Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Mohan Reddy Slams Chandrababu Govt1
మీరు మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరు: వైఎస్‌ జగన్‌

తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లో క్షీణించిన శాంతిభద్రతపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘రాజకీయ కక్షలతో చంద్రబాబుగారు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్‌ ఆర్డర్‌ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది.అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారంలో ఉన్నవారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోయి, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా అదుపాజ్ఞ‌ల్లోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య డ్రైవర్ మ‌ద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే, చలానా రాసినందుకు ఆ ఎమ్మెల్యే ఆ కానిస్టేబుల్‌ను రప్పించుకుని, సీఐ సమక్షంలో నిందితుడైన అదే డ్రైవర్‌తో దాడిచేయిస్తారా? , చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ ఘటనను మూసివేసేలా ప్రయత్నించి వ్యవస్థలకే తలవంపులు తెస్తున్నారు. ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడిది?’ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టడం పరిపాటిగా మారిపోయింది‘రాజకీయ కక్షలతో నిర్దోషులపై తప్పుడు కేసులు పెట్టి, వారిని జైళ్లకు పంపడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయిందని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మీనారాయణపై అక్రమంగా కేసుపెట్టి, తీవ్రంగా కొట్టారు.. లంచం ఇవ్వలేదని లేని గంజాయి కేసుపెట్టి 2 నెలలపాటు జైలుకు పంపడంతో అవమానాలు భరించలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.10 ఏళ్ల కొడుకు, 8 ఏళ్ల కూతురు ఉన్న లక్ష్మీనారాయణ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. .@ncbn గారి పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. రాజకీయ కక్షలతో చంద్రబాబుగారు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్‌ ఆర్డర్‌ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది. అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి.… pic.twitter.com/9w3zBRhTub— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2025చంద్రబాబుగారి ఏడాదిపాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి గురైన ఇలాంటి కుటుంబాలెన్నో ఉన్నాయి. లక్ష్మీనారాయణకు జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరిది?, అక్రమకేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?, వ్యవస్థలు సక్రమంగా పనిచేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదా?, ప్రజాసమస్యల పరిష్కారంపై గళమెత్తుతూ వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు టీడీపీ వాళ్లు కక్షగట్టి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్‌నాయుడును కత్తులతో పొడిచి, బండరాయితో కొట్టి చంపేశారు.ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల తరఫున ఎవ్వరూ కార్యక్రమాలు నిర్వహించకూడదా?’ అని నిలదీశారు వైఎస్‌ జగన్‌. మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరుఅలా చేస్తే చంపేస్తారా? పోలీసుల పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్‌ సరిగ్గా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా? , శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడు గుర్రాకులపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయం. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదుకూడా ఇవ్వనీయకుండా టీడీపీ వాళ్లు భయపెట్టారు. నిందితులకు అధికారపార్టీ అండదండలు ఉండడంతో వారిని ఎదిరించే ధైర్యం లేక తండ్రిలేని ఆ బాలిక కుటుంబం ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోయింది. పోలీసులది ప్రేక్షక పాత్రే అయ్యింది. ఈ ఘటనలన్నింటినీ వేర్వేరుగా చూడకూడదు.చట్టాన్ని అపహాస్యం చేసి, బాధితులకు న్యాయాన్ని నిరాకరించి, అధికార పార్టీకి చెందినవారని ఆ నిందితులను స్వేచ్ఛగా వదిలేసినప్పుడు, ఈ పరిణామాలన్నింటినీ మౌనంగా చూస్తున్నప్పుడు కేవలం పాలనమాత్రమే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని నడిపించే వ్యవస్థలన్నీకూడా కుప్పకూలిపోతాయి. చంద్రబాబుగారూ మీరు మీ పద్ధ‌తిని మార్చుకోకపోతే ప్రజలు ఇక ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు. బాధితులకు న్యాయం జరిగేలా వారి తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది.’ అని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.

Canadas  Mark Carney dials modi for g7 invite pm confirms attendance2
‘జీ 7’కు ప్రధాని మోదీకి ఆహ్వానం.. కాంగ్రెస్‌ విమర్శలకు చెక్‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది నిర్వహించబోయే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ఇంతవరకూ ప్రధాని మోదీకి ఆహ్వానం అందలేదంటూ చర్చలు జరుగుతున్న తరుణంలో, కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ‍భారత ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి, ఈ సదస్సుకు ఆహ్వానించారు. జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలోని కననాస్కిస్‌లో ఈ సదస్సు జరగనుంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, జర్మనీ, కెనడా దేశాధినేతలు పాల్గొననున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 నుంచి ప్రతిసారీ జీ-7 దేశాల సమావేశానికి అతిథిగా హాజరవుతూ వస్తున్నారు. అయితే ఈ సారి ప్రధానికి ఈ సదస్సుకు ఆహ్వానం అందించడంలో కాస్త జాప్యం జరిగింది. దీనిపై కాంగ్రెస్‌ స్పందిస్తూ జీ 7 శిఖరాగ్ర సమావేశాలకు భారతదేశానికి ఆహ్వానం అందకపోవడం దౌత్యపరమైన లోపమంటూ విమర్శలు గుప్పించింది. అయితే తాజాగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ జీ7కు ఆహ్వానించేందుకుప్రదాని మోదీకి ఫోన్‌ చేశారు. దీనికి స్పందించిన మోదీ తన హాజరును ధృవీకరించారు.‘కెనడా ప్రధాని @MarkJCarney నుండి కాల్ అందుకోవడం ఆనందంగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంపై అభినందించాను. ఈ నెల చివర్లో కననాస్కిస్‌లో జరిగే జీ7 సమ్మిట్‌కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని తెలిపాను’ అని మోదీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ నేతృత్వంలో జీ 7 శిఖరాగ్ర సమావేశాన్ని జూన్ 15-17 తేదీలలో ఆల్బెర్టాలోని కననాస్కిస్ రిసార్ట్‌లో నిర్వహించనున్నారు.ఇది కూడా చదవండి: తరతరాలు మెచ్చేలా.. రాజ్‌నాథ్‌కు ‘మ్యాంగో మ్యాన్‌’ గిఫ్ట్‌

Gaza Crisis Rs 5 Indian Biscuit Is Being Sold For Rs 2,4003
రూ. 5ల బిస్కట్‌ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం గాజా (Gaza)లో ఇజ్రాయెల్‌ (Israel) మారణహోమాన్ని సృష్టిస్తోంది. వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆహార పంపిణి నిలిపివేత,కరువు నేపథ్యంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. ఇటీవలి ఆహార పంపిణీలో కనిపించిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం. మరోవైపుఆ అవకాశాన్ని క్యాష్‌ చేసుకునేందుకు బ్లాక్‌మార్కెట్‌ దందా జోరందుకుంది. ఏ వస్తువును కొందామన్నా ధర వింటే బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. అతి చవకగా దొరికే పార్లే-జి బిస్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అసలు ధర కంటే దాదాపు 500 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. గాజా నుండి ఇటీవల వైరల్ అయిన పోస్ట్‌ ప్రకారం ముంబైతె తయారయ్యే పార్లే జి బిస్కెట్లు 24 యూరోలకు (రూ.2,342) అమ్ముడవుతున్నాయి. భారత మార్కెట్లో కేవలం 5 రూపాయలకు లభించే ఈ బిస్కెట్ల ధర చూసి సోషల్ మీడియా యూజర్లు దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. ఈ ధరలు దాదాపు 4,300 కి.మీ దూరంలో ఉన్న దేశం నుండి ఎగుమతి అవుతున్న ఒక్క పార్లే-జికే పరిమితం కాదు, అన్ని వస్తువులు పరిస్థితి అలాగే ఉంది.After a long wait, I finally got Ravif her favorite biscuits today. Even though the price jumped from €1.5 to over €24, I just couldn’t deny Rafif her favorite treat. pic.twitter.com/O1dbfWHVTF— Mohammed jawad 🇵🇸 (@Mo7ammed_jawad6) June 1, 2025 "మూడు నెలలకు పైగా సరిహద్దులను మూసివేయడం వల్ల 2 మిలియన్ల మంది ప్రజల అవసరాలను తీర్చలేని చాలా తక్కువ మొత్తంలో ప్రాథమిక అవసరాలు మాత్రమే అనుమతి ఉందనీ, . కాబట్టి కొంతమందిమాత్రమే ఆహారం లభించినపుడు, ఈ ఆహారాలు చాలా ఎక్కువ, భరించలేని ధరలకు అమ్ముడవుతున్నాయని స్థానిక డాక్టర్ అల్షావా చెప్పారని ఎన్‌డీటీవీ తన స్పెషల్‌ రిపోర్ట్‌లో తెలిపింది. సమస్య అసలు సరఫరాదారులతో లేదా పన్నులతో కాదు" "ఈ వస్తువులు సాధారణంగా మానవతా సహాయంగా ఉచితంగా గాజాలోకి వస్తాయి. కానీ అవికొంతమందికి లభ్యమవుతున్నాయి. మిగతావి బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయని ఆయన అన్నారు.ఇదీ చదవండి: వ్యాపారవేత్తతో బాలీవుడ్‌ నటి పెళ్లి, ఐవరీ కలర్‌ లెహంగాలో బ్రైడల్‌ లుక్‌!జూన్ 6 నాటికి ఉత్తర గాజాలో మార్కెట్ ధరలుకిలోల చక్కెర: రూ. 4,914వంట నూనె: రూ. 4,177కిలో బంగాళాదుంపలు: రూ. 1,965కిలో ఉల్లిపాయలు : రూ. 4,423కాఫీ కప్పు: రూ. 1,800 గత గతేడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం మొదలైన తరువాత, గాజాకు ఆహార లభ్యత క్రమంగా తగ్గిపోయింది. ఈ సంవత్సరం మార్చి 2 -మే 19 మధ్య, పాలస్తీనాలో ఆధీన ప్రాంతం దాదాపు మొత్తం దిగ్బంధనను ఎదుర్కొంది. అంతర్జాతీయ ఒత్తిడి తరువాత కేవలం పరిమిత సంఖ్యలో మానవతా ట్రక్కులను మాత్రమే అనుమతినిస్తున్నారు. ఈ గాజా పోరు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటింది. ఈ యుద్ధంలో 54,510 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్‌డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం

YSRCP President YS Jagan Bakrid Wishes To Muslims4
ముస్లింలకు వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

తాడేపల్లి : ముస్లిం సోదర, సోద­రీ­­మ­ణు­లకు వైఎస్సా­ర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభా­కాంక్షలు తెలిపారు. త్యాగాల పండగ బక్రిద్‌ కాగా, త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్‌ పండగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్‌ పండుగ జరుపుకుంటారని, త్యాగనిరతికి ఈ పండుగ నిదర్శమన్నారు. ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని, అల్లాహ్‌ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

bengaluru stampede victims last rites  5
కొడుకా.. లేవరా, 100 కోట్ల ఆస్తి పెట్టాను

యశవంతపుర: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన హాసన్‌ జిల్లా వాసి భూమిక్‌ (20) ఇంటిలో చెప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి విగతజీవి అయ్యాడు. ఇంజనీరింగ్‌ చదువుతున్న భూమిక్‌ మృతితో తండ్రి తల్లడిల్లిపోతున్నారు. 100 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించి భూమిక్‌ కోసం పెట్టానంటూ కొడుకు శవం వద్ద తండ్రి బోరుమంటున్న వీడియో అందరినీ కలిచివేస్తోంది.హాసన్‌ జిల్లా బేలూరు తాలూకా కుప్పుగోడుకు చెందిన లక్ష్మణ, అశ్విని దంపతులకు ఏకైక కుమారుడు భూమిక్‌. బెంగళూరులో ఉంటు ఇంజినీరింగ్‌ రెండో ఏడాది చదువుతున్నాడు. కాలేజీ స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియం వద్దకెళ్లి తొక్కిసలాటలో మరణించాడు. విక్టోరియా ఆస్పత్రిలో గురువారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.పోస్టుమార్టం చేయొద్దుఎంతో ముద్దుగా పెంచాను. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని తండ్రి రోదించాడు. నా కొడుక్కి పోస్టుమార్టం చేయవద్దు, కోసి ముక్కలు చేయొద్దు అని ప్రాధేయపడ్డాడు. సీఎం, డీసీఎం వచ్చి పరామర్శిస్తారు, కానీ నా కుమారుడు రాడంటూ తండ్రి లక్ష్మణ బోరుమన్నాడు. అంబులెన్స్‌ లేని కారణంగా జీపులో భూమిక్‌ మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు.కన్నీటి మధ్య అంత్యక్రియలుతుమకూరు: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన మనోజ్‌ (20) అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య జిల్లాలోని కుణిగల్‌ తాలూకా ఎడెయూరు సమీపంలోని నాగసంద్ర గ్రామంలోని వారి తోటలో జరిగాయి. అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.బెంగళూరులోని హెబ్బాళ సమీపంలోని కెంపాపుర రెసిడెన్సీ కాలేజీలో బీబీఎం చదువుతున్న మనోజ్‌ యలహంకలో తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఉండేవాడు. బుధవారం స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియానికి వెళ్లి అక్కడ జరిగిన తొక్కిసలాటలో మృత్యువాత పడ్డాడు.ప్రభుత్వానిదే బాధ్యత: మంత్రియశవంతపుర: తొక్కిసలాటకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, ఐటీబీటీ మంత్రి ప్రియాంక ఖర్గే తెలిపారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటన జరగిఉండరాదు, ఎక్కువమంది అభిమానులు రావడంతో జరిగింది.సరైన వ్యవస్థలను కల్పించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. ప్రభుత్వం నుంచి లోపం జరిగిన మాట వాస్తవమే, అంగీకరిస్తున్నాం అన్నారు. ఒక ప్లాన్‌ ప్రకారం కార్యక్రమంను నిర్వహించి ఉంటే బాగుండేదని అన్నారు. మంత్రి ప్రకటనను జేడీఎస్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది.చ‌ద‌వండి: పెళ్లి చేసి పంపాల‌నుకున్నాం.. పాడె క‌ట్టి సాగ‌నంపారు

Akkineni Nagarjuna Sher Akhil Wedding Photos6
కుమారుడి పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నాగార్జున

టాలీవుడ్‌ నటుడు అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni) శుక్రవారం తెల్లవారుజామున వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు జైనబ్‌ రవ్జీతో కలిసి ఏడడుగులు వేశారు. ఇదే విషయాన్ని చెబుతూ తాజాగా నాగార్జున ఒక పోస్ట్‌ షేర్‌ చేశారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో చిరంజీవి, రాజమౌళి తనయుడు కార్తికేయ, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జూన్‌ 8న రిసెప్షన్‌ జరగనుంది. ఆ సమయంలో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.అఖిల్‌ వివాహ వేడుక ఫొటోలను అభిమానులతో నాగార్జున పంచుకున్నారు. తన ఆనందాన్ని ఇలా చెప్పుకొచ్చారు. 'మా ప్రియమైన కుమారుడు తనకు ఇష్టమైన జైనాబ్‌ను మా ఇంట్లో (తెల్లవారుజామున 3:35 గంటలకు) వివాహం చేసుకున్నాడు. అమలతో పాటు నేను ఎంతో ఆనందంగా ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ ప్రదేశం మా హృదయాలకు ఎంతో దగ్గరైంది. ఇక్కడ వారు కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. మేము మీ ఆశీర్వాదాలను కోరుకుంటున్నాము. ప్రేమ, కృతజ్ఞతతో అంటూ..' నాగార్జున పోస్ట్‌ చేశారు.అఖిల్‌ సతీమణి జైనబ్ రవ్జీ హైదరాబాద్‌కు చెందిన అమ్మాయినే.. అయితే, ముంబయిలో స్థిరపడింది. ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ ప్రముఖ వ్యాపారవేత్త. రెండేళ్ల క్రితం ఒక ఫంక్షన్‌లో అఖిల్‌-జైనబ్‌ కలుసుకున్నారని తెలుస్తోంది. అలా వీళ్లిద్దరి మధ్య చిగురించిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. With immense joy, Amala and I are delighted to share that our dear son has married his beloved Zainab in a beautiful ceremony (3:35 am) at our home, where our hearts belong. We watched a dream come true surrounded by love, laughter, and those dearest to us.We seek your blessings… pic.twitter.com/jiIDnQrVSk— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 6, 2025

India remains steadfast in its resolve to eradicate terrorism7
కలసి నడిస్తే... కట్టడి చేయొచ్చు!

మానవాళి ఎదుర్కొంటున్న పెను విపత్తు ఉగ్రవాదం. ఇది నాగరిక సమాజపు అత్యు న్నత విలువలకు మాయని మచ్చ. విప్లవం, బలిదానం, హింసను గొప్పగా చేసి చెప్పడం లాంటి తప్పుడు భావనలు ఉగ్రవాదం పెచ్చ రిల్లడానికి ప్రాతిపదికలవుతున్నాయి. ‘ఒక రికి స్వాతంత్య్ర యోధుడైనవాడు మరొకరికి ఉగ్రవాది’ అన్న వాదన అతి ప్రమాదకర మైన అపోహ. భయమూ, రక్తపాతాలపై నిజమైన స్వతంత్రాన్ని ఎన్నటికీ నిర్మించలేం.ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను పెంచుతున్నది భయమే. కానీ, ఆ భయాన్ని వ్యాపింపజేయడంలోనూ ఉగ్రవాదులు విఫలురయ్యారు. 26/11 దాడి, 2001లో భారత పార్లమెంటుపై దాడి, ఇటీవలి పహల్‌ గామ్‌ దాడి... ఘటన ఏదయినా, భారత్‌ దృఢంగా నిలబడింది. ఉగ్రవాదుల దుష్ట పన్నాగంపాకిస్తాన్ నుంచి ప్రభుత్వ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదా నికి దశాబ్దాలుగా మనం బాధితులం. పర్యాటకులను వారి మతమే మిటో అడిగి మరీ చంపేయడాన్ని బట్టి ఉగ్రవాదుల పన్నాగం స్పష్టమవుతోంది. దేశ ఐక్యతకు ముప్పు కలిగించాలన్న దురుద్దేశంతో, వివిధ విశ్వాసాలకు చెందిన పలు ఆధ్యాత్మిక ప్రదేశాలపై పాక్‌ దాడికి తెగబడటం కూడా ఇలాంటి చర్యే. ఇలాంటి దుర్మార్గపు చర్యలను ఏ మతమూ ఆమోదించదు. ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా మతాన్ని దుర్వినియోగం చేస్తూ, తమ ఆటవిక చర్యలకు సమర్థింపుగా దాన్ని వాడుకుంటున్నారు. ఈ మత దుర్వినియోగం ప్రమాదవశాత్తు జరిగినదో, లేదా హఠాత్పరిణా మమో కాదు, ఇది ఉద్దేశపూర్వక పన్నాగం. దురాగతాలకు తప్పుడు సమర్థనలను చెప్పుకునే కుటిల వ్యూహం.ఉగ్రవాదాన్ని ఎంతమాత్రమూ సహించబోమన్న విధానాన్ని భారత్‌ స్పష్టం చేసింది. ఉగ్రవాద చర్యలూ, చర్చలూ ఒకేసారి సాధ్యం కావు. భవిష్యత్తులో పాకిస్తాన్ తో జరిగే ఏ చర్చలయినా ఉగ్రవాదం, పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌పైనే ప్రధానంగా దృష్టి పెడ తాయి. పాకిస్తాన్ నిజంగా ఉగ్రవాదాన్ని తీవ్రమైనదిగా పరిగణిస్తే ఐక్యరాజ్యసమితి గుర్తించిన హఫీజ్‌ సయీద్, మసూద్‌ అజార్‌ వంటి ఉగ్రవాదులను అప్పగించాలి.పాక్‌ మూల్యం చెల్లించాలి!మనం చాలాకాలంగా దీర్ఘకాలిక దృక్పథంతో, సమర్థమైన వ్యూహాలను అన్వేషిస్తూనే ఉగ్రవాద చర్యలపై ప్రతిస్పందించాం. మన సాయుధ దళాలకు గతంలో రక్షణాత్మక చర్యలకు మాత్రమే అనుమతి ఉండేది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ (2016), బాలాకోట్‌ దాడులు (2019), ఇప్పుడు ఆపరేషన్‌ సిందూర్‌ (2025)లతో పాక్‌లోని ఉగ్ర వాదులు, ఉగ్రవాద సూత్రధారుల పట్ల తన వైఖరిలో భారత్‌ సమూల మార్పులు చేసింది. నైతిక, రాజకీయ అసమ్మతితోపాటు కేవలం రక్షణాత్మక వైఖరి ఇక సరిపోదని ఇప్పుడు తేటతెల్లమైంది. ఏ ఉగ్ర వాద చర్యనైనా ఇకపై యుద్ధ చర్యగానే పరిగణిస్తాం. భారత్‌పై ఏ ఉగ్రవాద దాడి జరిగినా... ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికీ ఉగ్రవాదులకూ తేడా లేదనే భావిస్తూ దీటుగా బదులిస్తాం. పాక్‌ తన గడ్డపై ఉగ్రవాదులను నిలువరించలేకపోతే, ఆ అసమర్థతకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.ఉగ్రవాదానికి ఆర్థిక చేయూతను నిరోధించడంపై న్యూఢిల్లీలో నిర్వహించిన ‘నో మనీ ఫర్‌ టెర్రర్‌’ మూడో మంత్రివర్గ సదస్సులో ప్రధాని మోదీ, ‘‘ఒక్క దాడినీ తేలిగ్గా తీసుకోం, ఒక్క ప్రాణం పోయినా తీవ్రంగా పరిగణిస్తాం. కాబట్టి, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించే వరకు మేము విశ్రమించబోం’’ అని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి మనం కట్టుబడి ఉన్నామని ఆప రేషన్‌ సిందూర్‌ ద్వారా భారత ప్రభుత్వం, సాయుధ బలగాలు ప్రపంచానికి చాటాయి. స్పష్టమైన, కచ్చితమైన, తీవ్రతరం కాని ఆపరేషన్‌ ద్వారా, పాకిస్తాన్, పాక్‌ ఆక్రమిత జమ్మూ–కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను మనం లక్ష్యంగా చేసుకున్నాం. ఉగ్రవాదులపై సైనిక చర్య ఆవశ్యకమనీ, కానీ అదొక్కటే సరి పోదనీ మనకు తెలుసు. పాక్‌ ఉగ్రవాదాన్ని సాధనంగా ఉపయో గిస్తుండటంతో... ఆ దేశాన్ని దౌత్యపరంగానూ, ఆర్థికంగానూ ఏకాకిని చేయడంలో భారత్‌ విజయం సాధించింది. పాక్‌ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతివ్వడాన్ని పూర్తిగా మానేసే వరకూ, ఆ దిశగా విశ్వసనీయతను పొందే వరకూ సింధూ జలాల ఒప్పందాన్ని మనం ‘నిలిపివేశాం’. ఈ నిర్ణయం పాక్‌పై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఆ దేశం తన 1.6 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమికి 80%, మొత్తం నీటి వినియోగంలో 93% సింధూనది వ్యవస్థపైనే ఆధారపడుతుంది. అలాగే 23.7 కోట్ల మంది దీనిపై ఆధారపడి ఉండగా, పాక్‌ జీడీపీలో నాలుగో వంతుకు ఇదే దోహదపడుతోంది.ఐదు కీలక చర్యలు!ఉగ్రవాదం కేవలం భారత్‌ సమస్యే కాదు, ఇది ప్రపంచ సమస్య. అంతర్జాతీయ ఉగ్రవాద సూచీ (జీటీఐ) ప్రకారం– ఉగ్ర వాద సంఘటనలను ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య కొన్నేళ్లుగా పెరిగింది. ఉగ్రవాద వ్యవస్థలను సమర్థంగా నిర్వీర్యం చేయడానికీ, రాబోయే తరాలకు భద్రమైన భవిష్యత్తును అందించడానికీ మనం సమష్టిగా ముందుకు సాగాలి. సూత్రప్రాయమైన, సమగ్రమైన, స్థిరమైన, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ వ్యూహాన్ని మనం అవలంబించాలి. ఈ దిశగా అయిదు కీలక చర్యలు తీసుకోవాలి.మొదటిది: ‘ఉగ్రవాదం’ పదాన్ని నిర్వచించడం. ఉగ్రవాదమంటే ఏమిటన్న దానిపై ఏకాభిప్రాయం లేదు. భారత్‌ ప్రతిపాదన ఆధారంగా ఐక్యరాజ్యసమితిలో జరిగిన ‘అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమగ్ర ఒడంబడిక’లో ఉగ్రవాద నిర్వచనం విషయంలో అతి సమీపంగా వచ్చాం. అర్థపరమైన అంశాలు ఉగ్రవాదంపై పోరా టాన్ని పరిమితం చేయకూడదు. ఉగ్రవాద చర్యల దర్యాప్తునకు లేదా విచారణకు లేదా విదేశాల నుంచి వారిని అప్పగించేందుకు విస్తృతంగా ఆమోదం పొందిన నిర్వచనం అవసరం.రెండోది: ఉగ్రవాద సంస్థలవే కాకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్స హిస్తున్న దేశాల ఆర్థిక వనరులను కూడా స్తంభింపజేయాలి. పాక్‌కు ఇచ్చే నిధులు సైనిక–ఉగ్రవాద చర్యలు రెండింటితో ప్రపంచాన్ని అస్థిరపరచడానికే దారితీస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి, పాకిస్తాన్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ తిరిగి గ్రే లిస్టులో చేర్చాల్సిన అవసరముంది. మూడోది: పాకిస్తాన్‌లో ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తులు ఒకే నాణేనికి రెండు పార్శా్వల వంటివని తెలిసిన విషయమే. ఉగ్రవాదు లకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం, సైనికాధి కారులు యూనిఫామ్‌లో హాజరు కావడం దీన్ని మరింతగా తేట తెల్లం చేస్తోంది. పాకిస్తాన్ లో అణ్వాయుధాలు ప్రభుత్వేతర సంస్థల చేతికి చేరే ప్రమాదం ఎప్పటికైనా ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ తీవ్రమైన ప్రమాదాన్ని గుర్తించి, పాక్‌ అణ్వాయుధాలను అంతర్జా తీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షణలో ఉంచాలి.నాలుగోది: తమ సౌలభ్యం లేదా ప్రయోజనాల ప్రాతిపదికన మాత్రమే ఏ ఉగ్రవాద చర్యలను ఖండించాలో దేశాలు నిర్ణయించుకుంటే– అది సమష్టి బాధ్యతను బలహీనపరుస్తుంది. అటువంటి చర్యలకు అది వ్యూహాత్మకమైన సమర్థింపునూ అందిస్తుంది.అయిదోది: కృత్రిమ మేధ, అటానమస్‌ సిస్టమ్స్, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ వంటి అధునాతనసాంకేతికతలను కూడా స్వీకరిస్తున్న పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు ప్రపంచమంతటికీ ప్రమాదకరమే. ఈ ముప్పులను అధిగమించడం కోసం అంతర్జాతీయ సహకారం అత్యావశ్యం. 9/11 దాడుల అనంతరం, ‘‘ఉగ్రవాదానికి సంబంధించి ఏ సైద్ధాంతిక, రాజకీయ లేదా మతపరమైన సమర్థననైనా మనందృఢంగా ఖండించాలి’’ అని నాటి భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో పేర్కొన్నారు. ఏ రూపంలో ఉన్నా సరే, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్న సంకల్పానికి భారత్‌ స్థిరంగా కట్టుబడి ఉంది. శాంతికాముక దేశాలన్నీ మాతో కలిసి రావాలని కోరుతున్నాం. - వ్యాసకర్త భారత రక్షణ మంత్రి-రాజ్‌నాథ్‌ సింగ్‌

Official announcement that a census will be conducted in the country8
ఎట్టకేలకు జనగణన

దేశంలో జనగణన నిర్వహించబోతున్నట్టు ఆరేళ్ల సుదీర్ఘ జాప్యం అనంతరం బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఈనెల 16న విడుదల చేస్తామని, 2027 మార్చి 1తో ఈ మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అందులో తెలియజేశారు. అంటే ఆ ఏడాది ఫిబ్రవరి 28తో జనగణనను ముగిస్తారన్నమాట. మంచు కురిసే లద్దాఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వచ్చే ఏడాది అక్టోబర్‌ 1కల్లా జనగణన ప్రక్రియ ముగుస్తుంది. అంటే సెప్టెంబర్‌ నెలాఖరుకు జనగణన పూర్తవుతుంది. ఈ నెల 16న నోటిఫికేషన్‌ విడుదల కాబోతోంది. ఆ తర్వాతగానీ మెథడాలజీ తదితర వివరాలపై స్పష్టత రాదు. ప్రక్రియ ముగించదల్చుకున్న తేదీని గమనిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి తుది గణాంకాలు వెల్లడికావొచ్చని తెలుస్తోంది. కనుక ప్రస్తుత లోక్‌సభ గడువు ముగిసేలోగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఉండకపోవచ్చు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి జనగణనతోపాటు కులగణన కూడా వుండబోతోంది. రాజకీ యంగా, సామాజికంగా సంచలనం కలిగించగల కులగణన స్వరూప స్వభావాలేమిటో తెలియా లన్నా నోటిఫికేషన్‌ వచ్చేవరకూ ఆగాల్సిందే. జనగణన రెండు దశల్లో వుంటుంది. మంచుకురిసే ప్రాంతాలు మినహా దేశంలో మిగిలినచోట్ల వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌ నెలల్లో తొలి దశఉంటుంది. అందులో నివాస గృహాలు, వాటి యాజమాన్య వివరాలు, నివాసం వుండేవారి సంఖ్య, వారికి ఎలాంటి సౌకర్యాలున్నాయో, ఏయే వాహనాలున్నాయో లెక్కేస్తారు. రెండో దశలో ఇంటి యజమాని పేరు, ఆయన భార్యాపిల్లలు, విద్యార్హతలు, ఉద్యోగ వ్యాపార వివరాలు, ఆదాయ వనరులు, కులమతాలు వగైరాలు తెలుసుకుంటారు. ప్రభుత్వాలకు డేటా ప్రాణప్రదమైనది. ఏ విధానం రూపొందించాలన్నా, ఏ పథకం ప్రవేశ పెట్టాలన్నా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా వాటి లబ్ధిదారులెందరు, ప్రభుత్వ నిర్ణయాల ప్రభావం ఎందరిపై పడుతుంది వగైరా అంశాలన్నీ అవసరమవుతాయి. దేశంలో పట్టణీకరణ విస్తృతి, స్త్రీ పురుష నిష్పత్తి, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, వలసలు, నివాసగృహాల తీరుతెన్నులు వగైరాలన్నీ జనగణనలోనే వెల్లడవుతాయి. మహిళలకు అవసరమైన పథకాలకూ, దారిద్య్ర నిర్మూలన పథకాల రూపకల్పనకూ, గృహనిర్మాణం, ఉపాధి హామీ పథకం వంటివి ఎక్కడెక్కడ అవసరమో తేల్చడానికి జనగణనే ఆధారం. ఒక్కమాటలో చెప్పాలంటే దేశ సంపూర్ణ ముఖచిత్రం ఈ జనగణన ద్వారా ఆవిష్కృతమవుతుంది. ఆఖరుగా 2011లో జనగణన జరిగింది గనుక 2021లో వాస్తవంగా తదుపరి జనగణన వుండాలి. అది మొదలుకాబోతోందని 2019 డిసెంబర్‌లో కేంద్రం ప్రకటించింది కూడా. ఆ ప్రక్రియ తొలి దశ 2020లో మొదలయ్యేలోగానే కరోనా మహ మ్మారి విరుచుకుపడటంతో జనగణన కాస్తా మూలనబడింది. ఆ తర్వాతైనా దాన్ని ప్రారంభించా లన్న ఆసక్తి కేంద్రంలో ఎందుకనో కనబడలేదు. కారణాలేమిటో కూడా చెప్పలేదు. కరోనా ప్రభావం తగ్గాక ప్రపంచంలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి 143 దేశాలు యుద్ధప్రాతిపదికన జనగణన పూర్తిచేశాయి. మనతోసహా 44 దేశాలు మాత్రమే దానికి దూరంగా వున్నాయి. కేంద్ర హోంశాఖ ప్రతినిధి చెప్పినట్టు అప్పుడు జనగణన పూర్తయిన దేశాల్లో లభ్యమైన డేటా నాణ్యమైనది, సమగ్రమైనదీ కాదని తేలివుండొచ్చు. కానీ విధాన నిర్ణయాల రూప కల్పనలో అక్కడి ప్రభుత్వాలకు ఎంతో కొంత పనికొచ్చింది. అసలు లేనిదానికన్నా ఇది మేలే. మన వరకూ చూస్తే జనగణన ఆలస్యం వల్ల విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు వంటి 15 అతి కీలకమైన సర్వేలు నిలిచిపోయాయి. ఫలితంగా పథకాల అమలు చీకట్లో తడుములాటగా మిగిలింది.దేశంలో చాలామంది, ముఖ్యంగా రాజకీయంగా చురుగ్గా ఉండదల్చుకున్నవారు ఎదురు చూసేది నియోజకవర్గాల పునర్విభజన గురించే. 1971 జనాభా లెక్కల ఆధారంగా 1973లో లోక్‌ సభ స్థానాల సంఖ్యను 543గా నిర్ధారించారు. ఆ తర్వాత పునర్విభజన జోలికెళ్తే సమస్య లెదురవు తాయన్న భయంతో రెండు రాజ్యాంగ సవరణల ద్వారా దాన్నే కొనసాగిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రా ల్లోనూ, తూర్పునున్న హిందీయేతర రాష్ట్రాల్లోనూ, దక్షిణాది రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వ కుటుంబ నియంత్రణ సమర్థంగా అమలుకావటంతో జనాభా రేటు నియంత్రణలో వుంది. కానీ హిందీ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆ విషయంలో చొరవచూపలేదు. దాంతో అక్కడ జనాభా పెరిగింది. జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన ప్రక్రియవుంటుంది కనుక తమ ప్రాంతాల్లో లోక్‌సభ స్థానాలు గణనీయంగా తగ్గుతాయని హిందీయేతర రాష్ట్రాలు వాదిస్తున్నాయి. 2011నాటి జనగణన తుది ఫలితాలు 2013లో వెల్లడయ్యాయి. ఇప్పుడు కూడా అదే సమయంపడితే 2029లోగానీ పూర్తి ఫలితాలు రావు. ఆ తర్వాతే పునర్విభజన ప్రక్రియ ఉంటుందని భావించాలి. జాప్యం మాటెలావున్నా జనగణన ప్రారంభం కాబోతోందన్న ప్రకటన హర్షించదగ్గది. సాధా రణ ప్రజానీకానికి జనగణనపై పెద్దగా ఆసక్తివుండదు. కానీ విధాన నిర్ణేతలూ, విశ్లేషకులూ దీన్ని ప్రాణప్రదంగా భావిస్తారు. ఎందుకంటే అన్ని రకాల సర్వేలకూ ఇదే ప్రాతిపదిక. నేతలూ, పార్టీలూ సరేసరి. ఎవరినుద్దేశించి ఎలాంటి పథకాలు రూపొందించాలో, ఏ సమస్యల్ని ప్రధానంగా ప్రస్తావించాలో నిర్ణయించుకోవటానికి జనగణన తోడ్పడుతుంది. ఈ ప్రక్రియకు అధునాతన సాంకేతికతను సద్వినియోగం చేసుకోవటం, పారదర్శకతకు చోటీయటం అవసరం. ఇక 1931 తర్వాత తొలిసారి కులగణన జరుగుతున్నందువల్ల వివాదాలు తలెత్తకుండా జాగరూకతతో వ్యవహరించాలి.

India to face Netherlands today in FIH Pro League Hockey9
‘ఆఖరి’ అంచెకు భారత్‌ ‘సై’

అమ్‌స్టెల్వీన్‌ (నెదర్లాండ్స్‌): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ లీగ్‌ హాకీ ఆఖరి అంచె పోటీలకు భారత జట్లు సిద్ధమయ్యాయి. ఈ యూరో అంచె పోటీల్లో అంచనాలకు మించి రాణించాలని, గరిష్ట పాయింట్లతో నేరుగా ప్రపంచకప్‌ బెర్తు సాధించాలని పురుషుల, మహిళల జట్లు పట్టుదలతో ఉన్నాయి. ముందుగా భారత పురుషుల జట్టు నేడు ఆతిథ్య నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. భువనేశ్వర్‌ అంచె పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన భారత్‌ వచ్చే ప్రపంచకప్‌కు వేదికైన నెదర్లాండ్స్‌లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. నేడు, 9వ తేదీన డచ్‌ టీమ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం ద్వారా యూరో అంచెకు శుభారంభం పలకాలని హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలోని భారత్‌ భావిస్తోంది. ప్రస్తుతం 15 పాయింట్లతో ఇంగ్లండ్‌ (16), బెల్జియం (16)ల తర్వాత మూడో స్థానంలో ఉన్న హర్మన్‌ బృందం ఈ ఆఖరి అంచె పోటీలతో మెరుగైన స్థానంలో నిలవాలని ఆశిస్తోంది. డ్రాగ్‌ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్, మిడ్‌ఫీల్డ్‌లో హార్దిక్‌ సింగ్‌లతో పాటు రక్షణ శ్రేణిలో అమిత్‌ రోహిదాస్, హర్మన్, జుగ్‌రాజ్, జర్మన్‌ప్రీత్‌లు స్థాయికి తగిన ఆటతీరును కనబరిస్తే గెలుపు ఏమంత కష్టం కాదు. భారత చీఫ్‌ కోచ్‌ క్రెయిగ్‌ ఫుల్టన్‌ తమ జట్టు అన్ని రంగాల్లోనూ మెరుగైందని, యువ ఆటగాళ్లు సైతం అనుభవం సంపాదించారని తప్పకుండా ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారని అన్నాడు. నెదర్లాండ్స్‌తో పోరు ముగిశాక భారత్‌ 11, 12 తేదీల్లో అర్జెంటీనాతో, 14, 15 తేదీల్లో ఆ్రస్టేలియాతో, 21, 22 తేదీల్లో బెల్జియంతో తలపడుతుంది. మరోవైపు మహిళల జట్టు యూరో అంచె పోటీలను లండన్‌లో ఆడనుంది. ఈ నెల 14 నుంచి భారత మహిళల జట్టు పోరు ప్రారంభం అవుతుంది. భారత జట్టు తొమ్మిది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు రెండింటిలో మాత్రమే గెలిచింది.

CM Revanth Reddy visit to Aleru Constituency of Yadadri District10
పదేళ్లు పగ్గాలివ్వండి

సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్‌ పార్టీకి పదేళ్లు పాలించే అధికారం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. తెలంగాణను అన్నివిధాలా అభివృద్ధి చేసి తీరుతామని ఆయన చెప్పారు. ‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పడగొడతానని ఆనాడు తొడగొట్టి చెప్పి పట్టు పట్టినం.. పడగొట్టినం. ఇవాళ ముఖ్యమంత్రిగా మీ ముందున్నా. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యం’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిర్మలాపురంలో రూ. 1,051.45 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రధానంగా రూ. 574.56 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్‌ నిర్మాణం, రూ. 200 కోట్లతో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్, రూ. 183 కోట్లతో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టారు. అనంతరం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధ్యక్షతన తిర్మలాపురంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.దేశంలో ఎవరూ చేయని విధంగా కులగణన ద్వారా బీసీల లెక్క తేల్చి 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కులగణన చేసే అనివార్యతను కల్పించామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి దశాబ్దాల కలను నెరవేర్చామని చెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు లాంటీ సీనియర్‌ నేత ఎస్సీ వర్గీకరణపై తనను అభినందించారని సీఎం చెప్పారు.గత ప్రభుత్వం గంధమల్ల, మూసీ కాలువల ఆధునీకరణ, ఎస్‌ఎల్‌బీసీ, డిండి వంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్‌ నిలదీశారు. గంధమల్లకు నీళ్లు ఎలా ఇస్తారని కొందరు అడుగుతున్నారని.. నిధులిచి్చన తమకు గంధమల్లకు నీళ్లు ఎలా ఇవ్వాలో తెలియదా? అని సీఎం బీఆర్‌ఎస్‌ నాయకులను ప్రశ్నించారు. గోదావరి జలాలను అందించడానికి ఎస్సారెస్పీ, మిడ్‌ మానేరు కట్టింది కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కాదా అని ఆయన అడిగారు. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలను కోటీశ్వరులను చేసే బృహత్తర కార్యక్రమం చేపట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళా సంఘాలకు రూ. 21 వేల కోట్ల మేర బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణను ఆడబిడ్డల చేతిలో పెట్టామన్నారు. ప్రజాపాలనలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాసంక్షేమమే «ధ్యేయంగా పనిచేస్తున్నామని రేవంత్‌ వివరించారు. తిరుమల తరహాలో త్వరలో యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా? ‘బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారు. గతేడాది నవంబర్‌ 8న పాదయాత్ర చేసి మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరతామని మాట ఇచ్చా. ఎవరు అడ్డుపడినా మూసీ నదిని పునరుజ్జీవం చేసి తీరుతాం. ప్రధాని మోదీ సబర్మతి, యమునా నదుల ప్రక్షాళన, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ గంగానది ప్రక్షాళన చేసుకోవచ్చుగానీ మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా?’అని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. వాసాలమర్రిని బాగుచేస్తా.. కేసీఆర్‌ ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు రోడ్డు వేసుకోవడానికి వాసాలమర్రి ప్రజలను మోసం చేశారని సీఎం రేవంత్‌ ఆరోపించారు. ‘ఆనాడు వాసాలమర్రికి వచ్చి ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు పండు ఇచ్చి ఆసుపత్రిపాలు చేసిండు. వాసాలమర్రిలో ఇళ్లు కూలగొట్టి శ్మశానంగా మార్చిండు. ఆయన ఆగం చేసినా వాసాలమర్రి గ్రామ పరిస్థితిని బాగు చేస్తా’అని సీఎం రేవంత్‌ చెప్పారు. ఇందుకోసం గ్రామ పరిస్థితిని అధ్యయనం చేయాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి సూచించారు. ఆలేరును అభివృద్ధి చేస్తా.. బలహీనవర్గాల బిడ్డ బీర్ల ఐలయ్యను ఎమ్మెల్యేగా గెలిపించిన ఆలేరు ప్రజలకు అండగా ఉంటానని సీఎం రేవంత్‌ అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేస్తామని అందరికీ మాట ఇస్తున్నా అని చెప్పారు. అడగకున్నా ఐలయ్యకు ప్రభుత్వ విప్‌ పదవి ఇచ్చానని సీఎం చెప్పారు. దెయ్యాల రాష్ట్ర సమితిగా పిలవండి బీఆర్‌ఎస్‌ను ఇకపై దెయ్యాల రాష్ట్ర సమితి (డీఆర్‌ఎస్‌)గా పిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో దెయ్యాలు ఉన్నాయని ఆ ఇంటి బిడ్డనే బయటపెట్టినా ఆ దెయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కొరివి దెయ్యాలను తెలంగాణ రాష్ట్రం పొలిమేరల వరకు తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఒక్క నోటీసు ఇస్తేనే ఆయన ఆగమాగం అయితుండు. కోర్టుకు వచ్చి జవాబు చెప్పాల్సింది పోయి విమర్శలు చేస్తుండు’అని విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు లాంటి వ్యక్తులే కోర్టుకు హాజరయ్యారని రేవంత్‌ గుర్తుచేశారు. ఉద్యోగులకు అండగా ఉంటాం.. రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని సీఎం రేవంత్‌ చెప్పారు. గత ప్రభుత్వం విడతలవారీగా వేతనాలు ఇచి్చందని.. కానీ ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచన్‌గా జీతాలు ఇస్తున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు ఇచి్చన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని చెప్పారు రూ. వెయ్యి కోట్లకు శంకుస్థాపన చరిత్రాత్మకం: మంత్రి ఉత్తమ్‌ ఆలేరు నియోజకవర్గానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించి శంకుస్థాపన చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే 80 శాతం జనానికి సన్నబియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని చెప్పారు. గత ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసి దొడ్డు బియ్యం ఇచి్చందన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న గంధమల్ల చెరువుకు జీవం పోసేందుకు రూ. 574.56 కోట్లతో 1.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణం చేస్తున్నామన్నారు. ఎవరు అడ్డుపడినా గంధమల్ల రిజర్వాయర్‌ను పూర్తి చేసి 60 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్‌ స్పష్టం చేశారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి కోమటిరెడ్డి పేదలందరికీ రూ. 5 లక్షల చొప్పున ఖర్చు చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రూ. 210 కోట్లు ఖర్చు చేసి ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీళ్లు ఇచ్చేలా పైపాప్‌లైన్‌ పనులను ప్రారంభించామన్నారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో ఈ పైప్‌లైన్లను మూడు నెలల్లో పూర్తి చేసి భగీరథ నీళ్లు అందిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, సోనియా గాంధీ కలలు కన్న తెలంగాణాను, రాహుల్‌ గాంధీ ఆలోచనలను నిజం చేస్తున్న నాయకుడు రేవంత్‌రెడ్డి అని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య కొనియాడారు. ఆలేరు నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలన్నారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వర్‌రావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తీన్మార్‌ మల్లన్న, శంకర్‌నాయక్, శ్రీపాల్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement