lab equipment
-
ప్రాక్టికల్ మాయ
ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ అంతా మాయగా మారింది. జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ప్రయోగశాలలు మచ్చుకైనా కనిపించవు. ఉన్న వాటిల్లో పరికరాల బూజు దులపని పరిస్థితి. తరగతులు ప్రారంభమై మూడునెలలు గడుస్తున్నా ఒక్క ప్రయోగం కూడా నిర్వహించని దుస్థితి ఉంది. సబ్జెక్టుల వారీగా వారానికి రెండు క్లాసులు నిర్వహించాల్సి ఉంది. ఒక్కటంటే ఒక్క క్లాసు కూడా జరగలేదు. ఓ వైపు విద్యార్థుల్లో ఆందోళన నెలకొనుండగా.. మరోవైపు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ యాజమాన్యాల అడుగులకు మడుగులొత్తుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లూరు (టౌన్): జిల్లాలో 174 ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ 58, ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు 116 ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్యానికి సంబంధించి ప్రభుత్వ కళాశాలలు 26, ఎయిడెడ్ కళాశాలలు 11, మోడల్ స్కూళ్లు 7, సోషల్ వెల్ఫేర్ కళాశాలలు 11, ఏపీ రెసిడెన్షియల్ కళాశాల 1, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలు 2 ఉన్నాయి. ప్రభుత్వ, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో జిల్లా వ్యాప్తంగా 60వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ప్రథమ, ద్వితీయసంవత్సరానికి సంబంధించి బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఏ కళాశాలలో ప్రాక్టికల్స్ చేపట్టలేదని అధ్యాపకులే చెప్పడం గమనార్హం. ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలు బ్రాంచీల పేరుతో పెద్ద ఎత్తున కళాశాలలను ఏర్పాటు చేశాయి. బ్రాంచీల్లో ఎక్కడా ప్రయోగశాలలు లేవని తెలుస్తోంది. నెలకు బైపీసీకి 32, ఎంపీసీకి 16 క్లాసులు ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ విద్య అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు వారానికి రెండు సార్లు ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించాలి. అంటే నాలుగు సబ్జెక్టులకు 8 క్లాసులు ఉంటాయి. ఈ లెక్కన నెలకు బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ జువాలజీలకు సంబంధించి 32, ఎంపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్టీలకు సంబంధించి 16 ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ నిర్వహణ కొంత మెరుగుగా ఉంది. కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ఒక్క క్లాసు కూడా తీసుకోలేదు. ద్వితీయ సంవత్సరంలో మొక్కుబడిగా ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహిస్తున్నారు. కళాశాలలు ప్రారంభించి 3 నెలలు దాటినా ఒక్క ప్రాక్టికల్ తరగతి నిర్వహించిన పరిస్థితి లేదు. ప్రాక్టికల్స్కు ల్యాబ్లు, రసాయన పదార్థాలు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వాటి జోళికి వెళ్లడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు .. ప్రాక్టికల్స్ను పర్యవేక్షించాల్సిన ఇంటర్ బోర్డు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో పూర్తి స్థాయిలో పరికరాలు, రసాయనాలు లేవు. ప్రాక్టికల్స్ పరీక్షల సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.200 ఇంటర్ బోర్డు అధికారులకు అప్పజెప్పి మార్కులు వేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అటు కళాశాలల యాజమాన్యాలు, ఇటు ఇంటర్ బోర్టు అధికారులు ప్రాక్టికల్స్ నిర్వహణలో నోరు మెదపడం లేదని తెలిసింది. ఇప్పటికైనా ఇంటర్ ప్రాక్టికల్స్పై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని తల్లి,దండ్రులు కోరుతున్నారు. కళాశాలలను తనిఖీ చేస్తున్నాం. కళాశాలల్లో ప్రయోగశాలల నిర్వహణపై ఇప్పటికే కొన్ని కళాశాలలను తనిఖీ చేశాం. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అన్ని కళాశాలల్లో ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించాలి. ప్రధానంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తప్పకుండా ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించాల్సి ఉంది. ఈ తరగతులు నిర్వహణపై విద్యార్థులను అడిగి తెలుసుకుంటాం. ప్రాక్టికల్స్ నిర్వహించని కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఆర్ఐఓ -
పట్టని ప్రయోగం
విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య కీలకం. చదువుతోపాటు ప్రయోగాలు చేయాల్సి ఉంది. లేకపోతే ఆ ప్రభావం మార్కుల మీదు పడుతుంది.ప్రతి సబ్జెక్టుకు 30 మార్కుల చొప్పున ఎంపీసీ వారికి రెండు, బైపీసీ వారికి 4 సబ్జెక్టులకు మార్కులు ఉంటాయి.ప్రయో పరీక్షలు జంబ్లింగ్ విధానంలో జరుగుతున్నా ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు అంతంగా స్పందించడం లేదు. చివరి దశలో నామమాత్రంగా ప్రయోగపరీక్షలు చేయిస్తూ పరీక్షల సమయంలో పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో కూడా అంతంత మాత్రంగానే చేయిస్తున్నారు. కొన్ని కళాశాలల్లో ల్యాబ్లకు సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజంపేట ఉర్దూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ల్యాబ్కు గది లేక పరికరాలను బీరువాలో ఉంచి ప్రాక్టికల్స్ సమయంలో బయటికి తీయాల్సిన పరస్థితి నెలకొంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభంకానున్న ప్రయోగ పరీక్షల దృష్ట్యా ప్రత్యేక కథనం.. కడప ఎడ్యుకేషన్ : ఈ ఏడాది ఇంటర్ ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 174 కళాశాలల్లో 45 వేలమంది విద్యార్థులు ఉన్నారు.వీరిలో 13,251 మంది ఎంపీసీ, బైపీసీ చదువుతున్నారు. జిల్లావ్యాప్తంగా 63 కేంద్రాల్లో ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి సెంటర్లో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ రవి తెలిపారు. నాలుగు విడతల్లో పరీక్షలు ప్రాక్టికల్ పరీక్షలు నాలుగు విడతల్లో జరగనున్నాయి. 1 నుంచి 5 వరకు మొదటి విడత, 6 నుంచి 10 వరకు రెండో విడత, 11 నుంచి 15వరకు మూడో విడత, 16 నుంచి 20 వరకు నాలుగో విడత పరీక్షలు జరగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్ర 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సారీ జంబ్లింగ్ విధానంలోనే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించనున్నారు. కార్పొరేట్ యాజమాన్యాల నుంచి ఒత్తిళ్లు వచ్చినా జంబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. పరీక్ష విధులకు హాజరయ్యే సిబ్బందిని కూడా ఏరోజుకారోజు మార్చి అక్రమాలకు అడ్డుకట్ట వేయనున్నారు. ప్రశ్నపత్రాలు అన్లైన్లో ప్రాక్టికల్స్కు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునేలా ఇంటర్ బోర్డు నూతన విధానానికి తెరలేపింది. గతంలో పోస్టల్ ద్వారా పరీక్ష పత్రాలు ఆయా కేంద్రాలకు పంపించేవారు. దీంతో కొన్నిచోట్ల అవకతవకలు జరుగుతున్నట్లు విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పరీక్షలకు 30 నిమిషాల ముందు సంబంధిత కేంద్రంలో పశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో పరిస్థితి జిల్లాలో చాలా కళాశాలల్లో వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాజంపేట మండలంలోని ఉర్దూ జూనియర్ కళాశాలలో ల్యాబ్ సౌకర్యం లేదు. పరిరకాలను బీరువాలో ఉంచుకుని ల్యాబ్ ఉన్న రోజు బయటకు తీసి టేబుల్పైన పెట్టుకుని ప్రయోగాలు చేయించి తిరిగి బీరువాలో భద్రపరచుకునే పరిస్థితి ఉంది. మైదుకూరు ఉర్దూ జూనియర్ కళాశాలకు సొంతభవనాలు లేవు.స్థానిక కొత్తకొట్టాలులో ఉన్న ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు 20 మంది ఉన్నారు.ఇక్కడ ల్యాబ్ సౌకర్యం మాత్రం లేదు.అధ్యాపకులు సొంత డబ్బులతో పరికరాలను కొని అరకొరగా ప్రయోగాలను చేయిస్తున్నారు. జమ్మలమడుగు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ల్యాబ్రూమ్ శిథిలావస్థకు చేరుకుంది. గది పైకప్పు పెచ్చులూడింది.కడప బాలుర, బాలికల జూనియర్ కళాశాల, ఓబులవారిపల్లె, రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, పొద్దుటూరులోని పలు కళాశాలల్లో ల్యాబ్స్, పరికరాలు బాగానే ఉన్నాయి. రాయచోటి, నందలూరు, మైలవరం, పెండ్లిమర్రి, పుల్లంపేట, మైదుకూరులలో పరికరాలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలిసింది. భయం భయంతో మా కళాశాలలో ల్యాబ్ సౌకర్యం లేదు. దీంతో పరికరాలను బీరువాలో ఉంచుతాం. ల్యాబ్ క్లాస్ ఉన్నప్పడు వాటిని బయటకు తీసి చిన్న టేబుల్పైన పెట్టుకుని భయం భయంగా ప్రయోగాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల స్పందించి వసతులన కల్పనకు చర్యలు తీసుకోవాలి. – షేక్ తాసిఫ్,ఉర్దూ జూనియర్ కళాశాల, రాజంపేట -
12నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు
జిల్లాలో 161 కేంద్రాలు హాజరుకానున్న 25వేల 39మంది విద్యార్థులు విద్యారణ్యపురి, న్యూస్లైన్ : ఇంటర్ ద్వితీయ సంవత్స రం సైన్స్ గ్రూపుల విద్యార్థులకు ఈనెల 12నుంచి మార్చి 3వ తేదీ వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. 16,546 మంది ఎంపీసీ, 8,493మంది బీపీసీ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 161 పరీక్ష కేంద్రాలు ఏ ర్పాటుచేశారు. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో నా లుగు దశల్లో బ్యాచ్ల వారీగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ల్యాబ్ పరికరాలు అందుబాటులో ఉన్న కళాశాలల్లోనే ప్రాక్టికల్స్ కోసం పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని ఇంటర్ విద్య ఆర్ఐఓ మల్హల్రావు తెలిపారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లుగా వ్యవహరించనుండగా, ఎగ్జామినర్ల నియామ కం పూర్తయిందని పేర్కొన్నారు. ఇంటర్ విద్య ఉన్నతాధికారులతో పాటు జిల్లాలోని హైపవర్ కమిటీ ప్రాక్టికల్స్ నిర్వహణ తీరును పరిశీలిస్తుందని, త్వరలోనే విద్యార్థులకు హాల్టికెట్లు అందజేస్తామని ఆర్ఐఓ వివరించారు. ఒకేషనల్ విద్యార్థులకు.. జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో కొనసాగిస్తున్న ఒకేషనల్ కోర్సుల ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కూడా ఈనెల 12నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 3,890మంది, ద్వితీయ సంవత్సరం 4,782మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్షలు రాయనుండగా, కోర్సులు నిర్వహించే కళాశాలల్లోనే సెంటర్లు ఏర్పాటుచేశారు. ఒకేషనల్ కోర్సుల విద్యార్థుల కోసం తొలిసారిగా ఇంటర్ బోర్డు ప్రాక్టికల్స్ పరీక్షల ప్రశ్నాపత్రాలు రూపొందించగా, పారామెడికల్ కోర్సులకు మాత్రం ఆయా కళాశాలల్లోనే ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు.