ఏరియల్ సర్వేతో సరి!
రైతుల నిరసనల భయంతో సింగపూర్ బృందం క్షేత్రస్థాయి పర్యటన రద్దు
నేడు విజయవాడకు బృందం రాక.. రెండు జిల్లాల అధికారులతో భేటీ
సాక్షి, విజయవాడ: భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతుల ఆగ్రహాన్ని సింగపూర్ ప్రతినిధులు చవిచూస్తే ఆ ప్రభావం రాజధాని నిర్మాణంపై ఉండొచ్చనే భయంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాటి సింగపూర్ బృందం క్షేత్రస్థాయి పర్యటనను రద్దు చేసింది. ఉదయం విజయవాడలోని గేట్వే హోటల్లో అధికారులతో కాసేపే మా ట్లాడి, సింగపూర్ ప్రతినిధి బృందం ‘ఏరియల్ సర్వే ’ జరిపేలా ఏర్పాట్లు చేసింది. మంగళవారం రాత్రి చివరి నిమిషంలో ప్రభుత్వం ఈ మేరకు కార్యక్రమాన్ని మా ర్చింది. వాస్తవానికి సింగపూర్ నిపుణుల బృందం బుధవారం ఉదయం రాజధాని ప్రతిపాదిత మండలాలైన తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో పర్యటిం చేలా కార్యక్రమం ఖరారు చేశారు. తాడేపల్లి, మంగళగిరి మండలాలకు చెందిన రైతులు సోమవారం రాత్రి సమావేశమై సింగపూర్ బృందం వస్తే ప్రతిఘటించాలని తీర్మానించుకున్నారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రైతులకు అండగా ఉంటానని ప్రకటించారు. ఎలాగైనా బృందాన్ని క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకుని వెళ్లాలనుకున్న ప్రభుత్వ వర్గాలు ఆ గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నమే పోలీసు బలగాలను మోహరింప చేశాయి. అయితే రైతుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుందనే విషయాన్ని ప్రభుత్వ నిఘా వర్గాలు ఉన్నతాధికారులకు చేరవేశాయి. దీంతో సింగపూర్ బృందాన్ని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేయించి వెనక్కు పంపేలా ప్రభుత్వం మార్పులు చేసింది.