అమీర్ఖాన్ మా అంబాసిడర్ కాదు
ముంబై: బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ మరింత ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. ఆయనను మహారాష్ట్ర ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్టు వచ్చిన వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అమీర్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఖండించారు. ఈ పథకానికి అంబాసిడర్గా తాము ఇంకా ఎవరినీ నిర్ణయించలేదని తేల్చిచెప్పారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'జలయుక్త్ శివర్ అభియాన్' పథకానికి అంబాసిడర్గా నియమితులయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. రాబోయే ఐదేళ్లలో 25వేల గ్రామాలకు తాగునీరు అందించడం ఈ పథకం ఉద్దేశం. కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన ఈ పథకానికి అమీర్ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారని కథనాలు వచ్చాయి. గతేడాది 3,200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో మహా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ప్రాముఖ్యత కల్పించింది.
దేశంలో పెరుగుతున్న అసహనంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమీర్ ఖాన్.. ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో 'ఇన్క్రెడిబుల్ ఇండియా'కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అమీర్ ఖాన్ను కేంద్రం ఆ పదవి నుంచి తొలగించింది. మేకిన్ ఇండియా వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన విందుకు బాలీవుడ్ నటులు అమీర్, కంగనా హాజరు కావడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే మహా అంబాసిడర్ గా అమీర్ ను నియమించనున్నారనే వార్తలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.