sahista saba
-
వారికి.. ఉరి శిక్షే సరైనది
సబా తల్లిదండ్రుల ఆక్రందన కొండాపూర్ : ‘మా కూతురును అపహరించి.. చిత్రహింసలు పెట్టి హత్య చేసిన వారికి ఉరిశిక్షే సరైనది’.. అంటూ సబా తల్లిదండ్రులు బోరున విలపించారు. స్థానిక పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు, బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ మహమూద్, రేష్మ దంపతుల మూడో కూతురే.. షాహిస్త సబా. ఈమె అసలు పేరు నౌషిన్బేగం. గత ఏడాది జూలై 30న హైదరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలో జరిగే ఉర్సు ఉత్సవాలకు వెళ్లారు. 31న ఉద యం 6 గంటలకు గుల్బర్గాకు చేరుకున్నారు. ఉత్సవాలను చూసేందుకు వెళ్తుండగా చిన్నారి మార్గమధ్యలో అదృశ్యమైంది. రాత్రి వరకు ఎంత వెదికినా ప్రయోజనం లేకపోవడంతో ఆగస్టు 1న గుల్బర్గాలోని ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇరవై రోజుల పాటు స్థానిక దినపత్రికల్లో వార్తలు ప్రచురితమైనా ఫలితం లేక.. విషా దం నిండిన హృదయాలతో తిరిగి వచ్చారు. ఇటీవల పాప మృతి చెందిన విషయాన్ని పేపర్లో చూసిన తర్వాత కొండాపూర్ పీఎస్ను సంప్రదించారు. ఎస్ఐ ప్రవీణ్కుమార్ పాప తల్లిదండ్రులతో కలిసి గుల్బర్గాలోని ఠాణాకు వెళ్లి దర్యాప్తు చేయగా.. మృతి చెందిన పాప వీరి కూతురేనని తేలిందని సీఐ నాగరాజు చెప్పారు. -
సూదులతో వాతలు... ఒళ్లంతా గాయాలు
-
సబను కిడ్నాప్ చేసి ..
►సూదులతో వాతలు... ఒళ్లంతా గాయాలు ►ఐదు నెలలుగా తిండి,నిద్ర లేకుండా గడిపిన చిన్నారి ►మెదడు, పుర్రెకు తీవ్ర గాయమై చనిపోయినట్టు వైద్యుల నిర్ధారణ ►చిట్టితల్లిది హైదరాబాదే...అసలు పేరు నౌసిన్ బేగం ►‘సాక్షి’లో ఫొటో చూసి సంగారెడ్డికి వచ్చిన తల్లిదండ్రులు ►వివరాల సేకరణలో పోలీసులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఒక ఖాకీ క్రూరత్వం.. మరి కొంత మంది ఖాకీల నిర్లక్ష్యం చిట్టి తల్లిని చిదివేశాయి. జాతరలో ఆడుకుంటున్న చిన్నారిని దొంగతనంగా ఎత్తుకొచ్చిన రాక్షస దంపతులు అత్యంత క్రూరంగా, పాశవికంగా హత్య చేశారు. పాప తలను బలంగా గోడకేసి కొట్టడంతో పుర్రె అంతర్భాగం చితికిపోయి, మెదడుకు ఇన్ఫెక్షన్ సోకడంతో షాహస్తా సబ చనిపోయిందని వైద్య పరీక్షల్లో తేలింది. ఈ కేసులో వెలుగు చూస్తున్న వాస్తవాలను చూస్తే ఖాకీ దంపతులు చిన్నారిని ఐదు నెలులుగా పస్తులు పెట్టి, ఏడిస్తే కాల్చి వాతలు పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. పాప నరకం అనుభవించి చనిపోయిందని వైద్య బృందం నిర్ధారణ చేసింది. అమాయకమైన ముఖంతో, స్ట్రెచర్ మీద నిద్రపోయినట్టున్న చిన్నారిని పత్రికల్లో చూసిన ప్రతి హృదయం కన్నీళ్లు పెట్టింది. అదే ఫొటోతో ‘సాక్షి’ మెయిన్ పేజీలో ప్రచురితమైన వార్తను చూసి హైదరాబాద్కు చెందిన పాప తల్లిదండ్రులు మంగళవారం సంగారెడ్డికి వచ్చారు. పోలీసులకు పాప విషయం చెప్పి భోరున విలపించారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ప్రాంతంలోని హసన్ నగర్కు చెందిన మహ్మద్ మహబూబ్, రేష్మాబేగం దంపతులు మూడో కూతురు షాహిస్త సబ, అసలు పేరు నౌసిన్ బేగం(5) గత ఏడాది జూలై మాసంలో రంజాన్ పండగ సందర్భంగా తన కుటుంబంతో కలిసి కర్ణాటక రాష్ట్రం గుల్భర్గలోని కేబీఎన్ దర్గాలో జరిగే ఉర్సుకు వెళ్లారు. అదే సమయంలో హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ జాకీర్ హుస్సేన్ కూడా భార్య, ఆరు మంది సంతానంతో కలిసి అదే దర్గాకు వెళ్లారు. ఈమేరకు జూలై 29 నుంచి ఆగస్టు 1 వరకు జాకీర్ హుస్సేన్ సెలవు తీసుకున్నట్లు బొల్లారం పోలీసు స్టేషన్ రికార్డుల్లో నమోదై ఉంది. జూలై 31న ఇంటికి తిరగి వచ్చేందుకు సిద్ధమైన హెడ్కానిస్టేబుల్ కుటుంబానికి దర్గా జాతరలో ఒంటరిగా ఆడుకుంటున్న నౌసిన్బేగం కంటపడింది. అప్పటికే గంపెడు మంది సంతానానికి చాకిరి చేయలేక ఇబ్బంది పడుతున్న కానిస్టేబుల్ భార్య రజియా సుల్తానా పని మనిషి కోసం వెతుకుతోంది. అదే అదునుగా వారిద్దరూ కలిసి చిన్నారిని కిడ్నాప్చేసి కొండాపూర్ మండలం మల్కాపూర్లోని తమ ఇంటికి తెచ్చుకున్నారు. మరోవైపు కనిపించకుండా పోయిన తన కూతురు కోసం మహ్మద్ మహబూబ్, రేష్మాబేగం దర్గా పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎవరో ఒక మహిళ ఎత్తుకొని పోయిందని స్థానికులు చెప్పడంతో అదే రోజు అంటే జూలై 31న చిన్నారి తల్లిదండ్రులు గుల్భర్గాలోని మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు మరుసటి రోజు అంటే ఆగస్టు 1న కిడ్నాప్ కేసుగా నమోదు చేశారు. కర్ణాటక పోలీసులు కేవలం కేసు నమోదుతోనే వదిలేశారు. ఆ తర్వాత పాప ఆచూకీ తెలుసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. కేసు దర్యాఫ్తు చేసి ఉంటే పాప ఆచూకీ బయట పడేది. మరో వైపు ఆగస్టు 2వ తేదీన జిన్నారం పోలీసు స్టేషన్లో విధులకు హాజరైన సయ్యద్ జాకీర్ హుస్సేన్ తర్వాత కాలంలో పని కోసం ఒక చిన్న పాపను తెచ్చుకున్నామని తన సహచర పోలీసు మిత్రులకు చెప్పినట్లు బొల్లారం పోలీసులు చెప్తున్నారు. తన భార్య గయ్యాళిదని హెడ్కానిస్టేబుల్ పలుమార్లు స్టేషన్ లో చెప్పినట్లు, ఈ విషయం ఎస్ఐతో సహా అందరికి తెలుసని ఇక్కడి పోలీసులు చెప్తున్నారు. ఏదేళ్ల చిన్న పాపను పనికోసం తెచ్చి పెట్టుకోవడం నేరమని ఏ ఒక్క పోలీసు చెప్పినా చిన్నారి బతికి ఉండేది. స్టేషన్ హౌస్ అధికారికి తెలిసినా ఆయన కూడా హెడ్కానిస్టేబుల్తో ఉన్న సాన్నిహిత్యంతో చెప్పలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. ఇక పాప చిత్ర వధకు గురవుతున్న విషయం చైల్డ్లైన్ డెరైక్టర్కు స్థానికులు చేరవేశారు. అయితే ఆయన కూడా వెంటనే స్పందించలేదనే విమర్శలు వస్తున్నాయి. మీడియాను వెంట తీసుకొనిపోయి ఫొటోలకు ఫోజులు ఇస్తూ హడావుడి చేయాలనే ఆలోచనతో జాప్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. చైల్డ్లైన్ డెరైక్టర్ గత నెల 27న ఒక టీవీ ఛానల్ రిపోర్టర్కు ఫోన్ చేసి సంయుక్త ఆపరేషన్ చేద్దామని అడిగినట్లు సమాచారం. అదే రోజు రాత్రి బాగా పొద్దుపోయాక ఆయన జిల్లా పోలీసులకు కూడా సమాచారం చేరవేసినట్లు తొలుత చైల్డ్లైన్ డెరైక్టరే మీడియాకు చెప్పారు. అయితే అప్పటికే బాగా రాత్రి కావడం, చైల్డ్లైన్ డెరైక్టర్ ఇచ్చిన సమాచారంలో క్లారిటీ లేకపోవడం, ప్రమాద తీవ్రత వివరించలేకపోవడం, పైగా దాడి చేయాల్సింది సొంత ఖాకీ ఇంటిమీద కావడంతో పోలీసులు వెంటనే స్పందించలేదని తెలుస్తోంది. అనంతరం జిల్లా ఎస్పీ సుమతి ఓ తల్లిగా స్పందించడంతో పోలీసు దాడులు మొదలయ్యాయి. డీఎస్పీ తిరుపతన్న మెరుపు దాడి చేశారు కానీ. అప్పటికే చిట్టితల్లి కర్కశుల చేతిలో గాయపడి కొన ఊపిరితో చివరి ఘడియల్లో ఉంది. వెంటనే 108లో ఆసుపత్రికి తరలించినా ఫలించినా ఫలితం లేకపోయింది. సాక్షి కథనంలో బయటికి వచ్చిన విషాదం.. నౌసిన్బేగం మృతి చెందిన వార్తను సాక్షి మెయిన్ పేజీలో ప్రచురించింది. వార్తను చూసిన స్థానికులు విషయం చిన్నారి తల్లిదండ్రులకు మహ్మద్ మహబూబ్, రేష్మాబేగం దంపతులకు చెప్పారు. మంగళవారం వారు సంగారెడ్డికి చేరుకొని డీఎస్పీ తిరపతన్నను కలిశారు. తమ కూతురును గుల్బర్గా దర్గా వద్ద ఎవరో కిడ్నాప్ చేసినట్లు, అక్కడి పోలీస్ స్టేషన్లో కేసుపెట్టినుట్లు చెప్పడంతో, దర్యాప్తు కోసం వారిని కొండాపూర్ పోలీసుతో గుల్బర్గా పంపించారు. -
అయ్యో.. అయ్యయ్యో..!
సకాలంలో స్పందించి ఉంటే సబా బతికేదే ఖాకీల నిర్లక్ష్యానికి పరాకాష్ట విషయం తెలిసీ చర్యలకు వెనుకంజ అంతా అయ్యాక హెడ్కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు ‘ఐదేళ్ల బాలికపై వేడినూనె పోశారు.. వళ్లంతా వాతలు పెట్టారు. ఆ చిన్నారి చావుబతుకుల్లో ఉంది కాపాడండి బాబూ’ అని ఎవరైనా చెబితే.. మానవత్వమున్న మనిషన్న వాడు అధికారం లేకపోయినా ఆ పాపను కాపాడేందుకు తెగిస్తాడు. కానీ అన్ని అధికారాలున్న మన పోలీసులు సొంత ఖాకీపై కరుణ చూపారు. ఆ చిన్నారి దుస్థితి తెలిసీ తేలిగ్గా తీసుకున్నారు. ఈ కారణంతోనే షాహిస్తా సబ పసిప్రాయంలోనే వసివాడిపోయింది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదన్న బాధ ఇపుడు ప్రతి హృదయాన్ని తొలుస్తోంది. సంగారెడ్డి క్రైం : వేడి నూనె పడి వ ళ్లంతా కాలిపోయింది. వాతలతో దేహం చిల్లులుపడింది. అన్నం తిని ఎన్నిరోజులైందో... కనీసం అరిచే శక్తికూడా లేదు. అందుకే ఓ మూలన సొమ్మసిల్లిపడిపోయింది. అలా పడిపోయి కూడా ఎన్నిరోజులైందో తెలియదు. అందరూ స్పందించి ఆస్పత్రికి తీసుకెళ్లేలోవు ఆ చిన్నారి ఆయువు తీరిపోయింది. కొండాపూర్ మండలం మల్కాపూర్లోని గాంధీనగర్లో హెడ్కానిస్టేబుల్ సయ్యద్ జాకీర్ హుస్సేన్ అహ్మద్, రజియా సుల్తానా దంపతుల చేతిలో చిత్రహింసలకు గురై గురువారం మృతి చెందిన షాహిస్తా సబ(5) దుస్థితి ఇది. చిన్నారి పరిస్థితి గురించి తెలుసుకున్న స్థానికులు ఈనెల 27వ తేదీన చైల్డ్లైన్ నిర్వాహకులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించాల్సిన ఖాకీలు నిందితుడు హెడ్కానిస్టేబుల్ కావడంతో అతనిపై కరుణ చూపారు. కనీసం బాలిక ఎలా ఉందో కూడా ఆరా తీయలేదు. బాలిక పరిస్థితి పూర్తిగా విషమించాక గురువారం రాత్రి బాలిక ఆచూకీ కనుగొన్నారు. వైద్యం కోసం 108లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ బాలిక ఊపిరి అప్పటికే ఆగిపోయింది. అంతా అయ్యాక స్పందించిన పోలీస్ బాస్ షాహిస్తా సబ మృతి ఘటనపై పోలీసు బాస్ స్పందించారు. బాలిక మృతికి కారణమైన దంపతులను గురువారమే అదుపులోకి తీసుకున్నారు. హెడ్కానిస్టేబుల్ అహ్మద్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. వీరిపై కిడ్నాప్, హత్య, జస్టిస్ జువెనైల్, బాల కార్మిక చట్టాల కింద కేసులు నమోదు చేశారు. బాలిక శరీరమంతా గాయాలతో ఉండటం తీవ్రంగా కలిచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులమని చెప్పుకుంటున్న హెడ్కానిస్టేబుల్ దంపతులకు డీఎన్ఎ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. బాలిక పట్ల అత్యంత కిరాతకంగా, వ్యవహరించిన దంపతులు శిక్ష నుంచి తప్పించుకోకుండా కఠిన కేసులు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. కేసును పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. అయితే జిల్లా పోలీసు బాస్గా మహిళ ఉన్నప్పటికీ ఓ బాలిక ప్రాణం మాత్రం కాపాడలేకపోయారనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. గాంధీ ఆస్పత్రికి బాలిక మృతదేహం పోలీసులు బాలిక సబ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సంగారెడ్డిలో ఆధునిక పరికరాలు లేనికారణంగా మృతదేహాన్ని గాంధీకి తరలించినట్లు ఎస్పీ సుమతి తెలిపారు. అమ్మతానికే మచ్చ ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చిన హెడ్కానిస్టేబుల్ భార్య రజియా...తన కూతురు వయసున్న సబ పట్ల కఠినంగా వ్యవహరించేదని తెలుస్తోంది. చిన్న తప్పుకే వాతలు పెట్టేదని స్థానికులు చెబుతున్నారు. ఈ దురాగతం తెలిసినా హుస్సేన్ అహ్మద్ పోలీసుశాఖలో పనిచేస్తుండడంతో ఎవరూ నోరుమెదపలేకపోయినట్లు తెలుస్తోంది. దీన్ని అలుసుగా తీసుకున్న ఆ ‘అమ్మ’ చిన్నారిపై శాడిజం చూపుతూ ఆనందపడుతుంటే.. తన బాధచెప్పుకునే అవకాశమే లేక ఆ పసిమొగ్గ వసివాడిపోయింది. వైద్య సాయంకూడా సకాలంలో అందక ఈ దుర్మార్గలోకం నుంచి వెళ్లిపోయింది. పేరులో వెలుగు.. అంతా చీకటి సబ...అంటే శోభిల్లడం, ప్రకాశవంతం అని అర్థం. కానీ ఖాకీ దంపతుల కర్కశానికి బలైన చిన్నారి షాహిస్తా సబ జీవితం మాత్రం మొగ్గదశలోనే చీకటిలో విసిరి వేయబడింది. బలవంతంగా చిదిమేయబడింది. లోకంపోకడ తెలియని వయస్సులోనే నరకం చూసింది. తల్లిదండ్రులెవరో తెలియదు... నా అన్న వాళ్లు లేరు. ఎక్కడో దర్గాలో ఉన్న సబను సొంత బిడ్డలా పెంచుకుంటామని ఇంటికి తెచ్చుకున్న ఖాకీ దంపతులు చిన్నచిన్న పనులు చేయలేదన్న కారణంతో వేడినూనె పోయడం, వాతలు పెట్టడం లాంటి దుర్మార్గమైన చర్యలకు పూనుకోవడంతో ఆ పాప అల్లాడిపోయింది. వారి దాష్టికాన్ని తాళలేక అనంతలోకాలకు తరలిపోయింది.