ఢిల్లీస్థాయిలో సమైక్యత చాటుతాం
ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు
శాంతియుతంగానే ధర్నా
విభజనవాదులవి మూర్ఖత్వపు వ్యాఖ్యలు
బిల్లు అడ్డుకోకపోతే ప్రతిపక్షాలది ప్రేక్షకపాత్రే
సాక్షి, న్యూఢిల్లీ: ‘సేవ్ డెమోక్రసీ-సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరిట ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్న ధర్నాతో సమైక్య ఉద్యమాన్ని ఢిల్లీస్థాయిలో చాటి చెబుతామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు, సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ైచె ర్మన్ అశోక్ బాబు అన్నారు. తాము ఢి ల్లీలో దాడులకు పాల్పడే అవకాశం ఉందంటూ కొందరు విభజనవాదులు మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆందోళన కార్యక్రమాలు శాంతియుతంగా, చట్టాలకు లోబడి చేస్తామని కేంద్రానికి హామీ ఇచ్చారు. లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పెట్టిన తీరు అత్యంత దుర్మార్గ పూరితంగా ఉందన్నారు. పార్లమెంట్లో ఏం జరుగుతుందో తెలియజెప్పేందుకు అన్ని జాతీయ పార్టీలకు ఓ వేదిక కావాలని, ఆ వేదికను తమ ధర్నాతో కల్పిస్తున్నామన్నారు. ధర్నా ఏర్పాట్లను ఆదివారం మధ్యాహ్నం ఆయన పర్యవేక్షించారు. అనంతరం చలసాని శ్రీనివాస్, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకుడు కిశోర్ బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...
ఇన్నాళ్లుగా ఉద్యమిస్తున్నా జాతీయ స్థాయిలో అంతగా స్పందన రాలేదు. ఢిల్లీ స్థాయిలో తెలుగువారి ఐక్యత చాటిచెప్పేందుకు రెండురోజులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ధర్నాకు సీమాంధ్ర 13 జిల్లాల నుంచి ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వర్గాలకు చెందిన వారు దాదాపు 8 నుంచి 10వేల మంది హాజరవుతున్నారు.
సమైక్యానికి మద్దతు ఇస్తున్న అన్ని జాతీయ పార్టీలను ఆహ్వానించాం. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతోపాటు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించాం.
జాతీయ పార్టీలు రాష్ట్ర విభజన సమస్యను కేవలం ఆంధ్రప్రదేశ్ సమస్యగా కాకుండా జాతీయ సమస్యగా భావించాలి.
ఆర్టికల్ 3ని ఉపయోగించి అడ్డగోలుగా రాష్ట్రాలను విడగొడుతూ పోతే భవిష్యత్తులో విభజన సమస్య అన్ని రాష్ట్రాలకు వస్తుంది. ప్రజాస్వామ్య విలువలు పక్కనపెట్టి సీబీఐ తరహాలో ఆర్టికల్ 3ని కేంద్రం దుర్వినియోగం చేస్తోంది.
ఎవరెన్ని చెప్పినా మూజువాణి ఓటుతోనైనా రాష్ట్రాన్ని విడదీస్తామని ముందుకెళ్తున్న కేంద్రాన్ని బీజేపీ అడ్డుకోకపోతే ప్రతిపక్షాలు ఇకపై ప్రేక్షకపాత్రకే పరిమితం కావాల్సి ఉంటుంది.
కొందరు మంత్రులు సోనియా చీరలు ఉతుకుతున్నారు: కిశోర్బాబు
ఈ ధర్నా రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని తెలుగుజాతి కోసం అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేస్తున్న ఆందోళన అని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకుడు కిశోర్బాబు అన్నారు. కొందరు సీమాంధ్ర కేంద్ర మంత్రులు సోనియా చీరలు ఉతకడం, మన్మోహన్సింగ్ బూట్లు పాలిష్ చేసేవిధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన ఆపకపోతే సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని హెచ్చరించారు. సభ నుంచి సస్పెండైన సీమాంధ్ర ఎంపీలను తిరిగి సభలోకి వచ్చేలా కేంద్ర మంత్రులు చర్యలు తీసుకోవాలన్నారు. సమైక్యవాదులతో ఢిల్లీకి వస్తున్న రైళ్లలో కనీస సదుపాయాలు కల్పించకుండా వారిని ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని చలసాని శ్రీనివాస్ ఆరోపించారు.
రాంలీలాలో భారీ ఏర్పాట్లు
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తం ఆరు రైళ్లలో వివిధ జిల్లాల నుంచి బయలుదేరిన ఏపీఎన్జీవోలు, విద్యార్థులు, అన్ని జేఏసీల సభ్యులు సోమవారం ఉదయానికి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి చేరుకుంటారు. ధర్నాకి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం, రాత్రి భోజనాలతోపాటు మంచినీటి బాటిళ్లు సరఫరా చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. దాదాపు 6 వేల మంది రాంలీలా మైదానంలోనే రాత్రి పడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరంద రికీ సరిపడా పరుపులు వేయించారు. ఢిల్లీలో చలితీవ్రత అధికంగా ఉన్నందున శిబిరం అంతా హీటర్లను అమర్చుతున్నారు. కాలకృత్యాలు, స్నానాల కోసం 30- 40 మొబైల్ టాయిలెట్లను అందుబాటులో పెడుతున్నారు.