సానియా జంటకు రెండో విజయం
సింగపూర్: సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టెన్నిస్ చాంపియన్షిప్లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన ‘రెడ్ గ్రూప్’ లీగ్ మ్యాచ్లో సానియా-హింగిస్ ద్వయం 6-3, 6-4తో ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించింది. 76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి సెట్లో ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసిన ఈ ఇండో-స్విస్ జోడీకి రెండో సెట్లో గట్టి పోటీ లభించింది.
రెండో సెట్లో ఒకదశలో సానియా-హింగిస్ 1-4తో వెనుకబడ్డారు. అయితే వెంటనే తేరుకొని వరుసగా ఐదు గేమ్లు గెలిచి సెట్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నారు. శుక్రవారం జరిగే తమ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్లో తిమియో బాబోస్ (హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)లతో సానియా-హింగిస్ తలపడతారు. వరుసగా రెండు విజయాలు సాధించిన సానియా జోడీకి సెమీఫైనల్ స్థానం దాదాపు ఖాయమైంది.