
మహిళ హత్యకేసులో ముద్దాయికి యావజ్జీవం
అనంతపురం: మహిళను హత్య చేసిన కేసులో ముద్దాయికి కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. వివరాలు.. అనంతపురం రంగస్వామి నగర్లో నివాసం ఉంటున్న రవి, రామాంజినమ్మ (25) దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. రామాంజినమ్మకు నార్పల మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన దూదేకుల సిద్ధయ్యతో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ ఎక్కిడికై నా వెళ్లి జీవిద్దామనుకుని సిద్ధయ్య వెంట రామాంజినమ్మ కొన్ని రోజులకే వెళ్లిపోయింది. అలా వెళ్లిన వీరు కళ్యాణదుర్గం రోడ్డు బైపాస్ సమీపంలోని ఒక గదిలో తలదాచుకున్నారు. ఈ క్రమంలో రామాంజినమ్మ తన వెంట తెచ్చుకున్న బంగారు, నగదుపై సిద్ధయ్య కన్నేశాడు. ఆమెను మభ్య పెట్టి 5 తులాల బంగారు, నగలు, రూ.3 వేలు తీసుకుని ఆటో కొనుగోలు చేశాడు. తనను వివాహం చేసుకోవాలని సిద్ధయ్యను రామాంజినమ్మ కోరడంతో ఆమెను హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. ప్రస్తుతం తామున్న ఇంటిని ఖాళీ చేద్దామని, నగర శివారులోని సెయింట్ ఆన్స్ స్కూలు సమీపంలోని మబ్బుకొట్టాలలో తాను చూసిన ఇంట్లో చేరదామని చెప్పి అనుమానం రాకుండా కొన్ని సామాన్లతో 2014 ఫిబ్రవరి 25న ఆటోలో రామాంజినమ్మను ఎక్కించుకుని బయలుదేరాడు. నగర పరిధిలోని ఇంద్రజిత్ నగర్ వద్ద కంపచెట్లలోకి తీసుకెళ్లి బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు.అనంతరం మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. హత్య చేసిన మూడు రోజుల తర్వాత మళ్లీ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించాడు. మృతదేహం కంపు కొట్టడంతో పాటు గుర్తు పట్టలేని రీతిలో ఉండటంతో ఇక తనకేం ఇబ్బంది ఉండదని భావించి, అక్కడి నుంచి నేరుగా గోరంట్లలో పూల వ్యాపారం చేసే తన అన్న వద్దకు చేరుకున్నాడు. సిద్ధయ్య నడవడికపై అప్పటి గోరంట్ల ఎస్ఐకి అనుమానం వచ్చి విచారించగా, రామాంజినమ్మ హత్య విషయం వెలుగు చూసింది. ఈ క్రమంలోనే మృతురాలి భర్త వడ్డే రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, ముద్దాయి సిద్ధయ్య వీఆర్వో వద్ద లొంగిపోయాడు. దీనిపై అప్పట్లో సీఐగా ఉన్న దేవానంద్ కోర్టులో చార్జ్షీటు దాఖలు చేశారు. అనంతపురంలోని నాలుగో అదనపు జిల్లా కోర్టులో కేసు నడిచింది. కేసులో 8 మంది సాక్షులను నాలుగో అదనపు జిల్లా జడ్జి శోభారాణి విచారించారు. ముద్దాయిపై నేరం రుజువు కావడంతో బుధవారం తీర్పు వెలువరించారు. దూదేకుల సిద్ధయ్యకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ సుజన వాదించారు. కోర్టు మానిటరింగ్ సిస్టం సీఐ వెంకటేష్ నాయక్, కోర్టు లైజన్ ఆఫీసర్ శ్రీనివాసులు (ఏఎస్ఐ), కోర్టు కానిస్టేబుల్ శౌ రెడ్డి, త్రీ టౌన్ పీసీ హెచ్. నాగరాజులు నిందితుడికి శిక్ష పడేలా కృషి చేశారు.

మహిళ హత్యకేసులో ముద్దాయికి యావజ్జీవం