breaking news
Remunerative prices
-
ధరల పతనంలో బాబు ‘రికార్డు’
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లే రాష్ట్రంలో రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు దక్కని దుస్థితిని ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్లే కదా? అని దెప్పిపొడిచారు. కర్నూలులో ఉల్లి రైతులకు కిలో రూ.మూడు మాత్రమే దక్కుతుండగా బిగ్ బాస్కెట్, ఇతర ఆన్లైన్ స్టోర్లలో మాత్రం కిలో రూ.29 నుంచి రూ.32 దాకా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే రైతుల నుంచి పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వం వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపాలని హితవు పలికారు. ఈమేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..» చంద్రబాబు గారూ.. పంటల ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు..? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా మీరు కనికరం కూడా చూపడం లేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్లే కదా? » క్వింటా ఉల్లిని రూ.1,200 చొప్పున కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవరూ కొనడం లేదు.. ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది? ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతర స్టోర్లలో ఆన్లైన్లో పరిశీలిస్తే కిలో రూ.29 నుంచి రూ.32 దాకా ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25కి తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? ఇది మీ తప్పు కాదా చంద్రబాబు గారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టి పెట్టకపోడం అన్యాయం. అటు టమాటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి. -
రాహుల్ రాష్ట్రానికి వస్తారు...
బెంగళూరు: గిట్టుబాటు ధరలు, పంటరుణాలు దక్కక ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరమార్శించడానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ త్వరలో కర్ణాటక వ్యాప్తంగా పర్యటిస్తారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్తో కలిసి శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని కారణాల వల్ల పర్యటన తేదీలు ఖరారు కాలేదని అయితే రాహుల్ గాంధీ పర్యటనపై త్వరలో స్పష్టత వస్తుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యాలు ఏడాదిలోపే తేటతెల్లమయ్యిందన్నారు. అనేక అక్రమాలకు పాల్పడిన లలిత్మోదీని ఎందుకు రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా బీజేపీ నాయకులను దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. బెంగళూరు నగరం అభివృద్ధి పథంలో పయనించాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. -
గుండె మండి ‘పంట’కు మంట!
పరిగి: రైతు ఉత్పత్తులకు గిట్టుబాటుధరలు కల్పించాలని రైతు కిసాన్సంఘ్ రాష్ట్ర కన్వినర్ అందె విజయ్కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబయ్య అన్నారు. శుక్రవారం రైతు కిసాన్సంఘ్ ఆధ్వర్యంలో పరిగి వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. పత్తి, మొక్కజొన్నలు తగులబెట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ మార్కెట్లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు రైతుల ఉత్పత్తులకు ధరలు తగ్గుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదని ఆరోపించారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం నామ్కే వాస్తేగా మారిందన్నారు. దళారులకే దన్నుగా నిలుస్తున్నారని తెలిపారు. పత్తికి రూ. 5000, వరికి రూ.1400, మొక్కజొన్నలకు రూ.1310 కి తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని తెలిపారు. దళారుల బారినుండి రైతులను రక్షించాలన్నారు. పరిగి వ్యవసాయ మార్కెట్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవటంలేదన్నారు. అనావృష్టి కారణంగా ఈ సంవత్సరం నియోజకవర్గ రైతులు తీవ్ర నష్టం వచ్చిందని పేర్కొన్నారు. మద్దతు ధరలు పెంచి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మార్కెట్లో రైతులకు తప్పనిసరిగా తక్పట్టీలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తక్పట్టీలు ఇవ్వని కారణంగా రైతులు బీమా సౌకర్యం కోల్పోతున్నారని తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రం పరిగిలోనే ఏర్పాటు చేయటంతో పాటు తూకాలు కూడా ఇక్కడే నిర్వహించాలని కోరారు...ఈ కార్యక్రమంలో ఆయా రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.