paleru by-election
-
రెండేళ్లలో టీఆర్ఎస్కు అంత డబ్బెక్కడిది?
ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పూర్తిగా డబ్బు రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ అభ్యర్థి, దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి అన్నారు. ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్ ప్రలోభపెడుతోందని ఆమె మండిపడ్డారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఖర్చు పెడుతున్న ధనాన్ని, ఇంకో వందేళ్లు అయినా తాము సంపాదించలేమన్నారు. రెండేళ్లలోనే టీఆర్ఎస్కు అంత డబ్బు ఎక్కడని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సుచరితారెడ్డి ఓ లేఖను విడుదల చేశారు.'పాలేరులో వచ్చే తీర్పు మన తెలంగాణా ప్రజాస్వామ్య భవిష్యత్ ను నిర్ధేశిస్తుంది, ఏమాత్రం జాగ్రత్తగా లేకున్నా అరాచక ఊబి లో మునిగిపోవడం ఖాయం. అప్రమత్తంగా ఉండాలని పాలేరు నియోజక వర్గ ప్రజాబంధువుల కు వినతి. ప్రజల సొమ్ము అయిన ప్రభుత్వ ధన ఖర్చుతో అధికార బలం, ఆర్భాటాల ప్రచారం ఖర్చు ఎన్ని కోట్లో నేను ఊహించలేక పోతున్నాను. ఇంకా వందేళ్లు అయినా ... ఇంత ధనం మా కుటుంబం మొత్తం వ్యవసాయం, రాజకీయాల్లో ఉన్నా కూడా ఖర్చు పెట్టడం మాకు సాధ్యం కాదు అంటే మీరు పరిస్థితి ఊహించొచ్చు. రెండేళ్లలో వీరికి ఇంత ధనం ఎక్కడిది? విజ్ఞులైన ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లు కావాలంటే అక్రమ సంపాదనను ఖర్చుపెట్టడం ఎంతవరకు సబబు? 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి తర తమ బేధాలు లేకుండా ప్రజలందరూ నా వాళ్లే అని చూసుకున్నా మా కుటుంబానికే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే... ఇక ముందు ఈ టీఆర్ఎస్ పరిపాలనలో ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందా? వీరి ఆగడాలు, ఆర్భాటాలు, ప్రతి రోజూ ప్రజల బలహీనతలను ఆధారం చేసుకొని ఏదో ఒక నాటకం చేస్తూ మభ్యపెట్టడాన్ని ప్రజలు గమనించాలని ప్రార్ధన. ఇది ఒక రకంగా పెద్ద మోసమే.. దివంగత నేత రాంరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ స్ఫూర్తి, వారి ఆశీస్సులతో పాలేరు ప్రజల బాగును చూసుకొని అభివృద్ధికి నిదర్శనంగా నిలవాలని మీ ఆదరాభిమానానికై నిలుచున్న మీ ఇంటి ఆడపడుచును'. అని ముగించారు. -
ఖమ్మం కలెక్టర్, ఎస్పీపై సీఈసీ వేటు
♦ ఖమ్మం కలెక్టర్, ఎస్పీపై బదిలీ వేటు ♦ కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం ♦ పాలేరు రిటర్నింగ్ ఆఫీసర్ కూడా తొలగింపు సాక్షి, హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికలో అధికారులు, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ టీపీసీసీ చేసిన ఫిర్యాదుతో ఖమ్మం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతోపాటు పాలేరు ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిపై బదిలీ వేటు పడింది. వారిని ఆయా స్థానాల నుంచి తొలగించి, వేరే అధికారులను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశించింది. ఈ మేరకు వారిని బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. సీఈసీ సూచనల మేరకు ఖమ్మం కలెక్టర్గా దానకిశోర్, ఎస్పీగా రమారాజేశ్వరి, రిటర్నింగ్ అధికారిగా బి.శంకర్లను నియమిస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీ రేణుకా చౌదరి, పలువురు రాష్ట్ర నేతలు మంగళవారం ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) నసీమ్ జైదీని కలిశారు. ప్లీనరీ పేరిట టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కేంద్ర బలగాలను రంగంలోకి దింపి ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన సీఈసీ... జిల్లా కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయా స్థానాల్లో అధికారుల నియామకానికి పేర్లను సూచించాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎస్పీగా నియమించేందుకు ఐపీఎస్లు వై.ప్రకాశ్రెడ్డి, విక్రమ్జిత్సింగ్ దుగ్గల్, రమా రాజేశ్వరిల పేర్లతో కూడిన జాబితాను, కలెక్టర్గా నియమించేందుకు ఐఏఎస్లు రాహుల్ బొజ్జా, సందీప్ సుల్తానియా, దానకిశోర్ల పేర్లతో జాబితాను సీఈసీకి పంపించింది. వీరిలో సీఈసీ సూచనల మేరకు కలెక్టర్గా దానకిశోర్, ఎస్పీగా రమారాజేశ్వరి, రిటర్నింగ్ అధికారిగా బి.శంకర్లను నియమించింది. ఖమ్మం కలెక్టర్గా ఉన్న లోకేశ్కుమార్, ఎస్పీగా ఉన్న షానవాజ్ ఖాసీం, ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (రైల్వేస్) సీహెచ్ గణేశ్లను బదిలీ చేసింది. ఖమ్మం కలెక్టర్గా నియామకమైన దానకిశోర్ ప్రస్తుతం మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్గా, జలమండలి డెరైక్టర్గా... ఎస్పీగా నియామకమైన రమా రాజేశ్వరి రంగారెడ్డి జిల్లా ఎస్పీగా, బి.శంకర్ వరంగల్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నారు. -
పాలేరు బరిలో రాంరెడ్డి సతీమణి సుచరితారెడ్డి
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి పోటీ చేయనున్నారు. సుచరితారెడ్డిని బరిలోకి దించితేనే ఇతర పార్టీలు మద్దతుతో విజయం సాధిస్తామని రాంరెడ్డి కుటుంబసభ్యులు నిర్ణయించారు. కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆమె పేరును ప్రతిపాదిస్తూ తెలంగాణ పీసీసీకి పంపారు. టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం రాంరెడ్డి కుటుంబీకులతో సమావేశమయ్యారు. సుచరితా రెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెస్ హైకమాండ్ ఈ రోజు సాయంత్రం అధికారికంగా ప్రకటించనుంది.