సామ సాత్విక జోరు
సింగిల్స్, డబుల్స్లో గెలుపు
ఆసియా ఓసియానియా టోర్నీ
సాక్షి, హైదరాబాద్: ఆసియా ఓసియానియా వరల్డ్ జూనియర్ అండర్-14 టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి సామ సాత్విక విశేషంగా రాణించింది. దీంతో భారత్ 3-0తో కిర్గిస్థాన్పై క్లీన్స్వీప్ చేసింది. న్యూఢిల్లీలోని డీఎల్టీఏ కాంప్లెక్స్లో జరుగుతున్న ఈ టీమ్ ఈవెంట్ చాంపియన్షిప్లో మంగళవారం జరిగిన సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో సామ సాత్విక విజయాలు నమోదు చేసింది.
తొలి సింగిల్స్లో ఆమె 4-6, 6-3, 7-6తో ఎలిజాపై గెలుపొందగా, రెండో సింగిల్స్లో ఇంజెల్ శివాని 6-1, 6-2తో ఎర్మెకాను కంగుతినిపించింది. డబుల్స్లో సాత్విక-ఆర్జా చక్రవర్తి జోడి 6-1, 6-2తో ఎలిజా-ఎర్మెకా జంటను ఓడించింది. బుధవారం జరిగే పోరులో భారత్... జపాన్తో తలపడుతుంది.