Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Employees complain to Chief Vigilance Commissioner about employee transfers1
బేరం కుదిరితేనే బదిలీ

సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు లేకుండా ఉద్యోగులు ఎవరూ బదిలీల కోసం తమ వద్దకు రావద్దని ఉన్నతాధికారులు తేల్చి చెబుతున్నారు! ఎలాంటి రిక్వెస్టు అయినా ఎమ్మెల్యే లేఖ ద్వారానే చేస్తామని ఏలూరు జిల్లాలో కరాఖండిగా చెబుతుండటంతో ఉద్యోగులంతా అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్‌లో ఓ మండల స్థాయి అధికారి తన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి రీత్యా తనను బదిలీ చేయాలని పలు ఆధారాలు చూపించి అభ్యర్థించినా అధికారులు పక్కన పడేశారు. బదిలీకి అనుకూలంగా స్థానిక ఎమ్మెల్యే మరో ఉద్యోగికి లేఖ ఇవ్వడమే దీనికి కారణం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు తన అవసరాలు, ఇబ్బందులు, అర్హతలు వివరించి ఒక మండలంలో పోస్టింగ్‌ ఇవ్వాలని అభ్యర్థించగా సంబంధిత ఎమ్మెల్యే సిఫారసుతో రావాలని ఉన్నతాధికారులు సూచించారు. దీంతో ఆ ఉద్యోగి ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఆశ్రయించగా ఆ పోస్టును అప్పటికే ఇతరులకు బేరం పెట్టినట్లు తెలియడంతో హతాశుడయ్యాడు! పట్టు పరిశ్రమ శాఖలో ముడుపులు తీసుకుని బదిలీలు చేయడంపై కొందరు ఉద్యోగులు చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా పోస్టుల కోసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు చేతులు మారుతున్నట్లు వెల్లడించారు. ఏడీ పోస్టు కోసం కదిరిలో రూ.5 లక్షలు, చిత్తూరు జిల్లాలో రూ.8 లక్షలు, శ్రీసత్యసాయి జిల్లాలో రూ.10 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని కోరారు. ఆదాయ మార్గంగా.. పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరగాల్సిన ఉద్యోగుల బదిలీలను టీడీపీ కూటమి సర్కారు అక్రమాల పర్వంగా మార్చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులకు ఎలాంటి మేలు చేయకపోగా కనీసం బదిలీల విషయంలోనూ కరుణించడం లేదు. నిబంధనలు, మార్గదర్శకాలతో పని లేకుండా రాజకీయ జోక్యంతో బదిలీలు చేపడుతోంది. అన్ని స్థాయిల పోస్టుల్లో ఏ ఉద్యోగి ఉండాలనే విషయాన్ని ఆయా నియోజకవర్గాలకు చెందిన కూటమి పార్టీల ప్రజాప్రతినిధులే నిర్ణయిస్తున్నారు. వారి మాట కాదనేందుకు ఉన్నతాధికారులు సాహసించడం లేదు. మే 15వతేదీ నుంచి జూన్‌ 2వతేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేశారు. ఈ సమయంలో బదిలీలకు అవకాశం కల్పించి మార్గదర్శకాలు విడుదల చేసినా అవి ఎక్కడా అమలు కావడంలేదు. ఎమ్మెల్యేల సిఫారసుల ఆధారంగానే బదిలీలు జరుగుతుండడంతో ఉద్యోగులకు దిక్కు తోచడం లేదు. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వితంతు మహిళా ఉద్యోగులు, ఇతర సమస్యలు ఉన్నవారు తగిన ఆధారాలతో బదిలీల కోసం అభ్యర్థించే వీలున్నా టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయి. ఉద్యోగుల బదిలీలు వారికి ఆదాయం సమకూర్చే కార్యక్రమంగా మారిపోయింది! సిఫారసు లేఖల కోసం అగచాట్లు.. రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖ, విద్యుత్, పంచాయతీరాజ్‌ తదితర శాఖల్లో ఉద్యోగులు సిఫారసు లేఖల కోసం టీడీపీ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ముఖ్యమైన పోస్టుల్లో తమ పనులు చేసే వారిని, తమ మాట వినే వారిని నియమించేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మొగ్గు చూపుతున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు చెబితేనే ఆయా చోట్ల పోస్టింగ్‌లు ఇస్తామని కలెక్టర్లు, జేసీలు, ఇతర అధికారులు చెబుతున్నారు. బదిలీలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు, నిబంధనలున్నా వాటిని పక్కనపెట్టి ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు తెచ్చుకోవాలని స్పష్టం చేస్తున్నారు. సిఫారసులు లేకుండా వ్యక్తిగత అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేమని పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చిన తర్వాత వారితో మాట్లాడి ధ్రువీకరించుకున్నాకే పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నారు. వేలం పాటల తరహాలో.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సామాజిక వర్గం, డబ్బులు తదితర అంశాలు బేరీజు వేసుకున్నాకే సిఫారసు లేఖలు ఇస్తున్నారు. చాలాచోట్ల డిప్యూటీ తహశీల్దార్, సర్వేయర్, తహశీల్దార్‌ కార్యాలయాల్లో ముఖ్యమైన పోస్టుల కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తహశీల్దార్, ఎంపీడీఓ పోస్టుల కోసం రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలు సమర్పించుకోవాల్సిందే. ఎంపీడీవోలు, ఆస్పత్రుల్లో స్టాఫ్‌ నర్సులు లాంటి పోస్టుల కోసం కూడా వసూళ్లకు దిగుతున్నారు. అడిగినంత డబ్బులిచ్చిన వారికే సిఫారసు లేఖలు అందుతున్నాయి. కొందరికి సిఫారసు లేఖలు ఇచ్చిన తర్వాత తాము అంతకంటే ఎక్కువ ఇస్తామని ఇతరులు ముందుకు రావడంతో మొదట ఇచ్చిన లేఖను పట్టించుకోవద్దని ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తున్న ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మండల స్థాయి కూటమి నేతలు ఈ సిఫారసు లేఖలతో పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. డబ్బులు తీసుకుని ఎమ్మెల్యేల దగ్గరికి తీసుకెళ్లి సిఫారసు లేఖలు ఇప్పిస్తున్నారు. తిరుపతి అర్బన్‌ తహశీల్దార్‌ పోస్టు రూ.కోట్లు! అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్‌లో ఉన్న తిరుపతి జిల్లాకు చెందిన ఒక తహశీల్దార్‌కి అర్బన్‌లో పోస్టింగ్‌ ఇచ్చేందుకు రూ.కోట్లలోనే బేరం కుదిరినట్లు తెలిసింది. గతంలో ఆయన రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో పని చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తేలడంతో సస్పెండ్‌ చేశారు. ఇప్పుడు ఆయన్ను కీలకమైన తిరుపతి అర్బన్‌ తహశీల్దార్‌గా నియమించేందుకు రంగం సిద్ధమైంది. కూటమి పార్టీ ప్రజాప్రతినిధి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

Distribution of Rajiv Yuva Vikasam sanction letters on June 22
లక్ష మందికి.. రూ.లక్ష వరకు!

సాక్షి, హైదరాబాద్‌: రాజీవ్‌ యువ వికాసం..రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు వీలుగా వివిధ రకాల యూనిట్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జూన్‌ 2న లక్ష మంది అర్హులకు యూనిట్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. మొత్తం నాలుగు కేటగిరీలకు గాను తొలివిడతలో రెండు కేటగిరీలకు చెందిన లక్ష మంది లబ్ధిదారులకు, రూ.లక్ష లోపు యూనిట్లకు మంజూరు పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.మొత్తం 16.23 లక్షల దరఖాస్తులు రాజీవ్‌ యువ వికాసం పథకం కింద వివిధ సంక్షేమ కార్పొరేషన్ల వారీగా దరఖాస్తుల స్వీకరణ మార్చి 17న ప్రారంభమైంది. ఏప్రిల్‌ 14వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయ్యింది. మొత్తం 16,23,764 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను నాలుగు కేటగిరీల్లో స్వీకరించారు. రూ.50 వేల లోపు పరిమితి యూనిట్లను కేటగిరీ–1గా, రూ.50 వేల నుంచి రూ.1లక్ష లోపు వాటిని కేటగిరీ–2గా, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల పరిమితి ఉన్న యూనిట్లను కేటగిరీ–3గా, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య ఉన్న యూనిట్లను కేటగిరీ–4గా విభజించారు. ఈ క్రమంలోనే తొలుత కేటగిరీ–1, 2లోని అర్హులకు తొలి విడత కింద మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2 కేటగిరీలకు 1.32 లక్షల దరఖాస్తులే.. తొలి రెండు కేటగిరీలకు సంబంధించి 2.81 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. ఈ రెండు కేటగిరీల్లో కేవలం 1.32 లక్షల దరఖాస్తులే వచ్చాయి. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన మండల, మున్సిపల్‌ స్థాయి కమిటీలు...జాబితాలను జిల్లా కలెక్టర్లకు సమర్పించాయి. కలెక్టర్ల వద్దకు చేరిన ప్రతిపాదనలను పరిశీలించిన జిల్లా స్థాయి కమిటీలు లబ్ధిదారుల ఎంపికను పూర్తిచేశాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో ఆదివారం సాయంత్రానికి తుది జాబితాలు ఖరారు చేసి... లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించేలా కసరత్తు ముమ్మరం చేశారు.అయితే దరఖాస్తుదారుల ఆధార్, పాన్‌కార్డులు, బ్యాంకు ఖాతాల ఆధారంగా పరిశీలించి వడపోత అనంతరం తొలి విడత లక్ష మందికి అర్హత కల్పించారు. వీరికి ఈ నెల 2వ తేదీన మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు. రూ.50 వేల లోపు యూనిట్లకు పూర్తి సబ్సిడీ ఇస్తారు. రూ.లక్ష లోపు యూనిట్లకు 80 శాతం సబ్సిడీ ఇస్తారు. ఈ కేటగిరీ–2లోని దరఖాస్తుదారులు మంజూరు పత్రాలు తీసుకున్న తర్వాత బ్యాంకు నుంచి అంగీకార పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. వారం శిక్షణ..16 కల్లా యూనిట్ల ప్రారంభం లబ్ధిదారులకు జూన్‌ 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తారు. క్షేత్రస్థాయిలో జూన్‌ 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ పత్రాల పంపిణీ పూర్తయ్యాక జూన్‌ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులు యూనిట్లను ప్రారంభించాలి. జూన్‌ 16వ తేదీ నుంచి యూనిట్ల ప్రారంబోత్సవాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.అక్టోబర్‌ రెండో తేదీన గాంధీ జయంతి నాటికి యూనిట్ల గ్రౌండింగ్‌ పూర్తి చేయాలని కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటులో జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, జిల్లా కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేసింది. కాగా, తొలుత జూన్‌ 2న ఒకేసారి 5 లక్షల మందికి యూనిట్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. గరిష్టంగా రూ.4 లక్షల వరకు వ్యయమయ్యే యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం తొలి రెండు కేటగిరీలకే పరిమితమైంది. కేటగిరీ–3, 4లకు సంబంధించి ఇప్పటివరకు దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కాలేదు. వీరికి విడతల వారీగా మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు.

Mumbai Indians win in the Eliminator match 3
ముంబై ముందుకు... గుజరాత్‌ ఇంటికి

ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లు ఆడటంలో ఆరితేరిన ముంబై ఇండియన్స్‌... గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తు చేసి క్వాలిఫయర్‌–2కు చేరింది. బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ దూకుడుకు... బెయిర్‌స్టో, సూర్యకుమార్‌ మెరుపులు తోడవడంతో మొదట భారీ స్కోరు చేసిన ముంబై... ఆ తర్వాత బౌలింగ్‌లోనూ ఆకట్టుకొని ముందంజ వేసింది. టాప్‌–3 ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడిన గుజరాత్‌... కీలక ఎలిమినేటర్‌ పోరులో అది సాధ్యపడక పరాజయంతో లీగ్‌ నుంచి నిష్క్రమించింది. ముల్లాన్‌పూర్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్‌ జట్టు ఐపీఎల్‌ క్వాలిఫయర్‌–2కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ పోరులో ముంబై 20 పరుగుల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై విజయం సాధించింది. మొదట ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (50 బంతుల్లో 81; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) దుమ్మురేపగా... జానీ బెయిర్‌స్టో (22 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (20 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. గుజరాత్‌ బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ, సాయి కిషోర్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (49 బంతుల్లో 80; 10 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా... వాషింగ్టన్‌ సుందర్‌ (24 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్‌ 2... బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వని కుమార్‌ తలా ఒక వికెట్‌ తీశారు. ఆదివారం జరగనున్న క్వాలిఫయర్‌–2లో పంజాబ్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. దంచుడే దంచుడు... టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రోహిత్, బెయిర్‌స్టో మెరుపు ఆరంభాన్నిచ్చారు. రికెల్టన్‌ అందుబాటులో లేకపోవడంతో... ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన బెయిర్‌స్టో తన విలువ చాటుకున్నాడు. ప్రసిధ్‌ కృష్ణ వేసిన రెండో ఓవర్‌లో ఫోర్‌తో దూకుడు పెంచిన బెయిర్‌స్టో... ప్రసిధ్‌ కృష్ణ వేసిన నాలుగో ఓవర్‌లో పరుగుల పండగ చేసుకున్నాడు. వరసగా 6, 4, 6, 6, 4... 26 పరుగులు పిండుకున్నాడు. సిరాజ్‌ ఓవర్‌లో రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన రోహిత్‌ సాయి కిషోర్‌ బౌలింగ్‌లో 6, 4, 4తో గేర్‌ మార్చాడు. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను కోట్జీ వదిలేయగా... 12 పరుగుల వద్ద మెండిస్‌ మరో సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. దీన్ని పూర్తిగా వినియోగించుకున్న రోహిత్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసేసరికి ముంబై జట్టు 79/0తో నిలిచింది. స్పిన్నర్ల రాకతో స్కోరు వేగం మందగించగా... బెయిర్‌స్టోను అవుట్‌ చేసి సాయి కిషోర్‌ గుజరాత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. రషీద్‌ ఓవర్‌లో 4, 6 ద్వారా ఐపీఎల్లో 7 వేల పరుగులతో పాటు 300 సిక్స్‌లు పూర్తి చేసుకున్న రోహిత్‌... 28 బంతుల్లో హాఫ్‌సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లతో విరుచుకుపడిన సూర్యకుమార్‌ను సాయి కిషోర్‌ పెవిలియన్‌ పంపగా... ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన హైదరాబాద్‌ ఆటగాడు తిలక్‌ వర్మ (11 బంతుల్లో 25; 3 సిక్స్‌లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. స్లో బంతితో రోహిత్‌ను ప్రసిధ్‌ కృష్ణ బుట్టలో వేసుకోగా... చివరి ఓవర్‌లో మూడు సిక్స్‌లు కొట్టిన కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్‌; 3 సిక్స్‌లు) జట్టుకు భారీ స్కోరు అందించాడు. సుదర్శన్‌ పోరాడినా... భారీ లక్ష్యఛేదనలో గుజరాత్‌కు శుభారంభం లభించలేదు. కెప్టెన్ గిల్‌ (1) ఇన్నింగ్స్‌ నాలుగో బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో మరో ఓపెనర్‌ సుదర్శన్‌ బాధ్యతగా ముందుకు సాగాడు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన కుశాల్‌ మెండిస్‌ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కాస్త సహకరించగా... సుదర్శన్‌ క్లాస్‌ కవర్‌ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యం కళ్లముందు ఉన్నా... ఏమాత్రం వెరవని టైటాన్స్‌ పవర్‌ప్లే ముగిసేసరికి 66/1తో నిలిచింది. గ్లీసన్, హార్దిక్, బుమ్రా, సాంట్నర్‌ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన పసుదర్శన్‌ 28 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మెండిస్‌ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ కూడా ఆకట్టుకున్నాడు. ప్రమాదక బుమ్రా బంతులను కాచుకున్న ఈ జంట... మిగిలిన ఓవర్లలో ధాటిగా పరుగులు రాబట్టింది. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి టైటాన్స్‌ 148/2తో నిలిచింది. విజయానికి 42 బంతుల్లో 81 పరుగులు కావాల్సిన దశలో... బుమ్రా అద్భుత యార్కర్‌తో సుందర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో పరిస్థితి మారిపోయింది. సుదర్శన్‌ను గ్లీసన్‌ను అవుట్‌ చేయగా... రూథర్‌ఫోర్డ్‌ (24; 4 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. చివర్లో రాహుల్‌ తెవాటియా (16; 1 ఫోర్, 1 సిక్స్‌), షారుక్‌ ఖాన్‌ (13; 1 సిక్స్‌) మెరుపులు జట్టును గెలిపించలేకపోయాయి. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) రషీద్‌ (బి) ప్రసిధ్‌ కృష్ణ 81; బెయిర్‌స్టో (సి) కోట్జీ (బి) సాయి కిషోర్‌ 47; సూర్యకుమార్‌ (సి) సుందర్‌ (బి) సాయి కిషోర్‌ 33; తిలక్‌ (సి) మెండిస్‌ (బి) సిరాజ్‌ 25; హార్దిక్‌ (నాటౌట్‌) 22; నమన్‌ ధీర్‌ (సి) రషీద్‌ (బి) ప్రసిధ్‌ కృష్ణ 9, సాంట్నర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 228. వికెట్ల పతనం: 1–84, 2–143, 3–186, 4–194, 5–206. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–37–1; ప్రసిధ్‌ కృష్ణ 4–0–53–2; సాయి కిషోర్‌ 4–0–42–2; రషీద్‌ ఖాన్‌ 4–0–31–0; కోట్జీ 3–0–51–0; సుందర్‌ 1–0–7–0. గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయి సుదర్శన్‌ (బి) గ్లీసన్‌ 80; గిల్‌ (ఎల్బీ) (బి) బౌల్ట్‌ 1; మెండిస్‌ (హిట్‌ వికెట్‌) (బి) సాంట్నర్‌ 20; సుందర్‌ (బి) బుమ్రా 48; రూథర్‌ఫోర్డ్‌ (సి) తిలక్‌ (బి) బౌల్ట్‌ 24; తెవాటియా (నాటౌట్‌) 16; షారుక్‌ ఖాన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) అశ్వని కుమార్‌ 13; రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–3, 2–67, 3–151, 4–170, 5–193, 6–208. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–56–2; బుమ్రా 4–0–27–1; గ్లీసన్‌ 3.3–0–39–1; హార్దిక్‌ పాండ్యా 3–0–37–0; సాంట్నర్‌ 1–0–10–1; నమన్‌ ధీర్‌ 1–0–9–0; అశ్వని కుమార్‌ 3.3–0–28–1.

Indian Union of States is in trouble4
దేశమంటే కేంద్రం కాదోయ్‌!

‘ఇండియన్‌ యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ చిక్కుల్లో పడింది. న్యాయం, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవలు అందరికీ సమానంగాఅందిస్తూ, ఇండియాను ఆధునిక, ప్రజాస్వా మిక, లౌకిక రాజ్యంగా మార్చడమే రాజ్యాంగ అభిమతం. ఇండియా కాషాయ రంగు ఒక్కటే పులుముకున్న దేశంగా ఉండాలన్న భావన ఏనాడూ లేదు. భిన్న జాతులు, సంస్కృతులు, భాషలతో విలసిల్లే వైవిధ్యభరిత దేశమే లక్ష్యంగా రాజ్యాంగ రచన జరిగింది. ఈ వైవిధ్యత నేడు పెను సవాలు ఎదుర్కొంటోంది. ఇండియాలోని ఒక్కో రాష్ట్రం స్వరూప స్వభావాలు ఒక్కోవిధంగా ఉంటాయి. కాబట్టి వాటిమధ్య రాజకీయ, ఆర్థిక బలాబలాల సమతుల్యత సాధించడం ముఖ్యం. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జనాభాను తగ్గించుకున్న రాష్ట్రాలకు ప్రస్తుత డీలిమిటేషన్‌ (నియో జకవర్గాల పునర్విభజన) కసరత్తు వల్ల పార్లమెంటులో వెయిటేజ్‌ తగ్గుతుంది. అలా చేయలేని విఫల రాష్ట్రాలను డీలిమిటేషన్‌ పేరిట అధిక పార్లమెంటు స్థానాలిచ్చి సత్కరిస్తున్నారు. పార్లమెంటరీ నియో జక వర్గాల సంఖ్యను ఇప్పుడున్న స్థాయిలోనే శాశ్వతంగా స్తంభింప జేయాలి. డీలిమిటేషన్‌ ప్రక్రియను నిలిపేయాలి.విద్య పూర్తిగా రాష్ట్రాలదే!ప్రపంచం ఇప్పుడు సాంకేతిక యుగంలోకి ప్రవేశించింది. విద్యా ప్రమాణాలే సమాజాల ప్రగతిని శాసిస్తాయి. కేంద్ర నిర్వహణలోని ఉన్నత విద్యావిధానం చాలావరకు విఫలమైంది. విద్య యావత్తూ రాష్ట్ర జాబితాలోకి రావాలి. ఏఐసీటీఈ, యూజీసీ వంటి సంస్థల అధికార పరిధి నుంచి రాష్ట్రాలను విముక్తం చేయాలి. వైద్య, న్యాయ, సామాజిక శాస్త్రాల విద్యను మెరుగుపరచడం మాత్రమే నేటి జాతీయ అవసరం. నాణ్యమైన విద్యలో రాష్ట్రాలు పరస్పరం పోటీ పడేవిధంగా విధానాలు ఉండాలి. అంతేతప్ప, సగటు స్థాయి కేంద్రీకృత నిర్వహణ సంస్థలకు తలొగ్గే పరిస్థితి ఉండకూడదు. కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) చెల్లించి పంటలను కొనుగోలు చేయడం అనేది ప్రస్తుతం ఏవో కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకే పరిమిత మైంది. ఇలా సేకరించడం అంటే సబ్సిడీ ఇవ్వడమే. వ్యవసాయ సాగుభూమి ప్రాతిపదికగా, ఈ సేకరణ అన్ని రాష్ట్రాలకూ వర్తింప జేయాలి. ఆహారధాన్యాల్లో తృణధాన్యాలు ఎక్కువ భాగం ఆక్రమి స్తాయి కనుక అన్ని రాష్ట్రాల్లో వాటి సేకరణకు గ్యారెంటీ ఇవ్వాలి. అన్ని రాష్ట్రాల్లో ఇలా సేకరణ చేయడం సాధ్యం కాదనుకున్నప్పుడు, ఆ యా రాష్ట్రాలకు అందుకు బదులుగా గ్రాంట్ల రూపేణా పరిహారం ఇవ్వాలి.గంగా పరివాహకేతర ప్రాంతాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, అల్యూమినియం, రాగి, జింకు, నికెల్‌ వంటి ఖనిజ వనరులు విరివిగా ఉన్నాయి. ఈ వనరులు ఎవరి భూమి కింద ఉన్నాయో వారికి చెందాలి. అన్ని ఖనిజాల మీద ఆ యా రాష్ట్రాలకే తవ్వకం హక్కులు కట్టబెట్టాలి. వాటి ద్వారా సమకూరే ఆదాయాలు సైతం వాటికే సంక్రమించాలి.పన్నుల్లో వాటా రాష్ట్రాలకు ముందే ఇచ్చేయాలి!రాష్ట్రాలు ఆర్థిక స్వయంప్రతిపత్తి సాధించినప్పుడే నిజమైన సమాఖ్య వ్యవస్థ సాధ్యమవుతుంది. అంటే రాష్ట్రాలకు మరిన్ని ఆర్థిక వనరులుండాలి. ఫైనాన్స్ కమిషన్‌ సిఫారసుల ప్రకారం, పన్నుల రాబడిలో రాష్ట్రాలకు ప్రస్తుతం 42 శాతం వాటా దక్కాలి. అలా జర గటం లేదు. కేంద్రం వద్ద నిధులు కేంద్రీకృతమవుతున్నాయి. దీనికి తోడు, రాష్ట్రాలకు రావలసిన పన్ను బకాయిలను తొక్కిపట్టే ధోరణి పెరుగుతోంది. రాష్ట్రాలకు న్యాయబద్ధంగా దక్కాల్సిన ఆదాయాన్ని కేంద్రం తన పథకాల కోసం వాడుకుంటోంది. దీని నివారణకు మార్గాలు ఆలోచించాలి. పన్ను చెల్లింపు మూలం వద్దే రాష్ట్రాలకుచెందాల్సిన వాటా మినహాయించే విధానం అవసరం. దీనివల్ల సకాలంలో రాష్ట్రాలకు నిధులు అంది, అవి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోగలుగుతాయి. నిధుల బదిలీలో జాప్యం జరిగితే ఆర్బీఐ రేట్ల ప్రకారం వడ్డీ చెల్లించే నిబంధన కూడా ఉండాలి.అలాగే, రాష్ట్రాలకు తమ సాంస్కృతిక చారిత్రక వనరులను పరిరక్షించుకునే హక్కు ఉంది. కేంద్రం తన అధీనంలోని ఆర్కియ లాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) ద్వారా ఈ పరిరక్షణ హక్కును కాపాడటంలో విఫలమైంది. పురాతన కట్టడాలు, కళాఖండాల సంపద నాశనమవుతోంది. ఈ బాధ్యతను నేరుగా రాష్ట్రాలకే అప్పగించాలి. ఏఎస్‌ఐ వద్ద ఉండే రాష్ట్రాల నిధులను తక్షణం బదిలీ చేయాలి. ఏఎస్‌ఐ, కేంద్ర సాంస్కృతిక శాఖ సంకుచిత భావజాలంతో కొన్ని ప్రాంతాల మీద అధిక ప్రేమ కనబరచే ధోరణి పెరుగుతోంది.సైన్యంలో ఆ ఒక్క రాష్ట్రమేనా?సైనిక దళాలు, పారామిలిటరీ దళాల నియామకాలు కొన్నిప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. పరిమిత కాల సర్వీసు, జీవితకాల పెన్షన్, ఇతర బెనిఫిట్స్‌ కారణంగా యుద్ధ జాతులుగా పరిగణనలో ఉన్న వారికి మిలిటరీలో ఎక్కువ అవకాశాలు దక్కి వారే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. ఇది ఎలా జరుగుతోందో ఉదాహరణలతో పరిశీలిద్దాం. మద్రాస్‌ రెజిమెంట్‌ భారత సైన్యంలో అత్యంత పురాతనమైన పదాతిదళం. నీలగిరుల్లోని వెల్లింగ్టన్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ రెజిమెంటులో 21 బెటాలియన్లు ఉన్నాయి. దక్షిణ భారతం అంతటికీ చెందిన దాదాపు 27 కోట్ల మంది (భారతీయుల్లో 22 శాతం) దీని పరిధిలోకి వస్తారు. అదే సిక్కు రెజిమెంటును తీసుకుంటే, కేవలం 80 లక్షల జనాభా నుంచి దీనికి ఎంపికలు జరుగుతాయి. ఈ ఒక్క రెజిమెంటులోనే 22 పదాతిదళ బెటాలియన్లు ఉన్నాయి. కేవలం 3 కోట్ల జనాభా ఉన్న పంజాబు రాష్ట్రంలోని అన్ని రెజిమెంట్ల కిందా కలిపి 74 బెటాలియన్లు ఉంటాయి. గ్రామీణ యువ తకు అద్భుత ఉపాధి అవకాశాలు కల్పించే ఒక సంస్థలో ఆ యాప్రాంతాల ప్రాతినిధ్యంలో ఇంతటి అసమానత ఉండటం సమంజసం కాదు. ఇతర ప్రాంతాల నుంచి సైనిక దళాల్లోకి నియామకాలు పెంచాల్సి ఉంది.ఇక మీడియా విషయానికి వద్దాం. ఎలక్ట్రానిక్, ప్రింట్‌ మీడి యాలు రెండూ భారీ పెట్టుబడితో ముడిపడి ఉంటాయి. పైగా, వీటిని కేంద్ర ప్రభుత్వం, బడా వ్యాపార సంస్థలు అదుపు చేస్తున్నాయి. గమ నించవలసిన అంశం ఏమిటంటే, ఈ రెండూ ప్రముఖంగా ఉన్నా, నేటికీ రేడియో వార్తలు దేశంలో అధిక సంఖ్యాకులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అదుపు చేస్తోంది. రేడియో వార్తలను ఎఫ్‌ఎం బ్యాండ్స్‌ మీద ప్రసారం చేయడానికి స్థానిక ఔత్సాహికులను అనుమతించాలి. ప్రింటు, టీవీ ప్రసార మాధ్యమాల నిర్వహణను ప్రయివేటు, ప్రభుత్వ సంస్థలు రెండూ చేపట్టే అనుమతి ఉన్నప్పుడు, అత్యధికులకు అందుబాటులో ఉండే రేడియో ద్వారా సమాచారం అందించడానికి ప్రయివేటు, రాష్ట్ర ప్రభు త్వాలకు ఎందుకు అనుమతి ఇవ్వరో అర్థం కాని విషయం.అన్ని జాతులకూ వర్గాలకూ సమాన గౌరవం దక్కినప్పుడేఇండియా సమైక్యత వికసిస్తుంది. ప్రతి ఒక్కరికీ తమ వాణి వినిపించే అవకాశం కల్పించిన రాజ్యాంగం రాష్ట్రాలను ఒక రాజకీయ సమాహా రంగా కూర్చింది. అందుకు భిన్నంగా దేశాన్ని ఏకవర్ణంగా, ఏకశిలగా మార్చే ఎలాంటి ప్రయత్నం చేసినా అది దుస్సాహసం అవుతుంది. అదే జరిగితే రాజ్యాంగ మౌలిక భావన కుప్పకూలుతుంది. యూని యన్‌ విచ్ఛిన్నం అవుతుంది.-వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయిత , మోహన్‌ గురుస్వామి- mohanguru@gmail.com

Assam cabinet decides to grant arms license5
ఆయుధాల పందేరం!

రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకోవటం మొదలెట్టి 75 ఏళ్లవుతుండగా మన పాలకుల విపరీత పోకడలు దాన్ని కాస్తా భ్రష్టుపట్టించే దిశగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని సరిహద్దులకు సమీపంగా వుండే మారుమూల ప్రాంతాల్లోని స్థానిక తెగలకూ, నివాసితులకూ ఆయుధాల లైసెన్స్‌లుమంజూరు చేయాలని అస్సాం మంత్రివర్గం బుధవారం నిర్ణయించటం ఆ కోవలోనిదే. సరిహద్దు ఆవలి నుంచి చొరబడి బెదిరింపులకు దిగేవారి నుంచి రక్షణ కోసం, వ్యక్తిగత భద్రత కోసం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెబుతున్నారు. ‘జాతి, నేల, స్థానికత’ కాపాడటం కోసమే ఇలా చేస్తున్నామని ఆయన ప్రకటించారు. బంగ్లాదేశ్‌ పొడవునావుండే రెండు జిల్లాల్లోని ఆరు ప్రాంతాల వాసులకు ఈ ఆయుధాల లైసెన్స్‌లు లభిస్తా యని ఆయన చెప్పారు. ఈ ప్రాంతాలన్నిటా ముస్లింల జనాభా ఎక్కువ. ఇప్పుడు జనం చేతికి తుపాకులందితే మత ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా తుపాకులు మాట్లాడటం మొదలవుతుంది. ఇది ప్రభుత్వానికి మంచిదేనా? 1985 నుంచీ ఆ ప్రాంతాలవారు ఈ లైసెన్స్‌ల కోసం డిమాండ్‌ చేస్తుంటే గత ప్రభుత్వాలేవీ సాహసించలేదని, వాటికి ధైర్యంలేదని శర్మ వివరిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకొనేది తమకు రక్షణ, భద్రత కల్పిస్తాయని, మౌలిక సదుపాయల కల్పనపై శ్రద్ధ పెడతాయని, తమ బతుకులు మెరుగుపరచటానికి అవసరమైన పథకాలు రూపొందిస్తాయని ఆశించబట్టే! ఇంతకూ ‘ధైర్యం లేని’ గత ప్రభుత్వాల్లో తాను మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్, బీజేపీ ప్రభు త్వాలున్నట్టేనా? ఆ కాలాల్లోని ప్రభుత్వాలకు ‘ధైర్యం’ కలిగించేందుకు తాను చేసిందేమిటి? తాను విఫలమైన పక్షంలో దానిపై నిలదీయకుండా మౌనంగా ఎందుకు ఉండిపోయినట్టు? దాదాపు పాతికేళ్లుగా శర్మ రాజకీయాల్లో వుంటున్నారు. ఆయన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల్లో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 2015లో కాంగ్రెస్‌ నుంచి తప్పుకోవటానికి కూడా కారణం ఆ సర్కార్‌కు ధైర్యం లేదని కాదు. తన రాజకీయ ఎదుగుదలకు అప్పటి సీఎం తరుణ్‌ గొగోయ్‌ అడ్డంకిగా మారటం! దీన్నంతటినీ రాహుల్‌గాంధీని కలిసి మొరపెట్టుకోవాలని శర్మతీవ్రంగా ప్రయత్నించారు. కానీ జనాదరణగల యువ నాయకుల కన్నా పీఠాధిపత్యం నెరపే వృద్ధ తరం నేతలకే పెద్దపీట వేసే సంస్కృతిగల కాంగ్రెస్‌లో అది సాధ్యపడలేదు. నేపథ్యం ఏమైనా బీజేపీలో శర్మ బాగా రాణించారు. ఏనాటినుంచో ఆ పార్టీలో వున్న నేతలను తలదన్నే విధంగా ప్రకటనలిచ్చి వివాదాస్పదుడూ అయ్యారు. అందువల్ల పార్టీలో ఆయన పట్టు పెరిగింది గనుకే 2021లో బీజేపీ అధిష్ఠానం శర్మను అస్సాం ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. కానీ గత ప్రభుత్వాలు తుపాకీ లైసెన్స్‌లు ఇవ్వకపోవటానికి వాటికి ధైర్యం లేకపోబట్టే అని ఆయన దేని ఆధారంగా నిర్ణయానికొచ్చారో చెప్పలేదు. శర్మ చెబుతున్న ప్రకారం ఆ ప్రభుత్వాలు సాహసించలేక పోబట్టి చాలామంది స్థానిక తెగలవారు బయటి వ్యక్తుల ఒత్తిళ్లకు లొంగి భూములు అమ్ముకోవాల్సి వచ్చింది. అక్కణ్ణించి వలసలు పోవాల్సి వచ్చింది. మరి ప్రభుత్వాల వైఖరి వల్ల జనం ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఆయన మౌనంగా మిగిలిపోవటం ఎందువల్ల?హిమంత గ్రహించాల్సిన విషయం ఒకటుంది. గతంలో ప్రజల నుంచి ఎన్ని డిమాండ్లు వచ్చినా అప్పటి ప్రభుత్వాలు ఆయుధ లైసెన్సులివ్వకపోవటానికి కారణం ధైర్యం లోపించి కాదు. అది అనైతికమూ, రాజ్యాంగ విరుద్ధమూ అని విశ్వసించటం వల్ల! అమెరికాలో పౌరులెవరైనా ఆయు ధాలు కొనుక్కోవచ్చు. అందుకు కొన్ని నిబంధనలున్నా ఆచరణలో అవి ఏమవుతున్నాయో అక్కడ తరచు జరిగే ఉదంతాలు గమనిస్తే అర్థమవుతుంది. అక్కడ సగటున 100 మంది పౌరులకూ 120.5 తుపాకులున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. నిరుడు తుపాకీ మరణాలు 30,000 మించాయి. అకారణంగా లేదా భయపడి తరచు అవతలివారిని చంపుతున్న ఉదంతాలు ఎక్కువ. ఆ దేశంలో కూడా హిమంత ప్రభుత్వం ఏకరువు పెడుతున్న నిబంధల వంటివే వున్నాయి. మానసికంగా సక్ర మంగా వుండి అవతలివారి నుంచి ప్రాణభయం ఉన్న 21 ఏళ్లు పైబడినవారందరికీ లైసెన్సులిస్తా మని హిమంత చెబుతున్నారు. ఏదైనా కేసులో శిక్షపడినా, శాంతికి దోహదపడతామని గతంలో ప్రభుత్వానికి బాండు రాసిచ్చినా అనర్హులవుతారట. అంతేగాక మానసికంగా, శారీరకంగా సరైన స్థితిలో వున్నవారికే లైసెన్సులు జారీచేస్తారట. ఒకసారంటూ కళ్లెం వదిలాక ఇవన్నీ నిజాయతీగా, చిత్తశుద్ధిగా అమలవుతాయా? అనుమానమే!అస్సాం మొదటినుంచీ సమస్యాత్మక రాష్ట్రం. అక్రమంగా చొరబడిన విదేశీయులను వెనక్కిపంపాలంటూ ఉవ్వెత్తున లేచిన విద్యార్థి ఉద్యమం, అటుతర్వాత ఉల్ఫా లాంటి ఉగ్రవాద సంస్థల ఆగడాలు తెలియంది కాదు. నిత్యం అపహరణలు, డబ్బు దండుకోవటం, హత్యలు ఒకప్పుడు చాలా అధికం. సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) జవాన్లు, పోలీసులు ఉల్ఫా ఆటకట్టించాక అవి చాలావరకూ తగ్గిపోయాయి. ఇప్పటికీ బీఎస్‌ఎఫ్‌ జవాన్లు సరిహద్దుల్లో నిత్యం పహారా కాస్తుంటారు. సమస్య వుందనుకుంటే మరింతమందిని నియమించి, పటిష్ఠమైన పర్యవేక్షణ అమలు చేయటం పెద్ద కష్టం కాదు. అందుకు భిన్నంగా లైసెన్సులిస్తామంటే ప్రభుత్వం చేతులెత్తేసినట్టు కాదా? ఇలాంటి కారణాల వల్లే గతంలో ఛత్తీస్‌గఢ్‌లో సుప్రీంకోర్టు సల్వాజుడుంను రద్దుచేసింది. పైగా అస్సాంకు భారీయెత్తున పెట్టుబడులు తీసుకొస్తామని చెబుతూ శాంతికి విఘాతం కలిగించే ఇలాంటి విధానం అమలు చేయటం సరైందేనా? హిమంత ఆలోచించాలి.

Secretariat employees protest at the corporation office6
ఏరా.. ల...కొడకా.. నీ..మ్మా!

అనంతపురం కార్పొరేషన్‌: అనంతపురం నగరంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రౌడీయిజం చేస్తూ బరితెగిస్తున్నారు. ఇటీవల మేయర్‌ వసీం చాంబర్‌లోకి టీడీపీ చోటా నాయకులు అక్రమంగా చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. తాజాగా 30వ డివిజన్‌ టీడీపీ ఇన్‌చార్జి రాజేష్‌నాయుడు రెచ్చిపోయాడు. ప్రజలకు నిబద్ధతతో సేవలందిస్తున్న సచివాలయ ఉద్యోగి (29వ వార్డు సచివాలయం వెల్ఫేర్‌ సెక్రటరీ) అశ్వత్థరెడ్డిని నానా దుర్భాషలాడాడు. మహానాడుకు ప్రజలను ఎందుకు తరలించలేదంటూ గురువారం బూతులతో రెచ్చిపోయాడు. దీంతో నగరంలోని ఉద్యోగులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదని, రాజేష్‌నాయుడుపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ధర్నాచేశారు. కమిషనర్‌ బాలస్వామి అందుబాటులో లేకపోవడంతో క్యాంపు క్లర్క్‌కు వినతిపత్రం ఇచ్చారు.నేను మాట్లాడేది రికార్డు చెయ్‌..కడపలో జరిగిన మహానాడుకు ఎవ్వరూ రాలేదంటూ రాజేష్‌నాయుడు ఫోన్‌లో అశ్వత్థరెడ్డిని నోటికొచి్చనట్లు బూతులతో దూషించాడు. ‘ఏం చేస్తున్నావ్‌ అన్నా.. రాత్రి నుంచి ఫోన్‌చేసినా.. నీ క్లస్టర్‌ నుంచి ఏ..ల..కొడుకూ రాలా.. కాల్‌ రికార్డు చెయ్‌ నేను మాట్లాడేది.. సచివాలయంలో నువ్వేమైనా పీ..తున్నావా? రేయ్‌..ల...కొడకా.. ఇన్ని రోజులు నీకు గౌరవం ఇచ్చినా.. ఒక్క ల.. ల..కొడుకు రాలేదు మీటింగుకు నీ..మ్మా..’ అంటూ రాయలేని భాషలో ఇంకా నోటి కొచ్చినట్లు తిట్టాడు.పెద్దఎత్తున సచివాలయ ఉద్యోగుల ధర్నా..ఈ ఘటనకు నిరసనగా నగరంలోని సచివాలయ ఉద్యోగులు శుక్రవారం రాత్రి పెద్దసంఖ్యలో నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే ధర్నా చేపట్టారు. ఆ సమయంలో కమిషనర్‌ బాలస్వామి అందుబాటులో లేకపోవడంతో క్యాంపు క్లర్క్‌కు వినతిపత్రం అందజేశారు. మహానాడుకు ప్రజలను తరలించే డ్యూటీ తమది కాదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సచివాలయ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. ఇలాగైతే తాము ఉద్యోగం ఏ విధంగా చేయాలని వారంతా ప్రశ్నించారు. పోలీసులు సుమోటోగా కేసును స్వీకరించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఇది మంచి సంస్కృతి కాదు..సచివాలయ ఉద్యోగిపట్ల దౌర్జన్యానికి పాల్పడ్డ రాజేష్‌నాయుడుపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇంత దారుణమైన పరిస్థితులుంటే ఎలా? అశ్వత్థరెడ్డితో మాట్లాడిన తీరుచూస్తే టీడీపీ నేతలు ఇలాగే ప్రవర్తించాలని మహానాడులో నేర్పినట్లుంది. ఇది మంచి సంస్కృతి కాదు. – రామిరెడ్డి, సీపీఎం అనంతపురం నగర కార్యదర్శిరాజేష్‌నాయుడుపై చర్యలు తీసుకోవాలి..టీడీపీ నేత రాజేష్‌నాయుడుపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఇతను డీఎంహెచ్‌ఓ కార్యాలయం ముందు ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా హోటల్‌కు లీజుకిచ్చి సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రభుత్వోద్యోగిని అంతుచూస్తానంటూ రౌడీలా బెదిరించాడు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎక్కడా ఉండవు. – ఎస్‌. నాగేంద్రకుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శికూటమి ప్రభుత్వంలో దారుణ పరిస్థితులు..టీడీపీ కూటమి ప్రభుత్వంలో జిల్లాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల నా చాంబర్‌లోకే టీడీపీ చోటా నాయకులు చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగిని టీడీపీ నాయకుడు నానా మాటలన్నాడు. ప్రభుత్వోద్యోగులపట్ల ఇలాగేనా ప్రవర్తించేది? మరీ ఇంత దారుణమా? ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులపట్ల ఇలా దాష్టీకంగా ప్రవర్తిస్తే ఎలా? – వసీం, మేయర్, అనంతపురం నగర పాలక సంస్థ

Confusion in ten results like never before in the history of the state7
ఈ రిమార్కు ఎవరిది మంత్రివర్యా?

సాక్షి, అమరావతి: ‘‘వారం రోజుల్లోనే పదో తరగతి ఫలితాలు వెల్లడించేశాం..’’ అని ఘనంగా చెప్పుకొనేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన పెద్ద పొరపాటు విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు గ్రహపాటుగా మారింది. ‘‘మేం రికార్డు సృష్టించాం’’అని గొప్పలు పోయేందుకు చేసిన తప్పు.. పరీక్షలు రాసిన విద్యార్థుల పాలిట శాపమైంది. సర్కారు అనాలోచిత చర్య.. వేలమందికి తీవ్ర మనస్థాపాన్ని మిగిల్చింది. పదో తరగతి అంటే ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమైన మలుపు అంటారు విద్యావేత్తలు. ఇక్కడ ప్రతిభ చూపితే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం వస్తుంది.భవిష్యత్‌లో ఏదైనా సాధించగలమనే నమ్మకం కలుగుతుంది. ఇంతటి కీలకమైన విద్యార్థి దశపై కూటమి సర్కారు దారుణమైన దెబ్బకొట్టింది. పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని గాలికి వదిలేసి ‘దిద్దుకోలేని తప్పు’ చేసింది. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్ష పేపర్లు దిద్దడంలో గొప్పలకు పోయి తీవ్ర గందరగోళం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తప్పులు దొర్లడం యావత్‌ దేశాన్ని కలవరపరుస్తోంది.జీవితం తారుమారు..!టెన్త్‌ మార్కుల ఆధారంగా ట్రిపుల్‌ ఐటీ, గురుకులాల్లో చేరి మెరుగైన విద్య చదివేందుకు అవకాశం దక్కుతుంది. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద అనేక కార్పొరేట్‌ సంస్థలు విద్యార్థుల ఉచిత చదువులకు సాయం అందించేందుకు ముందుకొస్తాయి. కానీ, కూటమి ప్రభుత్వం రికార్డుల కోసం పాకులాడి బంగారం లాంటి విద్యార్థుల జీవితాలను తలకిందులు చేసింది. తప్పుల మూల్యాంకనం కారణంగా వారు బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయి ఎంతో వేదనకు గురికావాల్సి వచ్చింది.మూడంచెల్లోనూ పొరపాట్లే..పదో తరగతి పరీక్ష పేపర్లను మూడు అంచెల్లో దిద్దుతారు. తొలుత విద్యార్థుల జవాబు పత్రాలను ఇతర జిల్లాకు పంపిస్తారు. అక్కడ ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ప్రతి ముగ్గురు టీచర్లు దిద్దిన పేపర్లను పరిశీలించడానికి ఒక చెకింగ్‌ ఉపాధ్యాయుడు ఉంటారు. వీరు దిద్దిన పేపర్లను ఆ ఉపాధ్యాయుడు.. క్షుణ్నంగా పరిశీ­లిస్తారు. మార్కులు లెక్కింపు నుంచి ప్రతి జవాబును దిద్దారా? మార్కులు వేశారా? అని చూస్తారు. తొలుత పేపర్‌ దిద్దిన ఉపాధ్యాయులు పొరపాటు చేసినా రెండో దశలో సరిచేసే అవకాశం ఉంటుంది. ఇక మూడో దశలో చీఫ్‌ ఎగ్జామినర్‌ ప్రతి 20 పే­పర్లలో ఏవైనా మూ­డింటిని తీసుకుని పరి­శీలి­స్తారు. అప్పుడైనా తప్పులు ఉంటే సరి చేస్తారు. కానీ, 66,363 పేపర్ల మూల్యాంకనంపై సందేహంతో దరఖాస్తు చేసుకోవడం, ఇందులో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమానాలకు తగ్గట్టుగానే 11 వేల పేపర్లలో మార్కుల్లో మార్పులు రావడం చూస్తుంటే మూడంచెల వ్యవస్థ పనితీరుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.కొడుకుపై ప్రేమ.. సస్పెండ్‌ డ్రామా!పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తప్పులతో కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. ఒకటా? రెండా? కోకొల్లలుగా ప్రభుత్వ తప్పులు బయటకొస్తున్నాయి. జూన్‌ 1 వరకు రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్‌ కొనసాగుతుంది. ఈ క్రమంలో తమ పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్య­క్తం చేస్తున్నారు. తప్పులపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇప్పటివరకు స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సీఎం చంద్రబాబు తనయుడిగానే కాకుండా పార్టీ, ప్రభుత్వంలో లోకే­శ్‌ కీలక వ్యక్తిగా చక్రం తిప్పుతుండడంతో ‘తన శా­ఖ పనితీరులో ముందున్నట్టు’ గొప్పులు చెప్పుకొ­నేందుకు విద్యా శాఖపై ఒత్తిడి తెచ్చి వేగంగా మూ­ల్యాంకనం పూర్తి చేయాలని, నిబంధనలను పక్కనపెట్టి ఒక్కో ఉపాధ్యాయుడికి ఎక్కువ పరీక్ష పేపర్లు ఇచ్చి మూల్యాంకనం చేయాలని ఒత్తిడి తేవడం తప్పులు దొర్లడానికి కారణమైంది. కానీ, పదో తరగతి పరీక్ష ఫలితాలపై ప్రజాగ్రహాన్ని దారిమళ్ళించేందుకు, కుమారుడు లోకేశ్‌పై ప్రేమతో సీఎం చంద్రబాబు మహానాడు వేదికగా డ్రామాకు తెరదీశారు. బాధ్యుల సస్పెన్షన్‌ అంటూ ఎత్తులు వేశారు.తప్పిదం ప్రభుత్వానిది.. మూల్యం విద్యార్థులదా?పరీక్షలు మంచిగా రాసినా... మార్కులు తక్కువ రావడం, ఫెయిల్‌ కావడాన్ని నామోషీగా భావించి విద్యార్థులు ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటే? ఏమిటి పరిస్థితి అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చేసిన భారీ తప్పిదానికి విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాలా? అని నిలదీస్తున్నారు. ఆ పాపాన్ని చంద్రబాబు మోస్తారా? అని అడుగుతున్నారు. పరీక్ష పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులను బాధ్యులను చేసి సస్పెండ్‌ చేసినప్పుడు విద్యాశాఖ మంత్రిగా విఫలమైన లోకేశ్‌ను ప్రథమ బాధ్యుడిగా గుర్తించి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. సంపద సృష్టి అంటే.. ప్రతిభావంతులైన విద్యార్థులను ఫెయిల్‌ చేసి వారితో ఫీజులు కట్టించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడమా? అని ఎద్దేవా చేస్తున్నారు.ఒత్తిడిలో మూల్యాంకనంపదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో ప్ర­భుత్వం పూర్తిగా విఫలమైంది. ఉపాధ్యాయులపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ ఒత్తిడి తెచ్చి వేగంగా దిద్దించేందుకు యత్నించడంతోనే మా­ర్కుల గజిబిజి గందరగోళం సృష్టించింది. ప్రతి­భావంతులైన విద్యార్థులు సైతం ఫెయిల్‌ కావడంతో కూటమి ప్రభుత్వ డొల్లతనం బహిర్గతమైంది. ఏకంగా 66,363 పేపర్లలో రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడం చూస్తుంటే విద్యార్థుల జీవితాలు ఎంత ప్రమాదంలో పడ్డాయో అర్థమవుతోంది. ఇందులో 11వేలకుపైగా పేపర్లలో ఉత్తీర్ణులు/మార్కుల మార్పు చెందినట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించడాన్ని చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఇప్పటికీ రీవెరిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగుతుండడం గమనార్హం. పేపర్లను దిద్దిన తర్వాత నాలుగు విభాగాలుగా మార్కులు వేస్తారు. ఇందులో కొన్నింటిని లెక్కించకపోవడంతో విద్యార్థులకు అన్యాయం జరిగినట్టు తెలుస్తోంది.కొట్టివేతలతో...రాజమహేంద్రవరం విద్యార్థి మణికంఠకు పదో తరగతి ఫలితాల్లో 505 మార్కులు వచ్చాయి. తెలు­గులో 97, ఇంగ్లిష్‌లో 81, గణితంలో 86, సైన్స్‌లో 97, సోషల్‌లో 92 రాగా.. హిందీలో మాత్రం 52 వచ్చాయి. విద్యార్థి తండ్రి వీరభద్రరావు రూ.వెయ్యి చెల్లించి రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేశా­రు. మార్కుల్లో ‘మార్పు లేదు’ అని సమాధానం వచ్చింది. అయితే, జవాబు పత్రాల్లో సరైన సమాధానాలు రాసినప్పటికీ వాటిని కొట్టివేశారని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.లోకేశ్‌ ఒత్తిడి కారణంగానే మార్కుల తారుమారు» రికార్డుల కోసం ప్రభుత్వం » విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేసింది» వేలాదిమంది భవిష్యత్తు ప్రమాదంలో పడింది» ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి» వైఎస్సార్‌సీపీ ట్వీట్‌సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకున్నదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ‘‘పరీక్ష రాసినవారిలో 60 శాతం మంది విద్యార్థులు రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి. పదో తరగతి బోర్డు చేసిన షాకింగ్‌ తప్పులు.. పాసైనవారిని కూడా ఫెయిల్‌ చేశాయి. విద్యా మంత్రి నారా లోకేశ్‌ ఒత్తిడి కారణంగానే మార్కులను తారుమారు చేశారు. 66,363 పేపర్ల రీవాల్యుయేషన్‌ కోరారు. ఇప్పటికే ఆందోళన చెందిన బోర్డు.. సమీక్ష తర్వాత 11 వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ప్రకటించింది. వాల్యుయేషన్‌ ఇంకా కొనసాగుతోంది. అయినప్పటికీ, లోకేశ్‌ మౌనంగా ఉన్నారు. ఈ తప్పుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల కోసం ప్రయత్నించిన ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేసింది’’ అని వైఎస్సార్‌సీపీ మండిపడింది.

Glacier melt in the Himalayas endangers South Asia8
ముంచుకొస్తున్న ముప్పు

న్యూఢిల్లీ: హిమాలయ పర్వతాలు భారతదేశానికి పెట్టని కోటలాంటివి. హిమాలయాల్లోని 800 కిలోమీటర్లకుపైగా పొడవైన హిందూకుష్‌ పర్వత శ్రేణిలో ఎన్నెన్నో హిమానీనదాలు(గ్లేసియర్స్‌) ఉన్నాయి. ఎన్నో నదులు, సరస్సులకు ఇవే ఆధారం. మధ్య, దక్షిణాసియాలో హిందూకుష్‌ గ్లేసియర్స్‌ నుంచి వచ్చే నీటిపై ఆధారపడి 200 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండడంతో హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. పారిశ్రామిక యుగానికి ముందున్న ఉష్ణోగ్రతల కంటే మరో 2 డిగ్రీల సెల్సియస్‌కుపైగా పెరిగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి హిందూకుష్‌ హిమానీనదాల మంచులో 75 శాతం అంతమైపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. 200 కోట్ల మంది జీవనం ప్రమాదంలో పడుతుందని తేలింది. ఈ అధ్యయనం వివరాలను సైన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు. భూగోళంపై మానవ మనుగడ కొనసాగాలంటే వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాలన్నీ తక్షణమే దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. → 10 దేశాలకు చెందిన 21 మంది శాస్త్రవేత్తలు ఉమ్మడిగా ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకుపైగా గ్లేసియర్లలో మంచు కరుగుతున్న తీరును పరిశీలించడానికి 8 గ్లేసియర్‌ మోడల్స్‌ ఉపయోగించారు. → ఉష్ణోగ్రతలు మరింత పెరగకుండా స్థిరంగా ఉన్నప్పటికీ గ్లేసియర్లలో మంచు కరగడం ఇప్పట్లో ఆగదని అధ్యయనకర్తలు స్పష్టంచేశారు. రాబోయే కొన్ని దశాబ్దాలపాటు ఈ పరిమాణం కొనసాగు తూనే ఉంటుందని పేర్కొన్నారు. → ఉష్ణోగ్రత కేవలం అర డిగ్రీ పెరిగినా సరే దాని ప్రభావం హిమానీనదాలపై కచ్చితంగా ఉంటుందని, ఈ మేరకు మంచు కరిగిపోతుందని సైంటిస్టు డాక్టర్‌ హ్యారీ జెకొల్లారీ చెప్పారు. మనం ఈ రోజు తీసుకొనే నిర్ణయాలు మన భవిష్యత్తు తరా ల బతుకులను నిర్ణయిస్తాయని అన్నారు. రాబోయే తరాలు బాగుండాలంటే గ్లేసియ ర్లను కాపాడుకోవాలని సూచించారు. → పారిస్‌ వాతావరణ ఒప్పందం ప్రకారం.. భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేస్తే హిమాలయాలు, కాకస్‌ పర్వతాల్లో 40–45 శాతం మంచును కాపాడుకోవచ్చు. → ఒకవేళ ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మంచు కరిగిపోతుంది. ఈ శతాబ్దం ఆఖరు నాటికి కేవలం 25 శాతమే మిగిలి ఉంటుంది. → యూరప్‌లో ఆల్ఫ్స్, ఉత్తర అమెరికాలో రాకీస్‌తోపాటు ఐస్‌ల్యాండ్‌లోని గ్లేసియర్లు మానవులకు జీవనాధారం కల్పిస్తున్నాయి. ప్రస్తుతం వీటికి ముప్పు పొంచి ఉంది. భూగోళం మరో రెండు డిగ్రీలు వేడెక్కితే.. ఇక్కడ మంచు 10–15 శాతమే మిగులుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 90 శాతం మంచు కనుమరుగైతే పరిస్థితి తీవ్రత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక స్కాండినేవియా ప్రాంతంలో మంచు పూర్తిగా కరిగిపోతుందన్న అంచనాలున్నాయి. → హిమానీనదాలపై ఐక్యరాజ్యసమితి తొలి సదస్సు ప్రస్తుతం తజకిస్తాన్‌లోని దుషాన్బేలో జరుగుతోంది. 50కిపై దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. → గ్లేసియర్లు వేగంగా కరిగిపోతుండడం వల్ల ఆసియాలో 200 కోట్ల మందికి కష్టాలు రాబోతున్నాయని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఉపాధ్యక్షుడు యింగ్‌మింగ్‌ యాంగ్‌ హెచ్చరించారు. ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాల్లో సమీప భవిష్యత్తులో తీవ్రమైన వరదలు, కరువులు సంభవించే ప్రమాదం ఉందని, సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల తీర ప్రాంతాలు మునిగిపోతాయని చెప్పారు. → మంచు కరిగిపోవడాన్ని ఆపాలంటే శిలాజ ఇంధనాలను పక్కనపెట్టాలని, క్లీన్‌ ఎనర్జీని ఉపయోగించుకోవాలని యింగ్‌మింగ్‌ యాంగ్‌ స్పష్టంచేశారు. భూమిని అగ్నిగుండంగా మారుస్తున్న కాలుష్య ఉద్గారాలకు కళ్లెం వేయాలన్నారు.

Teachers are concern through social media9
‘నవ’ మోసాలు

అవనిగడ్డ: జీవో 117ని రద్దు చేయకుండా రెక్టిఫికేషన్‌ పేరుతో పాఠశాలల సంఖ్యను తొమ్మిది రకాలుగా మార్చడాన్ని ఉపాధ్యాయులు తప్పు పడుతున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న చేతలకు పొంతన లేని తీరుపై వారు మండిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఉద్యమమే సరైన మార్గమని, లేకపోతే భవిష్యత్‌ లేదని ఉపాధ్యాయులంతా ఏకమవుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఉద్యమబాటకు సై అంటున్నారు. నాటి లోకేశ్‌ వీడియో వైరల్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటు సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడిన వీడియోని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వాట్సాప్‌ గ్రూపుల్లో విపరీతంగా వైరల్‌ చేస్తున్నారు. గౌరవ శ్రీనారా లోకేశ్‌ గారు ఎన్నికలకు ముందు..అంటూ ఇంగ్లిష్, తెలుగు మీడియం ఆప్షన్‌పై మాట్లాడిన వీడియో ఉపాధ్యాయ సంఘాల గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. అలాగే తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంపై ఆనాడు పవన్‌ కళ్యాణ్‌ ఎలా మాట్లాడారు? ఇప్పుడెలా స్పందిస్తున్నారనే వీడియో సైతం అందరి గ్రూపుల్లో ప్రత్యక్షమవుతోంది. సంతకాలతో మంత్రి లోకేశ్‌కు లేఖలుఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(ఏపీటీఎఫ్‌) యూని­యన్‌ నేతలు ఒకడుగు ముందుకేసి 9 అంశాలపై సంతకాలు చేసిన లేఖలను మంత్రి నారా లోకేశ్‌కు మెయిల్స్, వాట్సాప్‌ల ద్వారా పంపిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఉపాధ్యాయుల వాట్సాప్‌ లేఖ సీఎస్‌పురం(పామూరు): ప్రభుత్వ పాఠశాలల పరి­రక్షణ కోసం చర్యలు చేపట్టాలని కోరుతూ విద్యా­శాఖ మంత్రి నారాలోశ్‌కు ప్రకాశం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు వాట్సాప్‌ ద్వారా విజ్ఞప్తులశ్‌పంపారు. అన్ని గ్రామాల్లో 1 నుంచి 5 తరగతులకు ప్రాథమిక పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలంటూ పలు అంశాలపై ఏకరువుపెడుతూ వాట్సాప్‌ చేశారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్గిష్‌ మాద్యమాలను కొనసాగించాలని కోరారు. ఎస్‌జీటీలకు పీఎస్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతులు, ఉన్నతపాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులు విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్‌ ఏర్పాటు చేయాలంటూ వాట్సాప్‌ ద్వారా మంత్రికి వినతులు పంపినట్లు ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌.నాయబ్‌రసూల్, సీఎస్‌పురం మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట శ్రీనివాసులు, జె.ఎస్‌.ఆనంద్‌బాబు పేర్కొన్నారు. ఆ తొమ్మిది అంశాలివే1. ప్రతి గ్రామంలో ప్రతిపాదిత ఫౌండేషన్‌ స్కూల్‌ స్ధానంలో 1 నుంచి 5 తరగతు­లుండేలా ప్రాథమిక పాఠశాలలు విధిగా కొనసాగించాలి. విద్యార్థుల సంఖ్యతో నిమి­త్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులుండాలి. 2. విద్యార్థులకు తెలుగు మాధ్యమంలో చదువుకునే అవకాశం కోసం తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాలను కొనసాగించాలి. మైనారిటీ భాషల మాధ్యమాలను కొనసాగించాలి. 3. ఎస్‌జీటీలకు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కల్పించాలి. 4. మోడల్‌ ప్రాథమిక పాఠశాలల్లో 120 మంది విద్యార్థులు దాటితే 5 ప్లస్‌ 1 ఉపాధ్యాయులను నియమించాలి.5. ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులను విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలి. 6. ప్రతిపాదిత ప్రభుత్వ ఉత్తర్వు 21లో ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పడనున్న 40 పీరియడ్ల భారాన్ని 32 పీరియడ్‌లకు మించకుండా చూడాలి. 7. ఉన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్‌ ఏర్పాటు చేయాలి. 8. క్లస్టర్లలో ఉపాధ్యాయులు మిగులు చూపించకుండా వారిని విద్యార్థుల సంఖ్యను బట్టి అవరోహణ క్రమం (ఎక్కువ నుంచి తక్కువ స్థాయి)లో పాఠశాలలకు కేటాయించాలి. 9. పెరిగిన జనాభా మేరకు మునిసిపాలిటీ, కార్పొరేషన్, నూతనంగా వెలిసిన ఆవాసాలతో నూతన పాఠశాలలను ఏర్పాటు చేయాలి.

MIT Class President Megha Vemuri Viral Graduation Speech on Israel Genocide in Gaza10
ఎంఐటీ  వేదిక నుంచి పాలస్తీనాకు సంఘీభావం 

కేంబ్రిడ్జ్‌ (యూఎస్‌): పాలస్తీనా మాటెత్తితే చాలు, ఏకంగా యూనివర్సిటీలపైనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉక్కుపాదం మోపుతున్న వేళ భారత సంతతికి చెందిన మేఘ వేమూరి అనే విద్యార్థిని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంబ్రిడ్జ్‌లోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) గ్రాడ్యుయేషన్‌ వేదిక నుంచి ఏకంగా పాలస్తీనాకు మద్దతు పలికారు. ఇజ్రాయెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌తో తమ వర్సిటీ పరిశోధన ఒప్పందాలను తీవ్రంగా వ్యతిరేకించారు. పాలస్తీనా సంఘీభావానికి ప్రతీకగా కెఫెయే (హిజాబ్‌ వంటిది) ధరించి మరీ గ్రాడ్యుయేషన్‌ వేడుకలో పాల్గొన్నారు! తన ప్రసంగంలో పాలస్తీనాకు పూర్తి మద్దతు తెలిపారు. ‘‘పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్‌ దాడికి అమెరికా మాత్రమే కాదు, మన యూనివర్సిటీ కూడా సాయం చేస్తోంది. వాటిని ప్రోత్సహిస్తోంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎంఐటీ విద్యార్థులు స్వేచ్ఛాయుత పాలస్తీనాను కోరుకుంటున్నారు. ఒక జాతి విధ్వంసాన్ని విద్యార్థులు సహించలేరు. మా జీవితాలను శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లు, విద్యావేత్తలు, నాయకులుగా తీర్చిదిద్దుకుంటాం. అలాగే ఆయుధ నిషేధానికి పిలుపునిచ్చేందుకు కూడా మేం అంతే కట్టుబడి ఉన్నాం. ఎంఐటీ పూర్వ విద్యార్థులుగా ఇజ్రాయెల్‌తో సంబంధాలను తెంచుకోవాలని వర్సిటీని డిమాండ్‌ చేస్తూనే ఉంటాం’’ అని ఆమె ఉద్ఘాటించారు. అమెరికాలో విద్యా రంగంలో అనిశ్చితి, విద్యార్థి కార్యకర్తలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి కూడా మేఘ మాట్లాడారు. ‘‘ప్రస్తుతం అమెరికావ్యాప్తంగా విద్యాసంస్థలపై అనిశ్చితి చీకట్లు కమ్ముకున్నాయన్నది బహిరంగ రహస్యం. తర్వాత ఏం జరగనుందనే ప్రశ్న మా మనస్సుల్లో ప్రతిధ్వనిస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.ఎంఐటీ విద్యార్థులుజాతి విధ్వంసాన్ని సహించరుఅమెరికాలో చాలామంది విద్యార్థుల హృదయాల్లో భయాందోళనలు గూడుకట్టుకుని ఉన్నాయని మేఘ అన్నారు. ‘‘మేమంతా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి జీవితాల్లో ముందుకు సాగడానికి సిద్ధమవుతున్నాం. గాజాలో మాత్రం అసలు విద్యా సంస్థలే లేకుండా చేశారు. పాలస్తీనాను పూర్తిగా తుడిచిపెట్టడానికి ఇజ్రాయెల్‌ ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాల్లో ఎంఐటీ కూడా భాగస్వామి కావడం సిగ్గుచేటు. గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు ఎంఐటీ విద్యార్థులు పిలుపునిచ్చారు. క్యాంపస్‌లో పాలస్తీనా అనుకూల కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు. వర్సిటీ నుంచే బెదిరింపులు, అణచివేత ఎదుర్కొన్నా వెనకడుగు వేయలేదు. ఎందుకంటే నాకు తెలిసి ఎంఐటీ విద్యార్థులు మారణహోమాన్ని ఎప్పటికీ సహించరు. జాతి విధ్వంసాన్ని హర్షించరు’’ అని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement