Uninterruptible power scheme
-
నిరంతర విద్యుత్ ఎప్పుడిస్తారు?
రాష్ట్రం తీరుపై కేంద్రం అసంతృప్తి అసలు అమలు చేసే వీలుందా? వెనుకడుగుకు కారణాలేమిటి? సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు కేంద్ర ఇందనశాఖ ఆదేశం వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నుంచి అదనంగా లక్ష మిలియన్ టన్నుల బొగ్గు ‘నిరంతర విద్యుత్’పై రాష్ట్ర అధికారులతో కేంద్ర అధికారుల సమీక్ష సాక్షి, హైదరాబాద్: ‘ఇంతకీ మీ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ పథకాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తున్నారు? అసలు అమలు చేసే వీలుందా? వెనకడుగు వేయడానికి కారణాలు ఏంటి? సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండానే ముందుకొస్తే ఎలా? దీనివల్ల కేంద్రం అబాసుపాలవ్వదా?’ అంటూ కేంద్ర విద్యుత్ అధికారులు రాష్ట్ర ఇంధన అధికారులపై అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. నిరంతర విద్యుత్ సరఫరా అంశంపై గురువారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ఇంధనశాఖ కార్యదర్శి అజయ్జైన్, కోల్ డెరైక్టర్ ప్రభాకర్రావు హాజరయ్యారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్.ఎన్.చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంప్రదాయేతేర ఇంధన వనరులు, పునరుత్పాదన బొగ్గు మంత్రిత్వశాఖ, ఆర్థిక, పెట్రోలియం శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ను అమలు చేయకపోవడం, దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడంపై కేంద్ర అధికారులు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. పథకం పేరుతో నిధులు కోరుతున్నారే తప్ప, ఇది కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే ప్రచారం చేయకపోవడం ఏమిటని ప్రశ్నించినట్టు చెప్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చించి.. స్పష్టమైన సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శిని కేంద్రం ఆదేశించినట్టు సమాచారం. కేంద్రం ఈ పథకాన్ని వెల్లడించిన అతి కొద్ది సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకంలోకి తమ రాష్ట్రాన్ని చేర్చాలని కోరారు. ఆయన ఒత్తిడి మేరకు సెప్టెంబర్లోనే ఆర్భాటంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు జరిగాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి పథకాన్ని అధికారికంగా వెల్లడిస్తామని సీఎం స్వయంగా చెప్పారు. తొలి విడతలో రెండు నగర పాలక సంస్థలు, 19 పురపాలక సంస్థలు, 39 మండలాల్లో పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించినా.. చివరకు అధికారంగా ప్రకటించలేదు. పథకం అమలవుతున్నట్లేనని అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్కు రూ. 1,350 కోట్లు రాష్ట్రంలో నిరంతర విద్యుత్ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రాయితీలను ప్రకటించింది. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి జాతీయ హరిత ఇంధన నిధి కింద రాష్ట్రంలోని గ్రీన్ ఎనర్జీ కారిడార్కు రూ. 1,350 కోట్లు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించింది. సోలార్ పంపుసెట్లను 4,000 నుంచి 8,000 కు పెంచింది. సమావేశ వివరాలను స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి చంద్రశేఖర్రెడ్డి మీడియాకు వివరిస్తూ.. రాష్ట్రంలో 20 ఏళ్ళ కిందట ఏర్పాటురేసిన ఎన్టీపీసీ, ఆర్టీపీపీలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని కేంద్రం దృష్టికి తెచ్చామన్నారు. బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు తగ్గిందనే విషయాన్నీ కేంద్ర ఇంధన శాఖ అధికారులకు తెలియజేశామని.. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నుంచి అదనంగా లక్ష మిలియన్ టన్నుల బొగ్గు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని వివరించారు. అజయ్జైన్కు అభినందనలు.. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టామని, సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన పనులను వేగవంతం చేశామని ఈ సమావేశంలో అజయ్జైన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. దీంతో పాటు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల సామర్థ్యం (పీఎల్ఎఫ్) పెంచడంలో విజయవంతమైనట్టు గణాంకాల ద్వారా సమావేశం ముందుంచారు. ఈ నేపధ్యంలో.. రాష్ట్రంలో ఇంధన పొదుపు, నష్టాల తగ్గింపుపై అజయ్జైన్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారంటూ ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి అభినందించినట్లు సమాచారం. -
నిరంత విద్యత్ పధకానికి ఏపీ కసరత్తు
-
నష్టాలు లేనిచోటే 24 గంటల విద్యుత్
* అందుకు అనుగుణంగా ప్రాంతాల ఎంపిక * మొత్తం 2 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు, 39 మండలాలు * అధిక నష్టాలున్న గిరిజన ప్రాంతాలు దూరం * అదనంగా 50 మెగావాట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ * ఒప్పంద ఖర్చులో 25 శాతం భరించాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరాలో నష్టాలు అతి తక్కువగా, వ్యవసాయ వాడకం పెద్దగాలేని ప్రాంతాల్లోనే నిరంతర విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఇందుకోసం తిరుపతి, విశాఖపట్నంతోపాటు మరికొన్ని మండలాలు, మున్సిపాలిటీలను జాబితాలో చేర్చింది. మొదట్లో పట్టణ ప్రాంతాల్లోనే అమలు చేయాలనుకున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే విమర్శలొస్తాయన్న ఆందోళన వ్యక్తమైంది. దీంతో పంపిణీ నష్టాలు రెండు శాతం మించని, సరఫరాకు తగ్గట్టుగా చెల్లింపు జరుగుతున్న మండలాలు, మున్సిపాలిటీలను కూడా చేర్చారు. 35 నుంచి 65 శాతం నష్టాలున్న గిరిజన, ఇతరప్రాంతాలను దూరంగా ఉంచారు. ఇలా మొత్తం రెండు కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీలు, 39 మండలాలను ఎంపిక చేశారు. ఈ మేరకు అక్టోబర్ రెండు నుంచి నిరంతర విద్యుత్ పథకానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ, ఎంపిక చేసిన ప్రాంతాల వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంధనశాఖ అధికారులు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. అలాగే నిరంతర విద్యుత్ పథకం కోసం అదనంగా మరో 50 మెగావాట్లు ఎవరికీ ఇవ్వని కోటా నుంచి కేటాయించాలని రాష్ట్ర సర్కారు కోరింది. ఇప్పటికే 200 మెగావాట్లు ఇస్తున్న కేంద్రం, తాజా ప్రతిపాదనకు సానుకూలత వ్యక్తం చేసింది. దీంతోపాటు ఒప్పందాల నేపథ్యంలో అయిన మొత్తం రూ. 15 కోట్ల ఖర్చులో, 25 శాతం (రూ. 3.75 కోట్లు) మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఒప్పందాలు కుదిరినప్పటికీ, అదనపు విద్యుత్, ఖర్చులపై స్పష్టమైన విధానాలు లేకపోవడంతో, కేంద్రాన్ని నొప్పించకుండా వ్యవహరించాలన్న రీతిలో రాష్ట్ర ఇంధన శాఖ ఆచితూచి అడుగులు వేస్తోంది. పవర్ కట్ తప్పనిసరి నిరంతర విద్యుత్ అమలు చేసినా, పెద్దగా డిమాండ్ పెరగదనే అధికారులు చెబుతున్నారు. అయితే అనూహ్యంగా ఉత్పత్తి తగ్గి, డిమాండ్ పెరిగే పక్షంలో అవసరమైన ముందస్తు చర్యలకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంవల్ల వాణిజ్య, వ్యాపార వర్గాలు సాధారణ స్థాయిలోనే విద్యుత్ను వినియోగిస్తున్నాయి. వాతావరణం మారినా, ఎండల తీవ్రత పెరిగినా డిమాండ్ పెరగవచ్చనే అంచనాలున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య సంస్థలకు, గ్రామాల్లో వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘అందరికీ విద్యుత్’ పథకం అమలు చేసే ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ కొనసాగిస్తూనే, ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల్లో విద్యుత్ కోత అమలు చేసే యోచనలో ఉన్నారు. ఈ దిశగానూ కసరత్తు చేసిన ఇంధన శాఖ, 50 శాతంకు మించి పంపిణీ నష్టాలున్న ప్రాంతాలను గుర్తించింది. వ్యవసాయ పంపుసెట్లకు ఐఎస్ఐ మార్కులేని మోటార్లు వాడే గ్రామాలు, ఎల్ఈడీ కాకుండా, సాధారణ బల్బులు వాడే ఏరియాల్లో ఈ నష్టాలు ఎక్కువగా ఉండే వీలుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు అమలు చేయడంవల్ల, ఎంపిక చేసిన ప్రాంతాలకు నిరంతర విద్యుత్ ఇవ్వొచ్చని లెక్కలు కట్టారు. రూ. 200కే ఎల్ఈడీ బల్బు నిరంతర విద్యుత్ పథకంలో భాగంగా విద్యుత్ పొదుపును కూడా ప్రభుత్వం ఎజెండాగా తీసుకుంది. మున్సిపాలిటీలు, నగరాలు, పంచాయతీల పరిధిలో పెద్ద ఎత్తున ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసేందుకు ఎనర్జీ ఎఫిషియన్సీ లిమిటెడ్తో ఒప్పందం కుదిరింది. ఇప్పటికే ప్రముఖ విద్యుత్ బల్బుల కంపెనీ ఫిలిప్స్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల ఎల్ఈడీ బల్బులను ఒక్కొక్కటీ రూ. 200కే అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మార్కెట్ రేటుతో పోలిస్తే ఇది అతి చౌకగా ఉండటంతో ప్రభుత్వం దీన్ని స్వాగతించే వీలుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, తండాల్లోనూ ఇదే కంపెనీ బల్బులను సరఫరా చేసే అవకాశం కన్పిస్తోంది. అయితే అందులో వాడే ఫిలమెంట్లు, ఇతర పదార్థాల నాణ్యత ఏమిటి అనే దానిపై అధికారులు స్పష్టత కోరుతున్నారు.