
సాక్షి, అమరావతి: 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తమను సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించేందుకు ఆమోదం తెలిపిన సీఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు పాల్గొన్నారు.
మా కలలను సీఎం నిజం చేశారు
అనంతరం డీఎస్సీ అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ.. 2,193 మంది అభ్యర్థుల కుటుంబాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారన్నారు. తమ సమస్య పరిష్కారమయ్యేలా కృషిచేసిన అందరికీ ధన్యవాదాలని బీఈడీ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు పిల్లా వెలుగు జ్యోతి అన్నారు. 13 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన తమకు న్యాయం చేసి తమ కలను నిజం చేసిన సీఎంకు, ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని విశాఖకు చెందిన సంధ్య అన్నారు.