శశిథరూర్ అరెస్ట్, విడుదల
తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరువనంతపురం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి శుక్రవారం స్థానిక రిజర్వ్ బ్యాంకు కార్యాలయం ముందు ధర్నా చేశారు.
తాము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత విడుదల చేశారని శశి థరూర్ మీడియాతో చెప్పారు. సరైన ప్రణాళిక లేకుండా, తగిన చర్యలు తీసుకోకుండా పెద్ద నోట్లను రద్దు చేశారని, దీని అమలుతీరు చాలా దారుణమని విమర్శించారు. అనాలోచిత నిర్ణయం వల్ల దేశ ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని అన్నారు. ప్రజలకు సరిపడా కరెన్సీని అందుబాటులో ఉంచకుండానే పెద్ద నోట్లను రద్దు చేశారని తప్పుపట్టారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు చేపడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది.