కృషి, పట్టుదలతో ఉన్నత జీవితం మీ సొంతం
‘సాక్షి యువమైత్రి’లో డాక్టర్ దుర్గ
తిరుపతి గాంధీరోడ్డు : నేటి పోటీ ప్రపంచంలో కృషి, పట్టుదల అలవరచుకుని చక్కటి నైపుణ్యాలతో లక్ష్యం వైపు పయనిస్తే ఉన్నత జీవితం సొంతమవుతుందని ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ దుర్గ అన్నారు. ‘సాక్షి’, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జ్యువలరీ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆధ్వర్యంలో గొల్లపల్లె సిద్ధార్థ విద్యాసంస్థలో బుధవారం ‘సాక్షి యువమైత్రి’ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన దుర్గ ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
ఆధునిక టెక్నాలజీ విస్తరిస్తున్న నేటి సమాజంలో రాణించాలంటే ప్రతి విద్యార్థికి విద్యతో పాటు నైపుణ్యం, కార్యదీక్ష అవసరమన్నారు. ప్రాథమిక విద్య పూర్తి కాగానే ఉన్నత విద్యారంభంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలన్నారు. ఆ దిశగా పయనం సాగించినప్పుడే తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు.
విద్యార్థులు అలవరచుకోవాల్సిన లక్ష్యాల గురించి ఆమె క్షుణ్ణంగా వివరించారు. సాక్షి యువమైత్రికి విశేష సంఖ్యలో విద్యార్థులు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.రాజశేఖర్, డెరైక్టర్ నరసింహారెడ్డి, సాక్షి యువమైత్రి నిర్వాహకుడు జే.ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.
సాక్షి యువమైత్రి హర్షణీయం
ఉన్నత విద్య అభ్యసించిన విద్యార్థులకు వారి లక్ష్యాల సాధనకోసం అవగాహన సదస్సులను సాక్షి యాజమాన్యం నిర్వహించడం హర్షణీయం. ఇదే రీతిలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి.
- రవీంద్రనాథ్, ఏవో, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల
లక్ష్య సాధనకు దోహదం
ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ లలో మంచి ఫలితాలు సాధిం చేందుకు సాక్షి యువమైత్రి దోహదం చేస్తుంది. ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహించాలి.
- ఆమని, ఇంజనీరింగ్ విద్యార్థిని
ఉజ్వల భవితకు సూచిక
సాక్షి అందిస్తున్న ఎడ్యుకేషన్ విద్యార్థుల ఉజ్వల భవితకు చక్కటి సూచిక. ప్రత్యేక ఎడ్యుకేషన్తో పాటు యువమైత్రి పేరిట నిర్వహిస్తున్న సదస్సు విద్యార్థులను జాగృత పరుస్తుంది.
- షర్మిల, విద్యార్థి
ఆత్మవిశ్వాసం నింపింది
ఉద్యోగ ప్రయత్నంలో ఇంటర్వ్యూలంటే నాలో భయాందోళనలు ఉండేవి. సాక్షి నిర్వహించిన యువమైత్రి నాలో భయాన్ని పోగొట్టి ఆత్మ విశ్వాసాన్ని నింపింది. ఎన్నో సందేహాలు నివృత్తి అయ్యాయి.
- దివ్య, ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థిని
మనోస్థైర్యాన్ని పెంచింది
ఉన్నత విద్యను పూర్తి చేసిన ప్రతి విద్యార్థిలో సాక్షి యువమైత్రి సదస్సు మనో స్థైర్యాన్ని పెంచింది. వక్తల మాటలు మాలో నమ్మకాన్ని పెంచి ఉజ్వల భవిత సాధనకు మార్గదర్శకాలు సూచించాయి.
- ఈశ్వర్ప్రసాద్, విద్యార్థి
బంగారు భవితకు పునాది
సాక్షి వారు నిర్వహించిన యువమైత్రి సదస్సు ప్రతి విద్యార్థి బం గారు భవితకు పునాది. వక్తలు అం దించిన సందేశాలు ఆత్మ బలాన్ని కలిగించాయి. ఇలాంటి సదస్సులు మరిన్ని చేపట్టాలి
- గోపి, ఇంజనీరింగ్ విద్యార్థి