గార్లదిన్నె: అదనపు కట్నం కోసం భార్యను వేధించిన కేసులో ముద్దాయికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం అనంతపురం స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి జె.సుజిన్కుమార్ వెల్లడించారు. ఈ మేరకు గార్లదిన్నె ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా శుక్రవారం వెల్లడించారు. కల్లూరుకు చెందిన ప్రసాద్కు అదే గ్రామానికి చెందిన సుహాసినితో 2017లో పెద్దల సమక్షంలో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో భర్త ప్రసాద్, అత్త, మరిది కలసి అదనపు కట్నం తీసుకురావాలంటూ తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ 2019లో గార్లదిన్నె పోలీసులకు బాధితురాలు సుహాసిని ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం సెక్షన్ ఐపీసీ34, 498ఏ కింద అప్పటి ఎస్ఐ ఆంజనేయులు కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు వాదనలు అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చాయి. సాక్షుల విచారణ అనంతరం అత్త, మరిది నిర్దోషులుగా తేలారు. నేరం రుజువు కావడంతో ముద్దాయి ప్రసాద్కు ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సుజిన్కుమార్ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలను పీపీ కె.శ్రీనివాసులు వినిపించారు.
ఇంటిపై నుంచి
కిందపడి వైద్యుడి మృతి
అనంతపురం: ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి కిందపడి ఓ వైద్యుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం నగరంలోని రెవెన్యూ కాలనీలో నివాసముంటున్న డాక్టర్ అమిలినేని మధు (49)కు భార్య డాక్టర్ సుష్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. దంపతులిద్దరూ దంత వైద్యులు కావడంతో నగరంలోని క్లాక్ టవర్ సమీపంలో ఓ ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం ఇంటిపైన నాలుగో అంతస్తులో ఉన్న వాటర్ ట్యాంక్ను పరిశీలించేందుకు డాక్టర్ అమిలినేని మధు వెళ్లాడు. గోడపైకి ఎక్కి వాటర్ ట్యాంక్ మూత తీసి పరిశీలిస్తుండగా, ప్రమాదవశాత్తు కాలు జారి పై నుంచి కిందకు పడడంతో వెన్నముక, కాళ్లు విరిగాయి. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డాక్టర్ సుష్మ ఫిర్యాదు మేరకు అనంతపురం మూడో పట్టణ సీఐ కె.శాంతిలాల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.