భారీగా పెరిగిన జేఎస్డబ్ల్యూ స్టీల్ లాభం
రెండేళ్లలో రూ.7,000 కోట్ల పెట్టుబడి ప్రణాళిక
న్యూఢిల్లీ: సజ్జన్ జిందాల్కు చెందిన జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో భారీగా పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.62 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.171 కోట్లకు పెరిగిందని జేఎస్డబ్ల్యూ స్టీల్ తెలిపింది.
అమ్మకాలు అధికంగా ఉండటంతో నికర లాభం పెరిగిందని జేఎస్డబ్ల్యూ స్టీల్ జాయింట్ ఎండీ, గ్రూప్ సీఎఫ్ఓ శేషగిరిరావు తెలిపారు. మొత్తం ఆదాయం రూ.12,600 కోట్ల నుంచి 15 శాతం క్షీణించి రూ.10,698 కోట్లకు పడిపోయిందని వివరించారు. దేశీయంగా ఇనుప ఖనిజం ధరలు పెరిగినా, ఉక్కు ఉత్పత్తులపై కనీస దిగుమతి ధర నిర్ణయించడం ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 3.21 మిలియన్ టన్నుల ముడి ఉక్కు ఉత్పత్తి చేశామని, ఇది 5% అధికమని వివరించారు.
ఇక ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,797 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.742 కోట్ల నికర నష్టాలు వచ్చాయని శేషగిరి రావు తెలిపారు. ఆదాయం రూ.52,972 కోట్ల నుంచి రూ.41,879 కోట్లకు పడిపోయిందని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేర్ 1.4 శాతం లాభంతో రూ.1,310 వద్ద ముగిసింది.