mohammad nasir
-
అక్రమ వలసదారులపై నజర్..!
♦ నసీర్తో పాటు మరో ముగ్గురి అరెస్టుతో అప్రమత్తమైన పోలీసులు ♦ నగరంలోని పలు ప్రాంతాలపై ముమ్మర నిఘా సాక్షి, సిటీబ్యూరో : నగరంలో ఉంటున్న అక్రమ వలసదారులపై నగర పోలీసులు దృష్టి సారించారు. వాళ్లు ఆశ్రయం పొందుతున్న ప్రాంతాలను గుర్తించి పాస్పోర్టు, వీసాలు లేకుండా ఎంత మంది ఉన్నారని గుర్తించే దిశగా ముందుకెళుతున్నారు. హర్కత్ ఉల్ జిహదీ అల్ ఇస్లామీ (హుజీ)తో సంబంధమున్న పాకిస్థానీ మహమ్మద్ నసీర్తో పాటు ఫైజల్ మహమ్మద్ (బంగ్లాదేశ్), జోయ్నల్ అబెదిన్ (బంగ్లాదేశ్), జియా ఉర్ రెహమన్ (మయన్మార్)ల అరెస్టు నేపథ్యంలో నగరంలో అక్రమంగా వలస ఉంటున్న వారి అంశం చర్చకు వచ్చింది. అరెస్టయిన వారందరూ అక్రమ వలసదారులే కావడం పోలీసుల్లో ఆందోళన కలిగిస్తోంది. సోమాలియా, ఈథియోపియా, ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్ దేశాల్లో జరిగిన యుద్ధాల్లో ఆప్తులను కోల్పోయి...ఇక్కడ ఉంటున్న శరణార్థుల వివరాలను కూడా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. చెంచల్గూడతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో విదేశీయులు కనబడితే చాలు వారి పాస్పోర్టు, వీసాలు ఉన్నాయా? లేవా? అని చెక్ చేసే పనిలో పడ్డారు. ఉగ్రవాద దాడులు జరగవచ్చన్న ఐబీ హెచ్చరికల నేపథ్యంలో అక్రమ వలసదారులపై కన్నేసి ఉంచామని, ఇందులో భాగంగానే నసీర్ తమకు చిక్కాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సైబరాబాద్లోనూ.. సైబరాబాద్ పరిధిలోని బాలాపూర్, బాబానగర్, బార్కస్, షహీన నగర్, శాస్త్రీపురం, కిషన్బాగ్ ప్రాంతాల్లో 1,725 మంది శరణార్థులు ఎటువంటి వీసాలు, పాస్పోర్టులు లేకుండా అక్రమంగా ఉంటున్నారనే విషయాన్ని గుర్తించిన సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్...ఇటీవల నగరానికి వచ్చిన యూఎన్హెచ్సీఆర్ మిషన్ చీఫ్ విలియమ్ టాల్ దృష్టికి తీసుకెళ్లారు. వీరి వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో ఎవరూ ఏమి చేస్తున్నారనే విషయం కూడా తెలియడం లేదని చెప్పడంతో... వారికి రెండేళ్ల కాలపరిమితి గల రెఫ్యూజీ సర్టిఫికెట్ను జారీ చేస్తామని అంగీకరించారు. ఇప్పటికే దీనిపై సైబరాబాద్ పోలీసులు దృష్టి కేంద్రీకరించి శరణార్థుల కదలికలపై నిఘా వేశారు. వయా దుబాయ్ టూ పాకిస్థాన్ ఇప్పటికే చెంచల్గూడకు చెందిన మహమ్మద్ మసూద్ ఆలీ ఖాన్ సహకారంతో ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు పొందడమే కాకుండా 15 మందికి భారత పాస్పోర్టులు ఇప్పించి విదేశాలకు పంపించడంపైనా పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. అయితే వీరిని దుబాయ్ మీదుగా పాకిస్థాన్కు పంపించారన్న విషయం పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించినట్టు సమాచారం. ఇదే నిజమైతే వారిని పాకిస్థాన్కు పంపించడానికి కారణమేంటి? ఉగ్రవాదులుగా శిక్షణ తీసుకునేందుకు వారిని పంపించారా? ఉద్యోగాల పేరుతో నమ్మించి ఉగ్రవాద చర్యల్లో భాగస్వామ్యులను చేసేందుకు అక్కడికి పంపించి ఉంటారా అన్న దిశగా పోలీసులు విచారణ సాగుతున్నట్టు తెలుస్తోంది. పాస్పోర్టు తనిఖీకి వచ్చిన కానిస్టేబుళ్లను కూడా పోలీసులు పిలిపించి మాట్లాడినట్టు సమాచారం. -
నగరంపై మళ్లీ ‘హుజీ’ పడగ!
నసీర్ అరెస్టుతో తిరిగి తెరపైకి సంస్థ కదలికలు అణువణువూ గాలిస్తున్న పోలీసులు సిటీబ్యూరో: ఉగ్రవాద సంస్థ హుజీతో సంబంధమున్న మహమ్మద్ నసీర్తో పాటు మరో ఐదుగురి అరెస్టుతో సిటీలో కలకలం రేగింది. ఈ ఘటనతో హుజీ కదలికలు మరోసారి బయటపడ్డాయి. పంద్రాగస్టు వేడుకలకు ముందే వీరు పట్టుబడటంతో...ఇంకా ఎవరైనా ఉన్నారా అని తెలుసుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంపై హుజీ ప్రభావాన్ని పరిశీలిస్తే గతంలో జరిగిన చాలా ఘటనలు కళ్ల ముందు మెదులుతాయి. 1992లో జరిగిన ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్, అతని గన్మన్ హత్యతో రాష్ర్టంలో ఉగ్రవాదుల హింస ప్రారంభమైంది. 2013 ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల వరకు ఇది కొనసాగింది. హైదరాబాద్లో జరిగిన రాక్షస క్రీడల్లో అత్యధికం హుజీవే. 2004 అక్టోబర్ 12న బేగంపేట గ్రీన్ల్యాండ్స్కు సమీపంలో ఉన్న హైదరాబాద్ కమిషనర్ టాస్క్ఫోర్స్ కార్యాలయంపై మానవబాంబు దాడికి పాల్పడింది కూడా హుజీనే. ఈ కేసుతో సహా వివిధ కేసుల్లో వాంటెడ్గా ఉండి 2007లో పాకిస్తాన్లోని కరాచీలో హతమైన కరుడుగట్టిన ఉగ్రవాది సాహెద్ అలియాస్ బిల్లాల్ నగరంలోని ముషారంబాగ్కు చెందినవాడు కావడం గమనార్హం. 2006 అక్టోబర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఒడియన్ థియేటర్లో గ్రానైట్ దాడికి పాల్పడి 2011లో పోలీసులకు చిక్కిన జియా ఉల్ హక్ హుజీ సంస్థ వాడే. బెంగళూరు, హైదరాబాద్లలో రాజకీయ నేతలతో పాటు ప్రముఖుల హత్యకు కుట్రను బెంగళూరు పోలీసులు 2013లో ఛేదించారు. దీని వెనుక కూడా హుజీనే ఉన్నట్టు తేలింది. ఈ కేసుతో సంబంధం ఉన్న పాతబస్తీకి చెందిన ఒబెత్ ఉర్ రెహమన్ కూడా హుజీకి చెందిన వాడే. 2007 ఆగస్టు 25నజరిగిన గోకుల్చాట్, లుంబినీపార్క్ పేలుళ్లు, 2013 ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో పాల్గొన్నది ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం)కు చెందిన వారు. అయితే హుజీకి, ఐఎంకి సంబంధాలున్నాయనే విషయం పలు సందర్భాల్లో వెల్లడైంది. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన వఖాస్ను హుజీకి చెందిన మహమ్మద్ నసీర్ భారత సరిహద్దులు దాటించి బంగ్లాదేశ్కు వెళ్లేందుకు సహకరించడం కూడా వారి సంస్థల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చెప్పకనే చెప్తోంది. పాస్పోర్టులపై దృష్టి... ఇప్పటికే చంచల్గూడకు చెందిన మహమ్మద్ మసూద్ అలీ ఖాన్ సహకారంతో మహమ్మద్ నసీర్ ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు పొందడమే కాకుండా 15 మందికి భారత పాస్పోర్టులు ఇప్పించి విదేశాలకు పంపించడంపైనా పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ఇతను హుజీ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు పంపాడా? లేదా డబ్బులు సంపాదించేందుకు వాళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తానని పంపించాడా?...ఇలా అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. పాస్పోర్టు వెరిఫికేషన్కు వెళ్లిన కానిస్టేబుళ్లను విచారించి, విధుల్లో అలసత్వం వహించినందుకు వారిపైనా చర్యలు తీసుకొనే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి తెలిపారు. -
'అనాథలకు తల్లీదండ్రీ టీఆర్ఎస్ ప్రభుత్వమే'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అనాథ బాలబాలికలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించడం అభినందనీయమని టీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ విభాగం మాజీ కార్యదర్శి మహ్మద్ నసీర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అనాథలు ఎవరూ ఉండబోరని, అలాంటి పిల్లల ఉన్నత చదువులు, బాగోగుల బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది ప్రభుత్వం తీసుకున్న సామాజిక బాధ్యత అని నసీర్ పేర్కొన్నారు. ఈ హామీ అమలైతే దేశంలోనే అనుసరించే గొప్ప కార్యక్రమం అవుతుందని వివరించారు.