మరో కార్గిల్ యుద్ధం రానివ్వం
ద్రాస్: కార్గిల్ లాంటి మరో యుద్ధాన్ని రానివ్వమని ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ శనివారం ప్రకటించారు. దేశంలో మరోసారి యుద్ధ వాతావరణం రాకుండా సైన్యం దేశానికి రక్షణగా ఉంటుందని ఆయన శనివారమిక్కడ స్పష్టం చేశారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 16 సంవత్సరాలైన నిర్వహిస్తున్న కార్యక్రమాలలో దల్బీర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైన్యం ఏర్పాటు చేసిన విజయ్ దివస్ ఉత్సవాలు జూలై 20న ప్రారంభమయిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ అమరులైన సైనిక వీరులకు నివాళులర్పించారు. కార్గిల్ విజయానికి గుర్తుగా కార్గిల్ వార్ మెమోరియల్ ను ప్రారంభించనున్నారు. ప్రధానంగా శని, ఆదివారాల్లో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించేందుకు సైన్యం ఏర్పాట్లు చేసింది. ఆదివారం సైనిక అమరవీరులకు ప్రత్యేక సంస్మరణ, నివాళి, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలు ఉంటాయి. కార్గిల్ అమర వీరుల కుటుంబాలను కలుస్తారు. అనంతరం వివిధ మత ప్రార్థనలు నిర్వహిస్తారు. సైన్యంలోని వీరనారిలతో ముఖాముఖి ఉంటుంది.
భారత్-పాకిస్థాన్ల మధ్య 1999 మే 8న కార్గిల్ యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. మనదేశంలోని లడఖ్, ఇతర సరిహద్దుల వద్ద ఉన్న వాస్తవాధీన రేఖను దాటి పాకిస్థాన్ సైన్యం మనదేశంలోకి ప్రవేశించింది. సుమారు మూడు నెలలపాటు సాగింది. చివరికి గంటలపాటు సుదీర్ఘ యుద్ధం అనంతరం భారత్ తిరిగి టైగర్హిల్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోగలిగింది.
కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన నాటి నుంచి జులై 26ను కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకోవడం ఆనవాయితీ. ఆనాటి నుంచి ప్రతీ సంవత్సరం జులైలో కార్గిల్, ద్రాస్, జమ్మూకాశ్మీర్ ప్రజలు యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన భారత సైనికాధికారులకు, సైనికులకు, జవాన్లకు ఘన నివాళులర్పిస్తున్నారు.