breaking news
Realty boom
-
హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు మళ్లీ పూర్వ వైభవం
మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లడం ఖాయం. ఈ బృహత్తర ప్రాజెక్ట్లు వచ్చే ఏడాదిలో ప్రారంభమవుతాయి. దీంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య(క్రెడాయ్) జాతీయ కార్యదర్శి గుమ్మి రాంరెడ్డి అన్నారు. ‘సాక్షి రియల్టీ’తో ఆయన ఇంటర్వ్యూ విశేషాలివీ.. –సాక్షి, సిటీబ్యూరోప్రభుత్వ ఆస్తులు, జలాశయాల రక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అవసరమే. కానీ, దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చిన తీరే గందరగోళాన్ని సృష్టించింది. హైడ్రా ప్రభావం ప్రాజెక్ట్లపై కంటే కస్టమర్ల సెంటిమెంట్పై ఎక్కువ ప్రభావం చూపించింది. రియల్టీ మార్కెట్ సైకిల్ వ్యవస్థ. వరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాల అమలులో జాప్యం, అధిక సరఫరా కారణంగా 2024లో రియల్టీ మార్కెట్ స్తబ్దుగానే ఉంది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే మూసీలోని అక్రమ నిర్మాణాలు, నిర్వాసితులకు పరిహారం తదితర అంశాలపై హైకోర్టు నుంచి అడ్డంకులు కూడా తొలగాయి. దీంతో మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. రెండోదశ మెట్రో విస్తరణ పనులను జనవరి నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణం, 14 వేల ఎకరాల్లోని ఫ్యూచర్ సిటీలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆయా ప్రాజెక్ట్లతో నగరం మరింత అభివృద్ధి చెందడంతోపాటు కొత్త మార్గాలు, ప్రాంతాల్లో రియల్ అవకాశాలు మెరుగవుతాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి.లుక్ ఆల్ డైరెక్షన్స్.. ఏ నగరమైనా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. కానీ, మౌలిక వసతుల కల్పనలో హెచ్చుతగ్గుల కారణంగా అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో హైదరాబాద్లో వెస్ట్, సౌత్ జోన్లో భూముల ధరలు బాగా పెరిగాయి. అందుబాటు ధర లేదు. సామాన్యుడు ఇల్లు కొనే పరిస్థితి లేదు. అందుకే పాలసీల్లో కొన్ని మార్పులు తేవాలి. ఔటర్ గ్రోత్ కారిడార్ను అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరికీ సొంతింటి కల సాకారమవుతుంది. అక్కడ భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చింది. కానీ, కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రభుత్వం లుక్ ఆల్ డైరెక్షన్ అమలు చేయాలి. రింగ్రోడ్డు చుట్టూ మొత్తం గ్రిడ్ రోడ్లు వేస్తే అక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగి సామాన్యుడికి సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశాలు మెరుగవుతాయి.పెట్టుబడులకు సౌత్ బెటర్.. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ ప్రాంతాల్లో స్థలాల ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఇక్కడ సామాన్యులు కొనే పరిస్థితి లేదు. రేవంత్ ప్రభుత్వం కొత్త విధానాలు, అభివృద్ధి పనులతో వచ్చే ఏడాది కొత్తూరు, షాద్నగర్, ఆదిభట్ల, ముచ్చర్ల వంటి దక్షిణ ప్రాంతాలు బాగా అభివృద్ధి అవుతాయి. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ధరలు తక్కువగా ఉన్నందున సామాన్య, మధ్యతరగతి వారు స్థలాలు కొనుగోలు చేయడం ఉత్తమం. వెస్ట్ జోన్లో అపార్ట్మెంట్ కొనే ధరకే చ.అ.కు రూ.7–9 వేలకే సౌత్లో విల్లా వస్తుంది. అంతేకాకుండా ఓఆర్ఆర్తో ప్రధాన నగరం నుంచి 30–40 నిమిషాల ప్రయాణ వ్యవధిలోనే సౌత్కు చేరుకోవచ్చు. -
రియల్టీ బూమ్.. రూ. 35,000 కోట్ల ప్రాపర్టీల విక్రయం
న్యూఢిల్లీ: వర్షాలు, నియంత్రణ సంస్థల నుంచి పూర్తిగా అనుమతులు రాకపోవడం తదితర అంశాల కారణంగా 2024–25 రెండో త్రైమాసికంలో కాస్త ప్రతికూల ప్రభావం పడినా లిస్టెడ్ రియల్టీ దిగ్గజాల విక్రయాలు గణనీయంగా నమోదయ్యాయి. 26 సంస్థలు ఏకంగా రూ. 35,000 కోట్ల విలువ చేసే ప్రాపర్టీలను విక్రయించాయి.గోద్రెజ్ ప్రాపర్టీస్ అత్యధికంగా రూ. 5,198 కోట్ల బుకింగ్స్ నమోదు చేసింది. నియంత్రణ సంస్థలకు సమర్పించిన వివరాల ప్రకారం 26 దిగ్గజ సంస్థలు రూ. 34,985 కోట్ల ప్రాపర్టీలు విక్రయించాయి. అత్యధికంగా రెసిడెన్షియల్ సెగ్మెంట్లో ప్రీ–సేల్స్ నమోదయ్యాయి. లోధా బ్రాండ్పై కార్యకలాపాలు సాగించే ముంబైకి చెందిన మ్యాక్రోటెక్ డెవలపర్స్ రూ. 4,290 కోట్ల బుకింగ్స్ సాధించింది. ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్ రూ. 4,100 కోట్లు, బెంగళూరు కంపెనీలు ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ రూ. 4,023 కోట్లు, సిగ్నేచర్ గ్లోబల్ రూ. 2,780 కోట్ల ప్రాజెక్టులు విక్రయించాయి.ఇదీ చదవండి: హైదరాబాద్లో ప్రాపర్టీ కొంటున్నారా? అయితే మీ కోసమే ఈ జాగ్రత్తలుఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో చాలా మటుకు రియల్టీ కంపెనీలు రూ. 500 – రూ. 1,000 కోట్ల అమ్మకాలు నమోదు చేశాయి. అయితే, తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో కొన్ని సంస్థల విక్రయాలు నెమ్మదించాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్పరంగా అగ్రస్థానంలో ఉన్న డీఎల్ఎఫ్ తొలి త్రైమాసికంలో రూ. 6,404 కోట్ల ప్రీ–సేల్స్ సాధించగా కొత్త ప్రాజెక్టులేమీ ప్రకటించకపోవడంతో రెండో త్రైమాసికంలో రూ. 692 కోట్లు మాత్రమే నమోదు చేసింది. -
రియల్టీలో పెట్టుబడుల సునామీ, రూ.36,500 కోట్లకు..
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత పెట్టుబడులు (ఇనిస్టిట్యూషనల్) ఈ ఏడాది 4 శాతం పెరిగి 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.36,500 కోట్లు)గా ఉండొచ్చని కన్సల్టెన్సీ సంస్థ కొల్లియర్స్ ఇండియా అంచనా వేసింది. 2020లో ఈ రంగంలో సంస్థాగత పెట్టుబడిదారులు 4.8 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ఇనిస్టిట్యూషన్స్ పెట్టుబడులు 2.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2020 మొదటి ఆరు నెలల్లో వచ్చిన గణాంకాలతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్టు కొల్లియర్స్ ఇండియా తెలిపింది. కార్యాలయ సముదాయాలపై ఇన్వెస్ట్ చేసేందుకు సంస్థాగత పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 35 శాతం పెట్టుబడులు కార్యాలయ వసతుల ప్రాజెక్టుల్లోకి వచ్చాయి. అలాగే, పారిశ్రామిక, గోదాముల విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు 775 మిలియన్ డాలర్లు (రూ.5,657 కోట్ల)గా ఉన్నాయి’’ అని కొల్లియర్స్ ఇండియా వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆకర్షణీయమైన విలువలకే ఆస్తులను సొంతం చేసుకునే ఆలోచనతో ఇన్వెస్టర్లు ఉన్నారని తెలిపింది. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య నివాస గృహ ప్రాజెక్టుల్లోకి వచ్చిన సంస్థాగత పెట్టుబడులు కేవలం 4 శాతంగానే ఉన్నాయని పేర్కొంది. లాజిస్టిక్స్, లైఫ్ సైన్సెస్ ల్యాబ్లు, డేటా కేంద్రాలకు సంబంధించి రానున్న రోజుల్లో పెట్టుబడులు ప్రోత్సాహకరంగా ఉండొచ్చని అంచనా వేసింది. చదవండి: మీ ఆధార్ బయోమెట్రిక్ సేఫ్గా ఉండాలంటే ఇలా చేయండి -
Hyderabad Real Estate: శివారు జోరు!
సాక్షి, హైదరాబాద్: శివారు ప్రాంతాలలో రియల్టీ జోరు కొనసాగుతుంది. పరిధిలోనే కాదు.. కొత్త గృహాల ప్రారంభాల్లోనూ శివారు ప్రాంతాలు ప్రధాన నగరాన్ని దాటేశాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్లో 30,340 గృహాలు లాంచింగ్ కాగా.. ఇందులో 45 శాతం ఔటర్ ప్రాంతాల్లోనే ప్రారంభమయ్యాయి. మేడ్చల్, మియాపూర్, నిజాంపేట, శంషాబాద్, కోకాపేట, పటాన్చెరు, తెల్లాపూర్ శివార్లలోనే కేంద్రీకృతమయ్యాయి. ఎఫ్వై 19లోని మొత్తం 18,460 యూనిట్లలో 35 శాతం శివారుల్లోనే లాంచింగ్ అయ్యాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ తెలిపింది. పుణే ఫస్ట్, కోల్కతా లాస్ట్.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2021 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021) 1.49 లక్షల గృహాలు లాంచింగ్ కాగా.. ఇందులో 58 శాతం శివారు ప్రాంతాలలోనే ప్రారంభమయ్యాయి. ఎఫ్వై 20లో 2.07 లక్షల యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో 53 శాతం, అలాగే ఎఫ్వై 19లో 2.29 లక్షల ఇళ్లు ప్రారంభం కాగా.. ఇందులో 51 శాతం గృహాలు శివారు ప్రాంతాల్లోనే లాంచింగ్ అయ్యాయి. శివారు ప్రాంతాలలో ప్రాజెక్ట్స్ల లాంచింగ్స్లో పుణే ప్రథమ స్థానంలో నిలవగా.. కోల్కతా చివరి స్థానంలో నిలిచింది. ఎఫ్వై 21లో పుణేలో 29,950 గృహాలు ప్రారంభం కాగా.. ఇందులో 76 శాతం ముల్శీ, పిరంగట్, దౌండ్, కంషేట్, రావేట్, చకాన్, చికాళీ, వాడ్గావ్ బుద్రక్, తలేగావ్ దభాడే, ఉంద్రీ శివారుల్లోనే ఉన్నాయి. ఎఫ్వై 19లోని 39,210 హౌసింగ్లో ఔటర్ వాటా 67 శాతం. కోల్కతాలో 4,250 గృహాలు లాంచింగ్ కాగా.. కేవలం 26 శాతం యూనిట్లు బరాసత్, బరాక్పూర్, సెరాంపూర్, గారియా, హౌరాల్లోనే ప్రారంభమయ్యాయి. ఇతర నగరాల్లో.. ► ఎఫ్వై 21లో ముంబైలో 34,620 యూనిట్లు లాంచింగ్ కాగా.. 67 శాతం గృహాలు పన్వేల్, పాల్ఘర్, వాసాయి, విరార్, బద్లాపూర్, భీవండి, డొంబివ్లీ ప్రాంతాలలోనే ప్రారంభమయ్యాయి. ఎఫ్వై 19లో వీటి వాటా 60 శాతంగా ఉంది. ► ఎన్సీఆర్లోని 19,090 గృహాలలో 57 శాతం సోహ్నా, గ్రేటర్ నోయిడా వెస్ట్, యమునా ఎక్స్ప్రెస్ వేలో ఉన్నాయి. ఎఫ్వై 19లోని మొత్తం 29,500 యూనిట్లలో ఔటర్ వాటా 49 శాతం. ► చెన్నైలోని 10,110 యూనిట్లలో 54 శాతం పూనమల్లె, అవడి, వండలూర్, షోలినాగ్నలూర్, గుడువాంచెరి, చెంగల్పట్టు ప్రాంతాలలో జరిగాయి. ఎఫ్వై 19లోని 16,130 యూనిట్లలో 44 శాతం వాటా శివారుదే. ► బెంగళూరులోని 20,520 గృహాలలో 46 శాతం చందపుర–అనెకల్ రోడ్, సర్జాపుర, యలహనక, దేవనహళ్లి, సర్జాపూర్–అట్టిబెల్ రోడ్లో ప్రారంభమయ్యాయి. ఎఫ్వై 19లోని 36,620 గృహాలలో శివారుల వాటా 37 శాతంగా ఉంది. డిమాండ్ ఎందుకంటే? కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మారిపోయాయి. గతంలో వాక్–టు–వర్క్ కల్చర్ ప్రాజెక్ట్లకు పరుగులు పెట్టిన కస్టమర్లు ప్రస్తుతం విశాలమైన, గ్రీనరీ ఎక్కువగా ఉండే నివాసాలు, వాయు, శబ్ధ కాలుష్యం తక్కు వగా ఉండే ప్రాంతాలలో అఫర్డబుల్ గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్, ఈ–స్కూల్, ఆరోగ్య భద్రత వంటి వసతులున్న ప్రాజెక్ట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పూరి తెలిపారు. శివారు ప్రాంతాలలో ల్యాండ్బ్యాంక్ ఉన్న డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్లు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం అని సూచించారు. అంతేకాకండా శివారు, కొత్త ప్రాంతాలలో నివాస సముదాయాల నిర్మాణాలతో ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గుతుంది. మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్ వంటి మౌలిక వసతులతో ప్రధాన నగరం, శివారు ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. -
రియల్టీ బూస్ట్ : సూచీల జోరు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు లాభాలతో ప్రారంభమైన ఆ తరువాత మరింత స్టాక్మార్కెట్లు జోరందుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా ఎగిసి సరికొత్త గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా 12000 పాయింట్లను అధిగమించింది.ప్రస్తుతం 141 పాయింట్లు ఎగసి 40,610వద్ద నిఫ్టీ 31 పాయింట్లు పుంజుకుని 11997వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా రియల్టీ 2 శాతం, బ్యాంక్ నిఫ్టీ లాభపడుతుండగా, మెటల్, ఆటో రంగాలు బలహీనంగా ఉన్నాయి. ఇన్ఫ్రాటెల్, ఇండస్ఇండ్, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, జీ, సన్ ఫార్మా, టీసీఎస్, గ్రాసిమ్, ఎస్బీఐ లాభాల్లో కనొసాగుతున్నాయి. అయితే టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, వేదాంతా, యస్ బ్యాంక్, బీపీసీఎల్, హీరో మోటో, ఐషర్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ నష్టపోతున్నాయి. మరోవైపు రియల్టీ రంగంకోం కేంద్రం రూ. 25వేలకోట్ల ఫండ్ ప్రకటించడంతో రియల్టీ హౌసింగ్షేర్లలో కొనుగోళ్లు పుంజుకున్నాయి. రియల్టీ కౌంటర్లలో ఇండియాబుల్స్, శోభా, ప్రెస్టేజ్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్, బ్రిగేడ్ భారీగా లాభపడుతున్నాయి. -
ఆరు నెలల్లో అభివృద్ధి దిశగా!
2015 చివరికల్లా రియల్టీ బూమ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అభివృద్ధికి పక్కా ప్రణాళికలు.. చక్కటి పరిపాలన దిశగా అడుగులు.. శాంతిభద్ర తలకు పెద్ద పీట.. పూర్తిస్థాయి పారదర్శకత.. భాగ్యనగరానికి పెరుగుతున్న ఆదరణ.. క్యూ కడుతున్న ఐటీ, ఇతర సంస్థలు.. మెరుగుకానున్న ఉపాధి అవకాశాలు.. నిర్మాణ రంగం వృద్ధికి సరికొత్త నిర్ణయాలు.. మొత్తానికి హైదరాబాద్ బ్రాండ్ విశ్వవ్యాప్తం అవుతోందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ‘లెట్స్ గెట్ రియల్’ సదస్సులో పాల్గొన్న వక్తలు. ఇంటర్నేషనల్ అడ్వర్టయిజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) ఇండియా చాప్టర్, సాక్షి మీడియా గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘హైదరాబాద్ రియల్టీ ప్రస్తుత పరిస్థితి- భవిష్యత్తు ప్రణాళికలు’ అనే అంశంపై ట్రెడా అధ్యక్షుడు పి.దశరథ్ రెడ్డి, అప్రెడా అధ్యక్షుడు జి.హరిబాబు, పీబీఈఎల్-ఇన్కోర్ కో-ఫౌండర్ జి.ఆనంద్రెడ్డి, నమన్ గ్రూప్నకు చెందిన నీతా పటేల్, లగ్జరీ అండ్ ఎక్స్పెరిమెంటల్ మార్కెటింగ్ ప్రతినిధి సోనాల్ సేత్లు బృంద చర్చ చేశారు. ముఖ్యాంశాలివీ... ►కొన్నేళ్లుగా మాంద్యం, స్థానిక రాజకీయాంశాలతో తీవ్ర ఇబ్బంది పడ్డ నిర్మాణ రంగం గాడిలో పడటానికి బోలెడన్ని కారణాలున్నాయి. నిర్మాణ సంస్థలు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లాయి. నిధుల కొరత తీవ్రం కావడంతో పలు సంస్థలు ప్రాజె క్టుల్ని కుదించుకున్నాయి. నగదు కొరతను అధిగమించడానికి తమ వద్ద కొన్నేళ్ల నుంచి ఖాళీగా ఉన్న స్థలాల్ని విక్రయించాయి. పలు నిర్మాణ సంస్థలు నష్టాలు లేకుండా చూసుకోవడానికి ఇతర సంస్థలతో కలసి ఉమ్మడి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. ►కొన్ని సంస్థలు నిధుల కొరతను అధిగమించడానికి ఆకర్షణీయమైన పథకాల్ని ప్రకటించి వాటి ద్వారా వచ్చిన సొమ్ముతో పాత ప్రాజెక్టుల్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాయి. పలు సంస్థలు కొత్త నిర్మాణాల జోలికెళ్లకుండా ప్రస్తుత వాటిని పూర్తి చేయడంపై దృష్టి సారించాయి. ►ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోనే ఫ్లాట్ల రేట్లు తక్కువ. కొన్నాళ్లుగా చాలా మంది సొంతూళ్ల్లలో స్థలాలు, ఇళ్లను కొనడం మీద దృష్టిసారించినా నగరానికి గల ప్రత్యేకతను గుర్తించి భవిష్యత్తు అభివృద్ధిని అంచనా వేసుకొని ఫ్లాట్లను కొంటున్నారని అప్రెడా అధ్యక్షుడు హరిబాబు చెప్పారు. ‘‘ప్రాజెక్ట్ నిర్మాణ దశను బట్టి పెట్టుబడులొస్తుంటాయి. అంతే తప్ప ఒక్కసారిగా రావు. ఈస్ట్, నార్త్ దిశల్లోనూ స్థిరాస్తి అమ్మకాలు జోరందుకున్నాయి. భవిష్యత్తు వృద్ధికి అపార అవకాశాలున్న ప్రాంతాలు, పని కేంద్రాలకు చేరువగా ఉన్న ఏరియాల్లో కొత్తగా ఆరంభమైన ప్రాజె క్టుల్లో ధర తక్కువగా ఉంటే కొనుగోలుదారులు ఫ్లాట్లను కొంటున్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఇంటి ధర పెరుగుతుందనే ఉద్దేశంతో పెట్టుబడిదారులూ ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరలో మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు లభించే ప్రాజెక్టులు భవిష్యత్తులో వస్తాయో లేవోననే సందేహాలు కొనుగోలుదారుల్లో నెలకొన్నాయి. ఇలాంటి వారు ఆలస్యం చేయకుండా ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు’’ అని ఆయన వివరించారు. ►కొత్తగా మొదలైన ప్రాజెక్టుల్లోనూ ఈ ఏడాది అమ్మకాలు పెరిగాయి. ప్రవాసులు, వృత్తి నిపుణులు, వ్యాపారులు, ఐటీ నిపుణుల వంటివారు లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల్ని కొనేవారి జాబితాలో ముందుంటున్నారని నమన్ గ్రూప్ నీతా పటేల్ చెప్పారు. దేశంలో ఏటా 10-15 శాతం ఎన్నారై పెట్టుబడులు పెరుగుతున్నాయని... బ్రాండ్, మార్కెటింగ్ మీద ఆధారపడి వారు పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. ఆటా, నాటా వంటి సంస్థలు, బ్యాంకులు ఎగ్జిబిషన్లు నిర్వహించడం కలిసొచ్చే అంశాలంటూ... ఎన్నారై ఎంక్వయిరీలకు రెస్పాండ్ కావాలని, వారితో ప్రొఫెషనల్గా డీల్ చేయాలని సూచించారు. ►బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శ్రీనగర్కాలనీ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ పెరగడం, ఇళ్ల ధరలు అధికం కావడం వల్ల కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ మార్గాలైన కొండాపూర్, చందానగర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల వైపు దృష్టి సారిస్తున్నారని పీబీఈఎల్-ఇన్కోర్ కో-ఫౌండర్ జీ ఆనంద్రెడ్డి చెప్పారు. ‘‘సరైన ప్రాంతంలో సరైన నిర్మాణాలు ఉంటే కొనుగోలుదారులు వెనుకంజ వేయటం లేదు. అయితే ఏ నగరంలోనైనా స్థిరాస్తి రంగం వృద్ధి చెందాలంటే స్థానిక రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు బయటి నుంచి... ప్రాజెక్ట్ లొకేషన్, ధర, వసతులు అంతర్గతంగా మద్దతిచ్చేలా ఉండాలి. మరోవంక ఆరంభించిన ప్రతి ప్రాజెక్ట్ను విక్రయించని ప్రాజెక్ట్గా సర్వేల్లో చెబుతున్నారు. ఇది తప్పు. ఎందుకంటే స్థిరాస్తి ప్రాజెక్ట్ అనేది ఒక్క రోజులో నిర్మించేది కాదు. ప్రాజె క్ట్ నిర్మించాలి.. ప్రభుత్వం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలి. అప్పుడు కూడా విక్రయం కాకపోతే అది అన్సోల్డ్ ప్రాజెక్ట్ కింద లెక్క. 2000లో నగరంలో ఏటా 5 వేల ఫ్లాట్లు అమ్ముడయ్యేవి. 2006 తర్వాత ఏటా 25 వేల ఫ్లాట్లు అమ్ముడయ్యే స్థాయికి నగరం చేరింది. ప్రతి ప్రాజెక్ట్లో 3 శాతం పెట్టుబడులను అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్ కోసం ఖర్చు చేస్తున్నాం’’ అని వివరించారు. ►ఏటా 5 కోట్ల చ.అ. వాణిజ్య స్థలం అభివృద్ధి చెందుతోందని, 2020 నాటికల్లా ఆఫీసు సముదాయాల విస్తీర్ణం 70 కోట్ల చ.అ.లకు చేరుకుంటుందని లగ్జరీ అండ్ ఎక్స్పెరిమెంటల్ మార్కెటింగ్ సోనాల్ సేత్ చెప్పారు. ఈ స్థాయిలో వృద్ధిని నమోదు చేయడం వల్లే ప్రపంచంలో హైదరాబాద్ రియల్ మార్కెట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందన్నారు. ‘‘ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో బూమ్ కారణంగా నిర్మాణ సంస్థలు ఐటీ పార్కులు, షాపింగ్ మాళ్లను ఏర్పాటు చేశాయి. ఫలితంగా కమర్షియల్ రియల్ ఎస్టేట్లో గిరాకీ కంటే సరఫరా పెరిగింది. అయితే రూ.50 కోట్ల ప్రాజెక్ట్ను విక్రయించాలంటే పేపర్, రేడియో వంటి సంప్రదాయ అడ్వర్టయిజింగ్తో అయ్యే పని కాదు. ఇందుకోసం ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి డిజిటల్ మీడియా చాలా అవసరం. ప్రాజెక్ట్లోని ప్రతి దశను కొనుగోలుదారులకు గ్రాఫులతో వివరంగా చెప్పాలి. అప్పుడే వారిలో నమ్మకం పెరుగుతుంది’’ అని వివరించారు. ప్రచారంతోనే రియల్టీ పరుగులు ►అడ్వర్టయిజింగ్ అనేది ట్రెండ్ను ఫాలో అవ్వటం కాదు.. సృష్టించాలి. బ్రాండ్, మార్కెటింగ్ అనేది ఏ సంస్థకైనా ముఖ్యమే. ప్రకటనలతోనే స్థిరాస్తి అమ్మకాలు పరుగులు పెడతాయి. బ్రాండింగ్, మార్కెటింగ్తో అది మరింత జోరందుకుంటుంది. ►స్థిరాస్తిని కొనుగోలు చేయాలంటే కస్టమర్లు ముందుగా చూసేది లొకేషనే. అంటే ఆఫీసుకు దగ్గర్లోనో.. పిల్లల స్కూలుకు దగ్గర్లోనో.. లేక బంధువులు, సంబంధీకుల దగ్గర్లోనో ఉండాలని. ఆ త ర్వాతే ధర చూస్తారు. హైదరాబాద్లో ఎక్కువ శాతం 2 బీహెచ్కే ఫ్లాట్ల వైపే మొగ్గుచూపుతారు. వాటి రేటు కూడా రూ.35 లక్షల్లోపే ఉండాలి. ఆ గీత దాటితే కొనడం కష్టమే. ఫ్లాట్ విస్తీర్ణం కూడా కొంత మేర ప్రభావం చూపిస్తుంది. 2 బీహెచ్కే ఫ్లాట్లంటే గరిష్టంగా 1,800 చ.అ. ఉండాల్సిందే. చాలా వరకు సంస్థలు ఇంత విస్తీర్ణంలో ఫ్లాట్లను ఇవ్వలేకే కుదేలవుతున్నారు. ►ఈ ఏడాది నుంచి స్థిరాస్తి రంగంలోనూ అడ్వర్టయిజింగ్ ప్రభావం అనే అంశంపై సదస్సులు నిర్వహిస్తున్నాం. రిటైల్, రియల్ ఎస్టేట్ ఈ రెండు రంగాలకు అడ్వర్టయిజింగ్ చాలా ముఖ్యం. ►ఐఏఏ ఇండియా చాప్టర్ ఈ ఏడాదితో 25 వసంతాల్లోకి అడుగుపెట్టింది. గతేడాది ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గోవా, హైదరాబాద్లో 32 కార్యక్రమాలను పూర్తి చేశాం. ఈసారి వాటి సంఖ్యను 50కి పెంచుతాం. ►దేశంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలతో సదస్సులు, సమావేశాలూ నిర్వహించాం. ►రాష్ట్ర జీడీపీలో 35 శాతం వాటా స్థిరాస్తి సంస్థలు చెల్లించే పన్నులు, వ్యాట్ ఇతరత్రానే. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఇనుము, సిమెంట్, ఇసుక, రంగులు వంటి సుమారు 250కిపైగా పరిశ్రమలు ఒక్క స్థిరాస్తి రంగంపైనే అధారపడి పనిచేస్తున్నాయి. - ఎస్కే స్వామి, ఐఏఏ ఇండియా చాప్టర్ ప్రెసిడెంట్ ప్రచారానికి మాంద్యమే సరైన సమయం ►మాంద్యం సమయంలో మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ క త్తిమీద సామే. అయితే ఇలాంటి సమయమే ఎన్నో పాఠాలు నేర్పుతుంది. నిజం చెప్పాలంటే మాంద్యం సమయంలో ధరలు తక్కువగా ఉంటాయి. దీన్ని అందిపుచ్చుకుని సరికొత్తగా, క్రియేటివ్గా ప్రచారం చేస్తే విజయవంతమవుతాం. ►మాంద్యం సమయంలో ప్రచారం విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. ఉత్పత్తి తాలూకు ప్రయోజనాలు, ఉపయోగాలను సూటిగా... సుత్తి లేకుండా కొనుగోలుదారులకు చేరవేయాలి. అలాంటి మాధ్యమాలనే ఎంచుకోవాలి. ►కస్టమర్ల సందేహాలు, సమస్యలకు నేరుగా స్పందించాలి. ఈమెయిళ్లు, సామాజిక మాధ్యమాల్లో నేరుగా స్పందించాలి. కొనుగోలుదారుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా ప్రచారం చేయాలి. ఖర్చు చేసే ప్రతి రూపాయిపై ప్రతిఫలం పొందేలా ప్రచార సాధనాలను ఎంచుకోవాలి. ►పేపర్, రేడియో వంటి సంప్రదాయ ప్రచార సాధనాలు తెరమరుగవుతున్నాయని.. ఇక డిజిటల్ ప్రచారమే ఊపందుకుంటుందని అనడం సరైందికాదు. ఎందుకంటే నేటికీ 80 శాతం కొనుగోళ్లు సంప్రదాయ ప్రచార సాధనాల ఆధారంగానే వస్తున్నాయి. ట్రేడ్షో, రోడ్షోలు, పార్టీల వంటివి నిర్వహిస్తుండాలి. ఆగ్యుమేటెడ్ రియల్టీతో ప్రాజెక్ట్ దశలను కస్టమర్లకు వివరించాలి. వెబ్సైట్లు గజిబిజిగా కాకుండా సులువుగా వినియోగించేలా ఉండాలి. - జాకబ్, సోమయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ప్రొఫెసర్ ప్రచారం రాత్రి సమయాల్లోనూ.. ►పోటీ అనేది ఒకే రంగానికి చెందింది కాదు. రియల్టీ సంస్థలకు సిమెంట్, స్టీల్, పెయింట్స్ వంటి సంస్థలతో పోటీ ఉండాలి. అది కూడా స్నేహపూర్వక వాతావరణంలోనే. ►ఆన్లైన్లో స్థిరాస్తి అమ్మకాలు పెరుగుతున్నాయి. 2015 ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో 37 శాతం అడ్వర్టయిజింగ్ ఫేస్బుక్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారానే జరిగింది. ►మంచి ప్రాజెక్ట్ను నిర్మించినంత మాత్రాన కస్టమర్లు రారు. దానికి తగిన ప్రచారం ఉంటేనే కొనుగోలుకు ముందుకొస్తారు. అది కూడా ట్రెండ్కు తగ్గట్టుగా ప్రచారం చేయాలి. ►ఓ పుస్తక సంస్థ ఇటీవల ఏం చేసిందంటే.. ఒక్క ట్వీట్ చేసి పుస్తకాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చంటూ సరికొత్త విధానానికి తెరలేపింది. ఇలా ప్రచారంలో కొత్త ధోరణిని తీసుకురావాలి. అప్పుడే కస్టమర్లను చేరుకుంటాం. నో బ్రోకర్.కామ్ సంస్థ స్థిరాస్తి రంగంలో మధ్యవర్తుల అవసరమే లేకుండా చేసేందుకు సరికొత్త పద్ధతులను తీసుకొచ్చింది. ఆన్లైన్లో అగ్రిమెంట్లు, ఆగ్యుమేటెడ్ రియల్టీతో ప్రాజెక్ట్ పరిశీలన వంటివి దీనికి ఉదాహరణ. ►చాలా వరకు స్థిరాస్తి సంస్థలు కస్టమర్లకు ప్రాపర్టీ విజిట్లను డే టైమ్లో చూపిస్తాయి. ఎందుకు నైట్ టైంలో చూపించవనేది నా ప్రశ్న. పొద్దంతా ఆఫీసు పని, గజిబిజి ట్రాఫిక్ సమస్యలతో అలసి ఇంటికొచ్చిన వారికి సాయంత్రం సమయంలో తమ ప్రాజెక్ట్ ఎంతటి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని నింపుతుందో నేరుగా చూపిస్తే ఇట్టే అర్థమవుతుంది. ప్రాజెక్ట్లోని గార్డెనింగ్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఎంతటి ఆహ్లాదాన్ని నింపుతాయో అర్థమయ్యేలా చేయాలి. - చారులత రవికుమార్, రాజోర్ఫిష్ ఇండియా సీఈఓ ప్రచారం నుంచే లగ్జరీ మొదలు.. లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలు నిర్మించడంతోనే సరిపోదు. వాటిని సరిగ్గా ప్రమోట్ చేసుకోగలగాలి. కొనుగోలుదారులకు లగ్జరీ స్థిరాస్తులనే విషయం ప్రచారం నుంచే మొదలు కావాలి. ఇందుకోసం వినూత్న పద్ధతులను ఫాలో కావాలి. హీరానంద్, లోధా వంటి కంపెనీలు తరగతులను బట్టి బ్రాండింగ్, మార్కెటింగ్ చేస్తాయి. సామాన్యులకో బ్రాండ్, మధ్యతరగతికో బ్రాండ్, లగ్జరీకో బ్రాండ్లతో ప్రాజెక్ట్లను చేస్తాయి. ఈ తరహా విధానాలను అవలంభిస్తే బాగుంటుంది. ►చేతిలో ఉన్న ప్రాజెక్ట్ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని అడ్వర్టయిజింగ్ చేయకూడదు. దాదాపు దశాబ్ధం ముందు ఆలోచించి ప్రచారాన్ని ఎంచుకోవాలి. ఆన్లైన్, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నేటి ట్రెండ్. ఆన్లైన్ కొనుగోలుదారులతో సత్సంబంధాలు కొనసాగిస్తే వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా పరిచయాలు పెరుగుతాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం చేసుకునే అవకాశముంటుంది. ►{పాజెక్ట్ పురోగతిని ఫొటోల రూపంలో, ఆగ్యుమేటెడ్ రియల్టీతో కొనుగోలుదారులకు ఎప్పటికప్పుడు చేరవేయాలి. అప్పుడే నిర్మాణ సంస్థలపై కస్టమర్లకు నమ్మకం పెరుగుతుంది. - ప్రీతి వ్యాస్, వ్యాస్ గైనట్టి క్రియేటివ్ ప్రై.లి. చైర్పర్సన్ ప్రచారంలో కొత్త పద్ధతులు తెలిశాయి సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు అభినందనీయం. ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఇప్పటివరకు నగరంలో స్థిరాస్తి ప్రాజెక్ట్ల ప్రచారం అంటే అదొక మూస ధోరణిలా ఉండేది. కానీ, ఈ సదస్సుతో సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు తెలిశాయి. ఉదాహరణకు చారుతల రవికుమార్ ఇచ్చిన ప్రసంగంలో రాత్రి సమయాల్లో స్థిరాస్తి ప్రాజెక్ట్ల విజిటింగ్లనేది కొత్తగా ఉంది. దీన్ని మా ప్రాజెక్ట్లో అమలు చేస్తాం. - వెంకట్ రెడ్డి, ఏవీ కన్స్ట్రక్షన్స్ స్థానిక సంస్థలను కలుపుకోవాల్సింది సరికొత్త ప్రచారం ఎత్తుగడలు ఈ సదస్సుతో తెలిసింది. కానీ,అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ సదస్సును స్థానికంగా ఉన్న స్థిరాస్తి సంస్థలను కూడా భాగస్వాముల్ని చేసి ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తే బాగుంటుంది. విలువైన సమాచారం ఉన్న ఈ సదస్సు మిగతా ప్రాంతాల్లోనూ నిర్వహిస్తే అందరికీ ప్రయోజనం కలుగుతుంది. - రాము, రామ్ డెవలపర్స్