Jallikattu movement
-
కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
-
ప్రజలకు ఈ ప్రభుత్వం వద్దు
♦ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి ♦ నటుడు కమల్హాసన్ సంచలన వ్యాఖ్యలు ♦ తమిళ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడి ♦ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు సాక్షి ప్రతినిధి, చెన్నై : ప్రస్తుతం రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ఎడపాడి ప్రభుత్వం నాలుగేళ్లపాటూ ఉండాలని ప్రజలు కోరుకోవడం లేదు, కాబట్టి వెంటనే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి’.. ఈ వ్యాఖ్యలు చేసింది తిరుగుబాటు వర్గ నేత పన్నీర్సెల్వం కాదు. ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ అంతకంటే కాదు. ప్రముఖ సినీనటుడు కమల్హాసన్ నోటి నుంచి సోమవారం సంచలన వ్యాఖ్యలు వెలువడ్డాయి. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో ఏర్పడిన పరిణామాలు కమల్లో నిగూఢమై ఉన్న రాజకీయాలపై ఆసక్తిని పెంచాయి. జల్లికట్టు ఉద్యమం మొదలు అనేక కీలక అంశాలపై విమర్శలు చేస్తున్న కమల్ హాసన్ సోమవారం మరింత దూకుడు ప్రదర్శించారు. సోమవారం ఒక తమిళ టీవీ చానల్ (పుదియ తలైమురై)కు ఇచ్చిన ఇంటర్వూ్యలో.. ఆయన మాటలు యథాతథంగా.. విశ్వరూపం సినిమా విడుదలకు ముం దు, ఆ తరువాత చోటుచేసుకున్న పరి ణామాలకు కారణం ఇస్లాం వర్గం కాదు, రాజకీయ నాయకులే పూర్తిగా కారకులు. ఆనాడు అధికారంలో ఉన్న వారే విశ్వరూపం విడుదల కాకుండా అడ్డుకున్నారు. నేను కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతాను, అదే రాజకీయ మాటలు గా మారాయి. భవిష్యత్తు రాజకీయాలకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తే ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. కేవలం కళాకారుడిగా ఉండడం నావల్ల కాదు. నా వ్యాఖ్యలు ప్రజలకు చేరుతాయి కాబట్టే విమర్శలు చేస్తున్నాను. నా జీవితంలో అవినీతి, అక్రమాలకు తావివ్వలేదు. నా మాటల ప్రభావం అడ్డుపెట్టుకుని ఓటు అమ్ముకుంటే నేతలను ప్రశ్నించే అవకాశం ఉండదు. నేరాలు ఘోరాలకు పాల్పడితే అధికారంలో ఎవరున్నా నిలదీస్తాను. భారత దేశ పౌరుడిగా రాజకీయాలు మాట్లాడే హక్కు నాకుంది. ఎర్రచొక్కా వేసుకున్నంత మాత్రానా కమ్యూనిస్టు వాది అని భావించరాదు. (ఇంటర్వూ్యకు కమల్ ఎర్రచొక్కాతో వచ్చారు.) నన్ను రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎంతోకాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రభుత్వం తప్పులు చేసే కొద్దీ ప్రజల్లో సహనం నశించిపోయి ఆగ్రహం పెరిగిపోతుంది. కాలానికి అనుగుణంగా రాజకీయనాయకులు మారాలి. పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు తీసుకురావాలి. ద్రవిడ పార్టీలకు కాలం చెల్లిందని చెప్పడానికి వీల్లేదు. తమిళ తల్లి ఆశీర్వాదం ఉన్నంత వరకు ద్రవిడ సిద్ధాంతం వర్ధిల్లుతూనే ఉంటుంది. జాతీయ పార్టీలు రాష్ట్ర పాలనలో ప్రవేశించదలుచుకుంటే ద్రవిడ పార్టీలను ఢీకొనక తప్పదు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం వెనుక మర్మాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. జయలలిత తన జీవితంలో పారదర్శకంగా వ్యవహరించలేదు. ఆమెకు జరిగిన చికిత్స సైతం గోప్యంగా ఉంచడానికి ఇది ఒక కారణం కావచ్చు. వెంటనే ఎన్నికలు జరపాలి : ప్రస్తుతం రాష్ట్రంలోని ఎడపాడి ప్రభుత్వాన్ని ప్రజలు అంగీకరించడం లేదు. రాష్ట్రం లో వెంటనే ఎన్నికలు జరగాలి. ఎన్నికలు నిర్వహించేందుకు చట్టం ఒప్పుకోదు అనే కారణంతో ప్రజలకు ఇష్టంలేని పాలనను నాలుగేళ్లు కొనసాగాలని ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. నాలుగేళ్లు కొనసాగాల్సిందేనని చెప్పడం బలవంతపు పెళ్లిలా ఉంటుంది. రాష్ట్రాన్ని ఎవరు పాలించాలనేది ప్రజలు నిర్ణయించాలి. పన్నీర్సెల్వం, ఎడపాడి పళనిస్వామి... వీరిద్దరిలో ఎవరిపైనా తనకు ప్రత్యేకమైన మమకారం లేదు. ఎవ్వరికీ మద్దతుగా నేను మాట్లాడటం లేదు. సినిమాల గురించి రాజకీయనాయకులు మాట్లాడినట్లే రాజకీయాల గురించి నేను మాట్లాడుతున్నా. రాజకీయాల్లో ధనప్రభావం, కుల మతాల జాఢ్యం పోవాలని ఆశిస్తు న్నా. జయ మరణం తరువాత రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ శూన్యతను నింపేందుకు కమల్ రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. -
జల్లికట్టు స్ఫూర్తితో ట్రిపుల్ తలాక్ కోసం..
-
జల్లికట్టు స్ఫూర్తితో ట్రిపుల్ తలాక్ కోసం..
తమిళులంతా జల్లికట్టు కావాలని ఒక్కతాటి మీదకు వచ్చి పోరాటం చేసిన స్ఫూర్తితో ముస్లింలు ట్రిపుల్ తలాక్ కోసం పోరాడాలని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. తమిళుల్లాగే ముస్లింలకు కూడా తమ సొంత సంస్కృతి ఒకటి ఉందని, తమిళుల ఉద్యమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తల వంచాల్సి వచ్చినందున ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. తమ పెళ్లిళ్లు, ట్రిపుల్ తలాక్ లాంటి తమ సంప్రదాయాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదని ఆయన అన్నారు. తమిళనాడులో తమ సంప్రదాయం కోసం లక్షలాది మంది నిరసనకు దిగారని, మనం వాళ్లకంటే ఎందులో తక్కువని ప్రశ్నించారు. మనకు కూడా మన సొంత సంస్కృతి ఉందని, మనకు కావల్సి వచ్చినట్లుగానే పెళ్లి చేసుకుని, విడాకులు ఇచ్చుకుంటామని, ఇలాగే చేయాలని ఎవరూ చెప్పడానికి వీల్లేదని ఒవైసీ అన్నారు. ట్రిపుల్ తలాక్ సంస్కృతిని పలు మహిళా సంఘాలు వ్యతిరేకించడంతో సుప్రీంకోర్టు దాని రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తున్న సమయంలోనే ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
రణరంగంగా మారిన చెన్నై
-
రణరంగంగా మెరీనా బీచ్
► పోలీస్స్టేషన్ దహనం ► వాహనాలు దగ్ధం ► ఆందోళనకారులపై లాఠీచార్జీలు ► సంఘ విద్రోహశక్తులుగా అనుమానం ► అట్టుడికిన రాష్ట్రం ప్రశాంతంగా సాగుతున్న జల్లికట్టు ఉద్యమం ఉద్రిక్తతలకు దారితీసింది. జల్లికట్టు ఉద్యమాన్ని విరమించాలని కోరినందుకు ఆగ్రహించిన ఆందోళనకారుల విధ్వంసంతో రాష్ట్రం అట్టుడికిపోయింది. చెన్నైలో పోలీస్స్టేషన్ దహనం, వాహనాల దగ్ధం, లాఠీచార్జీలు, భాష్పవాయువు ప్రయోగాలతో రాష్ట్రం రణరంగంగా మారిపోయింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళుల సంప్రదాయ జల్లికట్టుపై విధింపబడి ఉన్న నిషేధాన్ని తొలగించాలని కోరుతూ వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్న సంగతి పాఠకులకు విదితమే. మధురై జిల్లా అలంగానల్లూరులో ఈ నెల 16వ తేదీన, చెన్నై మెరీనాబీచ్లో 17వ తేదీన ఆందోళనలు ప్రారంభమయ్యాయి. వీరికి మద్దతుగా రాష్ట్రం లోని ప్రజలంతా ఎక్కడికక్కడ ఉద్యమించారు. 20వ తేదీన భారీస్థాయిలో బంద్ నిర్వహించగా ప్రపంచమే నివ్వెరపోయేలా ఆందోళనకారులు బంద్ను విజయవంతం చేశారు. ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ అనుమతి తీసుకుని ఈ నెల 21వ తేదీన జల్లికట్టుకు అనుమతిస్తూ ఆర్డినెన్స్ ను తీసుకువచ్చారు. ఆర్డినెన్స్ వార్త వెలువడిన తరువాత కూడా ఉద్యమకారులు ఆందోళనను విరమించలేదు. చెన్నై మెరీనాబీచ్ను వీడిపోలేదు. ఆర్డినెన్స్ తాత్కాలిక ఊరట మాత్రమే, శాశ్వత చట్టం తెచ్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని భీష్మించుకున్నారు. రాష్ట్రం నలుమూలలా అదే జోరున జల్లికట్టు ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. ఆర్డినెన్స్ తెచ్చిన రోజున రెండుసార్లు మీడియా వద్దకు వచ్చిన సీఎం ఇది శాశ్వత చట్టంగా రూపొందుతుందని మొరపెట్టుకున్నా ఆందోళనకారులు వినిపించుకోలేదు. ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్డే వేడుకలకు ఇక మూడు రోజులే ఉన్న తరుణంలో, చెన్నై మెరీనాబీచ్రోడ్డే వేడుకలకు వేదిక కావడంతో ఆందోళనకారులను బలవంతంగా ఖాళీ చేయించక తప్పలేదు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఆందోళనకారులతో పోలీసులు చర్చలు జరిపినా, పలువురు ప్రముఖులతో చెప్పించినా వినకపోవడంతో పెద్ద సంఖ్యలో మెరీనాను చుట్టుముట్టారు. బతిమాలినా వినకపోవడంతో లాఠీలకు పని చెప్పారు. ఆందోళనకారులను బలవంతంగా లాగివేశారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో భాష్పవాయువును ప్రయోగించారు. గాలిలోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. కొందరు ఆందోళనకారులు సముద్రంలోకి వెళ్లి నిలబడి బెదిరించడంతో పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది. అయితే సముద్రంలోని వారికి ఆహారం, తాగునీరు అందకకుండా చేయడంతో ఒకరొకరుగా సముద్రం నుంచి వెలుపలకు వచ్చేశారు. జల్లికట్టు ఉద్యమకారులపై చెన్నైలో లాఠీచార్జీ చేశారనే సమాచారం రాష్ట్రంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు సృష్టించింది. మధురై, కోయంబత్తూరు, విరుదునగర్, సేలం తదితర జిల్లాల్లో ప్రజలు రోడ్లపై బైఠాయించారు. వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. అగ్నికి ఆహుతైన ఐస్హౌస్ పోలీసు స్టేషన్ చెన్నై మెరీనాతీరంలో పోలీసులు చెదరగొట్టిన ఆందోళనకారుల్లో 50 మంది అక్కడికి సమీపం ట్రిప్లికేన్ లోని ఐస్హౌస్ పోలీసు స్టేషన్ కు వచ్చి రెచ్చిపోయారు. పోలీసులు వారించినా వినిపించుకోకుండా పెట్రోలో బాంబులు విసిరారు. పోలీసు స్టేషన్ బైట తాళం పెట్టి దగ్ధం చేశారు. పోలీసు స్టేషన్ నుంచి మంటలు ఎగిసిపడుతుండగా లోన చిక్కుకుని ఉన్న 14 మంది సిబ్బంది కిటీకి తలుపులు పగలగొట్టుకుని బయటకు వచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో పోలీసు స్టేషన్ వాకిట ఉన్న ద్విచక్రవాహనాలు, నగరంలో కొన్ని చోట్ల నాలుగు కార్లను దగ్ధం చేశారు. పరస్పర దాడుల్లో పోలీసులు, ఉద్యమకారులు తీవ్రంగా గాయపడ్డారు. లాఠీచార్జీకి నిరసనగా చెన్నైలోని అన్ని కూడళ్లలో కొందరు రాస్తారోకో చేసి అలజడి సృష్టించారు. ఎట్టకేలకు సోమవారం సాయంత్రానికి చెన్నై మెరీనా తీరాన్ని పోలీసులు ఖాళీ చేయించగలిగారు. ఆందోళన వెనుక అదృశ్యశక్తులు ఇన్నాళ్లూ శాంతియుతంగా సాగిన ఆందోళనలు సోమవారం అకస్మాత్తుగా ఉద్రిక్తతకు దారితీయడం వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని అనుమానిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సంఘ విద్రోహ శక్తులను ప్రవేశపెట్టి ఉండవచ్చని అనే అనుమానం పోలీసు వర్గాలను కలవరపాటుకు గురిచేశాయి. ఇది పసిగట్టే మెరీనా తీరాన్ని ఖాళీ చేయించేందుకు పోలీసులు సిద్ధపడ్డారు. అయితే అంతలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రశాంత ఉద్యమంలో పోలీసులు జోక్యం చేసుకోవడమే ఉద్రిక్తతకు కారణమని ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం రణరంగంగా మారిపోయిన తరుణంలో ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం సోమవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.