సబ్రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
మంగళగిరి (గుంటూరు) : గుంటూరు జిల్లా మంగళగిరి సబ్రిజస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు బుధవారం మధ్యాహ్నం దాడి చేశారు.ఏసీబీ డీఎస్పీ చంద్రవంశం దేవానంద్ శాం మీడియాతో మాట్లాడుతూ మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీగా అవినీతి జరుగుతోందని పలువురి ఫిర్యాదు మేరకు ఏసీబీ దాడి నిర్వహించామన్నారు.
ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ అన్నామణి, సీనియర్ అసిస్టెంట్ మస్తాన్వలితోపాటు ఐదుగురు సిబ్బంది, 12మంది ప్రైవేటు వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద నుంచి రూ.98,690 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కొనుగోలుదారులు, అమ్మకందారులతోపాటు డాక్యుమెంట్ రైటర్లను విచారిస్తున్నామని, విచారణ కొనసాగుతుందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.. దాడిలో ఏసీబీ సీఐ నరసింహారెడ్డి, సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.