రాజోలు బుల్లోడు... కోటలో రాణింపు
శ్రీహరికోట షార్లో డీజీఎం స్థాయిలో వెంకటసత్యప్రసాద్
జగ్గంపేట :
దేశానికి సేవ చేసే భాగ్యం కొందరికే దక్కుతుంది. అటువంటి భాగ్యాన్ని మన రాజోలుకు చెందిన బిక్కిన వెంకటసత్యప్రసాద్ పొందారు. 12 తరగతి వరకు రాజోలులో విద్యనభ్యసించిన ఆయన కాకినాడలో పాలిటెక్నిక్, జేఎన్టీయూలో బీటెక్ మెకానికల్ ఇంజనీర్ విద్యను అభ్యసించి 1983లో ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరారు. అప్పటి నుంచి ఉపగ్రహాల ప్రయోగంలో తనదైన శైలిని కనబరుస్తూ సైంటిస్ట్ జి గ్రేడ్కు చేరుకుని వెహికల్ అసెంబ్లీ, లాంచ్ ఫెసిలిటీ విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాకు చేరుకున్నారు. ఇస్రో ద్వారా విక్రమ సారాబాయి, ఏఎస్సై అవార్డు, స్పెషల్ ఎచీవ్మెంట్ అవార్డులను సొంతం చేసుకున్నారు. జిల్లాకు చెందిన వెంకటసత్యప్రసాద్ ఇస్రోలో రాణిస్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. తన తండ్రి వెంకటరత్నం ఉపాధ్యాయుడిగా పని చేశారని, తల్లి గృహిణి అని, సోదరుడు హైదరాబాద్లో మేజిస్ట్రేట్గా పనిచేస్తున్నాడని చిన్నప్పటి నుంచి లెక్కలు, సైన్స్పై ఆసక్తి ఉండడంతోనే ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్ స్థాయి నుంచి ఉన్నతమైన స్థితికి చేరుకున్నానన్నారు. విద్య ముఖ్యమని డబ్బు ప్రధానం కాదని యువతకు ఆయన సందేశమిచ్చారు. చదువు ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. తనతోపాటు కాకినాడకు చెందిన సత్యనారాయణ, రామచంద్రపురానికి చెందిన వరప్రసాద్లు శ్రీహరికోట షార్లో సేవలందిస్తున్నారన్నారు.