పంటలు ఎండిపోయాక హడావుడి ఎందుకు?
– సీఎం సుడిగాలి పర్యటనలో సాధించింది శూన్యం
– పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధ్వజం
పీలేరు:
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు పూర్తి ఎండిపోయాయ ముఖ్యమంత్రి, మంత్రుల హడావుడి ఎందుకని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. పీలేరు మండలం బాలంవారిపల్లెలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతిందనీ, ప్రభుత్వం చేతనైతే రైతలకు ఇన్పుట్ సబ్సీడీ, పంటల బీమా చేయించాలన్నారు. సుడిగాలి పర్యటనలతో సాధించేదేముందని ప్రశ్నించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగాన్ని తప్పుదోవ పట్టించడం తప్ప వేరొకటి కాదన్నారు. రెయిన్గన్స్ మంత్రులు వచ్చినపుడు మాత్రమే పనిచేస్తున్నాయని, అనంతరం మొరాయిస్తున్నాయని తెలిపారు. మంత్రులు, ఐఏఎస్లు, గ్రూప్వన్ అధికారులను ఇన్చార్జులుగా నియమించి ప్రభుత్వం సాధించింది శూన్యమన్నారు. సీఎం సుడిగాలి పర్యటనలు హాస్యాస్పదమని విమర్శించారు. సీఎం, మంత్రుల ప్రొటోకాల్, పర్యటనల ఖర్చులెంతని ప్రశ్నించారు. ఆరు నెలల ముందుగానే కళ్లు తెరచి యాక్షన్ప్లాన్ తయారుచేసుకుని ఉండాలన్నారు. ఇప్పుడు హడావుడి చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వ్యవసాయ శాఖ పనితీరు అధ్వానంగా ఉందన్నారు. కృష్ణ పుష్కరాల పేరిట రూ.1,400 కోట్ల ప్రజాధనం సీఎం దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఈనెల 11 నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రెయిన్గన్స్, స్ప్రింకర్లపై వైఎస్ఆర్సీపీ తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.