breaking news
Rowthulapudi
-
ప్రతి గ్రామానికీ గుడి, బడి, ఆసుపత్రి అవసరం: ఆర్.నారాయణమూర్తి
సాక్షి, కాకినాడ సిటీ: ప్రతి గ్రామానికీ గుడి, బడి, ఆసుపత్రి అవసరమని సినీ నటుడు, దర్శక నిర్మా త ఆర్.నారాయణమూర్తి అన్నారు. స్వస్థలమైన రౌతులపూడి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన శివాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఊరిలో గుడి ఉంటే మనిషి పాపభీతితో తప్పులు చేయకుండా ఉంటాడని, బడి ఉంటే చదువు ద్వారా జ్ఞానం, వికా సం వస్తాయని చెప్పారు. ఆసుపత్రి ఉంటే అనారోగ్య సమస్య వచ్చినవారు కుదుట పడతారన్నారు. శివాలయం పునఃప్రతిష్ఠకు వేలాదిగా ఊరి జనంతో పాటు చుట్టుపక్కల ప్రజలు, భక్తులు తరలిరావడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. శివాలయం పునర్నిర్మాణం అంశాన్ని ఆలయ కమిటీ తన దృష్టికి తీసుకు రాగా.. గత ప్రభుత్వంలో దేవదాయ శాఖ ఆధ్వర్యాన రూ.55 లక్షలు మంజూరు చేశారని చెప్పారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మాజీ అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజస్తంభం ఏర్పాటుకు తన శాఖ నుంచి ఎటువంటి అడ్డంకులూ లేకుండా అనుమతులు ఇచ్చారని చెప్పారు. గ్రామ పెద్దలు పైలా సాంబశివ, అరిగర్ల రామకృష్ణ, ఈరంకి ప్రభాకరరావు, యిటంశెట్టి భాస్కరరావు, వాసిరెడ్డి కృష్ణమూర్తి, నాగబాబు, ఊరిలోని ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు చందాలు ఇచ్చి ఆలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించారని నారాయణమూర్తి కొనియాడారు. చదవండి: (24 గంటలలోపే.. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు) -
చిత్తుగా తాగి స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్
రౌతులపూడి : తప్పతాగిన ఓ స్కూలు బస్సు డ్రైవర్ ఆ మత్తులో బస్సు నడుపుతూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నాడు. ఆ తాకిడికి స్తంభం విరిగి పోయినా, బస్సులోని విద్యార్థులు ముప్పు నుం చి తప్పించుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. తునిలోని ఓ విద్యాసంస్థకు చెందిన బస్సు బల రామపురం నుంచి బుధవారం ఉదయం విద్యార్థులను తీసుకుని బయలుదేరింది. డ్రైవర్ నరసింహమూర్తి పూటుగా తాగిన మత్తులో బస్సు నడపడంతో, అదుపు తప్పి లచ్చిరెడ్డిపాలెం శివార్లలో 11 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. స్తంభం మధ్యకు విరిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ముప్పు తప్పిం ది. బస్సును ఆపకుండా డ్రైవర్ అడ్డది డ్డంగా నడుపుకొంటూ పోవడంతో ఫణికుమార్ అనే డిగ్రీ విద్యార్థి చొరవ చేసి, నరసింహమూర్తితో బలవంతంగా బస్సు ను ఆపు చేయించాడు. విద్యార్థులంతా దిగిపోయాక నరసింహమూర్తి బస్సుతో అక్కడి నుంచి ఉడాయించాడు. తర్వాత అతడిని వెంటబెట్టుకుని వచ్చిన విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులను స్థానికులు నిలదీశారు. గతంలోనూ మూడుసార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, స్థానికులకు నచ్చజెప్పిన యాజమాన్య ప్రతినిధులు ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటిస్తామని హామీ ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఈపీడీసీఎల్ ఏఈ ప్రసాద్ మాట్లాడుతూ పరిహారం చెల్లించకపోతే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదూ అందలేదని కోటనందూరు ఎస్సై ఎం.అప్పలనాయుడు చెప్పారు. -
అక్షరాలా అరకోటి హాంఫట్
రౌతులపూడి, న్యూస్లైన్ : ‘కంచే చేను మేసిన’ రీతిలో మహిళా సంఘాల అభ్యున్నతికి పాటుపడాల్సిన కమ్యూనిటీ ఫెసిలిటేటర్లే (సీఎఫ్లు) వారిని దగా చేశారు. మహిళలు ఆర్థికం నిలదొక్కుకోవడానికి దోహదపడాల్సిన సొమ్మును దర్జాగా నొక్కేశారు. ‘కల్లు దొంగిలించి తాగేవాడి మోచేతి జాలును జుర్రుకున్నట్టు’ అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఆ తప్పుడు సంపాదనలో వాటాలు తీసుకున్నారు. ఆ పార్టీకే చెందిన ఓ ఎమ్మెల్సీ ఆ అవినీతిపరులకు అండగా నిలుస్తున్నారు. రౌతులపూడి మండలంలో చోటు చేసుకున్న ఈ అవినీతిపర్వం వివరాలిలా ఉన్నాయి. మహిళలకు వ్యక్తిగతంగా రుణాలివ్వడానికి ప్రభుత్వం రెండేళ్ల క్రితం ‘స్త్రీ నిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్’ పేరుతో మండలానికి కోటి రూపాయల చొప్పున మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఇందిరా క్రాంతిపథం కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు మహిళా సంఘాల సభ్యులకు ఈ పథకంలో రుణాలిప్పిస్తామని రూ.660 చొప్పున షేర్ క్యాపిటల్గా వసూలు చేశారు. ఆ సొమ్ముకు ఎలాంటి రశీదూ ఇవ్వలేదు. మండలంలో ఇలా వసూలు చేసిన మొత్తం రూ.20 లక్షలకు పైగా ఉంటుంది. రికార్డుల్లోనే రుణం.. ప్రభుత్వం స్త్రీ నిధి ద్వారా 2012-13 ఆర్థిక సంవత్సరంలో మండలంలోని ఎ.మల్లవరం, బీబీ పట్నం, బలరామపురం, గంగవరం, గిడజాం, గుమ్మరేగుల, లచ్చిరెడ్డిపాలెం, మల్లంపేట, రాజవరం, రౌతులపూడి, ఎస్.పైడిపాల, ఉప్పంపాలెం గ్రామాల్లోని 158 మహిళా సంఘాలకు చెందిన 667మందికి రూ.93,82,300 రుణాలుగా మంజూరుచేసింది. అయితే ఈ సొమ్మంతటినీ మంజూరైన సభ్యులకు విడుదల చేయకుండా రూ.30 లక్షలకు పైగా పక్కదారి పట్టించినట్టు క్షేత్రస్థాయిలో ‘న్యూస్లైన్’ జరిపిన పరిశీలనలో తేలింది. బలరామపురంలో మణికంఠ మహిళా సంఘంలో 14 మంది సభ్యులుండగా రూ.660 చొప్పున అందరితో షేర్ధనం కట్టించుకొన్నారు. వీరిలో అయిదుగురిపేరు మీద రూ.70 వేలు స్త్రీ నిధి రుణం విడుదలైంది. అయితే ఆ సంఘం సభ్యులు తమకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మొత్తుకుంటున్నారు. అదే గ్రామంలో కరుణామయుడు గ్రూప్లో నలుగురు సభ్యుల పేరు మీద రూ.52 వేలు రుణం ఇచ్చినట్లు రికార్డులు చూపుతుండగా, ఇద్దరికి మాత్రమే అదీ రూ.10 వేల చొప్పున ఇచ్చినట్టు తేలింది. రాజవరంలో గంగాభవాని గ్రూపునకు అయిదుగురి పేరుమీద రూ.80,000 రుణం ఇచ్చినట్టు రికార్డుల్లో ఉన్నా ఒక్కరికీ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. భవానీ గ్రూపునకు ముగ్గురి పేరు మీద రూ.50 వేలు ఇచ్చినట్టు రికార్డులు చెపుతుండగా వాస్తవానికి ఇద్దరికి రూ.20 వేలే ఇచ్చారు. లచ్చిరెడ్డిపాలెం దుర్గా గ్రూపులో ఆరుగురి పేరు మీద రూ.90 వేలు ఇచ్చినట్టుండగా ఆ సంఘానికి ఇచ్చింది రూ.60 వేలు మాత్రమే. సాయి గ్రూపులో ఆరుగురికి రూ. 90 వేలు రుణం ఇచినట్లు రికార్డుల్లో ఉండగా, వారికిచ్చింది రూ.60 వేలు మాత్రమే. గిడజాం గంగోత్రి గ్రూపులో నలుగురు సభ్యులకు రూ.40 వేలు రుణం ఇచ్చినట్టు రికార్డుల్లో ఉండగా, తమ పేరున రుణం విడుదలైనట్టే తెలియదని వారంటున్నారు. మొత్తం మీద అన్ని గ్రూపులకూ కలిపి రూ.30 లక్షలకు పైగా పక్కదారి పట్టినట్టు అంచనా. అండగా నిలిచిన వారిపై తప్పుడు కేసులు కొందరు సీఎఫ్లు కుమ్మక్కై ఈ అవినీతికి పాల్పడగా అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ, పలువురు నాయకులు వారి నుంచి తామూ ముడుపులు పొంది అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా తమ పేరిట విడుదలైన రుణాలు తమకు దక్కకుండా కాజేసిన వ్యవహారంపై ఇటీవల గిడజాంలో మహిళలు ఆందోళన చేశారు. ఆ సందర్భంగా వారికి అండగా నిలిచిన వారిపై అధికార పార్టీ నేతల ప్రమేయంతో అన్నవరం పోలీసుస్టేషన్లో తప్పుడు కేసులు బనాయించారు. దీన్నిబట్టే సీఎఫ్ల అవినీతికి అధికార పార్టీ వారు కొమ్ము కాసిన నిజం తేటతెల్లమైందని మహిళలు అంటున్నారు. జిల్లాలో ఈ పథకం దివ్యంగా అమలు జరుగుతోందని పథకం ఎండీ విద్యాసాగర్రెడ్డి ఇటీవల కాకినాడలో కితాబునివ్వడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు..రౌతులపూడి మండలంలో జరిగిన అవినీతి బాగోతాన్ని గుర్తించి, లక్షలు స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, పథకం లక్ష్యం నెరవేరేలా చూడాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. బహిరంగ విచారణ జరుపుతాం.. కాగా రౌతులపూడి మండలంలో స్త్రీ నిధి రుణాలపై అన్నిగ్రామాల్లో బహిరంగ విచారణ జరుపుతామని ఇందిరాక్రాంతిపథం తుని ఏరియా కో ఆర్డినేటర్ పద్మావతి చెప్పారు. నిధులు దుర్వినియోగం అయినట్లు రుజువైతే ఆ సొమ్ములను వెనక్కి కట్టిస్తామని, బాధ్యులపై డీఆర్డీఏ పీడీ ఆదేశాలమేరకు చర్యలు చేపడతామని తెలిపారు.