breaking news
National Consumer Law
-
వినియోగదారులకు ‘హెల్ప్లైన్’ భరోసా
సాక్షి, న్యూఢిల్లీ: వస్తువు కొని మోసపోయామనో, నాణ్యమైన సేవలు అందలేదనో వినియోగదారులు ఇకపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని ‘జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్’ (ఎన్సీహెచ్) వినియోగదారుల పక్షాన నిలుస్తూ మంచి ఫలితాలను సాధిస్తోంది. గత ఎనిమిది నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా బాధితులకు ఏకంగా రూ.45 కోట్ల రీఫండ్ను ఇప్పించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఏప్రిల్ 25– డిసెంబర్ 26 మధ్య కాలంలో 31 వేర్వేరు రంగాలకు సంబంధించి వచ్చిన 67,265 ఫిర్యాదులను ఎన్సీహెచ్ పరిష్కరించింది. కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా, ఖర్చు లేకుండా ’ప్రీ–లిటిగేషన్’ (కేసు వేయక ముందే) దశలోనే సమస్యలను పరిష్కరిస్తుండటం వల్ల వినియోగదారుల కమిషన్లపై భారం తగ్గడంతో పాటు సామాన్యులకు త్వరితగతిన న్యాయం జరుగుతోంది. ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ మోసాలే దేశంలో అధికంగా నమోదవుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం రీఫండ్స్లో సింహభాగం ఈ–కామర్స్ రంగానిదే కావడం గమనార్హం. ఈ 8 నెలల్లో ఈ–కామర్స్ రంగానికి సంబంధించి 39,965 ఫిర్యాదులు పరిష్కారం కాగా, బాధితులకు రూ.32 కోట్లు తిరిగి వెనక్కి వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో ట్రావెల్ అండ్ టూరిజం రంగం ఉంది. ఈ రంగంలో 4,050 ఫిర్యాదులకు గాను రూ.3.5 కోట్లు రీఫండ్ అయ్యాయి. మొత్తం రీఫండ్స్లో 85 శాతానికి పైగా వాటా ఈ–కామర్స్, ట్రావెల్, ఏజెన్సీ సర్వీసులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఎయిర్లైన్స్ రంగాల నుంచే ఉండటం గమనార్హం. మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు బాధితులు ఈ హెల్ప్లైన్ను ఆశ్రయిస్తూ తమ సమస్యలకు పరిష్కారం పొందుతున్నారు. హెల్ప్లైన్ కోసం 1915 టోల్ ఫ్రీ నంబర్తో పాటు, వాట్సాప్ (8800001915), ఎన్సీహెచ్ యాప్, ఉమంగ్ యాప్, వెబ్సైట్ ద్వారా 17 భాషల్లో ఫిర్యాదు చేసే సౌకర్యం ఉంది. -
‘ఫిర్యాదుల పరిష్కారానికి సర్క్యూట్ బెంచ్’
సాక్షి, హైదరాబాద్: వినియోగదారుల కమిషన్లో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదుల అప్పీల్స్, రివిజన్ పిటిషన్లపై జాతీయ వినియోగదారుల వివాదాల, రిడ్రెసల్ కమిషన్ (ఎన్సీడీఆర్సీ) సర్క్యూట్ బెంచ్ సోమవారం నుంచి హైదరాబాద్లో విచారణ ప్రారంభించనుందని పౌరసరఫరాల కమిషనర్ అకున్ సభర్వాల్ ఆదివారం తెలి పారు. ఈ కేసుల విచారణ కోసం హైదరాబాద్ వచ్చిన జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కె.అగర్వాల్ను ఆదివారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా వినియోగదారుల ఫోరంల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఆదర్శనగర్లోని తెలంగాణ పుడ్ కమిషన్ కాన్ఫరెన్స్ హాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సర్క్యూట్ బెంచ్లో తెలంగాణ, ఏపీకి చెందిన పెండింగ్ కేసుల విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. -
కస్టమర్ల హక్కులపై పట్టింపు లేదు
- అందుకే వేలాదిగా కేసులు పెండింగ్: జస్టిస్ అరిజిత్ పసాయత్ - జాతీయ వినియోగదారుల చట్టంలో మార్పులు తేవాలి: సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వినియోగదారుల ఫోరాల్లో వేలాదిగా కేసులు పెండింగులో ఉంటున్నాయని జస్టిస్ అరిజిత్ పసాయత్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఈ ఫోరంలను పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్లో శని వారం ‘వినియోగదారుల ఫోరాలు ఎదుర్కొం టున్న సవాళ్లు’ అన్న అంశంపై ప్రాంతీయ సమావేశం జరిగింది. వినియోగదారుల ఫోరాల పని తీరు, సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్న జస్టిస్ అరిజిత్ పసాయత్ ఈ సమావేశంలో ప్రసంగిస్తూ గడచిన 19 నెలలుగా కమిటీ పర్యటనలు చేస్తోందని చెప్పారు. సుమారు 10 వేల కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగులో ఉండగా, 40 వేల కేసులు పదేళ్లకు పైగా పెండింగులో ఉన్నాయని వివరించారు. వినియోగదారుల ఫోరాలకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని, కేంద్రమే ఓ రాజకీయ నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ కోరారు. హక్కులపై అవగాహన కల్పించాలి... జాతీయ వినియోగదారుల చట్టం వచ్చి 30 ఏళ్లు (1986) అవుతోందని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ముఖ్యంగా వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన కల్పించాలని, కోర్టుల్లో కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.


