Southeast Bay of Bengal
-
తీవ్రం కానున్న ‘వార్దా’ తుపాను
-
తీవ్రం కానున్న ‘వార్దా’ తుపాను
విశాఖపట్నం: ‘వార్దా’ తుపాను గంట గంటకూ బలపడుతూ కోస్తాంధ్ర వైపు కదులుతోంది. తక్కువ వేగంతో పయనిస్తూ ఎక్కువ ప్రభావం చూపబోతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుపాను ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. శుక్రవారం రాత్రి విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 950, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1,050 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం ఉదయానికల్లా తీవ్ర తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ నెల 11 వరకు తీవ్ర తుపానుగానే కొనసాగుతుందని, అనంతరం కాస్త బలహీన పడుతూ కోస్తాంధ్ర తీరం వైపు వస్తుం దని తెలిపింది. 12న మధ్యాహ్నానికి లేదా సాయం త్రానికి ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం – నెల్లూరు మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో కోస్తాంధ్రలో గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమై న పెను గాలులు వీయవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. -
మరో తుపాను ముప్పు?
-
మరో తుపాను ముప్పు?
♦ బంగాళాఖాతంలో అల్పపీడనం ♦ బలపడి రేపటికల్లా వాయుగుండం ♦ 7, 8 తేదీల్లో తుపానుగా మారే అవకాశం సాక్షి, విశాఖపట్నం/ హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి రానున్న 48 గంటల్లో (గురువారం నాటికి) వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి మరో నాలుగైదు రోజుల్లో తుపాను గానూ మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అల్పపీడనం తుపానుగా ఉధృతమైతే దక్షిణ కోస్తాంధ్రపై ప్రభావం చూపవచ్చని అంటున్నారు. సాధారణంగా ఈ సీజన్లో.. అల్పపీడనాలు తుపాన్లుగా మారేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని, ఈ కారణంగానే కోస్తాలో అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎక్కువగా తుపాన్లు వస్తాయని చెబుతున్నారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాల సీజన్లో ఏర్పడే తుపాన్లు దక్షిణ కోస్తాంధ్రలోనే అధికంగా తీరాన్ని దాటతాయి. ఈ నేపథ్యంలో ఇది కూడా ఆ ప్రాంతంలోనే తీరం దాటే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈశాన్య రుతుపవనాలు ప్రస్తుతం ఓ మోస్తరుగా ఉన్నాయి. ఈ పరిణామాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు గానీ, అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం గానీ కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. తాజా అల్పపీడనం తుపానుగా మారేదీ లేనిదీ రెండు రోజుల్లో తేలుతుందని, మరోవైపు అండమాన్ సముద్రంలో అల్పపీడన ద్రోణి సూచనలు కనిపిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ఎం.నరసింహారావు ‘సాక్షి’కి తెలిపారు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం ఆకాశం మేఘావృతమై ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో చలితీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
నైరుతికి మరో నాలుగు రోజులు!
* కేరళను తాకే అవకాశం.. ఆ తర్వాత వారంలో రాష్ట్రానికి! * తెలంగాణకు వడగాడ్పుల సూచన సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కన్యాకుమారి దక్షిణ ప్రాంతం వరకు వచ్చిన నైరుతి రుతుపవనాలు మరో నాలుగు రోజుల్లో కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్ని తాకే అవకాశాలున్నట్టు వాతావరణ నిపు ణులు సోమవారం తెలిపారు. ఆ తర్వాత వారం రోజుల్లో నైరుతి రాష్ట్రాన్ని తాకవచ్చన్నారు. వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వివరించారు. ఇలా ఉండగా విదర్భ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వారు తెలిపారు. దీని ప్రభావంతో మరో రెండురోజుల పాటు రాష్ట్రంలోని కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలు పడవచ్చని చెప్పారు. తాజాగా కురిసిన వర్షాలకు కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దక్షిణ కోస్తాలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం రెండు మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలోని గుంటూరు, రాయలసీమలోని చిత్తూరుతో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నట్టు భారత వాతావరణ కేంద్రం తన నివేదికలో వెల్లడించింది. సోమవారం రెంటచింతలలో గరిష్టంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు పేర్కొంది. -
రేపు తీరం దాటనున్న ‘లెహర్’!
-
రేపు తీరం దాటనున్న ‘లెహర్’!
ఉత్తర కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం వచ్చే 48 గంటల్లో గంటకు 150-200 కి.మీ.ల వేగంతో పెనుగాలులు ప్రస్తుతం కాకినాడకు 800 కి.మీ దూరంలో తుపాను సాక్షి, విశాఖపట్నం:లెహర్ తుపాను మంగళవారం రాత్రి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా 800కి.మీ దూరంలో నిలకడగా ఉంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అది ప్రస్తుతం తీవ్ర తుపానుగానే ఉందని, పెనుతుపానుగా నిర్ధారించేది, లేనిది బుధవారం నాటి వాతావరణ పరిస్థితుల్ని బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. లెహర్ తుపాను గురువారం సాయంత్రం మచిలీపట్నం, కళింగపట్నం తీరాల మీదుగా కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందన్నారు. బుధవారం గంటకు 160నుంచి 200కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, గురువారం గంటకు 170నుంచి 200కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు 2, 3 మీటర్ల ఎత్తు వరకు ఎగసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, వెళ్లినవారు వెంటనే తిరిగి రావాలని సూచించారు. రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడొచ్చని, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని, యానాంలోనూ భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. తుపాను బలపడుతున్న కొద్దీ గుడిసెలు కూలిపోవడం, సమాచార వ్యవస్థ కుప్పకూలడం, రైల్వే ట్రాక్లు, రోడ్లు ధ్వంసం అయ్యే అవకాశాలున్నాయన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా ఉంటేనే మంచిదని సూచించారు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామన్నారు. మెల్లగా కదులుతూ..! లెహర్ తుపాను ప్రస్తుతానికి మెల్లగానే కదులుతోందని అధికారులు చెబుతున్నారు. సోమవారం గంటకు 15 కి.మీ ప్రయాణించి కొద్దిసేపు నిలకడగా ఉంటే మంగళవారం గంటకు 16కి.మీ చొప్పున ప్రయాణించి రాత్రి సమయానికి నిలకడగానే ఉంది. తుపాను మెల్లగా కదులుతుండడం, కొద్దిసేపు నిలకడగా ఉండిపోవడాన్ని బట్టి చూస్తుంటే దాని తీవ్రత అంచనాలకు అందుకోలేని విధంగా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దట్టంగా పొగమంచు: రాష్ర్టంలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కోస్తాంధ్రలో భీమడోలులో 3సెం.మీ, కుప్పం, వెంకటగిరికోట ప్రాంతాల్లో 2సెం.మీ చొప్పున వర్షం కురిసింది. తెలంగాణ సహా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఆదిలాబాద్లో కనిష్టంగా 17డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం సాయంత్రంలోపు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఓ మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పొగమంచు దట్టంగా కురుస్తుంది. ‘ముందస్తు చర్యలు తీసుకున్నాం’ సాక్షి, హైదరాబాద్ : లెహర్ తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో పటిష్టమైన ముందస్తు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ పార్థసారథి తెలిపారు. బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాసం కోసం ఆర్మీ సహకారం తీసుకుంటున్నామని వెల్లడించారు. వాతావరణ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. ముంపు ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రక్షణ దళానికి చెందిన 4 హెలికాప్టర్లను, 4 కాలమ్స్ (ఒక్కో కాలమ్లో 100 మంది) ఆర్మీని తీసుకున్నట్టు చెప్పారు. రైల్వేశాఖ అప్రమత్తం: లెహర్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముందస్తు చర్యలకు నడుం బిగించింది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో భేటీ అయి, తాము తీసుకునే చర్యల గురించి వివరించారు. అనంతరం రైల్నిలయంలో ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఎంతటి ఉపద్రవం ఎదురైనా ప్రయాణికుల ఇబ్బందులను వీలైనంత తగ్గించేలా చూడాలన్నారు. 28న రైలు ప్రయాణం కష్టమే! విశాఖపట్నం, న్యూస్లైన్: లెహర్ తుపాను నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే అధికారులు అప్రమత్తయ్యారు. రైల్వే ట్రాక్లతోపాటు విద్యుత్ ట్రాక్షన్పై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటున్నందున రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న రైల్వే ప్రయాణాలు సజావుగా సాగే అవకాశాలుండవని అభిప్రాయపడుతున్నారు. -
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం మన రాష్ట్రంపై ఎంత వరకు ఉంటుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇది బలపడేందుకు కనీసం రెండు మూడు రోజులు పడుతుందని చెప్పారు. రాష్ర్టంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అన్ని ప్రాంతాల్లోనూ పొడి వాతావరణమే నమోదైంది. ఆదిలాబాద్లో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం కూడా రాష్ర్టం లోని అన్ని ప్రాంతాల్లోనూ పొడి వాతావరణమే ఉండవచ్చని భారత వాతావరణశాఖ(ఐఎండీ) బులెటిన్లో పేర్కొంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, పొగమంచు కురుస్తుందని తెలిపింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 29, 18 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.