కొత్తనోట్లను ఎలా గుర్తించాలంటే!
కొత్తగా విడుదల చేసిన రూ. రెండువేలు, రూ. 500 నోట్లు ఎలా ఉంటాయి, వాటిలో ఎలాంటి విశిష్టతలు ఉన్నాయి, కొత్త నోట్లను ప్రజలు ఎలా గుర్తుపట్టాలనే దానిపై భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) తాజాగా వివరణ ఇచ్చింది. కొత్తగా మహాత్మాగాంధీ సిరీస్లో విడుదలకానున్న రూ. రెండువేల కరెన్సీ నోటుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకం ఉంటుందని, అదేవిధంగా దీనిపై ముద్రణ సంవత్సరం 2016 కూడా ముద్రించి ఉంటుందని తెలిపింది. దేశం తొలిసారిగా జరిగిన గ్రహాంతర వ్యోమనౌక యాత్రకు గుర్తుగా మంగల్యాన్ బొమ్మ నోటుపై ఉంటుందని తెలిపింది. అదేవిధంగా ఈ నోటుపై ముందువైపు, వెనుకవైపు ఉండే కొన్ని విశిష్ట లక్షణాలను ఆర్బీఐ వెల్లడించింది. అవి ఏమిటంటే..
రెండువేల నోటు ముందువైపు..
2000 అని అంకెల్లో రాసిన దానికింద రిజిస్టర్ నంబర్ ఉంటుంది.
2000 ఇమేజ్ కాస్త గుప్తంగా తరచిచూస్తే కనిపించేవిధంగా ఉంటుంది.
దేవనాగరి అంకెలలో २००० అని రాసి ఉంటుంది.
నోటు మధ్యలో మహాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది.
బ్యాంకు నోటు ఎడుమవైపు ‘ఆర్బీఐ’ అని, ‘2000’ అని సూక్ష్మంగా రాసి ఉంటుంది.
‘భారత్’ అని విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్లో రాసి ఉంటుంది. అంతేకాకుండా ఆర్బీఐ, 2000 అని కలర్షిఫ్ట్లో రాసి ఉంటాయి. నోటును కాస్తా కదిలిస్తే ఇవి ఆకుపచ్చని రంగు నుంచి నీలిరంగులో మారుతాయి.
నోటు కుడివైపున గ్యాంరెటీ క్లాజ్, గవర్నర్ సంతకం, ప్రామిస్ క్లాజ్, ఆర్బీఐ చిహ్నం ఉంటాయి.
కుడివైపున కిందిభాగంలో రూపీ ముద్ర, ₹2000 అని కలర్ చేజింగ్ (ఆకుపచ్చ రంగు నుంచి నీలిరంగులోకి మారుతాయి)లో రాసి ఉంటాయి.
మహాత్మాగాంధీ బొమ్మకు కుడివైపున అశోక స్తంభం చిహ్నంతోపాటు, ఎలక్ట్రోటైప్ (2000 అని) వాటర్ మార్క్స్ ఉంటాయి.
ఎడుమవైపున పైభాగంలో, కుడివైపున కిందిభాగంలో సిరీస్ అంకెలు చిన్నవి నుంచి పెద్దవిగా ఉంటాయి.
అంధుల కోసం
కళ్లు కనిపించని వారు గుర్తించేందుకు మహాత్యాగాంధీ బొమ్మ, అశోక స్తంభం చిహ్నం ఉబ్బెత్తుగా ఉండి, బ్లీడ్ లైన్స్, ఐడెంటిటీ మార్క్స్ ఉంటాయి.
సమాంతరంగా, దీర్ఘచతురస్రాకారంలో ₹2000 ఉబ్బెత్తుగా నోటుపై రాసి ఉంటుంది.
నోటు కుడివైపున, ఎడుమవైపున కోణాకారంలో బ్లీడ్లైన్స్ ఉబ్బెత్తుగా ఉంటాయి.
రూ. రెండువేల నోటు వెనుకవైపున
ఎడుమవైపు ముద్రణ సంవత్సరం ముద్రించి ఉంటుంది
నినాదంతో కూడిన స్వచ్ఛభారత్ లోగో ఉంటుంది.
కుడివైపునకు చేరువగా భాషల ప్యానెల్ ఉంటుంది.
మంగల్యాన్ బొమ్మ ఉంటుంది.
దేవనాగరి అంకెలలో २००० అని రాసి ఉంటుంది.
రూ. రెండువేల నోటు 66 మిల్లిమీటర్ల వెడల్పు, 166 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది.
ఇక రూ. 500 నోటుపై ఏమి ఉంటాయంటే..
మహాత్మాగాంధీ సిరీస్లో విడుదల చేసిన కొత్త రూ. 500 నోట్లపై ‘E’ అనే ఇంగ్లిష్ అక్షరంతోపాటు ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకం, ముద్రణ సంవత్సరం ‘2016’, స్వచ్ఛ భారత్ లోగో, నోటు వెనుకవైపున ముద్రించి ఉంటాయి. గతంలో జారీచేసిన స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్ల (ఎస్బీఎన్) సిరీస్కు రంగులో, పరిణామంలో, డిజైన్లో, థీమ్లో, భద్రతపరమైన ఫీచర్స్ విషయంలో కొత్త 500 నోటు భిన్నంగా ఉంటుంది.
ఈ నోటు వెడల్పు 66మిల్లీమీటర్లు, పొడవు 150 మిల్లీమీటర్లు
రంగు స్టోన్ గ్రే (నెరిసిన ముదురు రంగు)
భారత వారసత్వ సందప అయిన జాతీయ పతాకంతో కూడిన ఎర్రకోట బొమ్మ నోటు వెనుకవైపు ముద్రించి ఉంటాయి.
అందులో కోసం మహాత్మాగాంధీ బొమ్మ, అశోక చిహ్నం, బ్లీడ్ లైన్స్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉబ్బెత్తుగా ముద్రించి ఉంటాయి.