'గడప గడపకు'పై రేపు సమీక్ష
ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ప్రజలను కలిసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బృహత్ కార్యక్రమం 'గడప గడపకు వైఎస్ఆర్'పై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష జరపనున్నారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి ఈ సమీక్ష ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సమీక్ష సమావేశంలో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొంటారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జూలై 8వ తేదీ నుంచి ప్రారంభమైన 'గడప గడపకు వైఎస్ఆర్' ఎలా సాగుతోందన్న అంశంపై సవివరంగా చర్చిస్తారు.