దుష్ప్రచారం ఆపకపోతే రాజీనామా: ఫిరాయింపు ఎమ్మెల్యే
బద్వేలు అర్బన్ : వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో కొందరు అధికార పార్టీ ముఖ్య నేతలు పనికట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జయరాములు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా నాయకత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ఇప్పటికైనా వారు స్పందించకపోతే తనతో పాటు, తన అనుచర వర్గమంతా మూకుమ్మడి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. అంతవరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననని తేల్చిచెప్పారు. శనివారం బద్వేలు ఆర్అండ్బీ బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీలోని కొందరు అగ్రవర్ణ నేతలు దళితుడినైన తనను అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుకుంటున్నారని, తాను చేపట్టే కార్యక్రమాలకు పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి తెలియచేసినా చర్యలు తీసుకోకపోగా, వారికే వత్తాసు పలకడం తగదన్నారు.