MRO Narayanamma
-
నాపై దాడి చేసి.. ఏకవచనంతో తిట్టారు
చెరువు కబ్జాను అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు తనపై టీడీపీ సర్పంచ్ రమణారెడ్డి దాడిచేసి, నానా దుర్భాషలు ఆడారని చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు ఎమ్మార్వో నారాయణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తాను కలెక్టర్ ఆదేశాల మేరకే అక్కడకు వెళ్లానని, అయితే అక్కడ తనకు తీరని అవమానం జరిగిందని ఆమె తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు ఫిర్యాదు చేశానన్నారు. ప్రజాప్రతినిధిగా ఆయన సక్రమంగా ఉండాలని, తమ పని తాము సక్రమంగా చేసేలా అడ్డు లేకుండా ఉంటే చాలని ఆమె తెలిపారు. అదే తాము ఏదైనా తప్పుచేస్తే అడగొచ్చని.. అంతే తప్ప లేనిపోని అభియోగాలు మోపి మానసికంగా చిత్రహింసలు చేయడం మాత్రం సరికాదని తహసీల్దార్ నారాయణమ్మ అన్నారు. తాము మానవతా దృక్పథంతో ప్రజలకు సేవ చేయడానికే ఉన్నామని, ప్రజలకు ఏం కావాలో అది చేస్తామని, మనస్సాక్షిని బట్టే పనిచేస్తామని తెలిపారు. తాను కూడా ఒకప్పుడు పేదింటి పిల్లనేనని, అందుకే వాళ్ల మేలు కోసం పనిచేస్తున్నానని చెప్పారు. తన వెనక తమ సంఘం వాళ్లు ఉండబట్టే ధైర్యంగా ఉన్నానన్నారు. -
మరో మహిళా తహశీల్దార్పై దాడికి యత్నం
చిన్నగొట్టికల్లు (చిత్తూరు జిల్లా): కులం పేరుతో మహిళా తహశీల్దార్ను దూషించి, దాడికి యత్నించినందుకు టీడీపీ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక కేసు నమోదైంది. ఈ ఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు మండలం రంగన్నగారిగడ్డ గ్రామంలో జరిగింది. చిన్నగొట్టికల్లు మండల తహశీల్దార్ నారాయణమ్మ ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగన్నగారిగడ్డ గ్రామంలో ఆక్రమణకు గురైన చెరువు భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు. అయితే టీడీపీ బలపరిచిన ఆ గ్రామ సర్పంచ్ రమణారెడ్డి చెరువు వద్దకు చేరుకొని తహశీల్దార్ నారాయణమ్మను కులం పేరుతో దూషించి, దాడికి యత్నించి భూముల స్వాధీన కార్యక్రమాన్ని అడ్డుకున్నాడు. దీంతో నారాయణమ్మ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ విషయంపై సర్పంచ్ రమణారెడ్డిని వివరణ కోరగా తాను ఎలాంటి తప్పు చేయలేదని, కులం పేరుతో దూషించలేదని, దాడికి పాల్పడలేదని చెప్పాడు.