Special Authority
-
వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ
జిల్లాలో ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన సాక్షి, హన్మకొండ: వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటన బుధవారం సాయంత్రం ముగిసింది. పర్యటన సందర్భంగా జిల్లా, నగర అభివృద్ధికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. మంగళ, బుధవారాల్లో జిల్లా, నగర అభివృద్ధికి సంబంధించి మొత్తం 86 అంశాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. బుధవారం ఉదయం 11:20 గంటలకు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న సీఎం.. గుడుంబా నిర్మూలన కార్యక్రమంలో పాల్గొంటున్న మహిళలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా గుడుంబా తయారీ నుంచి తప్పుకున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు జిల్లాకు రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గుడుంబా నిర్మూలనకు కృషి చేసిన అధికారుల వివరాలను అందజేస్తే వారికి ప్రోత్సాహకాలు, పదోన్నతులు కల్పించే విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మధ్యాహ్నం నందనా గార్డెన్లో నగర అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో ఉన్న హంటర్ రోడ్డును ఆరు లేన్ల రహదారిగా విస్తరించాలని, ఇందుకు అవసరమయ్యే నిధులు బడ్జెట్లో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ అభివృద్ధి కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వరంగల్ కలెక్టరేట్, కార్పొరేషన్, కమిషనరేట్, ఎంజీఎంలతో పాటు పాత ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు. జర్నలిస్టు కాలనీ నిర్మిస్తా డబుల్ బెడ్రూం పథకానికి అదనంగా నిధులు వెచ్చించి వరంగల్లో జర్నలిస్టు కాలనీని నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. హైదరాబాద్ జర్నలిస్టులు అసూయ పడేలా తానే బాధ్యత వహించి ఈ కాలనీని కట్టిస్తానన్నారు. జెనెసిస్ అనే ఆర్కిటెక్చర్తో కాలనీని డిజైన్ చేయిస్తానని తెలిపారు. ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసి ఏడాదిలోగా ఇళ్లను ప్రారంభించేలా పనులు చేపడతామన్నారు. రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు, కెమెరామెన్లు, చిన్న పత్రికల రిపోర్టర్లు, వీడియో జర్నలిస్టులు.. ఇలా జర్నలిస్టుందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. మధ్యాహ్నం కొండా దంపతుల ఇంటికి భోజనానికి వెళ్లిన సీఎం.. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్కు పయనమయ్యారు. -
నాలుగేళ్లలో 'పాలమూరు'
ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇంజనీరింగ్, ఫైనాన్స్, పాలనా వ్యవహారాలన్నీ దాని పరిధిలోకే సీనియర్ ఐఏఎస్ నేతృత్వంలో విధులు.. శరవేగంగా పనులు జరిగేలా చర్యలు 'ప్రాణహిత'లో మిడ్మానేరు- నిజాంసాగర్ మధ్య లైడార్ సర్వే వేర్వేరు ఎత్తులో 'తుమ్మిడిహెట్టి' ముంపుపైనా అధ్యయనం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు, రాష్ట్ర రాజధానికి తాగునీరు అందించే ప్రతిష్టాత్మక ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకాన్ని నాలుగేళ్లలో పూర్తిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు మానస పుత్రిక అయిన ఈ ప్రాజెక్టు పనులను శరవేగంగా చేపట్టేందుకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసింది. ఇంజనీరింగ్ నైపుణ్యం నుంచి భూసేకరణ, ఫైనాన్స్, వివిధ ఏజెన్సీలను సమన్వయం చేయడం, పాలనా వ్యవహారాలు వంటి బాధ్యతలన్నీ ఈ అథారిటీకి అప్పగించనుంది.ఈ మేరకు అథారిటీ ఏర్పాటు చేస్తూ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో నిర్ణయించిన మేరకు నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలన్న లక్ష్యంతోనే ఈ అథారిటీ ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. వీలైనంత వేగంగా: రూ.35,200కోట్లతో చేపడుతున్న ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తిచేసేందుకు అథారిటీ ఏర్పాటు చేయాలని నెల రోజుల కింద కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అథారిటీకి సీనియర్ ఐఏఎస్ అధికారి చైర్మన్గా వ్యవహరిస్తారని అందులో తెలిపారు. ప్రాజెక్టు నిర్వహణ నైపుణ్యంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ ఏజెన్సీలతో సమన్వయం చేసుకునేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేయాలని జూన్ 11న జరిగిన శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారని ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రస్తుతం చాలా ప్రాజెక్టుల్లో భూసేకరణ, సహాయ పునరావాసం పెద్ద సమస్యగా మారి సమయానికి ప్రాజెక్టుల పూర్తికి అవరోధంగా మారిందని... అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ప్రాజెక్టు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రాజెక్టులో భాగంగా ఉండే ఇంజనీరింగ్, భూసేకరణ, ఫైనాన్స్, ప్రాజెక్టు మానిటరింగ్, కార్యాలయ పరిపాలనా విభాగాలన్నీ అథారిటీ కింద పనిచేస్తాయన్నారు. కొత్త భూసేకరణ చట్టం మేరకు పరస్పర అంగీకారంతో భూములను తీసుకోవడానికి లేక సేకరించడానికి అథారిటీకి అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ప్రాజెక్టుకు ఏవైనా అడ్డంకులు ఎదురైతే, వాటిని గుర్తించి, అధిగమించాల్సిన చర్యలను ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ చూస్తుందని... ఏయే పనులను ఎంత కాలంలో చేయాలో నిర్ధారిస్తుందని వెల్లడించారు. ఇక ఫైనాన్స్ యూనిట్ ఆర్థిక నిబంధనలకు లోబడి ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు విధానాలు రూపొందించుకోవచ్చని... అవసరాల మేరకు నిధులను నేరుగా ఖర్చు చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాణహిత లైడార్ సర్వేకు రూ. 2.85 కోట్లు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మిడ్మానేరు నుంచి నిజాంసాగర్ వరకు లైడార్, డీజీపీఎస్ సర్వే చేసేందుకు వ్యాప్కోస్కు బాధ్యతలు కట్టబెడుతూ ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది. సమగ్ర సర్వే నివేదిక కోసం రూ. 2.85 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. మిడ్మానేరు-తడ్కపల్లి-గంధమల-బస్వాపూర్-పాములపర్తి-నిజాంసాగర్ వరకు నీటి సరఫరా వ్యవస్థ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ఏర్పాటుతో పాటు తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మిస్తే జరిగే ముంపు ప్రాంతాన్ని సైతం అధ్యయనం చేయనున్నారు. తుమ్మిడిహెట్టి వద్ద గతంలో సర్వేలు జరిగినా లైడార్ సర్వే చేయలేదు. లైడార్ సర్వే చేస్తే.. మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా 148 మీటర్ల ఎత్తు నుంచి 149, 150, 151, 152 మీటర్ల వరకు ఎంతెంత ముంపు ఉంటుందన్నది కచ్చితంగా తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. -
రాజధాని కోసం ప్రత్యేక అథారిటీ
పురపాలక శాఖ మంత్రి డాక్టర్ నారాయణ వెల్లడి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో నూతన రాజధాని నిర్మాణానికి ప్రత్యేక అథారిటీని నియమిస్తున్నట్టు పురపాలకశాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ తెలిపారు. కలెక్టర్లు, మున్సిపాలిటీ అధికారులతో సంబంధం లేకుండా ఈ అథారిటీకి ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారిని నియమిస్తున్నట్టు చెప్పారు. గత మూడు రోజులుగా వివిధ రాజధాని నగరాలను పరిశీలించి వచ్చిన నేపథ్యంలో మంత్రి నారాయణ శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. తొలి దశలో నిర్మాణంలో భాగంగా సచివాలయం, అసెంబ్లీ, కొన్ని పరిపాలనా భవనాలు మూడేళ్లలో పూర్తిచేస్తామన్నారు. రాజధాని చుట్టూ (గుంటూరు-తెనాలి-గన్నవరం-ఇబ్రహీంపట్నం) 185 కిలోమీటర్లతో రింగ్రోడ్డు నిర్మించనున్నామని, ఈ రింగురోడ్డు పరిధిలో (ఇన్నర్ సర్కిల్లో) 6 లక్షల ఎకరాల్లో నగరం ఉంటుందని నారాయణ అన్నారు. చండీగఢ్, నయా రాయ్పూర్, గాంధీనగర్ నగరాలను పరిశీలించామని, అక్కడి స్థలాల సేకరణ, ల్యాండ్ పూలింగ్ పద్ధతులు పరిశీలించామని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఇక్కడ కూడా భూముల సేకరణ చేస్తామని మంత్రి అన్నారు. చండీగఢ్ బావుంది.. ప్రస్తుతం రాజధాని సలహా కమిటీ పరిశీలించి వచ్చిన అన్ని నగరాలకంటే చండీగఢ్ నగరం అద్భుతంగా ఉందని మంత్రి నారాయణ అన్నారు. ఇది రెండు రాష్ట్రాలకు రాజధాని అయినందున అభివృద్ధి వేగంగా జరిగిందన్నారు. గాంధీనగర్ నిర్మాణంలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించారని, నయా రాయ్పూర్ కూడా చక్కటి రహదారులతో పాటు గ్రీన్సిటీ రూపకల్పన అద్భుతంగా జరిగిందన్నారు. 22 తర్వాత సింగపూర్, పుత్రజయలలో పర్యటన ఈ నెల 22 తర్వాత సింగపూర్, పుత్రజయలలో పర్యటించనున్నామని, వచ్చేనెల 5 తర్వాత చైనాలో షాంఘై, ఉత్తర కొరియాలలో బృందం పర్యటిస్తామని మంత్రి తెలిపారు. ఈ నగరాల పర్యటన అనంతరం రాజధాని సలహా కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని, ఆ తర్వాత ముఖ్యమంత్రి పలువురితో చర్చించి నిర్ణయిస్తారన్నారు.