తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్, టీడీపీ
టపెదవాల్తేరు, న్యూస్లైన్: రాష్ట్ర విభజన నిర్ణయం ఎవరిది? ప్రత్యేక తెలంగాణ ప్రకటించినప్పుడు ఏం చేస్తున్నారు? రాష్ట్ర విభజనకు నిరసనగా ఒక్కరైనా రాజీనామా ఆమోదించుకోగలిగారా? కాంగ్రెస్ నిర్ణయాన్ని తిప్పికొట్టకుండా సమైక్యాంధ్ర ఉద్యమాలంటూ ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులను వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం సమైక్యాంధ్ర కోరుతూ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు రిలే నిరహారదీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని చీల్చిన సోనియాగాంధీ, కేంద్ర మంత్రుల ఇళ్ల ముందు నిరసనలు చేయాలని నగర కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. కేంద్రంలో కాంగ్రెస్పార్టీ రాష్ట్ర విభజన చేస్తే నగరంలో ఆ పార్టీ నాయకులు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారని శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబుది ఆత్మగౌరవ యాత్ర కాదు ఆత్మవంచన యాత్ర అని ధ్వజమెత్తారు.
ముందు మీరు మారండి మీ నాయకులను మార్చండి తర్వాత ఉద్యమాల్లోకి రావాలని ఆయా పార్టీల నాయకులకు హితవు పలికారు. రూరల్ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారన్నారు. కాంగ్రెస్, టీడీపీ మంత్రులు రాజీనామా డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ ప్రాపకం కోసం కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా ప్రజా గాయకుడు దేవిశ్రీప్రసాద్ ఆలపించిన సమైక్యాంధ్ర పాటలు అలరించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షలో అనుబంధ సంఘ కన్వీనర్లు పక్కి దివాకర్, కాళిదాసురెడ్డి, నాయకులు సత్తి రామకృష్ణరెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్తలు కోరాడ రాజబాబు, జి.వి.రవిరాజు, తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, అధికార ప్రతినిధి కంపా హనోకు, కన్వీనర్లు పసుపులేటి ఉషాకిరణ్, గుడ్ల పోలిరెడ్డి, భూపతిరాజు శ్రీనివాస్, రవిరెడ్డి, నౌషాద్, రాధ, ఏవీఎస్ నాయుడు, మాజీ కార్పొరేటర్లు కండిపిల్లి అప్పారావు, ఉరుకూటి అప్పారావు, చొప్పా నాగరాజు నాయకులు పాల్గొన్నారు.