కస్టమర్ల హక్కులపై పట్టింపు లేదు
- అందుకే వేలాదిగా కేసులు పెండింగ్: జస్టిస్ అరిజిత్ పసాయత్
- జాతీయ వినియోగదారుల చట్టంలో మార్పులు తేవాలి: సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వినియోగదారుల ఫోరాల్లో వేలాదిగా కేసులు పెండింగులో ఉంటున్నాయని జస్టిస్ అరిజిత్ పసాయత్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఈ ఫోరంలను పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్లో శని వారం ‘వినియోగదారుల ఫోరాలు ఎదుర్కొం టున్న సవాళ్లు’ అన్న అంశంపై ప్రాంతీయ సమావేశం జరిగింది. వినియోగదారుల ఫోరాల పని తీరు, సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్న జస్టిస్ అరిజిత్ పసాయత్ ఈ సమావేశంలో ప్రసంగిస్తూ గడచిన 19 నెలలుగా కమిటీ పర్యటనలు చేస్తోందని చెప్పారు. సుమారు 10 వేల కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగులో ఉండగా, 40 వేల కేసులు పదేళ్లకు పైగా పెండింగులో ఉన్నాయని వివరించారు. వినియోగదారుల ఫోరాలకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని, కేంద్రమే ఓ రాజకీయ నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ కోరారు.
హక్కులపై అవగాహన కల్పించాలి...
జాతీయ వినియోగదారుల చట్టం వచ్చి 30 ఏళ్లు (1986) అవుతోందని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ముఖ్యంగా వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన కల్పించాలని, కోర్టుల్లో కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.