పీఎస్ఎల్వీ ప్రయోగం దిగ్విజయం
* విజయవంతంగా కక్ష్యలోకి ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ
* వరుసగా 27వ సారి ఘన విజయం
* తెల్లవారుజామున 1.32కు ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు మరో విజయం దక్కింది. ఇప్పటికే గెలుపుగుర్రంగా పేరుగాంచిన పీఎస్ఎల్వీ రాకెట్ తన రికార్డును మరోసారి నిలుపుకొంది. 1425 కిలోల బరువైన ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ఉపగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం సిరీస్లో ఇది మూడో ఉపగ్రహం. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి వేకువజామున 1.32 గంటలకు పీఎస్ఎల్వీ సీ26 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 20 నిమిషాల ప్రయాణం తర్వాత ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ఉపగ్రహం నిర్ధేశిత గమ్యాన్ని చేరింది. దీంతో శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.
షార్ నుంచి అర్ధరాత్రి రాకెట్ను ప్రయోగించడం ఇస్రో చరిత్రలో ఇది రెండోసారి. ఈ ప్రయోగం కోసం సోమవారం ఉదయం 6.32 గంటలకు ప్రారంభంమైన కౌంట్డౌన్ 67 గంటలపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్లో జరిపిన 28 ప్రయోగాల్లో వరుసగా 27వ విజయం ఇస్రో సొంతం కావడం విశేషం. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను కేంద్రమంత్రి జితేందర్ సింగ్ అభినందించారు.