multi-purpose vehicle
-
ఒకటికి ఏడు పనులు చేసే యంత్రం
వరి సాగులో నాటు దగ్గరి నుంచి వివిధ దశల్లో అనేక పనులను ఒకే ఒక్క చిన్నపాటి యంత్రంతో చేయగలిగితే? అది నిజంగా అద్హుతమే. వరి సాగు ఖర్చులు తలకు మించిన భారంగా పరిణమిస్తున్న ఈ తరుణంలో రైతుకు నిజంగా వరమే అవుతుంది. కన్నూరు(కేరళ)లోని సెయింట్ థామస్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు ఒకటికి ఏడు పనులను చేసే ఇటువంటి అద్భుత యంత్రాన్ని ఇటీవల ఆవిష్కరించారు. వరి పొలంలో దమ్ము చేయటం, వరి నాట్లు వేయడం నుంచి పొలంలోకి నీరు తోడటం, వరి కోతలు కోయడం, ధాన్యం నూర్పిడి చేయడం, తూర్పారబట్టడం, ధాన్యాన్ని బియ్యంగా మార్చడం.. వంటి ఏడు రకాల పనులను ఈ ఒక్క యంత్రం చేసేస్తుంది. మెకానికల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు అభిషై, లిపిన్, రిజున్, అక్షయ్ బృందం ఈ యంత్రానికి రూపకల్పన చేసింది. అభిషై బృందం స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేసి పేటెంట్ కోసం ధరఖాస్తు చేసింది. ఈ బహుళ ప్రయోజనకర వ్యవసాయ యంత్రం బ8రువు మొత్తం కలిపితే 624 కిలోలు మాత్రమే. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తేగల పారిశ్రామికవేత్త కోసం వెదుకుతున్నామని అభిషై ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఏదేమైనా 4 నెలల్లో రైతులకు అందుబాటులోకి తేవాలని ఆశిస్తున్నామన్నారు. వరి రైతుకు ఖర్చు తగ్గి నికరాదాయం మూడు రెట్లు పెరుగుతుందన్నారు. వానపాముల మాదిరిగా రైతుకు ఎంతో మేలు చేసే ఈ యంత్రానికి ‘మన్నిర’(మళయాళంలో వానపాము) అని పేరు పెట్టామని అభిషై(80758 36523, 94951 24870) ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. 15 హెచ్పి సామర్థ్యం గల పాత ఇంజిన్ను ఉపయోగించి ప్రొటోటైప్ను రూపొందించారు. కొత్త ఇంజిన్తో తయారు చేస్తే ఈ డీజిల్ యంత్రం ఖరీదు రూ. 2.5 లక్షల వరకు ఉండొచ్చట. రైతుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్న ఈ యువ ఇంజినీర్లకు ‘సాక్షి’ జేజేలు పలుకుతోంది! యంత్రాన్ని ఆవిష్కరించిన విద్యార్థుల బృందం -
రైలు పట్టాలపైనా నడిచే 'యునిమోగ్'
-
రైలు పట్టాలపైనా నడిచే 'యునిమోగ్'
ప్రపంచవ్యాప్తంగా లగ్జరీకార్ల తయారీ సంస్థ మెర్జిడెస్ బెంజ్.. ఇప్పుడు కొత్త డిజైన్ వాహనాన్ని రూపొందించింది. యునిమోగ్ పేరిట మల్టీ పర్పస్ వాహనాన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. అనేక అవసరాలకు ఈ వాహనాలను వినియోగించుకోవచ్చని సంస్థ చెప్తోంది. ఇంతకు ముందు తయారైన ఎన్నో వాహనాలకు భిన్నంగా ఇప్పుడు రోడ్లపైనే కాక... రైలు పట్టాలపైనా నడిచే సరికొత్త యునిమోగ్ ను మెర్సిడెస్ ఆవిష్కరించింది. మెర్జిడెస్ ఇప్పటికే రోడ్లతోపాటు రైలు పట్టాలపై నడిచే ఎన్నో యునిమోగ్ వాహనాలను తయారు చేసింది. అయితే ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన సరికొత్త యునిమోగ్ మాత్రం వాటన్నింటికీ భిన్నంగా ఉంది. ఈ కొత్త మోడల్ 423 ని మరిన్ని అప్ డేట్స్ తో అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదాలను సైతం గుర్తించి, నిర్మూలించే ప్రత్యేక భద్రతా లక్షణాలను కలిగిన ఈ వాహనాన్ని సురక్షితంగా రైలు పట్టాలుమీద కూడా నడిపే అవకాశం ఉంది. రైలు ఇంజన్ లాగా కూడా పనిచేసే ఈ వాహనం పట్టాలమీద ఉన్న బోగీలను ఒకచోటునుంచీ మరోచోటుకు చేర్చగలిగే విధంగా మెర్సిడెస్ కంపెనీ ఈ యునిమోగ్ వాహనాన్ని రూపొందించింది. సాధారణ రహదారుల్లోనే కాక ప్రతికూల మార్గాల్లోనూ నడిపేట్లుగా యునిమోగ్ ను మెర్సిడెస్ తయారు చేసింది. 5.1 లీటర్ సామర్థ్యం కలిగిన నాలుగు సిలిండర్లతో కూడిన టర్బో ఛార్జ్డ్ డీజిల్ ఇంజన్... సుమారు 231 బిహెచ్ పి పవర్ తోపాటు, 664 పౌండ్ ఫీట్ టార్క్ ను ఉత్పత్తి చేసే విధంగా రూపొందించారు. గంటకు సుమారు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే యునిమోగ్.. 1000 టన్నుల బరువైన రైలు బోగీలను కూడా సులభంగా లాగ గల్గుతుంది. వాహనానికి ఉన్న మెటల్ చక్రాలు పట్టాలు మీద.. రబ్బరు చక్రాలు నేల మీద.. నడించేందుకు సహకరిస్తాయి.