melee
-
తముళ్ల డిష్యూం డిష్యూం..!
తిరుపతి: త్వరలో తిరుపతిలో జరగబోతున్న మహానాడు కార్యక్రమానికి చేసే ఏర్పాట్ల విషయంలో టీడీపీ పార్టీలోని రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. తిరుపతి నెహ్రో మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో మహానాడు కోసం ఏర్పాట్లు చేస్తుండగా.. పార్టీ నగర అధ్యక్షుడు భాస్కర్ గురువారం మధ్యాహ్నం అక్కడికి చేరుకోవడంతో వివాదం రాజుకుంది. ఏర్పాట్లు సరిగా లేవని భాస్కర్ తెలుగు యువత నాయకులతో అనడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు చొక్కాలు పట్టుకుని తోపులాడుకున్నారు. ఈ ఘటనలో మధు అనే తెలుగు యువత నాయకుడు, ఓ పత్రిక విలేకరికి స్వల్పంగా గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు. -
నువ్వు 'సీపీఎం'.. నీకు నీళ్లు లేవు!
తాగునీటి కోసం బావి వద్దకు వెళ్లిన కుటుంబాన్ని గ్రామస్తులు చితకబాదిన ఘటన బెంగాల్ లోని దక్షిణ 24 పరగణా జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. 60 ఏళ్ల నిమాయ్ సాన్పుయ్ కుటుంబం 24 పరగణా జిల్లాలో నివసిస్తోంది. గురువారం రాత్రి నిమాయ్ కోడలు నీటి కోసం గ్రామంలోని బావి దగ్గరకు వెళ్లగా కొంతమంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను దూషించారు. ఈ బావి తృణమూల్ కాంగ్రెస్ నిర్మించిందని.. ఇక్కడ సీపీఎం వాళ్లకు నీళ్లు దొరకవని చెప్పి పంపేశారు. దీంతో కుటుంబం మొత్తం బావి దగ్గరకు చేరుకుని నీరు తోడుకునే హక్కు తమకూ ఉందని చెప్పడంతో వాళ్లు దాడికి తెగబడినట్లు నిమాయ్ భార్య కాళిదాసీ తెలిపారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు ఓటేయాలని తమపై ఒత్తిడి చేశారని ఆమె వివరించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు సమర్ సాన్పుయ్, సుభాష్ సాన్పుయ్ లపై నిమాయ్ కుటుంబం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన తృణమూల్ కాంగ్రెస్ ఈ సంఘటన వెనుక ఎటువంటి రాజకీయ చర్యలు లేవని పేర్కొంది.