Telangana Archaka JAC
-
ఆశీర్వదించే చేతులతో అర్థిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: ‘ఆశీర్వదించే చేతులతో అర్థిస్తున్నాం. మా ఆందోళనకు సహకరించండి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మాకు వేతనాల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. మేం దేవాలయాలు మూసివేయడం లేదు. కేవలం ఆర్జిత సేవలను మాత్రమే నిలిపివేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి’అంటూ భక్తులకు రాష్ట్రంలోని దేవాలయాల అర్చకులు, ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలను నిలిపివేశారు. దీంతో ఆలయాలకు వచ్చిన భక్తులకు తమ సమస్యను వివరించి వారికి సర్దిజెప్పేందుకు ప్రయత్నించారు. రాష్ట్రం మొత్తం మీద 646 దేవాలయాలు దేవాలయ శాఖ పరిధిలో ఉండగా, 610 దేవాలయాల వరకు ఆర్జిత సేవలు నిలిపివేశామని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ జె.జైపాల్రెడ్డి తెలిపారు. శుక్రవారం కావడంతో కొన్ని జిల్లాల్లోని దేవాలయాల్లో ఆర్జిత సేవలు కొనసాగించక తప్పలేదన్నారు. ఆర్జిత సేవల నిలిపివేత శనివారం కూడా కొనసాగుతుందని, తమ సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు భక్తులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. -
వేచిచూసే ధోరణిలో అర్చక జేఏసీ
సమ్మె యోచనపై ప్రస్తుతానికి వెనక్కు సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆలయాల్లోని అర్చకులు, ఉద్యోగుల వేతనాలు పెంచే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించనప్పటికీ కొంతకాలం వేచిచూసే ధోరణి అవలంబించాలని దేవాదాయశాఖ ఆలయ ఉద్యోగులు, అర్చకుల జేఏసీ నిర్ణయించింది. ఫిబ్రవరి ఐదో తేదీ నాటికి సానుకూల నిర్ణయం ప్రకటించని పక్షంలో ఏడో తేదీ నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ గతంలో హెచ్చరించినప్పటికీ... మరికొన్ని రోజులు వేచిచూడాలని ఆదివారం బర్కత్పురాలోని అర్చక భవన్లో జరిగిన సమావేశంలో తాజాగా నిర్ణయించారు. అర్చకులు, దేవాలయ ఉద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు సానుకూలంగానే ఉన్నప్పటికీ కొందరు ఆయనకు తప్పుడు సమాచారమిస్తూ పక్కదారిపట్టిస్తున్నారని జేఏసీ నేత గంగు భానుమూర్తి పేర్కొన్నారు. ఈనేపథ్యంలో నేరుగా ముఖ్యమంత్రినే కలసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే సమ్మెకు దిగాలని భావిస్తున్నట్లు నేతలు తెలిపారు.