షాకింగ్ న్యూస్ వెల్లడించిన ఆర్టీఐ
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ తర్వాత రోజుకో సంస్కరణ, ఉపశమన చర్యలు ప్రకటిస్తుండగా ఆర్ టీఐ ద్వారా తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ కొరతతో నానా అవస్థలు పడుతున్న తరుణంలో కొత్త 2 వేల రూపాయల కొరతకు సంబంధించి అసలు విషయం వెలుగులోకి తెచ్చింది. నవంబరు 8న కేంద్ర ప్రభుత్వ పెద్దనోట్ల రద్దు సంచలన ప్రకటన నాటికి రిజర్వ్ బ్యాంక్ వద్ద కొత్త రూ. 2 వేల నోట్ల కేవలం రూ.4.94 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయట. రద్దుచేసిన రూ.500, రూ. 1000నోట్ల కరెన్సీ విలువ సుమారు రూ.20 లక్షల కోట్లు. అంటే రద్దయిన నోట్ల విలువలో నాలుగో వంతు మాత్రమే కొత్త నోట్లు అందుబాటులో వున్నాయని ఆర్ టీఐ తెలిపింది.
ముంబయికి చెందిన కార్యకర్త అనిల్ గాల్గాలి దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నవంబర్ 8న నోట్ల రద్దు నిర్ణయంతో చలామణిలో ఉన్న రూ.9.13లక్షల కోట్ల విలువ కలిగిన వెయ్యి నోట్లు, రూ.11.38లక్షల కోట్ల విలువైన రూ.500 నోట్లు రద్దయ్యాయని ఆర్బీఐ తెలిపింది. 2,473 మిలియన్ల రూ. 2,000 నోట్లు (రూ 4.94 లక్షల కోట్లు) ఉన్నట్టు తెలిపింది. అనిల్ చేసిన దరఖాస్తుకు ఆర్బీఐ ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు అందించింది.
సమాచారము చట్టం, 2005 హక్కు సెక్షన్ 8 (1) (జి) కింద ఈ వివరాలను బహిర్గతం చేసినట్టు 'సమాధానంలో చెప్పారు. దీంతో దేశంలో రానున్న నగదు సంక్షోభం గురించి ఆర్ బీఐ ముందే తెలుసనీ, ఈ విషయాన్ని గ్రహించడానికి ఆర్థిక నిపుణుడై అయి వుండాల్సి అవసరం లేదని అనిల్ అరోపించారు. కోట్లాదిమంది భారతీయుల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందనే సంగతి ఆర్ బీఐకి స్పష్టంగా తెలుసని వాదించారు. బహిర్గతం చేయాల్సిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడం దురదృష్టమని వ్యాఖ్యానించారు. తద్వారా ఆర్ బీఐ 'ప్రకటన విధానాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు.