Department of Education
-
పరీక్షల వేళ.. ఫీజుల పేచీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పలు యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకూ ఆందోళన కొనసాగించాలని భావిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇంతకుముందే గత నెల 14 నుంచి నాలుగు రోజుల పాటు ప్రైవేటు కాలేజీలను యాజమాన్యాలు మూసివేశాయి. 17వ తేదీన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారంలో బకాయిలు చెల్లిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో... ఆందోళన విరమిస్తున్నట్టు యాజమాన్యాలు ప్రకటించాయి. కానీ ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని, దీనితో పరీక్షలు బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నుంచి, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, కాలేజీల తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7 లక్షల మంది డిగ్రీ, పీజీ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందంటూ.. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, సిబ్బందికి వేతనాలు ఇవ్వడం కూడా కష్టంగా మారిందని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బకాయిలు చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికే నాలుగైదు నెలలుగా సిబ్బందికి సరిగా వేతనాలు చెల్లించలేదని.. భవనాల అద్దె, ఇతర ఖర్చులకూ ఇబ్బంది నెలకొందని పేర్కొంటున్నాయి. పరీక్షలు జరగనివ్వండి ప్లీజ్: ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చర్చలు జరిపారు. ఈ వివరాలను ఆయన మీడియాకు తెలిపారు. పరీక్షలు బహిష్కరిస్తే విద్యార్థులు ఆందోళన చెందే అవకాశం ఉందని.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఆందోళనకు దిగవద్దని కాలేజీలను కోరానని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం సీఎం కలవాలని సూచించినట్టు చెప్పారు. వారు పరిస్థితిని అర్థం చేసుకుంటానే నమ్మకం కలిగిందన్నారు. బకాయిలు చెల్లించాలి గత నెలలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి హామీ మేరకు ఆందోళన విరమించాం. కానీ ఆ హామీ నిలబెట్టుకోలేదు. కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. మా నిరసన తెలియజేయడానికే నవంబర్ 19 నుంచి కాలేజీల్లో నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించాం. – డాక్టర్ బొజ్జ సూర్యనారాయణరెడ్డి, ప్రైవేటు పీజీ, డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు -
మేమూ ఇంగ్లిష్లో మాట్లాడతాం!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్ సులువుగా అర్థం చేయించడం.. ఆపై మాట్లాడేలా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ‘వుయ్ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లిష్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఉన్నప్పటికీ.. విద్యార్థుల్లో భయాన్ని తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్తోపాటే విద్యార్థులు మాట్లాడేలా గతనెల 28 నుంచి జిల్లాలోని 16 ప్రభుత్వ పాఠశాలల్లో స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను నిర్వహిస్తున్నారు. 1,252 మంది విద్యార్థులకు లబ్ధి జిల్లాలోని కల్లూరు, తల్లాడ, వైరా, కొణిజర్ల, చింతకాని, ముదిగొండ, బోనకల్, ఖమ్మంఅర్బన్, రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లోని 16 పాఠశాలలను స్పోకెన్ ఇంగ్లిష్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో 6, 7 తరగతుల విద్యార్థులు 1,252 మంది ఉండగా.. 16 మంది టీచర్లకు అవగాహన కల్పించారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్లానర్ (ఐఎప్పీ) డిజిటల్ బోర్డులున్న పాఠశాలలను ఎంపిక చేశారు. హైదరాబాద్కి చెందిన భారత్ దేఖో, మంత్రా పర్ చేంజ్, అలోకిట్, శిక్షా లోక్ స్వచ్ఛంద సంస్థలు రోజూ 15 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను ఈ పాఠశాలలకు ఆన్లైన్లో పంపిస్తుండగా.. వీడియో చూశాక మరో 15 నిమిషాలు విద్యార్థుల నడుమ గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తున్నారు. వీడియోలోని బొమ్మలు, వాటి నడుమ సంభాషణ గుర్తుండి ఇంగ్లిష్ మాట్లాడటం సులువవుతుందని భావిస్తున్నారు. వీటిద్వారా విద్యార్థులు ఉత్సాహంగా ఇంగ్లిష్ నేర్చుకుంటున్నారు. 15 రోజులకోసారి సమీక్షిస్తున్న కలెక్టర్.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్ధికి ఇంగ్లిష్ పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థులకు మంచి అవకాశం ఇంగ్లిష్ నేర్చుకోవడానికి విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. ఆడియో, వీడియోల ద్వారా పిల్లలు ఉత్సాహంతో ఒత్తిడి లేకుండా నేర్చుకుంటారు. ఇప్పటికే చిన్నచిన్న వాక్యాలు మాట్లాడుతున్నారు. కలెక్టర్, డీఈఓ ఆదేశాలతో త్వరలోనే ఇంకొన్ని పాఠశాలల్లో ప్రారంభిస్తాం. –జక్కంపూడి జగదీష్, జిల్లా కోఆర్డినేటర్, ఉయ్ కెన్ లెర్న్ ప్రోగ్రాం ఇంగ్లిష్ అంటే భయం పోతోంది.. ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో ఇంగ్లిష్ అంటే భయం తగ్గింది. కథల ద్వారా నేర్చుకోవడం, మాట్లాడటం జరుగుతోంది. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్పై పట్టు సాధిస్తారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన జిల్లా విద్యాశాఖకు ధన్యవాదాలు. –బి.రామనాథం, టీచర్, జెడ్పీహెచ్ఎస్, చిన్న కోరుకొండి, కల్లూరు మండలం చక్కగా నేర్చుకుంటున్నా.. ఈ కోర్సు వల్ల ఇంగ్లిష్ నేర్చుకున్నా. ప్రస్తుతం చిన్నచిన్న వాక్యాలను మాట్లాడగలుగుతున్నా. త్వరలోనే ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడతాననే నమ్మకం ఏర్పడింది. మాలాంటి విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశం. – డి.బ్యూలా, 7వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, గుబ్బగుర్తి, కొణిజర్ల మండలం కలెక్టర్ సార్కు ధన్యవాదాలు.. స్పోకెన్ ఇంగ్లిష్ ప్రోగ్రాంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేర్చుకోగలుగుతున్నాం. రోజూ వినడం వల్ల కొంతకాలం తర్వాత మాట్లాడగలుగుతాం. మా పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లిష్ మొదలు పెట్టినందుకు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సార్కు ధన్యవాదాలు. –బి.దేవిక, 7వ తరగతి, జెడ్పీఎస్ఎస్, కల్లూరు, ఖమ్మం జిల్లా త్వరలోనే 200 పాఠశాలల్లో.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఇంగ్లిష్ మాట్లాడగలమనే విశ్వాసం కలిగించేలా ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రస్తుతం 16 పాఠశాలలను ఎంపిక చేసినా త్వరలోనే 200 పాఠశాలలకు విస్తరిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివాక డిగ్రీ, పీజీ పూర్తిచేసిన వారు ఇంగ్లిష్లో రాణించలేక ప్రైవేట్ ఉద్యోగాల ఇంటర్వ్యూల్లో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. దీంతో ‘వుయ్ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లిష్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. – ముజమ్మిల్ఖాన్, కలెక్టర్, ఖమ్మం జిల్లా చక్కగా నేర్చుకుంటున్నా.. ఈ కోర్సు వల్ల ఇంగ్లిష్ నేర్చుకున్నా. ప్రస్తుతం చిన్నచిన్న వాక్యాలను మాట్లాడగలుగుతున్నా. త్వరలోనే ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడతాననే నమ్మకం ఏర్పడింది. మాలాంటి విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశం.– డి.బ్యూలా, 7వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, కొణిజర్ల మండలం -
కొత్త టీచర్లు ఎలా ఉన్నారు?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన కొత్త ఉపాధ్యాయుల పనితీరుపై విద్యాశాఖ ఆరా తీస్తోంది. క్షేత్రస్థాయి నివేదికలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ జిల్లా విద్యాశాఖాధికారులను కోరింది. దీంతో డీఈవోలు ఈ బాధ్యతను మండల విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక అంశాలను ఎంఈవోలకు సూచించారు. ఇటీవల డీఎస్సీ ద్వారా 11,062 మందికి టీచర్ పోస్టులు వచ్చాయి. ఇందులో చాలామందిని ఏకోపాధ్యాయ పాఠశాలల్లోనే నియమించారు. కొత్తగా చేరినవారి బోధనా సరళి ఏ విధంగా ఉంది? విద్యార్థులతో ఎలా మమేకమవుతున్నారు? స మస్యలు వస్తున్నాయా? ఏమేరకు చొరవ చూపుతున్నారు? అనే అంశాలపై ప్రధా నంగా నివేదిక కోరారు. దీంతోపాటు పాలనాపరమైన విధులు, విద్యాశాఖ నిబంధనావళిని ఎంతవరకు పాటిస్తున్నారనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఎంపికైన టీచర్లకు ముందుగా శిక్షణ ఇవ్వాలని అధికారులు భావించినప్పటికీ అది సాధ్యంకాలేదు. ముందుగా రిసోర్స్ పర్సన్స్ను ని యమించి, వారి ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పాఠశాల విద్య అధికారులు తెలిపారు. ఈలోగా వారి బోధన విధానాన్ని నిశితంగా పరిశీలిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని, ఆయా అంశాలను కూడా శిక్షణలో జోడించే వీలుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
సర్కారు చదువులు చట్టుబండలు!
సాక్షి, అమరావతి: సజావుగా సాగుతున్న పాఠశాల విద్యపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టింది. పేద పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్యను, అందులోనూ ప్రాథమిక దశ నుంచే సబ్జెక్టు టీచర్ బోధనను దూరం చేసేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకెళుతోంది. తాజాగా జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలను నిర్దయగా రద్దు చేస్తోంది. పిల్లల్లో విద్యా నాణ్యత పెంచేందుకు 3, 4, 5 తరగతుల విద్యార్థులకు నిపుణులైన సబ్జెక్టు టీచర్లతో బోధన అందించేందుకు తీసుకొచ్చిన జీవో 117ను రద్దుచేసి, వచ్చే ఏడాది నుంచి ఆ తరగతులను ప్రాథమిక పాఠశాల్లోకి మార్చాలని నిర్ణయించింది. ఏపీ మోడల్ను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తుంటే.. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో అమలు చేసిన విద్యా సంస్కరణలను దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. ‘ప్రభుత్వాలు మారడం సహజం. కానీ.. పాలన మాత్రం మారకూడదు. మంచి ఏ ప్రభుత్వంలో జరిగినా దాన్ని కొనసాగించాలి’ అని ఇటీవల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అంతేకాదు.. విద్యాశాఖ మంత్రిగా ఆయన ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడి పరిస్థితులనూ పరిశీలించారు. గత ప్రభుత్వంలో విద్యా సంస్కరణలు బాగున్నాయని, వాటిని అలాగే కొనసాగిద్దామని ఉన్నతాధికారుల వద్ద కూడా పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రే బాగున్నాయని చెప్పిన సంస్కరణలను రద్దు చేయడం విస్మయం కలిగిస్తుంది. జీవో 117 రద్దు చేస్తే విద్యార్థులకు అన్యాయం పలు సర్వేల అనంతరం విద్యారంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)–2020 సంస్కరణలను తీసుకొచ్చి0ది. దీని ప్రకారం దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలని, జాతీయ స్థాయిలోను, రాష్ట్రాల్లోను ఒకేవిధమైన విధానాలు అనుసరించాలని, పిల్లలు నేర్చుకునే దానికి, వస్తున్న ఫలితాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని సూచించింది. ఇందుకోసం ఉపాధ్యాయ–విద్యార్థుల నిష్పతి్తని తగ్గించాలంది. ఎన్ఈపీ–2020 విద్యా బోధనను 5+3+3+4 విధానంలో పునర్నిర్మించాలని సూచించింది. ఎన్ఈపీ సంస్కరణల్లో భాగంగా గత ప్రభుత్వం 2022లో జీవో–117 జారీ చేసింది. దీనిప్రకారం గతేడాది ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లోకి మార్చారు. ఇలా 4,900 ఎలిమెంటరీ స్కూళ్లలోని 2.43 లక్షల మంది విద్యార్థులను కి.మీ. లోపు దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో చేర్చారు. 8 వేల మంది అర్హులైన ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి కల్పించి సబ్జెక్టు టీచర్ బోధన అందుబాటులోకి తెచ్చారు.అంతేగాక ఉపాధ్యాయులపై బోధనా ఒత్తిడి తగ్గించేందుకు ప్రాథమిక విద్యార్థుల బోధనను ఒక టీచర్కు 20 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంది. ఎంతో ఉన్నతమైన ఆశయంతో తీసుకొచ్చిన జీవో 117ను ఉపాధ్యాయులు సైతం మెచ్చుకున్నారు. కానీ.. ఇప్పుడు అదే చట్టాన్ని రద్దు చేయడమంటే పేదల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేయడమేనని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
1,17,136 ఇంజనీరింగ్ సీట్లు భర్తీ
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్–2024 కౌన్సెలింగ్లో తొలివిడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి.నవ్య బుధవారం తెలిపారు. విద్యార్థులు ఈ నెల 22 లోపు కళాశాలల్లో రిపోర్టు చేయాలని సూచించారు. అయితే ఈ నెల 19 నుంచే తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఏపీఈ ఏపీసెట్లో అర్హత సాధించిన 1,86,031 మందిలో తొలి విడత కౌన్సెలింగ్ కోసం 1,28,619 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. ధ్రువపత్రాల తనిఖీ అనంతరం 1,28,065 మంది అర్హత సాధించారన్నారు. మొత్తం 245 కళాశాలల్లో 1,36,660 సీట్లు ఉండగా, 1,17,136 సీట్లు భర్తీ అయ్యాయని, మిగిలిన 19,524 సీట్లను రెండో విడత కౌన్సెలింగ్లో భర్తీ చేస్తామన్నారు. ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటాలకు సంబంధించి మెరిట్ జాబితా రానందున ఈ సీట్లను చివరిగా భర్తీ చేస్తామని వివరించారు. -
ఏటా రెండుసార్లు టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా రెండు సార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఏటా ఏప్రిల్ లేదా మే నెలలో ఒకసారి మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తుండగా.. ఇకపై రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. ఈమేరకు సవరణ ఉత్తర్వులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జారీ చేశారు. ఒక అభ్యర్థి టెట్ పరీక్షను ఎన్నిసార్లు అయినా రాయొచ్చని, మెరుగైన మార్కుల కోసమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడితో పాటు ఎస్సీఈఆర్టీ సంచాలకులను ఆయన ఆదేశించారు. -
‘ప్రైమరీ’లో ప్రగతి జాడేదీ?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రాథమిక వి ద్యలో విద్యార్థుల ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేవని కేంద్ర విద్యా శాఖ పేర్కొంది. తెలగాణ సహా అన్ని రాష్ట్రాల్లో ఈ లోపం కనిపిస్తోందని.. దీన్ని అధిగమించేందుకు కసరత్తు అవసరమని తెలిపింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 2026 నాటికి దశల వారీగా ప్రమాణాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చిన రాష్ట్రాలు.. ఆ దిశగా అడుగులు వేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం ప్రతీ రెండేళ్లకోసారి నేషనల్ అచీవ్మెంట్ సర్వే (న్యాస్)ను నిర్వహించి.. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో విద్యా ర్థుల ప్రమాణాలను పరిశీలిస్తుంది. అలా తాజాగా చేపట్టిన సర్వేలో తేలిన అంశాలను వెల్లడించింది. కనీస స్థాయి కూడా ఉండక.. ప్రతి విద్యార్థికి ఐదో తరగతికి చేరేసరికి చదవడం, రాయడంతోపాటు సబ్జెక్టుల్లో ప్రాథమిక అవగాహన అవసరం. ఇది తేల్చేందుకు కేంద్ర విద్యాశాఖ సర్వేలో 28 అంశాలపై స్వల్పస్థాయి ప్రశ్నలు ఇచ్చింది. విద్యార్థుల్లో 56– 68 శాతం మంది 50శాతం ప్రశ్నలకే సమాధానం ఇచ్చారు. గణితంలో అయితే 70 శాతం మంది విద్యార్థులు 30శాతం ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేకపోయారు. 8వ తరగతి విద్యార్థులు కూడా గణితంలో 37శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నట్టు సర్వేలో గుర్తించారు. ప్రాంతీయ భాషల్లో రాయడం, చదవడంలోనూ విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. ఈ కేటగిరీలో కనీసం సగం ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వగలిగినవారు 53 శాతం మంది మాత్రమే. చాలా రాష్ట్రాల్లో 13.85 శాతం మంది 8వ తరగతి వచ్చే సరికే బడి మానేస్తున్నారని.. దీన్ని కనీసం 6 శాతానికి తగ్గించాలని రాష్ట్రాలకు కేంద్రం టార్గెట్ పెట్టింది. నెరవేరని లక్ష్యం! రెండేళ్ల క్రితం సర్వే చేసిన సమయంలో కేంద్రం అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది. కనీసం 50శాతం, ఆపైన ప్రశ్నలకు సరైన సమాధానం రాసేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించింది. ఆ సమయంలో తర్వాతి ఐదేళ్లలో వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని రాష్ట్రాలు హామీ ఇచ్చాయి. కానీ ఇప్పటివరకు పెద్దగా మార్పు మొదలైనట్టు కనిపించలేదని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరోమారు కొత్త లక్ష్యాలను నిర్దేశించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. పిల్లల్లో ప్రమాణాలు పెరగకపోవడానికి పాఠశాలల్లో టీచర్ల కొరతే కారణమని అధికారులు అంటున్నారు. ప్రైవేటు స్కూళ్లలో కూడా కరోనా తర్వాత నాణ్యమైన టీచర్లు దొరికే పరిస్థితి లేక సమస్యగా మారిందని విశ్లేషిస్తున్నారు. -
ప్రైవేట్ ఇంటర్ కాలేజీలకు ముకుతాడు !
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ప్రవేశాలను కూడా పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రణాళిక రూ పొందించాలని సీఎం రేవంత్రెడ్డి విద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ప్రైవేట్ కాలేజీల పెత్తనాన్ని అడ్డుకోవాల్సిన అవసరముందని, ఇది ఏ విధంగా సాధ్యమనే అంశాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పలువురు ఉన్నతాధికారులతో సీఎం విద్యాశాఖపై శుక్రవారం సమీక్షించారు. సకాలంలో స్కూళ్లకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించాల్సిన అంశాన్ని ప్రస్తావించారు. ఇంటర్ కాలేజీల ఫీజులపై తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందనే విషయాన్ని సీఎం గుర్తించినట్టు తెలిసింది. దీనిని కట్టడి చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా వీసీల నియామకం, పలు విద్యాశాఖ అంశాలపై చర్చించినట్టు తెలిసింది. -
ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్
సాక్షి, విజయవాడ: ఎన్నికలకు ముందు జరిగిన ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. 1400 ఉపాధ్యాయుల బదిలీలు నిలిపివేశారు. గతంలో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులు రద్దు చేయాలని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
3 నుంచి బడిబాట
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఏ రోజున ఎవరేం చేయాలనే మార్గదర్శకాలను బుధవారంరాత్రి విద్యాశాఖ విడుదల చేసింది. నిర్ణయించిన తేదీల్లో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఉపాధ్యాయులు తమ పరిధిలోని గ్రామాలు, శివారు గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. చదువుకోని పిల్లలను గుర్తించి, వారిని సమీపంలోని అంగన్వాడీలు, స్కూళ్లలో చేర్పించడం, ప్రభుత్వ స్కూళ్లల్లో ప్రవేశాలు పెంచడం, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించడం బడిబాట ఉద్దేశం. ఈ క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక బృందాలు, ఎన్జీఓల తోడ్పాటు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 3 నుంచి 19వ తేదీ వరకు ఏ రోజు ఏం చేయాలనే వివరాలతో కూడిన షెడ్యూల్ను కూడా విద్యాశాఖ ప్రకటించింది. కలెక్టర్ల నేతృత్వంలో కార్యాచరణ» జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డీఈఓలు, ఎంఈఓలు, స్కూల్ ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఈ నెల 30వ తేదీన వివిధ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహిస్తారు. బడిబాట కార్యక్రమ ప్రణాళిక ఖరారు చేస్తారు. జూన్ 10వ తేదీ నాటికి ప్రభుత్వ స్కూళ్లల్లో నోట్బుక్స్, టెక్ట్స్బుక్స్, యూనిఫాం పంపిణీకి సిద్ధం చేస్తారు.» సామాజిక సేవాసంస్థలు, ఎన్జీఓలు వివిధ వర్గాలను డీఈఓలు సమన్వయపరిచి, బడిబాటను ముందుకు తీసుకెళ్లాలి. ఎంఈఓలు, హెచ్ఎంలకు, టీచర్లకు బడిబాట దిశానిర్దేశం చేస్తారు. కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పిస్తారు. మండలపరిషత్ అధికారులు, ఎస్ఐ, వివిధ వర్గాల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. »మండలస్థాయి కమిటీలను ఎంఈఓలు ఏర్పాటు చేస్తారు. ఏరోజు ఏం చేయాలనే కార్యాచరణను మండల పరిధిలో ఎంఈఓలు రూపొందిస్తారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు.» గ్రామస్థాయిలో కమిటీలు, బడిబాటపై అవగాహన, ప్రచార కార్యక్రమాన్ని స్కూల్ హెచ్ఎంలు నిర్వహిస్తారు. స్థానిక నేతల భాగస్వామ్యాన్ని తీసుకోవడంలో కీలక భూమిక పోషిస్తారు. బడిబాట ద్వారా గుర్తించిన విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ చేపడతారు. -
ఇంజనీరింగ్లో 74 శాతం.. అగ్రి, ఫార్మాలో 89 శాతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ఈఏపీ సెట్–2024) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 78.98 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.66 శాతం అర్హత సాధించారు. ర్యాంకుల్లో రెండు తెలుగు రాష్ట్రాలూ పోటీ పడ్డాయి. రెండు విభాగాల్లోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు తొలి 10 ర్యాంకులు సమానంగా వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రి, ఫార్మసీ విభాగంలో ఏపీకే చెందిన అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఆలూరు ప్రణీత ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకొని టాప ర్లుగా నిలిచారు. ఈ మేరకు ఈఏపీ సెట్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్లు వెంకటరమణ, మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి, సెట్ కనీ్వనర్ డీన్కుమార్, కో–కన్వీనర్ విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు. 74.98 శాతానికి తగ్గిన అర్హులు టీఎస్ఈఏపీ సెట్ ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జరిగింది. ఇంజనీరింగ్ విభాగానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2,54,750 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,40,618 మంది సెట్కు హాజరయ్యారు. 1,80,424 మంది అర్హత సాధించారు. అగ్రి, ఫార్మా విభాగంలో రెండు రాష్ట్రాల నుంచి 1,00,432 మంది దరఖాస్తు చేస్తే 91,633 మంది పరీక్ష రాశారు. 82,163 మంది అర్హత సాధించారు. గత రెండేళ్ళతో పోలిస్తే సెట్ రాసిన వారి సంఖ్య పెరిగింది. కానీ అర్హత శాతం తగ్గింది. గత ఏడాది (2023) 3,01,789 మంది ఎంసెట్ పరీక్షకు హాజరయ్యారు. 2,48,814 (86.31%) మంది అర్హత సాధించారు. ఈ ఏడాది (2024) 3,32,251 మంది రాస్తే, ఇందులో 2,62,587 (74.98%) మంది అర్హత సాధించారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కనీస అర్హత మార్కులు లేకపోవడంతో రాసిన అందరూ అర్హులయ్యారు. ఆన్లైన్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ రాష్ట్ర ఈఏపీ సెట్ ఫలితాలను వారం రోజుల్లో ప్రకటించడం అభినందనీయమని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. వారం రోజుల్లో కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్ వెలువడకుండా యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసే కాలేజీలపై చర్య తీసుకుంటామన్నారు. ఈ ఏడాది ఆన్లైన్ విధానం ద్వారా ఈ సీట్లను భర్తీ చేసే ఆలోచన చేస్తున్నామని, త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్పారు. అనుమతి లేకుండా విద్యార్థులను చేర్చుకున్న గురునానక్, శ్రీనిధి ప్రైవేటు యూనివర్సిటీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే.. మాది ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం యరకరాయపురం. నాన్న మోహనరావు సాంఘిక సంక్షేమ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా, తల్లి హైమావతి ఆర్టీసీలో పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తెలంగాణ ఈఏపీసెట్లో మొదటి ర్యాంకు సాధించగలిగా. –సతివాడ జ్యోతిరాదిత్య, ఫస్ట్ ర్యాంకర్ (ఇంజనీరింగ్)ఐఐటీ బాంబేలో చదవడమే లక్ష్యం.. మా స్వస్థలం ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాల. నాన్న సూర్యకుమార్ యాదవ్ కమ్యూనికేషన్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్నారు. నాకు జేఈఈ మెయిన్లో 311వ ర్యాంకు వచి్చంది. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్డ్కు సన్నద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చేయడమే నా లక్ష్యం. – గొల్లలేఖ హర్ష, సెకండ్ ర్యాంకర్ (ఇంజనీరింగ్) బాంబే ఐఐటీలో సీఎస్ఈ లక్ష్యంప్రతిరోజు 10 గంటల పాటు చదివేవాడిని. తండ్రి బి.రామసుబ్బారెడ్డి, తల్లి వి.రాజేశ్వరి ఇద్దరు ప్రభుత్వ టీచర్లు. మాది ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని. ఇంజనీరింగ్లో 4వ ర్యాంకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేయడమే నా లక్ష్యం. – సందేశ్, 4వ ర్యాంకు, ఇంజనీరింగ్, హైదరాబాద్ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదువుతా మాది ఏపీలోని కర్నూలు. నాన్న ఎం.రామేశ్వరరెడ్డి చిరు వ్యాపారి. అమ్మ గృహిణి. జేఈఈ మెయిన్లో 36వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 6వ ర్యాంకు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు తెచ్చుకుని ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదవాలనుకుంటున్నా. – మురసాని సాయి యశ్వంత్రెడ్డి, ఐదో ర్యాంకర్ (ఇంజనీరింగ్)నాన్నలాగే అవ్వాలని అనుకుంటున్నా.. రోజుకు 16 గంటలు చదువుతున్నా. రాబోయే జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటి ఐఐటీ బాంబేలో సీటు సాధిస్తా. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అవుతా. మెయిన్స్లో 5వ ర్యాంకు వచ్చింది. ఈఏపీ సెట్లో ర్యాంకు రావడంతో ఆనందంగా ఉంది. నా తండ్రి అనిల్కుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. దీంతో నాన్నలాగే అవ్వాలని చిన్నప్పట్నుంచీ అనుకునేవాడిని. తల్లి మమత ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. – విదిత్, 7వ ర్యాంక్, ఇంజనీరింగ్ (మణికొండ) తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణంతండ్రి రాజేశ్వరరావు పబ్బ, తల్లి లావణ్య పబ్బ, అక్క మానస పబ్బల సహకారం, ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించా. బాంబే ఐఐటీలో సీటు సాధించి గొప్ప ఇంజనీర్ను కావడమే నా లక్ష్యం. – పబ్బ రోహన్ సాయి, 8వ ర్యాంకు, ఇంజనీరింగ్ (ఎల్లారెడ్డిగూడ) అమ్మా నాన్నల ఆశలు నెరవేరుస్తామంచి కళాశాలలో బీటెక్, ఆ తర్వాత ఎంటెక్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడమే నా లక్ష్యం. ఇంటర్మీడియెట్లో అధ్యాపకుల బోధన, కోచింగ్తోనే ఉత్తమ ర్యాంకు సాధించా. ముఖ్యంగా మా చదువు కోసమే అమ్మా నాన్న ఊరు విడిచి హైదరాబాద్కు వచ్చారు. వారు పడుతున్న కష్టాలు రోజూ చూస్తున్నా. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి మా తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తా. వారి ఆశలు నెరవేరుస్తా.–కొంతం మణితేజ, 9వ ర్యాంకు, ఇంజనీరింగ్, వరంగల్తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ర్యాంకులు మాది ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట. అమ్మా నాన్న సుశీల, శ్రీనివాసరావు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నాకు జేఈఈ మెయిన్లో261వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 35వ ర్యాంకు వచ్చాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహమే ర్యాంకులకు కారణం. –ధనుకొండ శ్రీనిధి, పదో ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) గుండె వైద్య నిపుణురాలినవుతా.. మాది ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి. నాన్న శ్రీకర్ హోమియో మెడికల్ ప్రాక్టీషనర్గా, తల్లి కళ్యాణి ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. అక్క సంవిధ కాగి్నజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్ చేసి వైద్యురాలిని కావడమే నా లక్ష్యం. కార్డియాక్ సర్జన్గా స్థిరపడాలన్నదే నా ఆకాంక్ష. – ఆలూరు ప్రణీత, ఫస్ట్ ర్యాంకర్ (అగ్రికల్చర్–ఫార్మా) నా కష్టం ఫలించింది.. మాది ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లి. అమ్మా నాన్న కృష్ణవేణి, నారాయణరావు వ్యవసాయం చేస్తున్నారు. మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో చదివా. నా కష్టం ఫలించింది. – నగుడసారి రాధాకృష్ణ, సెకండ్ ర్యాంకర్ (అగ్రికల్చర్–ఫార్మా) డాక్టర్ కావడమే లక్ష్యంమధ్య తరగతి కుటుంబం అయినప్పటికీ మా అమ్మానాన్న నా చదువు కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. డాక్టర్ కావాలన్న నా ఆకాంక్షను గుర్తించి హైదరాబాద్లోని కాలేజీలో చేర్పించారు. ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా చదువుపైనే దృష్టి పెట్టా. నీట్ పరీక్ష బాగా రాశా. – గడ్డం శ్రీవర్షిణి, 3వ ర్యాంకు, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ (హనుమకొండ)వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తానా తల్లిదండ్రులు ఎండీ జమాలుద్దీన్, నుస్రత్ ఖాన్లు. వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎదగడమే నా లక్ష్యం. ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తా. కరోనా కష్ట కాలంలో అన్ని రంగాలూ కుదేలైనా వ్యవసాయ రంగమే మన దేశాన్ని ఆదుకుంది.– అజాన్ సాద్, 6వ ర్యాంకు, అగ్రికల్చర్ ఫార్మసీ (నాచారం)వైద్య వృత్తి అంటే ఇష్టంనా తల్లిదండ్రులు జయశెట్టి సూర్యకాంత్, భాగ్యలక్ష్మి. నాకు వైద్య వృత్తిపై ఆసక్తి ఎక్కువ. సేవ చేయాలనే తపనతో నీట్ పరీక్ష రాశా. దాంతో పాటు ఈఏపీ సెట్ కూడా రాశా. ఈఏపీలో మంచి ర్యాంకు వచ్చింది. అదే విధంగా త్వరలో రానున్న నీట్ ఫలితాల్లో కూడా మంచి ర్యాంకు సాధిస్తానని ఆశిస్తున్నా. – ఆదిత్య జయశెట్టి, 9వ ర్యాంకు, అగ్రి ఫార్మసీ (కూకట్పల్లి) -
TS: పదో తరగతి పరీక్షలు ప్రారంభం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయమే పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులను పరీక్ష సమయానికి సెంటర్లోకి అనుమతించారు. 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. ఇక, ఏప్రిల్ రెండో తేదీ వరకూ జరిగే పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు కొనసాగుతాయి. అయితే ఈనెల 26, 27 తేదీల్లో జరిగే ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకే ఉంటాయి. నిర్ణీత పరీక్ష సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఇప్పటికే డీఈవోలకు, సీఎస్లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. గతేడాది వరంగల్లో జరిగిన ఘటన నేపథ్యంలో.. ఈసారి పరీక్ష కేంద్రాల సిబ్బందితో పాటు, తనిఖీలకు వచ్చే అధికారులు, స్క్వాడ్స్ కూడా ఫోన్లను బయటపెట్టేలా ఆదేశాలు జారీ చేశారు. -
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులను స్వీకరించననున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించనున్నారు. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 17 నుంచి 31 వరకు తెలంగాణ డీఎస్సీ పరీక్షలు జరపనున్నారు ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ కోటాలో 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. -
ఏపీ డిజిటల్ విద్యకు ప్రశంసల వెల్లువ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలను ఎన్సీఈఆర్టీ మరోసారి ప్రశంసించింది. ఇతర రాష్ట్రాల విద్యాశాఖలు ఏపీ విధానాలను అధ్యయనం చేయాలని సూచించింది. ముఖ్యంగా ఐఎఫ్పీల ద్వారా డిజిటల్ బోధన, ట్యాబ్ల వినియోగం, విద్యార్థుల ట్రాకింగ్, జగనన్న గోరుముద్ద యాప్, విద్యా సమీక్ష కేంద్రాల పనితీరు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని కొనియాడింది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సమీక్ష కేంద్రాల(వీఎస్కే) పనితీరుపై గుజరాత్లోని గాంధీనగర్లో రెండు రోజులు నిర్వహించనున్న జాతీయస్థాయి వర్క్షాప్ శుక్రవారం ప్రారంభమైంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ(సీఐఈటీ) ఆధ్వర్యంలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య కమిషనరేట్ ఐటీ విభాగం అధికారి రమేష్కుమార్, విద్యా సమీక్ష కేంద్రాల సూపర్వైజర్ రమ్యశ్రీ, సమగ్ర శిక్ష నుంచి శ్రీదీప్ హాజరై రాష్ట్ర విద్యాశాఖలో అమలు చేస్తున్న డిజిటల్ విధానాలు, వీఎస్కేల పనితీరును వివరించారు. ముఖ్యంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో యాప్ ద్వారా లెక్కించడం, ఆన్లైన్ విధానంలో విద్యార్థుల హాజరు, ట్రాకింగ్ చేయడం వంటివి వివరిండంతో ఎన్సీఈఆర్టీ ప్రశంసించింది. ఐఎఫ్పీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 2డి, 3డీల్లో పాఠాలు బోధించడం అద్భుతమని సీఐఈటీ జాయింట్ డైరెక్టర్ అమరేంద్ర బెహరా కితాబిచ్చారు. విద్యా సమీక్ష కేంద్రాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుందని, అక్కడి విధానాలను అధ్యయనం చేసి ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించాలని సూచించారు. ఏపీలో వీఎస్కే పనితీరు ఇలా.. ♦ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యాన విజయవాడ, విశాఖపట్నంలలో విద్యా సమీక్ష కేంద్రాలు(వీఎస్కే) ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రాష్ట్రంలోని 58,465 ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న 70,70,143 మంది విద్యార్థుల హాజరును ప్రతిరోజు ట్రాక్ చేస్తున్నారు. ♦ ప్రతిరోజు ఉదయం విద్యార్థుల హాజరును ఉపాధ్యాయులు మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ వెంటనే ఎంతమంది గోరుముద్ద స్వీకరిస్తారు, ఎవరెవరు కోడిగుడ్డు, రాగిజావ, చిక్కీ తీసుకుంటారనే వివరాలు సైతం ‘ఏఐ’ టెక్నాలజీ అటెండెన్స్ యాప్లో నమోదవుతున్నాయి. ♦ ఉపాధ్యాయుల ఫేషియల్ రికగ్నేషన్ సైతం ఇదే తరహాలో ఉదయం 9 నుంచి 9.15 గంటల మధ్య స్కూలు పరిధిలోనే ఫొటోతో నమోదు చేస్తున్నారు. ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోయినా సిగ్నల్ వచ్చినప్పుడు టైమ్తో సహా అప్డేట్ అయ్యేలా టెక్నాలజీని రూపొందించారు. ఆ వెంటనే ‘స్కూల్ ఇన్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టం’(సిమ్స్)లో నమోదై, ఉదయం 11– 12 గంటల్లోగా విజయవాడ, విశాఖల్లోని విద్యా సమీక్ష కేంద్రాలకు చేరుతాయి. ♦ ఈ టెక్నాలజీ రాకతో గతంలో రోజుకు 68 శాతం కంటే తక్కువగా ఉన్న హాజరు... ఇప్పుడు 99 శాతం పైగా నమోదవుతోంది. ♦ విద్యార్థి ఒక్కరోజు స్కూలుకు రాకపోతే తల్లిదండ్రులకు, వరుసగా మూడురోజులు రాకపోతే విద్యార్థి ఇంటి పరిధిలోని వలంటీర్కు, నాలుగు రోజులు హాజరుకాకపోతే గ్రామ, వార్డు సంక్షేమ కార్యదర్శికి, ఎంఈవో, డీఈవోలకు సమాచారం అందుతుంది. వారు కారణాలను తెలుసుకుని ఆ వివరాలను యాప్లో నమోదు చేసి సమస్యకు పరిష్కారం చూపించాలి. ♦ ఇందుకోసం జిల్లాకు ఇద్దరు చొప్పున 52 మంది సిబ్బంది, జోన్కు ఒక్కరు చొప్పున నలుగురు పర్యవేక్షకులు ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉండి, ఆరోజు అంశాలను అదేరోజు పరిష్కరిస్తున్నారు. ♦ విజయవాడ సెంటర్ నుంచి టీచర్స్ అటెండెన్స్, గోరుముద్ద, బైజూస్, అకడమిక్ అంశాలను, విశాఖపట్నం కేంద్రం ద్వారా విద్యార్థుల హాజరు, కన్స్టెన్ రిథమ్(నాడు–నేడు), జేవీకే, డీబీటీ అంశాలను పర్యవేక్షిస్తున్నారు. ♦ డిజిటల్ టెక్నాలజీని అత్యంత పకడ్బందీగా వినియోగిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది, ఇప్పుడు ఎన్సీఈఆర్టీతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల దృష్టిని ఆకర్షించింది. -
అత్యున్నత ఫలితాలే లక్ష్యం కావాలి
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో గుణాత్మక మార్పు తేవాలని విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. టెన్త్, ఇంటర్మిడియెట్ పరీక్షలు స్వేచ్ఛాయుతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని కోరారు. అత్యున్నత స్థాయి ఫలితాలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ తొలిసారిగా మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మిడియెట్ బోర్డు కార్యదర్శి హోదాలో నవీన్ మిత్తల్, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన హాజరయ్యారు. ఇంటర్, టెన్త్ పరీక్షలకు సంబంధించిన సమగ్ర వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు, రాబోయే ఫలితాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన ఫలితాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు. గత ఏడాది పేపర్ లీకేజీ ఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలిసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాలని కోరారు. కాగా ఆన్లైన్ మూల్యాంకన విధానాన్ని ఇంటర్ అధికారులు సీఎంకు వివరించారు. దీనివల్ల అతి తక్కువ సమయంలో ఫలితాల వెల్లడికి ఆస్కారం ఉందని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ దిశగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన సిఫారసులు, వాటి సాధ్యాసాధ్యాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది. ప్రైవేటుతో సమానంగా ఫలితాలు రావాలి ప్రైవేటు విద్యా సంస్థలతో సమానంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మెరుగైన ఫలితాలు రావాల్సిన అవసరాన్ని సీఎం రేవంత్రెడ్డి నొక్కి చెప్పారు. దీంతో గురుకులాల్లో మెరుగైన ఫలితాలు వస్తున్న తీరును అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చా రు. ఈ క్రమంలోనే గురుకులాల్లో మాదిరిగా ప్రభు త్వ స్కూళ్లల్లోనూ ఫలితాలు పెంచాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన బోధన, పరీక్షలకు సన్నద్ధమయ్యే మెళకువలు మెరుగు పర్చేందుకు సరికొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ఇంటర్ తర్వాత జరిగే పోటీ పరీక్షలకు రాష్ట్ర విద్యార్థులను, ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులను సన్నద్ధం చేయాలని, ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని సూచించారు. మండలానికో కాలేజీ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ విద్యార్థులకు కాలేజీలు అందుబాటులో ఉండాలని సీఎం చెప్పారు. ప్రతి మండలానికి ఓ కాలేజీ ఏర్పాటు అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో అవసరాన్ని బట్టి అధ్యాపకులను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో సీట్లు మిగిలిపోతుండటంపై ఆయన ఆరా తీశారు. పదోన్నతులు చేపడితే ఖాళీలపై స్పష్టత రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు, పరీక్షలు, ఫలితాల గురించి దేవసేన సీఎంకు వివరించారు. వివిధ సబ్జెక్టు టీచర్ల కొరత, ఖాళీల భర్తీ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో జరిగిన కసరత్తు చర్చకు వచ్చినట్టు తెలిసింది. 5 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి ఎన్నికల ముందు చేపట్టిన ప్రక్రియ ఆగి పోయిందని అధికారులు తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో 18 వేలకు పైగా ఖాళీలున్నాయని, పదోన్నతులు చేపడితే ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై స్పష్టమైన సమాచారం వస్తుందని వివరించారు. టెట్ ఉత్తీర్ణులకే పదోన్నతులు ఇవ్వాలన్న కోర్టు తీర్పు అడ్డంకిగా ఉందని చెప్పగా, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పినట్లు సమాచారం. -
పదోన్నతులకు టెట్ చిక్కులు
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఇప్పుడు సమస్యగా మారింది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన విధానం వెల్లడించకపోతే పదోన్నతులు క్లిష్టంగా మారనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పాఠశాల విద్యాశాఖాధికారులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ముందుగా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. వీలైనంత త్వరగా డిపార్ట్మెంటల్ పరీక్ష తరహాలో దీన్ని నిర్వహించాలని సూచిస్తున్నాయి. టెట్ చేపట్టమని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదని, దీనివల్ల తాము నష్టపోయామని పేర్కొంటున్నాయి. జాతీయ విద్యా విధానం–2020 అమలుకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనూ టెట్ అర్హతకు ప్రాధాన్యత పెరిగిందని వారు అంటున్నారు. ఎప్పుడో చెప్పిన కేంద్రం ప్రతి ఉపాధ్యాయుడు విధిగా టెట్ పాసవ్వాలని కేంద్రం 2012లోనే నిబంధన విధించింది. పాసైన వారికే పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి 2012కు ముందు రాష్ట్రంలో టెట్ లేదు. జిల్లా నియామక మండలి పరీక్ష ద్వారానే టీచర్ల ఎంపిక జరిగింది. అందువల్ల అనేక మందికి టెట్ అర్హత ఉండే అవకాశం లేదని రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు పొందింది. రాష్ట్రావిర్భావం తర్వాత కూడా ఇదే విధానం కొనసాగుతోంది. తాజా గా దీనిపై కేంద్రం మళ్ళీ స్పందించింది. ఉపాధ్యాయులందరికీ టెట్ తప్పనిసరి చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. ఎన్నికల ముందు జరిగిన ఈ ప్రక్రియపై కొంతమంది కోర్టును ఆశ్రయించారు. టెట్ అర్హత ఉంటేనే పదోన్నతి కల్పించాల్సి ఉంటుందనే నిబంధనను కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కోర్టు పదోన్నతులపై స్టే ఇచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకునేలోపే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఖాళీలు తెలిసేందుకూ వీల్లేదు! రాష్ట్రంలో టెట్ ఉత్తీర్ణులు 4 లక్షల మంది ఉన్నారు. వీళ్ళంతా ఉపాధ్యాయ పోస్టుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు. కాగా ప్రభుత్వ టీచర్లు 1.05 లక్షల మంది ఉన్నారు. వీరిలో 2012 తర్వాత రిక్రూట్ అయిన 15 వేల మందికి మాత్రమే టెట్ అర్హత ఉంది. అంటే దాదాపు 90 వేల మంది టీచర్లకు అర్హత లేదు. దీంతో వీళ్ళు పదోన్నతులు పొందేందుకు అవకాశం ఉండదు. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. అయితే పదోన్నతుల ప్రక్రియ ఆగిపోవడంతో కచ్చితమైన ఖాళీలు తెలిసే వీల్లేకుండా పోయింది. దీంతో టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియకూ బ్రేకులు పడుతున్నాయి. దీన్ని నివారించేందుకు 80 వేల మంది టీచర్లకు డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరి అంతర్గతంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఇదొక్కటే ప్రస్తుతం ఉన్న మార్గమని సూచిస్తున్నారు. ఏప్రిల్ లోపు ఈ తరహా టెట్ నిర్వహిస్తే.. వచ్చే జూన్, జూలైలో పదోన్నతులు చేపట్టేందుకు వీలుంటుందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం దృష్టి పెడితే తప్ప ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం కన్పించడం లేదు. -
నడుస్తున్న చరిత్ర!
పాత చరిత్రను కొత్తగా లిఖించే మరోప్రయత్నం మొదలైంది. పిల్లల పాఠ్యపుస్తకాల్లో ప్రస్తుతం ఉన్న ‘ప్రాచీన చరిత్ర’ స్థానంలో ‘సంప్రదాయ (క్లాసికల్) చరిత్ర’ను ప్రవేశపెట్టనున్నారు. అంటే, ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక అంటూ బ్రిటీషు వారు చేసిన చరిత్ర విభజన ఇక చెరిగిపోనుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) వేసిన ఉన్నత స్థాయి సంఘం చేసిన ఈ సిఫార్సు చర్చ రేపుతోంది. అలాగే, ఇకపై ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ను తీసుకురావాలని సైతం సదరు కమిటీ సిఫార్సు చేసిందన్న వార్త తేనెతుట్టెను కదిలించింది. భారతదేశపు గతానికి సంబంధించిన కథనాలను ‘సరిచేసేందుకు’ ఈ మార్పులు తీసుకు వస్తున్నామన్నది ఎన్సీఈఆర్టీ కమిటీ మాట. ఇండియా స్థానంలో భారత్ అనే సిఫార్సును అంగీకరించలేదని ఎన్సీఈఆర్టీ వివరణనిచ్చినా, కమిటీ చేసిన ఇతర ప్రతిపాదనలపైనా అనుమానాలు, చర్చోపచర్చలు ఇప్పుడప్పుడే ఆగేలా లేవు. 2020 నాటి జాతీయ విద్యా విధానంలో భాగంగా సాంఘిక శాస్త్రాల్లో మార్పులు చేర్పులు సూచించడం కోసం రిటైర్డ్ చరిత్ర ప్రొఫెసర్ అయిన సీఐ ఐజాక్ సారథ్యంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని 2022లో ఎన్సీఈఆర్టీ నియమించింది. పాఠ్యప్రణాళికలో భాగంగా పిల్లలకు బోధించే అన్ని సబ్జెక్టుల్లోనూ ‘భారతీయ విజ్ఞాన వ్యవస్థ’ (ఐకేఎస్)ను ప్రవేశపెట్టాలని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. ‘ప్రాచీన చరిత్ర’ బదులు ‘సంప్రదాయ చరిత్ర’ను పెట్టాలనే ప్రతిపాదనకు తనదైన సమర్థనను వినిపించింది. ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లో మన వైఫల్యాలనే పేర్కొన్నారనీ, మొఘలులు, సుల్తానులపై మన విజయాలను చెప్పలేదనీ, కాబట్టి యుద్ధాలలో ‘హిందూ విజయాల’పై దృష్టి పెడుతూ పాఠ్యపుస్తకాలు మార్చాలనీ ఐజాక్ బృందపు వాదన. చరిత్రను చరిత్రగా చెప్పాల్సిందే! అందులో లోటుపాట్లను సవరించడమూ తప్పు కాదు. కానీ, సాక్ష్యాధారాలతో సాగాల్సిన ఆ చరిత్ర రచనను మతప్రాతిపదికనో, మరో ప్రాతిపదికనో మార్చాలనుకోవడమే సమస్య. ‘ఇండియా’ అంటూ ప్రతిపక్ష కూటమి తమకు తాము నామకరణం చేసుకున్న తరువాత నుంచి ఈ ‘ఇండియా’ వర్సెస్ ‘భారత్’ రచ్చ నడుస్తూనే ఉంది. భారత రాజ్యాంగం ‘ఇండియా... దటీజ్ భారత్’ అని పేర్కొన్నప్పటికీ, ప్రభుత్వం కొన్నాళ్ళుగా ఈ ‘భారత’ నామంపై కొత్త ప్రేమ కనబరు స్తోంది. ఆ మధ్య జీ–20 వేళ రాష్ట్రపతి అధికారిక విందు ఆహ్వానంలో సైతం ‘భారత్’ అనే పదాన్నే వాడడం వివాదం రేపింది. అసలు ‘ఇండియా’ అనే పేరే వలసవాద ఆలోచనకు ప్రతీక అన్నది అధికార పక్షం వాదన. ఏడువేల ఏళ్ళ నాటి విష్ణుపురాణం తదితర ప్రాచీన గ్రంథాల్లో ‘భారత్’ అని ఉపయోగించినందున ఆ పేరును వాడాలనేది ఐజాక్ కమిటీ సూచన. అయితే, ఇన్నేళ్ళుగా ‘ఇండియా’, ‘భారత్’లను పరస్పర పర్యాయపదాలుగానే వాడుతున్న దేశంలో ‘ఇండియా’ అని ఉన్నచోటల్లా పాఠ్యపుస్తకాల్లో ‘భారత్’ అని మార్చేయమని సిఫార్సు చేయడమే అర్థరహితం. ప్రభుత్వం తమనేమీ ప్రభావితం చేయలేదని ప్రొఫెసర్ ఐజాక్ అంటున్నారు కానీ, హిందూత్వ భావజాలం వైపు ఆయన మొగ్గు జగమెరిగిన సత్యం. పాలక పక్షపు ప్రాపకం కోసం చేసే ఇలాంటి ప్రతిపాదనలు, సిఫార్సులు గాలిలో నుంచి వాటంతట అవి ఊడిపడతాయని అనుకోలేం. అలా అనుకుంటే అమాయకత్వమే. ఆ మాటకొస్తే, 2018లోనే ప్రాచీన చరిత్రను తిరగరాసేందుకు తోడ్పడే నివేదికను సమర్పించాల్సిందిగా కేఎన్ దీక్షిత్ సారథ్యంలోని కమిటీని కోరారు. దీక్షిత్ సాక్షాత్తూ ఇండియన్ ఆర్కియలాజికల్ సొసైటీకి ఛైర్మన్, భారత పురావస్తు సర్వేక్షణ సంస్థకు మాజీ జాయింట్ డైరెక్టర్ జనరల్. తాజా సిఫార్సులు వచ్చే విద్యా సంవత్సరానికల్లా అమలులోకి రావచ్చట. పిల్లల పాఠ్యపుస్తకాల్లోనే కాక, విద్యావిషయక పరిశోధనలోనూ ఈ కమిటీ సిఫార్సులు చోటుచేసుకుంటాయని 2018లో సంస్కృతీశాఖ మంత్రిగా చేసిన మహేశ్శర్మ తదితరులు ఆశాభావంతో ఉన్నారు. అసలింతకీ కొత్తగా చేర్చదలచిన ఈ ‘సంప్రదాయ చరిత్ర’ అంటే ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దేశాన్ని పాలించిన రాజవంశాలన్నిటికీ పాఠ్యగ్రంథాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలని ఐజాక్ కమిటీ ప్రతిపాదించింది. ఈ సమప్రాతినిధ్యం ప్రాంతాల ప్రాతిపదికన, చరిత్రలో ఆ వంశాల ప్రాధాన్యం ప్రాతిపదికనైతే ఫరవాలేదు. అలా జరుగుతుందా అన్నది ప్రశ్న. సంగీతం, సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం, వాణిజ్యం, భక్తి ఉద్యమాల్లో ఎంతో భాగమున్న దక్షిణాది రాజవంశాలను ఎన్సీఈఆర్టీ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంతకాలం ఉత్తర భారత దృక్కోణంలోనే నడుస్తున్న వారి పుస్తకాల్లో దక్షిణ భారత రాజవంశాలకూ తగినంత చోటిస్తారా? అది ఓ బేతాళప్రశ్న. అయితే, దేశంలో నిత్యం జరిగే చారిత్రక, పురావస్తు అధ్యయనాల్లో కొత్తగా బయటపడుతున్న అంశాలను సైతం పాఠ్యప్రణాళికలో చేర్చాలన్న కమిటీ సిఫార్సును తప్పక స్వాగతించాలి. చరిత్ర జడపదార్థం కాదు. దొరికిన సరికొత్త సాక్ష్యాధారాలతో ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చు కోవాలి. సమకాలీన అంశాలనూ చేర్చుకోవాలి. కానీ, కొత్త మార్పుల పేరిట పాలకపక్ష భావజాలా నికి అనుకూలంగానో, అన్నీ పురాణాల్లోనే ఉన్నాయిష అనో చరిత్రను మార్చాలని చూడడమే దుస్స హనీయం. అసలు సిసలు భారత్కు తామే ప్రతినిధులమని పిల్లలకు పాఠాలతో ఎక్కించి, రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అంత కన్నా ఘోరం లేదు. చంద్రయాన్–3, నారీ శక్తి వందన్, కోవిడ్ నిర్వహణ లాంటి అంశాలకూ చోటిచ్చేలా ఎన్సీఈఆర్టీ ప్రణాళికా రచన చేసినట్టు విద్యాశాఖ చెబుతోంది. నిజానికి, పరిశోధన చేసి, పిల్లల వయసుకు తగిన పాఠాలతో ముందుకు రావడం ఎన్సీఈఆర్టీ పని. ఆ బాధ్యత వదిలేసి, అధికార పార్టీ రాజకీయ ఆలోచనలకు తగ్గట్టు, లేదా ఒక పక్షం విజయాలనే కీర్తిస్తున్నట్టు పాఠ్యాంశాలనే మార్చాలనుకుంటే అది సమగ్ర చరిత్ర కాదు. సమర్థనీయం కానే కాదు! -
ముందు టెట్.. ఆ తర్వాత డీఎస్సీ: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: విద్యా శాఖపై విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం జగన్ తొలి ప్రాధాన్యత అయిన విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ‘‘బైజూస్ కంటెంట్ ఫ్రీగానే ఇచ్చారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చాం. అందులోనూ బైజూస్ కంటెంట్ పెట్టి ఇచ్చాం. దానికి కూడా బైజూస్కి ఒక రూపాయి చెల్లించలేదు. అతని వ్యాపారాలతో మాకు సంబంధం లేదు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. పిల్లలకు మంచి ఇంగ్లీష్ నేర్పడం కోసం టోఫెల్ను తీసుకొచ్చాం. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు టోఫెల్కి ఇచ్చేస్తున్నామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’’ నిప్పులు చెరిగారు. టోఫెల్లో శిక్షణ కోసం పెట్టే టెస్ట్కి ఒక్కో విద్యార్థికి రూ.7.50 పైసలు మాత్రమే ఫీజు. 20 లక్షల 75 వేల మందికి ప్రభుత్వం ఆ ఫీజు కట్టింది. ఆ టెస్ట్లో పాస్ అయిన వారికి మాత్రమే టెస్ట్కి రూ.600 ఫీజు తీసుకుంటారు. మొత్తం కలిపి రూ.6 కోట్లు మాత్రమే టోఫెల్ టెస్ట్ల కోసం పెడితే రూ.వందల కోట్లు పెడుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పేద పిల్లలకు మంచి విద్య అందించడానికి ఖర్చు చేయడం తప్పా?’’ అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు. చదవండి: బాబు లాయర్ల అతి.. బెంచ్ దిగి వెళ్లిపోయిన జడ్జి ముందు టెట్.. ఆ తర్వాత డీఎస్సీ.. ‘‘డీఎస్సీపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుంది. డీఎస్సీపై సీఎం దగ్గర చర్చ జరుగుతోంది. ముందు టెట్.. ఆ తర్వాత డీఎస్సీ నిర్వహిస్తాం. యూనివర్శిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,200కి పైగా పోస్టులు భర్తీ చేస్తాం. నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. 18 ఏళ్ల నుండి యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ జరగలేదు. పాఠశాలల్లో ఖాళీలన్నింటిని గుర్తించాం’’ అని మంత్రి వెల్లడించారు. -
బదిలీలకు ఓకే.. పదోన్నతులకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. బదిలీలను మాత్రం యథా విధిగా కొనసాగిస్తున్నట్టు తెలిపింది. అయితే గతంలో వెల్లడించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. గత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4వ తేదీన బదిలీ ఉత్తర్వులు టీచర్లకు అందాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ నెల 9వ తేదీన అధికారిక ఆదేశాలు ఇవ్వనున్నారు. బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ మంగళవారం జిల్లా విద్యాశాఖ అధి కారులకు ఆదేశించారు. బదిలీల కోసం టీచర్ల నుంచి అందిన దరఖాస్తుల్లో మార్పులు, చేర్పు లను 4వ తేదీ కల్లా పూర్తి చేయాలని, 5వ తేదీన సీనియారిటీ జాబితాను వెల్లడించాలని తెలి పారు. ఈ నెల 6, 7 తేదీల్లో టీచర్లు బదిలీ కావా ల్సిన పాఠశాలల వివరాలతో వెబ్ ఆప్షన్లు ఇవ్వా లని, వీటిల్లో మార్పులుంటే 8వ తేదీ నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన బదిలీ ఉత్తర్వులు సంబంధిత ఉపాధ్యా యులకు అందించాలని స్పష్టం చేశారు. టెట్ తెచ్చిన తిప్పలు: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి గత నెల ఒకటవ తేదీన విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా ప్రధానోపాధ్యాయుల ఖాళీలు గుర్తించి, వాటిని స్కూల్ అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇదే క్రమంలో స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను గుర్తించి, ఎస్జీటీల ద్వారా 70 శాతం నింపేందుకు వీలుగా దరఖాస్తుల పరిశీలన వరకూ వెళ్ళింది. ఈ దశలో సీనియారిటీలో హేతుబద్ధత కొరవడిందని కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో మల్టీజోన్–2 పరిధిలోని ప్రమోషన్లు తొలుత నిలిపివేశారు. ఇదే సమయంలో కేంద్ర నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాసయిన వారికే పదోన్నతులు ఇవ్వాలని మరికొంతమంది కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి 2010లో కేంద్రం ఈ నిబంధనను తెచ్చింది. కానీ రాష్ట్రంలో టెట్ 2011 నుంచి ఏర్పాటు చేశారు. ఈ కారణంగా అంతకుముందు నియమితులైన టీచర్లకు టెట్ అర్హత ఉండే ఆస్కారం లేదనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దీనికి మినహాయింపు ఇచ్చింది. అయితే ఇది కేవలం సర్వీస్లో కొనసాగడానికేనని, పదోన్నతులకు టెట్ ఉండాలన్న వాదనను కోర్టు సమర్థించింది. ప్రమోషన్లపై స్టే ఇచ్చింది. న్యాయపరంగా ఈ అంశాన్ని పరిష్కరించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని భావించిన అధికారులు, ప్రమోషన్ల అంశాన్ని పక్కనబెట్టేశారు. రిలీవర్ వస్తేనే స్థాన చలనం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 78 వేల మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తప్పనిసరిగా బదిలీ అయ్యే వారి సంఖ్య 40 వేలకుపైనే ఉంటుంది. సీనియారిటీ ప్రకారం చూస్తే 58 వేల మందికి బదిలీకి ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఉపాధ్యాయుడికి బదిలీ అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడు ఉంటేనే రిలీవ్ చేయాలని హెచ్ఎంలకు సూచించారు. అంటే రిలీవ్ అయ్యే టీచర్ బోధించే సబ్జెక్టుకు సంబంధించిన మరో టీచర్ బదిలీపై వస్తేనే ప్రస్తుతం ఉన్న టీచర్ను రిలీవ్ చేయాలని ఆదేశించారు. దీంతో 58 వేల మంది టీచర్ల బదిలీకి ఆస్కారమున్నా, 25 వేల మందికి మించి స్థాన చలనం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. పాఠశాల విద్య డైరెక్టర్ మార్గదర్శకాల ప్రకారం.. టీచర్ 8 ఏళ్ళు, హెచ్ఎం 5 ఏళ్ళు ఒకేచోట ఉంటే తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకేచోట కనీసం రెండేళ్ళుగా పనిచేస్తున్న టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. -
Fact Check: చదువులపై ‘చెత్త’ రాతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడుగు, బలహీనవర్గాల పిల్లలకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యనందించడాన్ని పచ్చ పత్రికలు జీర్ణించుకోలేకపోతున్నాయి. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా అసత్య కథనాలతో పదే పదే విషం చిమ్ముతున్నాయి. స్కిల్ కుంభకోణంలో కోట్లాది రూపాయలు మాయం చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలు కావడంతో దిక్కుతోచని పచ్చ పత్రికలు మరోమారు బడుగుల చదువులపై పడ్డాయి. చంద్రబాబు దోపిడీ వ్యవహారాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బుధవారం ఓ పచ్చపత్రిక బైజూస్కు లేని టెండర్ సీమెన్స్కు కావాలా? అంటూ అర్థంపర్థం లేని వార్తను ప్రచురించించి. ఇది పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నదని, కేవలం ప్రజలను తప్పుదోవపట్టించేందుకే ఇలాంటి వార్తలు ప్రచురిస్తున్నారని పాఠశాల విద్యాశాఖ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో సీమెన్స్ సంస్థతో ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు. ముందస్తుగానే వందల కోట్లు చెల్లించేసింది. ఇందులోనే అసలు మతలబు తెలిసిసోతోంది. ఈ వ్యవహారంతో తమకు ఏ సంబంధం లేదని సీమెన్స్ సంస్థ కూడా స్పష్టంగా చెప్పింది. వైఎస్ జగన్ ప్రభుత్వం పేద పిల్లల అభ్యున్నతికి బైజూస్ కంటెంట్ అందించడంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించింది. బైజూస్తో ఒప్పందం చేసుకొని మరీ ఆ సంస్థ కంటెంట్ను పిల్లలకు అందిస్తోంది. పైగా, బైజూస్కు ఎటువంటి చెల్లింపులూ చేయలేదు. వందల కోట్ల విలువైన కంటెంట్ను బైజూస్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అందిస్తోంది. ఎటువంటి ఒప్పందం లేకుండా జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి.., పూర్తి పారదర్శకంగా బైజూస్తో ఒప్పందం చేసుకొని, పూర్తి ఉచితంగా అందిస్తున్న విద్యా సేవకు లింకు పెట్టి పచ్చపత్రిక కథనాన్ని ఇవ్వడాన్ని విద్యా శాఖ ఖండించింది. అసలు వాస్తవాలను విద్యా శాఖ వెల్లడించింది. ♦ బైజూస్ సంస్థతో చేసుకున్న ఎంవోయూ ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాల్లో 4 నుంచి 10వ తరగతి పిల్లలకు బైజూస్ కంటెంట్ యాప్ను వారి సొంత మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఉచితంగా యాక్సెస్ చేయడానికి అందుబాటులో ఉంచారు. ♦ దీనికోసం బైజూస్కి ప్రభుత్వం ఎటువంటి డబ్బు చెల్లించలేదు. ♦ 8వ తరగతి చదివే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇచ్చేందుకు బహిరంగ, పారదర్శక బిడ్డింగ్ ద్వారా శామ్సంగ్ కంపెనీ నుండి ట్యాబ్లను ప్రభుత్వం సేకరించింది. ♦ దీనిలో బైజూస్ పాత్ర ఏమీ లేదు. ఈ శామ్సంగ్ ట్యాబ్ ఎస్డీ కార్డ్లో కంటెంట్ను లోడ్ చేసినందుకు బైజూస్కు శామ్సంగ్ సంస్థే లేబర్ ఛార్జీలను చెల్లించింది. ♦ ఇది బైజూస్, శామ్సంగ్ హార్డ్వేర్ తయారీదారుల మధ్య అంతర్గత ఏర్పాటు. కాబట్టి ప్రభుత్వం, బైజూస్ మధ్య ఎటువంటి డబ్బుల ఒప్పందం లేదు. ♦ బడి పిల్లలకు కోర్సుకు రూ. 15,000 చొప్పున 5.18 లక్షల మంది పిల్లలు కంటెంట్ని ఉచితంగా యాక్సెస్ చేస్తున్నారు. కాబట్టి దీని విలువ దాదాపు 750 కోట్లు ఉచితంగా అందజేసినట్లుగా భావించాలి. ♦ అంతేకాకుండా 4 నుండి 10 తరగతి వరకు చదివే విద్యార్థులు 17,59,786 మందికి రూ.12,000 విలువ చేసే కంటెంట్ విలువ మొత్తం రూ. 2,111.74 కోట్లు అవుతుంది. ఈ మొత్తం కూడా రాష్ట్ర విద్యార్థులకు ఉచితంగా బైజూస్ అందించింది. -
విద్యపై ఖర్చు రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడి
సాక్షి, విశాఖపట్నం: విద్యపై చేస్తున్న ఖర్చు మన రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడి అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ కుటుంబ సభ్యులేననీ, ప్రతి ఉద్యోగి ప్రభుత్వంలో అంతర్భాగమేనని వారిపై పనిఒత్తిడి తగ్గించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ ఆలోచిస్తుంటారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి మంత్రులు బొత్స, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యాలయాల్లో ఉత్తమ బోధన అందిస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే.. విశ్వవిద్యాలయాల్లో 3,200 పోస్టుల భర్తీ రాష్ట్రంలో టీచర్లకు జీతాలు ఇంకా వేయలేదని కొందరు విమర్శిస్తున్నారు. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా ఏ ప్రభుత్వమైనా ఉంటుందా? కేవలం సాంకేతిక కారణాలతోనే జీతాలు ఆలస్యమయ్యాయి. 7 లేదా 8 తేదీల్లో జీతాలు జమచేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నడూలేని విధంగా ఇప్పుడు ‘నో అడ్మిషన్’ బోర్డులు పెడుతున్నాం. అదేవిధంగా.. ఇటీవల టెన్త్ ఫలితాల్లో ఎక్కువ స్టేట్ ర్యాంకులు గవర్నమెంట్ స్కూల్స్లో చదివే విద్యార్థులే దక్కించుకున్నారు. వీటన్నింటికీ కారణం ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఇక విద్య మీద ఖర్చుచేసే ప్రతి రూపాయి రాష్ట్రం మీద పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోంది. గత 15 ఏళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాల్లేవు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం 3,200 పోస్టులు భర్తీని డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేస్తాం. ఉపాధ్యాయులందరికీ న్యాయం జరుగుతుంది.. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ‘మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్కు విశాఖకు విడదీయలేని అనుబంధం ఉంది. సీఎం జగన్ న్యాయం చేయలేకపోతే ఉపాధ్యాయులకు మరెవ్వరూ మేలు చేయలేరు. ఒక రోజు అటు ఇటుగా అందరికీ న్యాయం జరుగుతుంది’ అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ ‘విద్యావ్యవస్థలో నాడు–నేడు కార్యక్రమం ద్వారా విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చి పాఠశాలలను మెరుగుపరచేందుకు అనేక సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది’ అన్నారు. ‘ప్రపంచ జ్ఞానం నేర్పే గురువులకు కృతజ్ఞతాభివందనాలు’ ‘బిడ్డ గొప్పగా ఎదిగితే.. ఆ బిడ్డ తల్లిదండ్రుల ఆనందం.. ఆకాశాన్నంటుతుంది. వందలు.. వేల పిల్లల జీవితాల్ని తీర్చిదిద్దే ప్రతి టీచర్కు లభించే సంతోషం, సంతృప్తి ఇంకెంత గొప్పదో మాటల్లో చెప్పలేం. శిక్షణ, క్రమశిక్షణ.. పాఠాలు, జీవిత పాఠాలు.. అక్షరజ్ఞానం, ఆలోచనలు.. ప్రపంచ జ్ఞానం అన్నీ నేర్పే గురుబ్రహ్మలకు, మేథోశక్తులకు ఆదర్శప్రాయులైన మంచి టీచర్లకు, రాష్ట్రం తరఫున కృతజ్ఞతాభివందనాలు. (విదేశీ పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ సందేశాన్ని సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు చదివి వినిపించారు.) రాష్ట్రపతి, ప్రధాని సందేశాలు ఇక గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతిముర్ము సందేశాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి... ప్రధాని మోదీ సందేశాన్ని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ చదివి వినిపించారు. అనంతరంరాష్ట్రవ్యాప్తంగా 11 కేటగిరీల్లో 196 మందికి ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు అవార్డులందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ డా.భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్, ఏయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, విశాఖ మేయర్ జీహెచ్వీ కుమారి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నాగరాణి, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉత్తమ ఉపాధ్యాయులుగా 54 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో అవార్డులకు అర్హుల ఎంపికను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. ఈ అవార్డులకు అర్హతలున్న వారికి సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతిపాదనలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ యంత్రాంగం ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలన చేసింది. ఇందులో భాగంగా నాలుగు కేటగిరీల్లో 97 ప్రతిపాదనలు పరిశీలించిన పరిశీలన కమిటీ... 42 మందిని ఎంపిక చేసింది. అదేవిధంగా ప్రత్యేక కేటగిరీలో మరో 12 మందికి అవకాశం కల్పించింది. మొత్తంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 54 మందిని ఎంపిక చేసిన పాఠశాల విద్యా శాఖ కమిషనర్... శనివారం వారి పేర్ల జాబితాను ప్రకటించింది. మంత్రి సబితతో ఉత్తమ ఉపాధ్యాయుల భేటీ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ నెల 4వ తేదీన మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్ఐ)లో భేటీ కానున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల అనుభవాలు, విద్యాభివృద్ధికి దోహదపడే ఆలోచనలను వారు మంత్రితో పంచుకోనున్నారు. ఉత్తమ ఉపాద్యాయ అవార్డుకు ఎంపికైన టీచర్లు ఈనెల 4వ తేదీన మధ్యాహ్నం 2గంటల కల్లా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో రిపోర్టు చేయాలని సూచించారు. రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి వేడుకలు... ఈనెల 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉదయం 10గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయని వివరించింది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. -
రాష్ట్రంలో కొత్తగా 20 కేజీబీవీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఈ దిశగా మంగళవారం విద్యాశాఖ జీవో జారీ చేసింది. వీటి ఏర్పాటుకు రికరింగ్ బడ్జెట్గా రూ.60 లక్షలను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. జిల్లాల విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన మండలాల్లో 20 కేజీబీవీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించగా, ఆయా ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో 2014లో రాష్ట్రంలో 391 కేజీబీవీలుండేవి. 2017–18లో కొత్తగా 84 కేజీబీవీలను మంజూరు చేశా రు. దీంతో రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య 475కు చేరింది. తాజాగా మంజూరైన వాటి తో వీటి సంఖ్య 495కు చేరింది. వీటిల్లో 245 కేజీబీవీల్లో ఇంటర్ విద్య, మరో 230 కేజీబీవీలను పదోతరగతి వరకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేసినవి ఇవే.. మావల (ఆదిలాబాద్), బీర్పూర్, బుగ్గారం (జగిత్యాల), కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్), దంతాలపల్లి (మహబూబాబాద్), మహ్మదాబాద్ (మహబూబ్నగర్), నార్సింగి, నిజాంపేట, హవేలి, ఘన్పూర్ (మెదక్), నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ (నార్త్), నాగలిగిద్ద, మెగ్గుంపల్లి, వట్పల్లి, గుమ్మడిదల, చౌటకూరు (సంగారెడ్డి), దూల్మిట్ట (సిద్దిపేట), చౌడాపూర్ (వికారాబాద్). -
100 శాతం జీఈఆర్.. తొలి మండలంగా తెనాలి అర్బన్
ఈ చిత్రంలోని బాలుడి పేరు.. ఆదిముళ్ల నాగచైతన్య. గుంటూరు జిల్లా తెనాలి ఇందిరానగర్ కాలనీలో ఇతడి కుటుంబం ఉంటోంది. ఇంటికి కొంచెం దూరంలోనే ఉన్న మున్సిపల్ హైస్కూలులో ఐదో తరగతి చదువుతూ మధ్యలో మానేశాడు. చదువుపై ఆసక్తి లేదని చెప్పడంతో తల్లిదండ్రులూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో స్థానిక సచివాలయం నుంచి ఒక విద్యా కార్యదర్శి వచ్చి పిల్లాడిని చదివించాలని వారికి నచ్చజెప్పారు. ఫీజులు కట్టలేమని చెబితే దగ్గర్లోని కాన్వెంటులో ఉచితంగా చదివిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పిల్లాడూ సరేనన్నాడు. ఇప్పుడు రోజూ కాన్వెంటుకు వెళుతున్నాడని బాలుడి తల్లి సౌజన్య సంతోషంతో చెబుతున్నారు. తెనాలి: బడి బయట ఉన్న పిల్లలను, మధ్యలో బడి మానేసినవారిని గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. 2005 సెప్టెంబర్ 1–2018 ఆగస్టు 31 మధ్య పుట్టినవారంతా సెప్టెంబర్ 4 నాటికి ఏదో ఒక స్కూల్/కాలేజీలో నమోదై ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎవరైనా బడి/కాలేజీకి దూరంగా ఉంటే వారిని చేర్పించాలని ప్రభుత్వం.. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా తెనాలి అర్బన్ మండలం విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్)లో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించిన తొలి మండలంగా అవతరించింది. ఈ మండలంలో బడి బయట చదువుకు దూరంగా ఉన్న మొత్తం 935 మందిని పాఠశాల/కాలేజీలో చేర్పించారు. జూలై మొదటి వారం నుంచే ప్రత్యేక డ్రైవ్.. గ్రామ/ వార్డు సచివాలయాల సహకారంతో పాఠశాల విద్యాశాఖ నూరు శాతం జీఈఆర్ సాధనకు జూలై మొదటి వారం నుంచే ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఈ క్రమంలో 47 సచివాలయాలు కలిగిన తెనాలి అర్బన్ మండలం 100 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోల పర్యవేక్షణలో వలంటీర్లు, వార్డు సచివాలయ విద్యా కార్యదర్శులు ఇంటింటా సర్వేను ఒక ఉద్యమంలా చేపట్టారు. ఒక్కో సచివాలయం పరిధిలో వందలాదిమంది బడి ఈడు పిల్లల సమాచారాన్ని సేకరించారు. విద్యాశాఖ.. వార్డు/ గ్రామ వలంటీర్లకు అందజేసిన యాప్లో వారి వివరాలను పొందుపరిచారు. పదో తరగతిలోపు విద్యార్థులను వారు కోరుకున్న ప్రభుత్వ/ ప్రైవేటు పాఠశాలలకు పంపారు. స్థోమత లేని పేదింటి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. అందుకు ఇష్టపడని పిల్లలను తల్లిదండ్రుల అభిమతం ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలకు పంపారు. ఇంటర్ ఫెయిలైనవారు, మధ్యలో మానేసినవారిని కాలేజీ/ఐటీఐ/ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేర్చారు. మరికొందరిని వారు కోరినట్టుగా కోచింగ్ క్లాసులకు పంపారు. ఈ విధంగా తెనాలి అర్బన్ మండలంలో 935 మంది మళ్లీ బడి/కళాశాల బాటపట్టారు. కాగా అర్బన్ మండలంతోపాటు తెనాలి రూరల్ మండలం కూడా నూరు శాతం జీఈఆర్ లక్ష్యాన్ని సాధించింది. ఇక్కడ కూడా బడి బయట ఉన్నట్టు గుర్తించిన 355 మంది పిల్లలను బడి/కళాశాలల్లో చేర్పించారు. కోరిన పాఠశాలల్లోనే చేర్పించాం.. రాష్ట్రంలో నూరు శాతం జీఈఆర్ సాధించిన తొలి మండలంగా తెనాలి అర్బన్ నిలవడం పట్ల చాలా సంతోషంగా ఉంది. అందరి సమన్వయంతో రూరల్ మండలంలోనూ ఈ లక్ష్యాన్ని సాధించాం. పిల్లలు, వారి తల్లిదండ్రులు కోరుకున్న విద్యాసంస్థల్లోనే చేర్పించాం. – మేకల లక్ష్మీనారాయణ, మండల విద్యాశాఖాధికారి, తెనాలి, గుంటూరు జిల్లా చాలా సంతృప్తిగా ఉంది.. కరోనా తర్వాత మైగ్రేషన్, డేటాలో వయసు తప్పు వంటి సాంకేతిక సమస్యలను అధిగమించి మా సచివాలయం పరిధిలో 563 మందిని సర్వే చేశాం. చదువుకు దూరంగా ఉన్న ఇద్దరు పేద పిల్లలను గుర్తించి వారిని ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలో చేర్పించాం. చాలా సంతృప్తిగా ఉంది. – గంగవరపు స్వాతి, వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ, 35వ సచివాలయం, తెనాలి, గుంటూరు జిల్లా -
6,612 టీచర్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి వెల్లడించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఆమె గురువారం ఎస్సీఈఆర్టీ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు.‘‘రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నేరుగా భర్తీ చేసేందుకు 6,612 ఖాళీలు ఉన్నాయి. వాటిలో 5,089 పోస్టులు సాధారణ పాఠశాలల్లో, 1,523 పోస్టులు ప్రత్యేక అవసరాలుగల పిల్లల కోసం నిర్దేశించినవి. వీటిని త్వరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించా రు. 2017లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నిర్వహించి 8,792 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. కానీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)ల ద్వారా భర్తీ చేయాలని ముఖ్య మంత్రి ఆదేశించారు. దీనితో గతంలో నిర్వహించినట్టుగా డీఎస్సీల ద్వారా నియామకాలు చేపట్టనున్నాం..’’ అని మంత్రి సబితారెడ్డి వివరించారు. 9,979 పోస్టులకు పదోన్నతులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 1,22,386 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా.. వీటిలో 1,03,343 పోస్టుల్లో టీచర్లు పనిచేస్తున్నారని మంత్రి సబితారెడ్డి తెలిపారు. ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో 6,612 పోస్టులను భర్తీ చేస్తుండగా.. పదోన్నతుల ద్వారా మరో 9,979 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన కేటగిరీలో గెజిటెడ్ హెచ్ఎం ఖాళీలు 1,947 ఉన్నాయని, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పోస్టులు 2,162 ఉన్నాయని.. స్కూల్ అసిస్టెంట్ స్థాయి టీచర్లకు పదోన్నతుతో వీటిని భర్తీ చేయాల్సి ఉంటుందని వివరించారు. మరో 5,870 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లోకి ఎస్జీటీ టీచర్లకు పదోన్నతులు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 15న టెట్ డీఎస్సీ ద్వారా చేపట్టాల్సిన నియామకాలకు టెట్ కీలకమని.. ఇందుకోసం వచ్చే నెల 15వ తేదీన టెట్ పరీక్ష నిర్వహిస్తామని సబితారెడ్డి ప్రకటించారు. టెట్ ఫలితాలను వచ్చేనెల 27వ తేదీన ప్రకటిస్తామని.. ఆ తర్వాత ఉపాధ్యాయ నియామకాల ప్రకటన జారీ చేస్తామని తెలిపారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతోందని, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే తక్షణమే వాటిని కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఇటీవల కేజీబీవీల్లో 1,264 పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగిందని.. కొత్తగా 20 కేజీబీవీల ఏర్పాటుతో మరో 160 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. వీటిని కూడా వీలైనంత త్వరగా భర్తీ చేస్తామన్నారు. ఇక వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా విద్యాశాఖలో 3,896 మందికి లబ్ధి చేకూరిందని, ఇందులో అత్యధికులు విద్యాశాఖ వారే ఉన్నారని మంత్రి చెప్పారు. గురుకుల విద్యాసంస్థల్లో కూడా పలువురు ఉద్యోగులను క్రమబద్ధీకరించామన్నారు. మొత్తంగా విద్యాశాఖ పరిధిలో 8,792 పోస్టులు, కాలేజీల్లో 3,149 పోస్టుల భర్తీ ప్రక్రియలు టీఎస్పీఎస్సీ ద్వారా కొనసాగుతున్నాయని తెలిపారు. భర్తీ చేసే టీచర్ పోస్టులు ఇవీ.. మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు: 6,612 జనరల్ టీచర్లు: 5,089 వీరిలో స్కూల్ అసిస్టెంట్లు: 1,739 సెకండరీ గ్రేడ్ టీచర్లు: 2,575 భాషా పండితులు: 611 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు: 164 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు: 1,523 వీటిలో ప్రాథమిక స్థాయిలో 796 పోస్టులు – ప్రాథమికోన్నత స్థాయిలో 727 పోస్టులు ‘డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ’ ఇలా.. ప్రతి జిల్లాకు ఒక ‘డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)’ ఉంటుంది. దీనికి సదరు జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్గా అదనపు కలెక్టర్, కార్యదర్శిగా జిల్లా విద్యాశాఖ అధికారి, సభ్యులుగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (జెడ్పీ సీఈఓ) వ్యవహరిస్తారు. గతంలో డీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియామకాలు జరిగేవి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామంటూ డీఎస్సీలను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా వీటిని తిరిగి ఏర్పాటు చేయనుంది. -
ఖాళీల్లో మూడో వంతే భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించడం.. ఓవైపు అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించినా, తక్కువ పోస్టులనే భర్తీ చేయడం ఏమిటనే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వ ప్రకటన విద్యాశాఖలో టీచర్ల కొరతను తీర్చేదిగా లేదని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు పేర్కొంటున్నారు. నియామక ప్రక్రియలో స్పష్టమైన విధానం లేదని ఆరోపిస్తున్నారు. పదోన్నతులతో ముడిపడి ఉన్న స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), ప్రధానోపాధ్యాయుల పోస్టుల విషయంపై మంత్రి స్పష్టత ఇవ్వలేదని.. విద్యాశాఖను వేధిస్తున్న పర్యవేక్షణ పోస్టులైన డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోల కొరత విషయాన్నీ ప్రస్తావించలేదని అంటున్నారు. 22 వేల పోస్టులు ఖాళీ రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 13,086 ఖాళీ పోస్టులు ఉన్నాయని స్వయంగా సీఎం కేసీఆర్ గత ఏడాది ఏప్రిల్లో వెల్లడించారు. అందులో 10 వేల వరకు టీచర్ పోస్టులే ఉంటాయని అంచనా వేశారు. మిగతా వాటిలో 24 డిప్యూటీ డీఈవో ఖాళీలని ప్రభుత్వం తెలిపింది. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా 72 డిప్యూటీ డీఈవో పోస్టులు ఉండగా.. ప్రస్తుతం నలుగురే పనిచేస్తున్నారు. 68 పోస్టులు ఖాళీయే. ఇక ఎంఈవోలు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, డైట్ అధ్యాపకుల ఖాళీలు భారీగా ఉన్నాయి. మరోవైపు ఇటీవలి విద్యాశాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 21,433 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అంతర్గత పరిశీలనలో గుర్తించారు. పాఠశాలలు, టీచర్ల హేతుబద్దీకరణ చేపట్టిన తర్వాత వాటిని ప్రకటించాలనుకున్నారు. కానీ ఆ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. స్కూళ్లలో 1,974 హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి ఇవ్వడం ద్వారా వీటిని భర్తీ చేయాలి. ఇదే సమయంలో 7,200 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎస్జీటీలకు పదోన్నతి ద్వారా 70 శాతం, నేరుగా నియామకాల ద్వారా 30 శాతం పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతులు చేపడితే గానీ అసలు ఖాళీలు ఎన్ని అనే స్పష్టత వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.31 లక్షల మంది టీచర్ పోస్టులు ఉంటే.. ప్రస్తుతం పనిచేస్తున్నది 1.09 లక్షల మంది మాత్రమే. అంటే దాదాపు 22 వేల ఖాళీలు ఉన్నట్టు తెలుస్తోంది. పదోన్నతుల కోసం ఎదురుచూపులు రాష్ట్రంలో ఏడేళ్లుగా టీచర్లకు పదోన్నతులు కల్పించలేదు. గత నాలుగేళ్లుగా సాధారణ బదిలీలు కూడా లేవు. మూడుసార్లు నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లలో పాసైన 4 లక్షల మంది టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే బదిలీలు, పదోన్నతులకు కోర్టు కేసులు, ఇతర అడ్డంకులు ఉండటంతో.. 1,974 హెచ్ఎం పోస్టులు, 2,043 ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పోస్టులు, 7,200 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6,775 ఎస్జీటీలు, 467 ఎంఈవో పోస్టుల భర్తీ చేపట్టలేదని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. కానీ ప్రభుత్వం 6,612 పోస్టులే భర్తీ చేస్తుండటం.. ఇందులో సాధారణ టీచర్ పోస్టులు 5,089 మాత్రమే ఉండటంపై నిరాశ వ్యక్తమవుతోంది. పోస్టులను కుదించేస్తారా? వాస్తవంగా 22 వేల ఖాళీలు ఉన్నా.. హేతుబద్దీకరణ చేపడితే పోస్టుల సంఖ్య బాగా తగ్గుతుందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని 8,782 స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 20లోపే ఉందని.. ఇందులో 8,665 ప్రాథమిక పాఠశాలలు, 117 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయని అంటున్నాయి. వంద మంది పిల్లల కంటే ఎక్కువ ఉన్న స్కూళ్లు 6,833 మాత్రమేనని వివరిస్తున్నాయి. వీటిని హేతుబద్దీకరిస్తే టీచర్ పోస్టులు తగ్గుతాయని పేర్కొంటున్నాయి. అయితే ఈ తరహా హేతుబద్ధీకరణతో పాఠశాలలను, టీచర్ పోస్టులను కుదించడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. పిల్లల సంఖ్యను బట్టి కాకుండా.. స్కూళ్లలో తరగతులు, టీచర్ల అవసరాన్ని చూడాలని స్పష్టం చేస్తున్నాయి. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: బడికొస్తున్న ‘మేధావి’!
నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి: వెంకటేష్ గతంలో పది రోజుల పాటు పాఠశాలకు రాకపోయినా ప్రధానోపాధ్యాయుడికే సమాచారం లేని పరిస్థితి! వందల మంది విద్యార్థుల్లో ఎవరు సక్రమంగా వస్తున్నారో.. ఎంతమంది డుమ్మా కొట్టారో తెలుసుకోవాలంటే అటెండెన్స్ రిజిస్టర్లు తిరగేయాల్సిందే! ఆ వివరాలన్నీ సేకరించి హెచ్ఎం దృష్టికి వెళ్లేసరికి రోజులు గడిచిపోయేవి! ఇప్పుడు ఓ విద్యార్థి పాఠశాలకు రాకుంటే హెచ్ఎంకే కాదు.. ఏకంగా విజయవాడలోని విద్యాశాఖ కమిషనర్కు కూడా నిమిషాల్లో తెలిసిపోతోంది. ఒక్క రోజు బడికి గైర్హాజరైనా తల్లిదండ్రులకు సమాచారం అందుతోంది. ఉపాధ్యాయులు సమయానికి రాకున్నా, విద్యార్థులకు తాగునీరు అందకపోయినా, మరుగుదొడ్ల తలుపు విరిగిపోయినా ఉన్నతాధికారులు తక్షణమే గుర్తిస్తున్నారు. తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) టెక్నాలజీ సాయంతో పాఠశాల విద్యాశాఖ సాధించిన విజయం. నూరు శాతం ఫలితాలు.. ప్రతి విద్యార్థీ క్రమశిక్షణ పాటిస్తూ రోజూ బడికి వెళ్లి చక్కగా చదువుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తోంది. పుస్తకాల నుంచి ఫీజుల దాకా తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడకుండా భావి పౌరులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతోంది. ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్ది ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంగ్లిష్ మీడియంలో చదువులతోపాటు టోఫెల్ లాంటి పరీక్షలకు సైతం ఉచితంగా తర్ఫీదునిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా మన విద్యార్థులను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో కొండకోనల్లోని స్కూళ్లను సైతం పర్యవేక్షించేలా గతేడాది అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక సాంకేతిక విభాగం ఇప్పుడు దేశంలోనే ఉత్తమ పనితీరుతో ముందంజలో నిలుస్తోంది. రాష్ట్రంలోని 58,465 పాఠశాలల్లో జరిగే అన్ని కార్యకలాపాలు, విద్యార్థుల మంచిచెడులు, ఉపాధ్యాయుల స్థితిగతులు, నాడు–నేడు పనులను ‘ఏఐ’ టెక్నాలజీతో నిరంతరం ఉన్నతస్థాయిలో పర్యవేక్షించడంతో పాటు తక్కువ వ్యవధిలోనే నూరు శాతం ఫలితాలు సాధించారు. అత్యుత్తమ కమాండ్ సెంటర్లు మనవే.. నిన్న మొన్నటి దాకా ఇంటి నుంచి కాలు బయటపెట్టిన విద్యార్థి సక్రమంగా స్కూలుకు వెళ్లాడో లేదో అంతు చిక్కని పరిస్థితి. టీచర్ స్కూల్కు వచ్చారో లేదో కనీసం ఎంఈవో దృష్టికి కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ముందస్తు సమాచారం లేకుండా బడి మానేసినా.. ఉపాధ్యాయుడు సెలవు పెట్టకుండా స్కూలుకు రాకున్నా ఆ విషయం విద్యాశాఖ కమిషనర్కు, ప్రధాన కార్యదర్శికి, సంబంధిత మంత్రికి సైతం గంట వ్యవధిలోనే తెలిసిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 70,70,143 మంది విద్యార్థులు, 3,01,677 మంది ప్రభుత్వ టీచర్ల హాజరును కాగితాలతో పని లేకుండా నిత్యం నిశితంగా పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలో రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లను (విద్యా సమీక్ష కేంద్రాలు)నెలకొల్పి విద్యార్థుల హాజరు మొదలు గోరుముద్ద, విద్యాకానుక, అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు లాంటి సమస్త అంశాలను దీనికి అనుసంధానించారు. ఇలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లు దేశంలో మూడు (గుజరాత్, ఢిల్లీ, ఏపీ) మాత్రమే ఉండగా అత్యుత్తమ పనితీరుతో పూర్తిగా ఆన్లైన్ (పేపర్ లెస్) విధానాన్ని అనుసరిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. గతేడాది అక్టోబర్లో ప్రారంభమైన ఈ సెంటర్ సమర్థంగా సేవలు అందించడంతో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ప్రతి రోజు 99.50 శాతం హాజరు నమోదవుతుండడం విశేషం. ఎంతో విజయవంతమైన మన ఎడ్యుకేషన్ టెక్నాలజీని పక్క రాష్ట్రాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అటెండెన్స్ యాప్లో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో 58,465 పాఠశాలలు (44,372 ప్రభుత్వ, 847 ఎయిడెడ్, 13,189 ప్రైవేట్, 57 కేంద్ర ప్రభుత్వ పరిధిలోవి) ఉండగా వీటిలో 70,70,143 మంది విద్యార్థులు చదువుతున్నారు. అమ్మ ఒడి పథకానికి విద్యార్థుల హాజరును పరిగణలోకి తీసుకుంటూ అన్ని యాజమాన్యాల్లో చదువుతున్న విద్యార్థుల హాజరును రోజూ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. ఉదయం 10.30 గంటలకల్లా విద్యార్థుల హాజరును ఆన్లైన్లో నమోదు చేయగానే గోరుముద్ద, కోడిగుడ్డు, రాగిజావ, చిక్కీ తీసుకునేవారి వివరాలు ‘ఏఐ’ టెక్నాలజీ అటెండెన్స్ యాప్లో నమోదవుతున్నాయి. ఇదే తరహాలో ఉపాధ్యాయుల ఫేషియల్ రికగ్నేషన్ సైతం ఉదయం 9 నుంచి 9.15 గంటల మధ్య స్కూలు పరిధిలోనే ఫొటోతో నమోదు చేయాలి. నెట్ సౌకర్యం లేకున్నా అందుబాటులోకి రాగానే టైమ్తో సహా అప్డేట్ అయ్యేలా టెక్నాలజీని రూపొందించారు. ‘‘స్కూల్ ఇన్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టం’’ (సిమ్స్)లో రికార్డయ్యే వివరాలు ఉదయం 11– 12 గంటల్లోగా విజయవాడ, విశాఖల్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లకు చేరుతున్నాయి. ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యా సంబంధ గ్రీవెన్స్, పాఠశాల పర్యవేక్షణ, గోరుముద్ద, కన్స్టెంట్ రిథమ్(నాడు–నేడు), విద్యాకానుక, బైజూస్, డీబీటీ అంశాలను అనుసంధానించారు. గత సెపె్టంబర్, అక్టోబర్ నాటికి రోజుకు 68 శాతం కంటే తక్కువగా ఉన్న విద్యార్థుల హాజరు ఈ టెక్నాలజీ రాకతో ఇప్పుడు 99.50 శాతానికి పైగా నమోదవుతోంది. నెట్వర్క్ సరిగాలేని ఒకటి రెండు జిల్లాల్లోని కొన్ని పాఠశాలలు మినహా మిగిలిన అన్నిచోట్లా నూరు శాతం ఫలితాలు రావడం గమనార్హం. జిల్లాకు ఇద్దరు చొప్పున పర్యవేక్షణ కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది మధ్యాహ్నం 12 గంటల నుంచి బడికి గైర్హాజరైన విద్యార్థుల వివరాలను గుర్తించి తల్లిదండ్రుల ఫోన్కు మెస్సేజ్లు పంపుతున్నారు. ఒక్క రోజు రాకుంటే తల్లిదండ్రులకు సమాచారం ఇస్తుండగా వరుసగా మూడు రోజులు గైర్హాజరైతే విద్యార్థి ఇంటి పరిధిలోని వలంటీర్కు, గ్రామ / వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శికి, ఎంఈవో, డీఈఓలకు సమాచారం అందుతోంది. అందుకు కారణాలను తెలుసుకుని ఆ వివరాలను యాప్లో నమోదు చేసి సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉంటుంది. ఇందుకోసం జిల్లాకు ఇద్దరు చొప్పున 52 మంది సిబ్బందితోపాటు జోన్కు ఒక్కరు చొప్పున నలుగురు పర్యవేక్షకులు విధులు నిర్వర్తిస్తూ ఏ రోజు అంశాలను అదేరోజు పరిష్కరిస్తున్నారు. విజయవాడ సెంటర్ నుంచి టీచర్ల అటెండెన్స్, గోరుముద్ద, బైజూస్, అకడమిక్ అంశాలను పరిశీలిస్తుండగా విశాఖ కేంద్రంగా విద్యార్థుల హాజరు, కన్స్టెన్ రిథమ్, జేవీకే, డీబీటీ అంశాలను పర్యవేక్షిస్తున్నారు. సచివాలయాలతో అనుసంధానం నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డబుల్ డెస్క్ బెంచీలు, ఫ్యాన్లు, స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీ స్క్రీన్లు, టాయిలెట్లు, ఆర్వో తాగునీరు లాంటి వసతులను ప్రభుత్వం కల్పించింది. వీటిని ప్రతినెలా పరిశీలించేలా గ్రామ / వార్డు సచివాలయాల సిబ్బందిని విద్యాశాఖ పోర్టల్తో అనుసంధానించారు. స్థానిక ఆరోగ్య సిబ్బంది వారంలో ఒకసారి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేయాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ సైతం నిర్ణీత వ్యవధిలో స్కూల్లో సమస్యలను గుర్తించి ఫొటోతో సహా యాప్లో అప్లోడ్ చేయాలి. ఇలా స్కూలు హెచ్ఎం నుంచి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి వరకు అన్ని స్థాయిల్లో పరిశీలిస్తారు. ఈ విధానంలో ఎవరికి వారే బాధ్యులు, వారికి వారే పర్యవేక్షకులు. అన్ని అంశాలు పారదర్శకంగా జరిగేలా టెక్నాలజీ అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది. ఒక్క క్లిక్తో పర్యవేక్షణ.. గతంలో పాఠశాలలో ఏం జరుగుతోందో జిల్లా అధికారులకు కూడా తెలిసేది కాదు. ఇక రాష్ట్ర స్థాయికి చేరుకునే ఊసే లేదు. ఇప్పుడు అన్ని అంశాలను టెక్నాలజీ పర్యవేక్షిస్తోంది. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం ఇస్తోంది. గతేడాది అక్టోబర్లో విజయవాడలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశాం. మరో సెంటర్ను ఈ ఏడాది జూన్లో విశాఖలో అందుబాటులోకి తెచ్చాం. దాదాపు 70 లక్షల మంది విద్యార్థులు, 3 లక్షల మంది ఉపాధ్యాయులు, 58 వేల పాఠశాలలను ఒక్క క్లిక్తో పర్యవేక్షించవచ్చు. స్కూళ్ల నిర్వహణ, బోధనలో నూరు శాతం పారదర్శకంగా విజయవంతంగా ఫలితాలను నమోదు చేశాం. అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ ఉండడంతో ఎక్కడా తప్పు జరిగేందుకు ఆస్కారం లేదు. – కాటమనేని భాస్కర్, పాఠశాల మౌలిక వసతుల కమిషనర్ -
లక్షల్లో ఉత్తీర్ణులు.. వేలల్లో పోస్టులు, ఇదేం తీరు సర్కారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టెట్లో అర్హత సాధించినవారు 4,19,030 మంది ఉన్నారు. అయితే విద్యాశాఖలో ఉపాధ్యాయ ఖాళీలు కేవలం 22 వేల వరకే ఉన్నాయి. లక్షల్లో ఉత్తీర్ణులు అయ్యి ఉంటే వేలల్లో పోస్టులు భర్తీ చేస్తే ప్రయోజనం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో టెట్, డీఎస్సీ ఒకేసారి నిర్వహించేవారు. దీంతో కొంతమంది టీచర్ ఉద్యోగాలు పొందేవారు. వాస్తవానికి 2022లో భారీ నోటిఫికేషన్లు వస్తాయని ప్రభుత్వం ఆశలు కల్పించింది. దీంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నవారు కూడా ఉద్యోగాలు మానేసి టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) కోసం సన్నద్ధమయ్యారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రానేరాలేదు. ఈ నేపథ్యంలో యువతలో నెలకొన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకునే టెట్ను ముందుకు తెచ్చారనే విమర్శలొస్తున్నాయి. కోర్టు స్టేతో ఆగిన పదోన్నతుల ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లు, స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా పదోన్నతి కల్పిస్తే దాదాపు 12 వేల పోస్టులు ఖాళీ అవుతాయి. ఉద్యోగ విరమణ వల్ల ఖాళీ అయిన పోస్టులు, కొత్తవి కలుపుకుంటే 22 వేల వరకూ ఉంటాయని అంచనా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2022లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. అయితే ఇది పూర్తవ్వకుండానే కోర్టు స్టేతో ఆగిపోయింది. కనీసం పదోన్నతులు అయినా ఇవ్వొచ్చని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. పదోన్నతులు, బదిలీలు చేపడితే తప్ప ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ సాధ్యం కాదని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. నియామకాలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించినా, అనేక మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఎన్నికల వేళ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాకపోతే తమ కలలు కల్లలుగానే మిగిలిపోతాయని నిరుద్యోగులు అంటున్నారు. టీఆర్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి టెట్ నిర్వహణను స్వాగతించాల్సిందే. ఇదే క్రమంలో ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోతే టెట్ ఉత్తీర్ణులైనా ప్రయోజనం ఏముంటుంది. టీచర్ పోస్టుల భర్తీపై గతంలో సీఎం అసెంబ్లీలోనే హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ వచ్చేలోగా టీఆర్టీపై దృష్టి పెడితే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. టీచర్ పోస్టుల కోసం 4 లక్షల మంది ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం తెలుసుకోవాలి. – రావుల రామ్మోహన్ రెడ్డి (తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ప్రైవేటు మాయకు చెక్ పెట్టండి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులను చేర్చుకుని కూడా ఇంటర్ బోర్డ్కు ప్రవేశాలు చూపని ప్రైవేటు కాలేజీలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 27లోగా ప్రతి విద్యార్థి అడ్మిషన్ వివరాలను పంపేలా జిల్లా ఇంటర్ అధికా రులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ‘ఇంటర్ లెక్కల్లో కాలేజీల మాయ’ శీర్షికతో ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించా రు. 2లక్షల మంది టెన్త్ పాసయిన విద్యార్థులు ఎక్కడ చేరారు? వారి వివరాలు తెలియజేయాలని ఆమె అధికారు లను కోరారు. ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులు చేరినా, వాటి డేటా ఇంటర్ బోర్డ్కు చేరలేదనే విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ అధికారులతో చర్చించారు. పనులు పూర్తికాకపోతే ఎలా: సబిత రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కళాశా లల్లో అవసరమైన నూతన భవనాలు, అదనపు గదులు, టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.60 కోట్లు మంజూరు చేసినా సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం పట్ల మంత్రి సబిత అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా, ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రతీ వారం పనుల పురోగతిని సమీక్షించాలని నవీన్ మిత్తల్కు సూచించారు. కళాశాల నిర్వహణ అవసరాలకోసం, ల్యాబ్ల ఆధునికీకరణ వంటి పనుల కోసం మరో రూ.4.43 కోట్లు మంజూరు చేశామని, వీటిని వెంటనే చేపట్టాలని ఆదేశించారు. శుక్రవారంలోగా పుస్తకాలు అందాలి విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందకపోవడంపై సంబంధిత అధికారులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాలను వివిధ జిల్లాలకు సరఫరా చేయ డానికి ఆర్టీసీపైనే ఆధారపడకుండా ప్రయివేట్ ఆపరేటర్ల సహాయంతో శుక్రవారం నాటికి చేరేవిధంగా చర్యలు చేపట్టా లని ఆదేశించారు. మారుమూల జిల్లాల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తుండగా అన్ని వనరులు ఉండి కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాలు వెనుకబడి ఉండటం సమర్థనీయం కాదన్నారు. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వివిధ జిల్లాల ఇంటర్ విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు. డేటా పంపకపోతే విద్యార్థికి రూ.500 చొప్పున కాలేజీకి జరిమానా ఈ నెల 27లోగా ప్రైవేటు కాలేజీల్లో చేరిన విద్యార్థుల డేటా పంపాలని, అలా చేయకుండా తర్వాత పంపితే నెలాఖరు వరకూ ఒక్కో విద్యార్థికి రూ.500 చొప్పున కాలేజీపై జరిమానా విధించాలని బోర్డ్ అధికారులకు మిత్తల్ సూచించారు. ఆ గడువు కూడా దాటితే విద్యా ర్థికి రూ. వెయ్యి చొప్పున కాలేజీపై జరిమానా విధించా లని తెలిపారు. ఆఖరి నిమిషం వరకూ వేచి చూసి ఆ తర్వాత సెక్షన్లు పెంచుకోవడం, ఒక క్యాంపస్లో ప్రవే శాలు, మరో క్యాంపస్లో అడ్మిషన్లు చేపట్టే ప్రైవేటు కాలేజీలపై నిఘా పెట్టాలని, ఇలాంటి చర్యలకు పాల్ప డే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే నని, అవసరమైతే సదరు కాలేజీ అనుమతి కూడా రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని జిల్లా అధికారు లను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ ఆదేశించారు. -
నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులలో మానసిక ఉల్లాసం, నైపుణ్యాలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉన్నతాధికారులతో కలసి సోమవారం ఆమె విద్యాశాఖ పనితీరుపై సమీక్ష జరిపారు. ఢిల్లీ తరహాలో మన రాష్ట్రంలోని విద్యార్థులకు ఆత్మ విశ్వాసం, మానసిక ధృడత్వం పెంపొందించే లా మనోస్థైర్యం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాకు ఒక పాఠశాల చొప్పున 6, 7వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఇందుకోసం ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇద్దరేసి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. అలాగే విద్యార్థి దశలోనే వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. మొదటి దశలో 8 జిల్లాల్లోని 24 మోడల్ స్కూళ్లను ఎంపికచేసి అందులో ఇంటర్ మొదటి సంవత్సరం చదివే 2,500 మంది విద్యార్థులను వ్యాపార ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఇందులో మెరుగైన 1,500 ఆవిష్కరణలను ఎంపిక చేసి ఒక్కో ఆవిష్కరణకు ప్రభుత్వం రెండు వేల రూపాయలను అందజేస్తుందని వివరించారు. వీరితో ప్రత్యేక ఎగ్జిబిషన్లు ఏర్పాటుచేసి, భవిష్యత్తులో ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. -
‘ప్రత్యేక అవసరాల’ పిల్లలకు ప్రవేశాలు ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి: ప్రత్యేక అవసరాల(దివ్యాంగ) విద్యార్థులకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించని పాఠశాలలు, ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. వైకల్యాన్ని సాకుగా చూపి తమ పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించడం లేదని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన తల్లిదండ్రుల నుంచి సమగ్ర శిక్ష, విద్యా శాఖ ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు సమగ్ర శిక్ష ఈ నిర్ణయం తీసుకుంది. కొన్నిచోట్ల ప్రభుత్వ పాఠశాలలు, అత్యధికంగా ప్రైవేటు పాఠశాలలపై ఈ తరహా ఫిర్యాదులు అందుతున్నాయి. దివ్యాంగ విద్యార్థులనూ సాధారణ విద్యార్థులతో సమానంగా పరిగణించాలని, సమాన హక్కులు కల్పించాలని సమగ్ర శిక్ష ఉత్తర్వుల్లో ఉంది. సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 93 వేల మంది దివ్యాంగ విద్యార్థులు ఒకటి నుంచి 10వ తరగతి చదివే వయసుగలవారున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో కొన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు ప్రవేశాలిచ్చేందుకు నిరాకరించడంతో సమగ్ర శిక్ష రాష్ట్రాధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. అయితే ఇటీవల ప్రయివేటు పాఠశాలలపై కూడా ఇదే తరహా ఫిర్యాదులు అందడంతో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖను సమగ్ర శిక్ష ఆదేశించింది. వారి ప్రవేశాలను అడ్డుకుంటే చర్యలు కొన్ని పాఠశాలల్లో దివ్యాంగ విద్యార్థులకు ప్రవేశాలు ఇవ్వడం లేదని ఫిర్యాదులందాయి. ఇలాంటి ప్రయివేటు పాఠశాలలపైన, ప్రభుత్వ పాఠశాలల్లో అయితే ప్రధానోపాధ్యాయులపైనా విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చాం. రాష్ట్రంలో ఉన్న 93 వేల మంది దివ్యాంగ పిల్లల్లో పాఠశాల వయసువారే అధికం. ప్రభుత్వ స్థాయిలో 672 భవిత సెంటర్లలో సుమారు 900 మంది ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ను నియమించి పిల్లలకు ప్రాథమిక స్థాయిలో సౌకర్యాలు కల్పించి ఎలిమెంటరీ విద్యనందిస్తున్నాం. ఉన్నత పాఠశాలల్లోనూ 652 మంది స్పెషల్ ఎడ్యుకేటర్స్ దివ్యాంగుల కోసం పనిచేస్తున్నారు. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ దివ్యాంగ విద్యార్థుల ప్రవేశాలకు మార్గదర్శకాలు ► ఆరు నుంచి 18 ఏళ్ల వయసు గల ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలపై వివక్ష చూపకుండా తప్పనిసరిగా వయసు ప్రకారం ఆయా తరగతుల్లో ప్రవేశం కల్పించాలి. ► వైకల్యాన్ని సాకుగా చూపి ప్రవేశాన్ని నిరాకరించకూడదు. ► విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా వీరికి ప్రవేశాలు కల్పించొచ్చు. ► నూరు శాతం వైకల్యం గల పిల్లలకు హాజరు నుంచి మినహాయింపునివ్వాలి. -
ఈతరం పిల్లలకు గ్లోబల్ చదువులు.. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్గా తీరిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరిన్ని చర్యలు ప్రారంభించారు. ప్రపంచస్థాయిలో పోటీని తట్టుకునేలా, మారుతున్న టెక్నాలజీ రంగంలో విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేలా మరో అడుగు ముందుకేశారు. భవిష్యత్తు టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నైపుణ్యాలతో ప్రభుత్వ విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్ది వారికి హైఎండ్ టెక్నాలజీ రంగంలోని ఉన్నత ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దీనికోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, గ్లోబల్ టెక్ కంపెనీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు. పాఠ్యప్రణాళిక, ఉండాల్సిన మానవవనరులు, సదుపాయాలపై వచ్చేనెల జులై 15 కల్లా వర్కింగ్ గ్రూపు నివేదిక ఇవ్వనుంది. సీఎం జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చారు. అమ్మ ఒడి, విద్యాకానుక, వసతి దీవెన, విద్యాదీవెన లాంటి పథకాలను అమలు చేయడమే కాకుండా పాఠ్యప్రణాళిక పరంగా, మౌలిసదుపాయాల పరంగా ఎన్నెన్నో మార్పులు తీసుకు వచ్చారు. ►దీంట్లో భాగంగా 2019-20 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోని 41 లక్షలమంది విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం చదువులు అందుతున్నాయి. ►దీనికి అనుగుణంగా, విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరంలో సీఎం జగన్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. బైలింగువల్ టెక్ట్స్బుక్స్ను రూపొందించి విద్యార్థులకు అందించింది. జగనన్న విద్యాకానుక కింద సైన్స్, సోషల్ స్టడీస్, మాథమెటిక్స సబ్జెక్టుల్లో బై లింగువల్ టెక్ట్స్బుక్స్ను అందించింది. ఇంగ్లిషులో భాషా పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ల్యాబ్స్ కూడా ఏర్పాటుచేసింది. ►మరో అడుగు ముందుకేస్తూ 2021-2౨లో 6వ తరగతి నుంచి 10వ తరగతివరకూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని విద్యార్థులకు అందించింది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ పిక్టోరియల్ డిక్షనరీని అందించింది. ►3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. విద్యార్థులకు బోధనలో ఇదొక కీలక మార్పు. ►జాతీయస్థాయి, ప్రపంచస్థాయి విద్యార్థులతో పోటీపడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ అఫిలియేషన్ వచ్చేలా 2022-23లో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ►విద్యార్థులకు సైన్స్, సోషల్, మాథమెటిక్స్లో అత్యుత్తమ పాఠ్యాంశాలను అందించడానికి బైజూస్తో ఒప్పందం చేసుకుంది. విద్యార్థులకు మరింత సులువుగా, మరింత సమర్థవంతంగా పాఠ్యాంశాలు అర్థమయ్యేలా ఉండేందుకు ఆడియో, విజువల్ రూపంలో బైజూస్ కంటెంట్ను విద్యార్థులకు అందించింది. ►దీనికోసం ఎనిమిదో తరగతి చదువుతున్న 5,18,740 మంది విద్యార్థులకు ట్యాబులు అందించింది. ఇందులో బైజూస్ కంటెంట్ యాప్ను లోడ్ చేశారు. అందులో పాఠ్యాంశాలు ఆడియో, వీడియో రూపంలో ఉండడంవల్ల పిల్లలు సులభంగా నేర్చుకోగలుగుతున్నారు. ►తదుపరి విప్లవాత్మక మార్పుగా ప్రభుత్వం- పాఠశాలల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను విస్తృతంగా చేపట్టింది. నాడు-నేడు పూర్తిచేసుకున్న 30,213 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్స్ (ఐఎఫ్పీ)ను ఏర్పాటు చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం జులై కల్లా ఈ ప్యానెల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక మరో 10,038 తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తోంది. మిగిలిన పాఠశాలల్లో ఈవచ్చే డిసెంబర్ నాటికి ఐఎఫ్పీలు, స్మార్ట్టీవీల ఏర్పాటు చేయనుంది. ►దీంతోపాటు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) భాగస్వామ్యంతో ప్రభుత్వ స్కూలు పిల్లలకు టోఫెల్ పరీక్షలను కూడా నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ►ప్రపంచస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీపడాలంటే ఇంగ్లిషులో ప్రావీణ్యం చాలా కీలకం. ప్రపంచస్థాయి కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంగ్లిషులో పరిజ్ఞానం అన్నది చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దీంతోపాటు భవిష్యత్తు టెక్నాలజీలపై పిల్లలను సుశిక్షతులగా తయారు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధపెట్టింది. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం), ఎల్ఎల్ఎం ఫ్లాట్ఫాం మీదకు వచ్చే డేటా అనలిటిక్స్ ఛాట్ జీపీటీ, వెబ్ 3.O, అగ్మెంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెంట్ర్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, అటానమస్ వెహికల్స్, త్రీడీ ప్రింటింగ్, గేమింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు నైపుణ్యం ఇచ్చే అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను, మార్పులను సూచించేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు సీఎం ఆదేశాలిచ్చారు. ►విద్యాభ్యాసం తొలినాళ్లనుంచే ఈ తరహా టెక్నాలజీపై బోధన, సంబంధిత నైపుణ్యాలను అభివృద్ధిచేయడానికి ప్రత్యేక పాఠ్యాంశాలు, పాఠ్యప్రణాళిక, ఇవ్వాల్సిన శిక్షణ తదితర అంశాలపై ఈ వర్కింగ్ గ్రూపు ద్వారా ప్రభుత్వం దృష్టిపెట్టనుంది. ►పాఠ్యప్రణాళిక, మౌలిక సదుపాయాలు, మానవవనరులు, లెర్నింగ్ కంటెంట్, ల్యాబులు తదితర అంశాలు పాఠశాలల్లో ఎలా ఉండాలన్న దానిపై ఈ వర్కింగ్ గ్రూపు ఖరారు చేయనుంది. ► పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీనికి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సెక్రటరీ మెంబర్గా ఉంటారు. పాఠశాలల మౌలిక సదుపాయాల కమిషనర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. స్కూలు ఎడ్యుకేషన్ కమిషనర్, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్, ఎస్ఈఆర్టీ డైరెక్టర్, మైక్రో సాఫ్ట్ ఇండియాకు చెందిన అశుతోష్ చద్దా, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియాకు చెందిన షాలినీ కపూర్, గూగుల్కు చెందిన ప్రతినిధి, ఇంటెల్ ఏసియాకు చెందిన షాలినీ కపూర్, నాస్కాం ప్రతినిధి సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు జైజిత్ భట్టాచార్య, నీతి ఆయోగ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ మాజీ సలహాదారు అర్చనా. జి.గులాటి వర్కింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జులై 15, 2023 నాటికల్లా ఈవర్కింగ్ గ్రూపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. చదవండి: రైతులకు ఉచితంగా ఇస్తే తప్పా రామోజీ? -
హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నకిలీ సంస్థ
సాక్షి, అమరావతి: హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ అసోసియేషన్కు, పాఠశాల విద్యాశాఖకు ఎటువంటి సంబంధం లేదని ఆ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పేరుతో కొందరు వ్యక్తులు రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేస్తున్నారని, నిరుద్యోగ యువత వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ తరహా మోసపూరిత కార్యకలాపాలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. రాష్ట్రంలో కొన్ని అనధికార సంస్థలు స్కౌట్స్ అండ్ గైడ్స్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం గుర్తించిన ఒకే ఒక్క సంస్థ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని, ఈ సంస్థ న్యూఢిల్లీలోని నేషనల్ అసోసియేషన్కు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్లో ఉందని తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ గర్ల్ గైడ్స్ అండ్ గర్ల్ స్కౌట్స్ కూడా రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ అసోసియేషన్ అనేది నకిలీ సంస్థ అని, రాష్ట్రంలో కార్యకలాపాలు కొనసాగించేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ఇతర కార్యాలయాలు ఆ సంస్థకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టంచేశారు. -
12 నుంచి స్కూళ్లు.. తొలి రోజే ‘జగనన్న విద్యా కానుక’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని, అదే రోజు దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం విజయవాడలో విద్యా శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది విద్యా కానుక కోసం రూ.1,100 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇందులో యూనిఫాం, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, బ్యాగ్, ఇంగ్లిష్, తెలుగు (బైలింగ్వల్) టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, నోటు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం వైఎస్ జగన్ సోమవారం విద్యా కానుకను లాంఛనంగా పంపిణీ చేస్తారని తెలిపారు. అదే సమయంలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యా కానుక కిట్ల నాణ్యతను నాలుగు దశల్లో పరిశీలించామని, ఈ ఏడాది యూనిఫాం కుట్టుకూలిని రూ.10 పెంచి రూ. 45 ఇస్తున్నామన్నారు. 20న సీఎం చేతుల మీదుగా విద్యార్థులకు సత్కారం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ పది, ఇంటర్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట సత్కరించే వేడుక రాష్ట్రస్థాయిలో 20న సీఎం చేతుల మీదుగా జరుగుతుందని మంత్రి చెప్పారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను, హెచ్ఎంలనూ సత్కరిస్తామని చెప్పారు. 15న నియోజకవర్గ స్థాయిలో, 17న జిల్లా స్థాయిలో విద్యార్థులను సత్కరిస్తామన్నారు. వీరితో పాటు టెన్త్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులను 12 నుంచి 19 వరకు సత్కరించనున్నట్లు తెలిపారు. మొత్తం 22,768 మంది విద్యార్థులను సత్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్లో 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు అందిస్తామన్నారు. పాఠశాల స్థాయిలోనే ‘టోఫెల్’ శిక్షణ రాష్ట్ర విద్యార్థులు గ్లోబల్ ఇంగ్లిష్లో పట్టు సాధించేలా రాష్ట్రస్థాయిలోనే విద్యార్థులుకు టోఫెల్ శిక్షణ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఇందుకోసం జిల్లాకు ఇద్దరు ఉపాధ్యాయులను ప్రఖ్యాత అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీకి పంపి శిక్షణ ఇప్పిస్తామన్నారు. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు టోఫెల్–ప్రైమరీ, 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు టోఫెల్– జూనియర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పాఠశాలలు ప్రారంభమైన రోజు నుంచే గోరుముద్ద పథకం అమలు చేస్తామని మధ్యాహ్న భోజన పథకం సంచాలకులు డాక్టర్ నిధి మీనా తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, పాఠశాలల మౌలిక సదుపాయాల కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇంటర్మీడియట్ విద్య కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: అసత్యాల్లో నిండా మునిగిన ‘ఈనాడు’ ఫెయిల్ అయిన వారికి మరో అవకాశం టెన్త్, ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయడం తప్ప పాఠశాల, కాలేజీలకు వెళ్లి చదువుకునే అవకాశం ఇంతవరకు లేదు. అయితే, 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇలాంటి విద్యార్థులకు మరో అవకాశంగా రెగ్యులర్గా అదే తరగతిలో మరోసారి చదువుకునే అవకాశాన్ని కలి్పస్తున్నట్టు మంత్రి బొత్స తెలిపారు. వీరికి ఒక్క ఏడాదే ఈ అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ వర్తిస్తాయని వివరించారు. -
‘నెట్’స్పీడైతే.. బోధన ‘వీఆర్’అవుద్ది!
సాక్షి, హైదరాబాద్: మనుషులుగానీ, వస్తువులుగానీ మనం దగ్గరుండి చూసినట్టుగా.. అంతా మన కళ్ల ముందే ఉన్నట్టుగా అనిపించే సాంకేతికతే ‘వర్చువల్ రియాలిటీ (వీఆర్)’. ప్రత్యేకమైన వీఆర్ హెడ్సెట్ను కంప్యూటర్కు అనుసంధానం చేసి, వీడియోలను ప్లే చేయడం ద్వారా అనుభూతిని పొందొచ్చు. ఈ సాంకేతికతతో విద్యా రంగంలో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఉదాహరణకు ఒక విత్తనం మొలకెత్తడం నుంచి పెద్ద చెట్టుగా ఎదిగేదాకా కీలకమైన దశలన్నింటినీ కొన్ని నిమిషాల్లోనే స్పష్టంగా అవగాహన కలిగేలా ‘వీఆర్’వీడియోలను విద్యార్థులకు చూపించవచ్చు. ఇందుకోసమే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘వీఆర్’బోధన చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. కానీ స్కూళ్లలో సరైన కంప్యూటర్లు, వేగవంతమైన ఇంటర్నెట్ లేకపోవడం సమస్యగా మారింది. పరిశోధనలపై ఆసక్తి కలిగేలా.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పాఠశాలల్లో ‘వర్చువల్ రియాలిటీ, త్రీడీ’పద్ధతుల్లో బోధన అందించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రం 60%, రాష్ట్రాలు 40% నిధులు వెచ్చించేలా కార్యక్రమాన్ని రూపొందించింది. విద్యార్థుల్లో ఆలోచనను రేకెత్తించేలా, క్లిష్టమైన అంశాలు కూడా అత్యంత సులభంగా అర్థమయ్యేలా బోధన కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసింది. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ఇందుకు సంబంధించిన ప్రణాళికను కూడా రూపొందించింది. విద్యార్థి స్థాయిలోనే పరిశోధనల వైపు ఆసక్తి కలిగించేలా, పూర్తి అవగాహన వచ్చేలా అంశాలను ఎంపిక చేసింది. ఈ మేరకు 2023–24 నుంచే ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని కొన్ని స్కూళ్లలో ‘వీఆర్’ల్యాబ్లను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీని అమలుకు సంబంధించి ఇటీవల స్కూళ్లలో అధ్యయనం చేసింది. పాతకంప్యూటర్లు.. స్లో ఇంటర్నెట్.. ‘వీఆర్–త్రీడీ’వంటి ఆసక్తికర బోధన పద్ధతులను అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నా మౌలిక వసతుల కొరత ఇబ్బందిగా మారిందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రభుత్వ స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం అరకొరగా ఉందని.. వాడే కంప్యూటర్లు కూడా పాతవని, వాటితో వీఆర్ త్రీడీ పాఠాలు చెప్పడం కష్టమని అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. వాస్తవానికి ఒక్కో పాఠశాలకు 20 హెడ్సెట్ల చొప్పున ఐదు బడుల్లో దీన్ని తొలుత ప్రారంభించాలని అనుకున్నారు. కానీ బోధనకు సంబంధించిన వీడియోలు డౌన్లోడ్ చేసుకోవాలంటే సమస్య ఏర్పడుతోందని గుర్తించారు. చాలా స్కూళ్లలో ఇప్పటికీ కనీసం 4జీ నెట్ కూడా లేదు. పాత కంప్యూటర్లు ఎక్కువ పరిమాణంలో ఉండే వీఆర్–త్రీడీ వీడియోలను సరిగా ప్లే చేయలేకపోతున్నాయి. ఇది పిల్లల్లో విసుగు కలిగిస్తుందని అధికారులు అంటున్నారు. ప్రధానంగా సామాన్య, సాంఘిక శాస్త్రాల బోధనలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేలినట్టు వివరిస్తున్నారు. ఎక్కువ సామర్థ్యమున్న, వేగంగా పనిచేసే కంప్యూటర్లు, వేగవంతమైన ఇంటర్నెట్ ఉంటే తప్ప ‘వీఆర్’బోధన అంశంలో ముందుకెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నామని.. సానుకూల స్పందన వస్తే విద్యార్థులకు అద్భుతమైన బోధన అందుతుందని అధికారులు చెప్తున్నారు. -
టెన్త్ పేపర్ లీక్ పెద్ద గేమ్ప్లాన్
సాక్షిప్రతినిధి, వరంగల్/వరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా కమలాపూర్లో హిందీ ప్రశ్నపత్రం లీక్, కాపీ కుట్ర పెద్ద గేమ్ప్లాన్ అని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన రేపి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కుట్రకు పాల్పడ్డారని తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బండి సంజయ్ది ప్రధాన పాత్ర అని తేలడంతోనే ప్రథమ నిందితుడిగా చేర్చామన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, కొత్త అంశాలు బయటికొస్తే సెక్షన్లు మారుతాయని వివరించారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సీపీ ఏవీ రంగనాథ్ వివరాలను వెల్లడించారు. ఈ కేసులో 10 మందిని నిందితులుగా చేర్చామని.. ఏ1 బండి సంజయ్, ఏ2 బూర ప్రశాంత్, ఏ3 గుండెబోయిన మహేశ్, ఏ5 మౌటం శివగణేశ్లను అరెస్టు చేశామని, ఏ4గా ఉన్న బాలుడిని జువైనల్ హోమ్కు తరలించామని తెలిపారు. పరీక్షల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్వి జిలేటర్లపై విద్యాశాఖ చర్యలు తీసుకుందని చెప్పారు. సంజయ్ ఆదేశాలతోనే లీక్ ఈ కేసులో నిందితుడైన బూర ప్రశాంత్ జర్నలిస్ట్ కాదని, చాలా మందికి వాట్సాప్లో ప్రశ్నపత్రాన్ని పంపించాడని.. బండి సంజయ్ ఆదేశాల మేరకే ప్రశాంత్ కుట్రలో భాగస్వామి అయ్యాడని విచారణలో తేలిందని సీపీ వెల్లడించారు. ‘‘రెండు రోజుల క్రితం సాయంత్రం బండి సంజయ్తో ప్రశాంత్ వాట్సాప్ చాటింగ్ చేశాడు. ప్రశాంత్ చాటింగ్లో పేర్కొన్న అంశాలనే బండి సంజయ్ ప్రెస్మీట్లో మాట్లాడాడు. తర్వాతిరోజు బండి సంజయ్తో ప్రశాంత్ వాట్సాప్ కాల్ మాట్లాడాడు. దీనికి సంబంధించి 76800 06600 నంబర్తో కూడిన ఫోన్ ఇవ్వాలని అడిగినా బండి సంజయ్ ఇవ్వలేదు. ఆ ఫోన్ ఇస్తే మాకు కీలక సమాచారం వస్తుంది’’ అని సీపీ వెల్లడించారు. ఇంకా కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ల వివరాలు రావాల్సి ఉందని చెప్పారు. ప్రశాంత్పై కేవలం మెసేజ్ షేర్ చేసినందుకు మాత్రమే కేసు బుక్ చేయలేదని.. బీజేపీ మానిటరింగ్ చేస్తున్న నమో టీంలో వరంగల్ లోక్సభ పరిధిలో ప్రశాంత్ పనిచేస్తున్నాడని తెలిపారు. ప్రశాంత్ ఈ హిందీ పేపర్ను ఈటెల రాజేందర్, ఆయన పీఏ నరేందర్లతోపాటు పలువురు బీజేపీ నేతలకు పంపాడని చెప్పారు. చట్టప్రకారమే అరెస్టులు బండి సంజయ్ అరెస్టు చట్టప్రకారమే జరిగిందని, 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేయొచ్చని, దీనికి తగిన కారణాలున్నాయని సీపీ రంగనాథ్ వివరించారు. సంజయ్ అరెస్టుకు ముందు లోక్సభ స్పీకర్కు సమాచారం ఇచ్చామని చెప్పారు. తమపై ఎవరి ఒత్తిళ్లు లేవని, వరంగల్లో ఎక్కువగా అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ వారినేనని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను అరెస్టు చేయడంపై జాతీయ మహిళా కమిషన్ అడుగుతున్న ప్రశ్నలకు కూడా చట్టపరిధిలో సమాధానం ఇస్తామన్నారు. ఈ కేసులో నేరం రుజువైతే సంజయ్, ఇతర నిందితులకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్షపడే అవకాశం ఉందన్నారు. రిమాండ్ రిపోర్టు: అరెస్టులకు కారణాలివీ.. హిందీ పేపర్ లీక్ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు.. బండి సంజయ్ సహా నలుగురి అరెస్టుకు కారణాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అర్ణేష్ కుమార్ వర్సెస్ బీహార్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన నియమాలకు లోబడి.. నోటీసులు ఇవ్వకుండా నేరుగా నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు పేర్కొన్నారు. ఆ అంశాలు, కారణాలివీ.. ♦ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు పరీక్ష కేంద్రం నుంచి హిందీ ప్రశ్నపత్రాన్ని తీసి, దాని ఫోటోలను వాట్సాప్/సోషల్ మీడి యాలో షేర్ చేయడం హేయమైన నేరం. ఇంకా పరీక్షల ప్రక్రియ కొనసాగుతోంది. నిందితులు రిమాండ్ కాకుంటే పరీక్షల నేరాలకు మరింతగా పాల్పడి.. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ను నాశనం చేసే అవకాశం ఉంది. ♦ నిందితులు రిమాండ్కు వెళ్లకుంటే.. రాష్ట్రంలోని చిత్తశుద్ధి గల విద్యార్థులు సీరియస్గా తీసుకుని, నిందితులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయతి్నస్తే.. అది శాంతిభద్రతల సమస్యకు దారితీయవచ్చు. ♦ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. చాలా సాక్ష్యాలను సేకరించాలి. నిందితులు బయట ఉంటే.. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు, తదుపరి దర్యాప్తు సరైన విధంగా జరగకుండా ఆటంకం కలిగించేందుకు అవకాశం ఉంది. ♦ ఇది చాలా తీవ్రమైన కేసు, ముందస్తు ప్రణాళికతో చేసిన నేరపూరిత కుట్ర. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో చేశారు. మరికొందరు నేరస్తులను ఇంకా పట్టుకోవాల్సి ఉంది. లోతైన దర్యాప్తు అవసరం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నిందితులను రిమాండ్కు పంపాలి. -
ట్యాబులపైనా వంకర రాతలు.. ప్రభుత్వ ప్రయత్నాలను జీర్ణించుకోలేని ‘ఈనాడు’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద చిన్నారులకు ఇచ్చిన ట్యాబులపైనా ఈనాడు తన వంకర బుద్ధిని ప్రదర్శించింది. రాష్ట్రంలోని విద్యార్థులను ప్రపంచస్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జీర్ణించుకోలేక ఈనాడు తన దుష్ట నైజాన్ని ‘బడి ట్యాబుల్లో అన్నీ లభ్యం’ వార్త ద్వారా బయటపెట్టింది. రాష్ట్రంలోని 8వ తరగతి విద్యార్థులకు అందించిన ప్రతి ట్యాబులోనూ సెక్యూరిటీ ప్యాచ్ వేశారు. అయితే, ఎక్కడో జరిగిన చిన్న ఘటనను పెద్దగా చూపిస్తూ ఈనాడు విషప్రచారం చేస్తోంది. ప్రభుత్వ ఉన్నత లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నానికి ఒడిగడుతోంది. దీన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ తీవ్రంగా ఖండించాయి. దీనిపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్కుమార్ కూడా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు.. ‘బడి ట్యాబుల్లో అన్నీ లభ్యం’ వార్తను ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నతాశయంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, 8వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబులను పంపిణీ చేసింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు కూడా ప్రపంచంతో పోటీపడాలని, వారు ఉన్నత శిఖరాలు చేరాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష. అయితే, ఈ లక్ష్యాన్ని నీరుగార్చాలని ఎక్కడో జరిగిన చిన్నచిన్న విషయాలకు పత్రికాముఖంగా బురదజల్లే కార్యక్రమం జరుగుతోంది. నిజానికి.. ట్యాబుల విషయంలో ప్రభుత్వం ముందే అనేక రక్షణ చర్యలు తీసుకుంది. అవి ఏమిటంటే.. ♦ ప్రతీ ట్యాబ్లో సెక్యూరిటీ ప్యాచ్ వేయడం.. ♦ ప్రతీ ట్యాబ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంటు పర్యవేక్షణలో ఉంటుంది. ♦ ప్రతీ ట్యాబు విధిగా ఇంటర్నెట్కు ఒకసారి కనెక్ట్ చేయాలి. ♦ అలా చేయడంవల్ల ట్యాబుల్లో ఏమైనా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కాకపోతే అప్డేట్ అవుతుంది. ♦ ఎక్కడైనా ట్యాబులో ఏదైనా ఎర్రర్ వస్తే వార్డు వలంటీర్ ఆ ట్యాబు గురించి సంబంధిత శాఖ వారితో సంప్రదించి దానిని సరిచేసి రెండు పనిదినాల్లో విద్యార్థికి అందజేసే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకు సంబంధించి జీఓ–29 ద్వారా ఇలాంటి వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సమస్య ఉన్న ట్యాబులను గుర్తించి ఇప్పటికే సరిచేసి ఇచ్చే ప్రక్రియ కూడా జరుగుతోంది. ♦ కొన్ని సందర్భాల్లో ట్యాబులను మొబైల్ రిపేర్షాపులకు తీసుకెళ్లి బలవంతంగా ఫ్యాక్టరీ రీసెట్ చేయిస్తున్నారు. అలాంటి ట్యాబుల వివరాలు, విద్యార్థి పేరు, మండలం, స్కూలుతో సహా ఇతర వివరాలు విద్యాశాఖకు వెంటనే తెలుస్తుంది. సదరు స్కూలు హెడ్మాస్టర్కు వెంటనే సమాచారం అందించి నెట్కు కనెక్ట్ చేయించి ట్యాబును లాక్ చేయిస్తున్నాం. ♦ ఇక 8వ తరగతి బోధించే ప్రతి ఉపాధ్యాయునికీ ట్యాబ్ ఉపయోగించే విధానం, చిన్నచిన్న ఎర్రర్లను ఏ విధంగా సరిచేసుకోవాలనే అంశాలపై పూర్తిస్థాయి శిక్షణను ప్రారంభిస్తున్నాం. ♦ ఇలా ఒక గొప్ప లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ట్యాబులు వినియోగించుకుని జ్ఞానాన్ని పొందుతున్నారు. ఇలాంటి సత్సంకల్పాన్ని నీరుగార్చే ప్రయత్నాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ తీవ్రంగా ఖండిస్తోంది’. -
Telangana: విద్యార్థులకు అలర్ట్.. ఒంటిపూట బడులు ఎప్పటినుంచంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 25నుండి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఒంటిపూట బడి సమయాల్లో అన్ని పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. చదవండి: ఈడీని ధైర్యంగా ఎదుర్కొంటా: ఎమ్మెల్సీ కవిత -
నేడు ప్రైవేటు ఇంటర్ కాలేజీ యాజమాన్యాలతో సబిత భేటీ
సాక్షి, హైదరాబాద్/మణికొండ/ షాద్నగర్ రూరల్: ప్రైవేటు ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు, అధ్యాపక సంఘాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం భేటీ అవుతా రు. ఇంటర్, పోటీ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె సమీక్షించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల మానసిక స్థితిగతులు, యాజమాన్యాల నుంచి విద్యార్థులకు మార్కుల కోసం వస్తున్న ఒత్తిడిపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ విద్యాశాఖ కార్యదర్శి కరుణ హాజరవుతారు. సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర నివేదిక ఇటీవల నార్సింగ్ పరిధిలోని ఓ కార్పొరేట్ కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఇంటర్ బోర్డ్ అధికారులను సబిత ఆదేశించారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాధికారి ప్రాథమిక నివేదిక అందజేశారు. విద్యార్థి తను చదువుతున్న కాలేజీలో కాకుండా, అదే కాలేజీకి చెందిన మరో క్యాంపస్లో మృతి చెందినట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. వేరే క్యాంపస్కు అతను ఎందుకు వెళ్లాడు? అతని అడ్మిషన్ ఎక్కడ? ఆత్మహత్యకు గల కారణాలపై సోమవారం సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి సాత్విక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఆస్పత్రిపై అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదిక సమర్పించారని మృతుడి తల్లిదండ్రులు నాగుల రాజు, అలివేలు ఆరోపించారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి పోస్టుమార్టం చేస్తే, గాం«దీలో చేసినట్లు తప్పుడు నివేదిక ఇచ్చారని, తమ కుమారుడు అసలు శ్రీ చైతన్య కాలేజీలో చదవడం లేదని రిపోర్టు ఇచ్చి ఇచ్చారని ఆరోపించారు. ఆ నివేదికపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
విజయకేతనం ఫలితం 'పది'లం
ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా విపత్తు అనంతరం విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు మరింత క్షీణించి ఫలితాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వెనుకబడింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి జిల్లా విద్యాశాఖ తీవ్ర కసరత్తు చేసింది. ఈ దిశగా సబ్జెక్టు నిపుణులు, జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు ప్రతినిధులు విజయకేతనం పేరుతో ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. 40 రోజులపాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు అకుంఠిత దీక్షతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించడంతో పాటు కనీసం 50 శాతం మార్కులు సాధించేలా కార్యాచరణ రూపొందించారు. ఏప్రిల్లో పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా విజయకేతనం కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయడానికి డీవైఈఓలు, ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సంసిద్ధులయ్యారు. ఈనెల 20వ తేదీ నుంచి వచ్చేనెల 31 వరకు అమలు చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు విద్యార్థులను ఆశావహ దృక్పథంతో పరీక్షలకు సమాయత్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 487 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 37,066 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అలాగే సుమారు 270 ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 14,800 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లోనూ విజయకేతనం కార్యాచరణ అమలు చేయాలని అధికారులు సూచించారు. విజయకేతనంలో ప్రధాన అంశాలు ► 30 నుంచి 40 శాతం మంది విద్యార్థులు ఒక సబ్జెక్టులో 50 నుంచి 100 ప్రశ్నలు మాత్రమే చదవగలుగుతున్నారు. వారికి తక్కువ పనిభారాన్ని ఇవ్వడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడేలా చేయడం. ► వీరితో రోజుకు రెండు ప్రశ్నలు, 10 బిట్లు చదివిసా్తరు. టఏ రోజు ఏ ప్రశ్న చదవాలి అన్నది తేదీ వారీగా కార్యాచరణ రూపొందించారు. ఏ రోజు అభ్యసన అదే రోజు పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. ► విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించి పాఠశాలకు గైర్హాజరు కాకుండా చూడాలి. ► ఉపాధ్యాయులు సెలవులో ఉన్నా స్వచ్ఛందంగా పాఠశాలకు వచ్చి టైమ్ టేబుల్ అమలు చేసేలా హెచ్ఎంలు చూడాలి. ► ఉపాధ్యాయుల్లో ఒత్తిడి భావం కలగకుండా ప్రేరణ కలిగించాలి. ► ప్రశ్నలను అప్పజెప్పించుకోవడంతో పాటు విద్యార్థులతో చూడకుండా రాయించాలి. ► ప్రత్యేకంతో ప్రతి సబ్జెక్టులో విజయకేతనం పేరుతో పుస్తకాలు పెట్టించాలి. ► తరగతి గదిలో విద్యార్థులు ఎక్కువ మంది ఉంటే బాగా చదివే విద్యార్థులను లీడర్స్గా నియమించుకుని వెనుకబడిన విద్యార్థుల బాధ్యతలను (అప్పజెప్పించుకోవడం, రాయించడం) అప్పగించాలి. ► వచ్చేనెలలో ఎఫ్ఏ 4 పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఆ సిలబస్ను కార్యాచరణ ప్రణాళికలో ముందుగా ఇచ్చారు. ► అలాగే ఎఫ్ఏ 4 పరీక్షలతో పాటు ప్రీ పబ్లిక్ పరీక్షల తేదీల్లో వీలును బట్టి కార్యాచరణను మార్చుకున్నా వచ్చేనెల 31 నాటికి 40 రోజుల కార్యాచరణను విధిగా పూర్తిచేయాలి. ► సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు ఇద్దరు ఒక్కో డివిజన్ను దత్తత తీసుకొని కార్యాచరణ అమలు తీరును పరిశీలించాలి. -
హెచ్ఎంలతోనే సమస్య
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఒప్పుకుంటేనే బదిలీల ప్రక్రియ ముందుకు తీసుకెళ్లొచ్చని విద్యాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వారిని పరిగణనలోనికి తీసుకోని పక్షంలో కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇదే అంశాన్ని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి వివరించినట్టు తెలిసింది. ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో పదోన్నతులైనా కల్పించాలని కొన్ని సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యాశాఖ నుంచి నివేదిక కోరినట్టు సమాచారం. ఇప్పటివరకూ అన్ని కేటగిరీల టీచర్లకు సీనియారిటీని బట్టి పదోన్నతులు ఇవ్వాలని భావించారు. ఇందుకు అనుగుణంగానే సీనియారిటీ జాబితాను రూపొందించారు. అయితే, హెచ్ఎంల విషయంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. వీరికి ఎంఈవోలుగా పదోన్నతి కల్పించాల్సి ఉంటుంది. అదీగాక, ఎంఈవో, డిప్యూటీ డీఈవో వంటి పర్యవేక్షణ పోస్టుల విషయంలో ఉపాధ్యాయుల మధ్య వివాదం పరిష్కారం కాలేదు. నిబంధనల ప్రకారం పర్యవేక్షణ పోస్టులు తమకే ఇవ్వాలని ప్రభుత్వ హెచ్ఎంలు కోరుతున్నారు. స్థానిక సంస్థల పరిధిలోని బడుల్లో ఉన్న హెచ్ఎంలకు పర్యవేక్షణ పోస్టులు ఇవ్వాల్సిందేనని మరికొంత మంది కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో హెచ్ఎంల పదోన్నతుల ప్రక్రియ జటిలంగానే మారింది. ప్రస్తుతం పదోన్నతులు కల్పిస్తే స్కూల్ అసిస్టెంట్లు.. హెచ్ఎంలు అవుతారు. వారికి ఉన్న స్కూళ్లను కేటాయించి, ఇప్పుడున్న హెచ్ఎంలను ఎంఈవోలుగా ప్రమోట్ చేయకుండా, ఎక్కడికి పంపుతారనే ప్రశ్న తెరమీదకొచ్చింది. కాబట్టి ఈ విషయంలో అంగీకారం వస్తేనే బదిలీలు, పదోన్నతుల అంశం ముందుకెళ్తుందని అధికారులు అంటున్నారు. ఏప్రిల్లో బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కొన్ని సంఘాలు చెబుతున్నా, ముందస్తు ఎన్నికల భయం వారిని వెంటాడుతోంది. సెలవుల్లో టెన్త్ పేపర్ల మూల్యాంకన విధులుంటాయి. ఆ తర్వాత ఎన్నికల గంట మోగితే బదిలీలు, ప్రమోషన్లు లేనట్టేనని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. బదిలీలు, పదోన్నతులు రెండూ ఒకేసారి చేపట్టాలని, లేని పక్షంలో తమకు న్యాయం జరగదని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి రాజాభాను చంద్రప్రకాశ్ చెప్పారు. -
Telangana: టీచర్ల బదిలీలకు మళ్లీ బ్రేక్ .. బదిలీ జాబితా నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: కోర్టు తీర్పుతో టీచర్ల బదిలీ ప్రక్రియకు మళ్ళీ బ్రేక్ పడింది. సగం వరకూ వచ్చిన షెడ్యూల్ను మధ్యలోనే నిలిపివేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం విడుదల చేయాల్సిన సీనియారిటీ జాబితాను తక్షణమే నిలిపివేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన సోమవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ►317 జీవో ద్వారా కొత్త జిల్లాలకు వెళ్ళిన టీచర్లకు బదిలీ అవకాశం లేకుండా, రెండేళ్ళ కనీస సర్వీసు నిబంధన పెడుతూ విద్యాశాఖ ఇటీవల జీవో ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సోమవారం రాత్రి 11 గంటల వరకూ చర్చలు జరిపారు. విషయాన్ని ప్రభుత్వానికి చేరవేయడంతో బదిలీ ప్రక్రియ నిలిపివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ అధికారులకు చెప్పినట్టు తెలిసింది. దీంతో మంగళవారం విడుదల చేయాల్సిన బదిలీ జాబితాను నిలిపివేయాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు సమాచారం. కోర్టు తీర్పు తుది కాపీ ఇంకా అందలేదని, మంగళవారం కాపీ వచ్చిన తర్వాత తీర్పుపై అప్పీలుకు వెళ్ళడమా? తీర్పును అమలు చేయడమా? అనేది ఆలోచిస్తామని పాఠశాల విద్య ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఏడాదికి బదిలీలు లేనట్టే! కోర్టు తీర్పు ప్రకారం కొత్త జిల్లాలకు వెళ్ళిన టీచర్లకు బదిలీ అవకాశం ఇవ్వడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదని అధికారులు అంటున్నారు. బదిలీ అవకాశం లేని టీచర్లు దాదాపు 25 వేల మంది ఉంటారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా వెళ్ళాలంటే మళ్ళీ కొత్తగా షెడ్యూల్ ఇవ్వాల్సి ఉంటుంది. బదిలీ ప్రక్రియకు అనుసరించే సాఫ్ట్వేర్ మొత్తం మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. 317 జీవో ప్రకారం వెళ్ళిన టీచర్ల ఉమ్మడి జిల్లాలోని సీనియారిటీ మళ్ళీ లెక్కగట్టాలి. ఈ ప్రక్రియకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. ►బదిలీల ప్రక్రియ గత నెల 28న మొదలైంది. దాదాపు 59 వేల మంది టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీళ్ళలో ఎవరైనా కోర్టుకు వెళ్ళినా సమస్య మళ్ళీ జటిలమయ్యే అవకాశం కల్పిస్తోంది. అలా కాకుండా అంతా సవ్యంగా సాగినా... రెండు నెలలు పడుతుంది. ఈ లోగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వీలుంది. ఈ సమయంలో బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి బదిలీల వ్యవహారం ఈ ఏడాది ఉండకపోవచ్చనే వాదన విన్పిస్తోంది. -
2025 నుంచి సీబీఎస్ఈ ప్యాట్రన్లో టెన్త్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2025 విద్యాసంవత్సరం నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో సమూల మార్పులు రానున్నాయి. ఆ విద్యాసంవత్సరం నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానంలో జరగనున్నాయి. రాష్ట్రంలో సీబీఎస్ఈ విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతోపాటు ఈ విద్యాసంవత్సరం 8వ తరగతి నుంచి అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ విద్యాసంవత్సరం ఎనిమిదో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ తరహాలో పాఠ్యపుస్తకాలను అందించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటిని ద్విభాషా (బైలింగ్యువల్) విధానంలో ముద్రించి ఇచ్చారు. ఈ విద్యార్థులు 2025లో టెన్త్ పబ్లిక్ పరీక్షలను రాయనున్నారు. వీటిని సీబీఎస్ఈ ప్యాట్రన్లో నిర్వహించనున్నారు. ఆ తరువాత నుంచి వచ్చే బ్యాచ్ల విద్యార్థులు సీబీఎస్ఈ ప్యాట్రన్లోనే అభ్యసనం సాగించనున్నందున వారికి పరీక్షలు కూడా అదే విధానంలో నిర్వహించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 2022–23, 2023–24 విద్యాసంవత్సరపు విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం నిర్వహిస్తున్న తరహా పరీక్షలు ఉంటాయి. ఆతరువాత నుంచి పూర్తిగా సీబీఎస్ఈ విధానంలోనే పరీక్షలు కొనసాగనున్నాయి. టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులు తప్పనిసరి ప్రస్తుతం ఎస్సెస్సీ బోర్డు ద్వారా నిర్వహిస్తున్న పబ్లిక్ పరీక్షలను.. అంతర్గత మార్కులు 20 కలపకుండా నేరుగా 100 మార్కులకు నిర్వహిస్తున్నారు. సీబీఎస్ఈ విధానంలో 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించి మిగిలిన 20 అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. సమగ్ర నిరంతర మూల్యాంకనం (కాంప్రహెన్సివ్, కంటిన్యూ ఇవాల్యుయేషన్ – సీసీఈ) విధానం ప్రకారం గతంలో ఎస్సెస్సీ పరీక్షల్లో అంతర్గత మార్కులు ఉండేవి. అంతర్గత ప్రాజెక్టులకు 20 మార్కులు, పబ్లిక్ పరీక్షలను 80 మార్కులకు నిర్వహించేవారు. అయితే అంతర్గత మార్కుల విషయంలో ప్రైవేటు స్కూళ్లు అడ్డగోలుగా వ్యవహరిస్తూ తమ విద్యార్థులకు 20కి 20 మార్కులు వేసుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం గతంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల నుంచి అంతర్గత మార్కులను తొలగించింది. పూర్తిగా 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తోంది. సీబీఎస్ఈ విధానాన్ని అనుసరించనున్నందున 2025 నుంచి జరిగే టెన్త్ పరీక్షల్లో ఎస్సెస్సీ బోర్డు కూడా ఆ తరహాలోనే అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుందని ఎస్సెస్సీ బోర్డు వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఏటా ఆరులక్షల మందికిపైగా విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం (2022–23)లో కూడా ఆరులక్షల మందికిపైగా విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. తొలివిడతగా 1,092 స్కూళ్లకు రానున్న సీబీఎస్ఈ గుర్తింపు రాష్ట్రంలో సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నందున ప్రభుత్వ హైస్కూళ్లకు సీబీఎస్ఈ గుర్తింపునకోసం విద్యాశాఖ ఇప్పటికే ఆ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. సీబీఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా ఉండే 1,092 స్కూళ్లకు తొలివిడతగా ఈ గుర్తింపు రానుంది. ఈ స్కూళ్ల విద్యార్థులకు సీబీఎస్ఈ విధానాలను అనుసరించి పరీక్షలు ఉంటాయి. నేరుగా ఆ బోర్డే ఈ స్కూళ్ల విద్యార్థులకు పరీక్షలు పెడుతుంది. సీబీఎస్ఈ గుర్తింపులేకున్నా దాని సిలబస్, ప్యాట్రన్ను మిగిలిన స్కూళ్లలో అనుసరించనున్నందున ఆ స్కూళ్ల పదోతరగతి విద్యార్థులకు మాత్రం ఎస్సెస్సీ బోర్డు ద్వారా.. సీబీఎస్ఈ ప్యాట్రన్లోనే పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. -
అందుబాటులో అంతర్జాతీయ విద్య
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థులకు అంతర్జాతీయ విద్యావకాశాలు మరింత చేరవవుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి చేపట్టిన పలు కార్యక్రమాలు సాకారమవుతున్నాయి. ఇండో–యూరోపియన్ సింక్రనైజేషన్లో భాగంగా జర్మనీకి చెందిన పలు వర్సిటీలతో ఉన్నత విద్యామండలి వర్చువల్ సమావేశాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. జర్మనీ వర్సిటీల్లో అందించే పలు అత్యున్నత కోర్సులకు రాష్ట్ర విద్యార్థులను ఎంపిక చేయడం, పరస్పర మార్పిడి లాంటి కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే 400 ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీతో (ఏపీ ఐటీఏ) అనుసంధానించారు. నైపుణ్యాభివృద్ధి కోసం ఇంటర్న్షిప్ తప్పనిసరి చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. జర్మనీ వర్సిటీల్లోని ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకొనేలా ఇండో–యూరోపియన్ సదస్సులను రాష్ట్రం వినియోగించుకుంది. కీలక మార్పులకు శ్రీకారం ఎఫ్హెచ్ ఆచెన్ యూనివర్సిటీలోని యూరోపియన్ సెంటర్ ఫర్ మెకానిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా.ఇంగ్ గుంతేర్ స్టార్క్, యూనివర్సిటీ ఆఫ్ కెంప్టెన్ వైస్ ప్రెసిడెంట్ డా.ఇంగ్ డిర్క్ జాకోబ్ (రోబోటిక్స్ ఫ్యాకల్టీ), స్టెయిన్బీస్ యూనివర్సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా.బెర్ట్రమ్ లోహమ్ముల్లర్ తదితరులతో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఇతర ప్రతినిధులు గతంలోనే చర్చలు జరిపారు. జేఎన్టీయూ(కే), అనంతపురం వీసీలు ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు, ప్రొఫెసర్ రంగ జనార్దన, ఏపీఐటీఏ సీఈవో టి.అనిల్కుమార్, ఏపీ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ సీఈవో నందకిశోర్రెడ్డి తదితరులు సదస్సుల్లో పాల్గొని ఉన్నత విద్యా కార్యక్రమాల్లో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, ఆటోమేషన్ తదితర విభాగాల్లో రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దేలా కార్యక్రమాలు అమల్లోకి తెచ్చారు. ప్రాక్టికల్ లెర్నింగ్ పెంచేందుకు ఆన్లైన్లో ల్యాబ్లు, లెక్చరర్లతో బోధన తదితర కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలన్న వర్చువల్ సమావేశాల సూచనలను అమలులోకి తెచ్చారు. డిగ్రీ సిలబస్ను పూర్తిగా సంస్కరించడం కూడా విద్యార్థులకు కలసి వస్తోంది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను సమకూర్చేలా దాదాపు 27 వేల పరిశ్రమలు, ఇతర సంస్థలతో కాలేజీలను అనుసంధానించి ఇంటర్న్షిప్ చేపట్టారు. అంతర్జాతీయంగా పలు బహుళ సంస్థలు తమ ఉద్యోగులకు మైక్రో క్రెడెన్షియల్ స్కిల్ ప్రోగ్రామ్లను అమలులోకి తేగా వాటిని రాష్ట్ర విద్యార్థులకు ముందుగానే అందించేలా భారత్ స్కిల్స్, ఈ–స్కిల్ ఇండియా, నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్, ఎన్పీటీఐ, స్వయం, స్వయంప్రభ లాంటి వర్చువల్ ప్లాట్ఫామ్ల ద్వారా విద్యార్థులను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఈ కార్యక్రమాల ఫలితంగా జర్మనీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత కోర్సులను అభ్యసించేందుకు రాష్ట్ర విద్యార్థులకు మార్గం సుగమమైంది. జర్మనీ పర్యటనలో ‘ఉన్నత’ బృందం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 18 మంది సభ్యులతో కూడిన బృందం ఇటీవల జర్మనీలో పర్యటించింది. ఉద్యోగ ఆధారిత మాస్టర్స్ ప్రోగ్రామ్స్లో ఏపీ విద్యార్థులను చేర్చుకోవడంపై బెర్లిన్లోని స్టెయిన్బీస్ వర్సిటీ అధికారులతో బృందం చర్చించింది. గ్రీన్ టెక్నాలజీ కార్యకలాపాలపై సహకరించుకోవడం, హైడ్రోజన్ ఎనర్జీలో పరిశోధనలను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని రెండు సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు డీఎస్ఈ కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బాడెన్ వుర్టెంబెర్గ్ ఇంటర్నేషనల్ టాలెంట్ సంస్థ ద్వారా ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇంక్యుబేషన్, స్టార్టప్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయించారు. -
టెన్త్లో ఆరా? పదకొండు పేపర్లా? ఎస్సీఈఆర్టీ మొగ్గు ఎటువైపు?
సాక్షి, హైదరాబాద్: మార్చిలో నిర్వహించాల్సిన టెన్త్ వార్షిక పరీక్షలపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఆరు పేపర్లా? 11 పేపర్లతో పరీక్ష నిర్వహించాలా? అనే అంశంపై తర్జన భర్జనలు పడుతున్నారు. గురువారం సమావేశమైన రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్సీఈఆర్టీ) అధికారులు.. ఈ ఏడాది వరకు 11 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో ప్రధానోపాధ్యాయులు ఇచ్చిన సలహా మేరకు ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపేందుకు ఎస్సీఈఆర్టీ సిద్ధమైనట్లు తెలిసింది. అయితే పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం ఈ ప్రతిపాదనలపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతోనే పరీక్షలు జరపాలని భావిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఇలా ప్రతి సందర్భంలోనూ ఎస్సీఈఆర్టీ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ మధ్య సమన్వయం కొరవడుతుండటం గమనార్హం. తొలుత 11 పేపర్లకే షెడ్యూల్! ఈ ఏడాది స్కూల్స్ ఆరంభంలోనే 9, 10 తరగతులకు పరీక్షలపై పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. గతంలో మాదిరి 11 పేపర్లతోనే పరీక్షలు ఉంటాయని తెలిపింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగానే నవంబర్ 1వ తేదీ నుంచి జరిగే ఎస్ఏ– 1 పరీక్ష ప్రశ్నపత్రాలను జిల్లా అధికారులు రూపొందించి, కొన్ని చోట్ల ప్రింటింగ్కు కూడా పంపారు. అయితే ఈ సమయంలోనే ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా సమయంలో ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా విద్యార్థులకు సరళంగా ఉండేలా, వారిపై భారం తగ్గించేలా ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. హెచ్ఎంల్లో వ్యతిరేకత 11 పేపర్లకు సిద్ధమైన నేపథ్యంలో, ప్రశ్నపత్రాల ప్రింటింగ్కు ఆర్డర్లు కూడా ఇచ్చిన తర్వాత పేపర్లు తగ్గించడం ఇబ్బంది కల్గిస్తుందని పలు జిల్లాల హెచ్ఎంలు అభిప్రాయపడ్డారు. దీనివల్ల విద్యార్థులు కూడా గందరగోళంలో పడే వీలుందని స్పష్టం చేశారు. దీంతో ఎస్ఏ–1 వరకూ 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించి, ఎస్ఏ–2 (వార్షిక పరీక్షలు) మాత్రం ఆరు పేపర్లతో నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీనిపై ఎస్సీఈఆర్టీ జిల్లాల వారీగా అభిప్రాయాలు తెలుసుకుంది. వార్షిక పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఎస్ఏ–1 తోడ్పడుతుందని, ఎస్ఏ–1 ఒక రకంగా, ఎస్ఏ–2 మరో రకంగా ప్రశ్న పత్రాలు ఉంటే విద్యార్థులు ఇబ్బందుల్లో పడే వీలుందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీన్ని ఆధారంగా చేసుకునే ఎస్సీఈఆర్టీ రెండు పరీక్షలను 11 పేపర్లతోనే నిర్వహిస్తే బాగుంటుందనే ప్రతిపాదనను సిద్ధం చేసింది. కానీ పాఠశాల విద్యాశాఖ విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. దీనిపై నాన్చకుండా విధానం ఏదైనా ముందే స్పష్టత ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. అప్పుడే ఆ మేరకు వార్షిక పరీక్షలకు సిద్ధమయ్యే వీలుంటుందని అంటున్నారు. -
రెండు జిల్లాల్లో ఎస్ఏ–1 పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో 1–10 తరగతులకు నవంబర్ 1 నుంచి జరగాల్సిన సమ్మెటివ్ అసెస్మెంట్ –1 (ఎస్ఏ–1) పరీక్షను నవంబర్ 9 నుంచి నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నది. మిగతా జిల్లాల్లో ముందుగా ప్రకటించిన ప్రకారం ఎస్ఏ–1 షెడ్యూల్ అమలులో ఉంటుందని వెల్లడించింది. -
టెన్త్లో ఈసారీ ఆరు పేపర్లే
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది తరహాలోనే ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షలను 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. టెన్త్తోపాటు మిగతా క్లాసుల పరీక్షలూ ఆరు పేపర్లతోనే జరపనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా విద్యార్థులపై భారం పడకుండా ఉండేందుకు టెన్త్ పరీక్ష పేపర్లను రాష్ట్ర ప్రభుత్వం 2020–21 విద్యాసంవత్సరంలోనే 11 నుంచి 6కు కుదించింది. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా ఆ ఏడాది పరీక్షలను రద్దు చేసింది. ఇక 2021–22 విద్యాసంవత్సరంలోనూ ఆ ప్రకారమే 6 పేపర్లతో పరీక్ష నిర్వహించింది. ప్రతి సబ్జెక్టులోనూ పేపర్–1, పేపర్–2 బదులుగా ఒకే పేపర్ను 80 మార్కులకు ఇచ్చింది. మిగిలిన 20 మార్కులకు ఇంటర్నల్స్లో విద్యార్థులు పొందిన మార్కులను జతచేసింది. తాజాగా 2022–23 విద్యాసంవత్సరంలోనూ ఇదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి మొదలుకానున్న సమ్మెటివ్ అసెస్మెంట్–1 పరీక్షలను ఇదే విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొంటూ టైంటేబుల్ను విడుదల చేసింది. పేపర్ల ముద్రణ జరిగే వేళ... వాస్తవానికి సమ్మెటివ్ అసెస్మెంట్–1 పరీక్షలు 11 పేపర్లతో ఉంటాయని తొలుత పాఠశాల విద్యాశాఖ పేర్కొనడంతో జిల్లా అధికారులు ఈ తరహాలోనే పేపర్లు రూపొందించారు. కొన్నిచోట్ల వాటిని ప్రింటింగ్కు కూడా పంపారు. ఈ దశలో విద్యాశాఖ 11కు బదులు 6 పేపర్లే ఉంటాయని చెప్పడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు గందరగోళంలో పడ్డారు. విద్యార్థులు కూడా 11 పేపర్ల పరీక్షకు సిద్ధమై ఇప్పుడు 6 పేపర్లతో రాయాల్సి రానుండటంతో ఆందోళన చెందుతున్నారు. అయితే స్కూళ్ల ప్రారంభంలోనే ఈ మార్పు గురించి వివరించి ఉంటే విద్యార్థులను సంసిద్ధులను చేయడానికి వీలుండేదని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. కొరవడిన సమన్వయం.. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) పరీక్షా పేపర్లపై వారం క్రితమే విద్యాశాఖ డైరెక్టర్కు కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. తొలుత ఈ సూచనలను పట్టించుకోకుండా పక్కన పడేసిన డైరెక్టర్.. ఆ తర్వాత ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ ప్రతిపాదనను అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే దసరా సెలవులను రెండు వారాలపాటు ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడం.. గతంలో ఇచ్చిన సెలవులను మినహాయించి దసరా సెలవులను కుదించాలంటూ ఎస్ఈసీఆర్టీ సిఫార్సు చేయడం.. దాన్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పట్టించుకోకపోవడం చూస్తుంటే ఈ రెండు విభాగాల మధ్య సమన్వయం కొరవడిందన్న విమర్శలు వస్తున్నాయి. తక్కువ సమయంలో విద్యార్థులను ఎలా సిద్ధం చేయాలి? పరీక్షల తీరును ఉన్నఫళంగా మార్చడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు గందరగోళంలో పడే ప్రమాదం ఉంది. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పరీక్షలపై దృష్టి పెడుతున్న విద్యార్థులను అధికారులు పరిగణనలోకి తీసుకోవాలి. 11 పేపర్లతో టెన్త్ పరీక్ష ఉంటుందని విద్యార్థులను తయారు చేశాం. తక్కువ వ్యవధిలో ఆరు పేపర్లకు సిద్ధం చేయాల్సి రావడం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. – రాజా భానుచంద్ర ప్రకాశ్, ప్రభుత్వ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ఎంసెట్ మెడికల్ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి బీ–ఫార్మసీ, ఫార్మా–డీ, బయోటెక్నాలజీ కోర్సుల కోసం ఎంసెట్–22(బైపీసీ) ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ శనివారం విడుదల చేశారు. రెండుదశల్లో ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కౌన్సెలింగ్కు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్, హెల్ప్లైన్ కేంద్రాల వివరాలు, కౌన్సెలింగ్ ప్రక్రియ సమాచారాన్ని టీఎస్ ఎంసెట్ వెబ్సైట్లో ఈ నెల 27న అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. -
ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ వైపే..
సాక్షి, హైదరాబాద్: ఈసెట్ ర్యాంకు ఆధారంగా ఇంజనీరింగ్ సెకండియర్లో 89 శాతం మందికి సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. తొలిదశ సీట్ల కేటాయింపు పూర్తి చేసినట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈసెట్ కౌన్సెలింగ్లోనూ కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులనే విద్యార్థులు ఎక్కువగా ఎంచుకున్నట్టు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 19,558 మంది ఈసెట్లో అర్హత సాధించగా తొలి దశ కౌన్సెలింగ్కు 13,429 మంది ఆప్షన్లు ఇచ్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో రెండో ఏడాదిలో ప్రవేశానికి 11,260 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, 9,968 సీట్లు కేటాయించినట్టు తెలిపారు. ఫార్మసీలో 1,174 సీట్లు అందుబాటులో ఉంటే, 50 సీట్లు కేటాయించామన్నారు. సీట్లు దక్కించుకున్న అభ్య ర్థులు ఈ నెల 22లోగా ఆన్లైన్ చెల్లింపు ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, వచ్చే నెల 10లోగా అన్ని ధ్రువపత్రాలతో కాలేజీలో నేరుగా రిపోర్టు చేయాలని తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీట్లు 19 భర్తీ అయ్యాయి. ఏఐఎంఎల్లో 127 సీట్లు ఉంటే, 105 కేటాయించారు. డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సుకు 80 శాతంపైనే ఆప్షన్లు ఇచ్చారు. కంప్యూటర్ సైన్స్లో 2,643 సీట్లు ఉంటే, 2470 సీట్లు కేటాయించారు. ఈసీఈలోనూ 2,060 సీట్లకు 1853 భర్తీ అయ్యాయి. ఈఈఈలో 1,096 సీట్లకు 1,066 కేటాయించారు. మెకానికల్ ఇంజనీరింగ్లో 886 సీట్లకు 860, సివిల్ ఇంజనీరింగ్లో 905 సీట్లకు 900 కేటాయించారు. -
ఇంజనీరింగ్లో మరిన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మలి విడత కౌన్సెలింగ్లో కొత్తగా మరిన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇదే క్రమంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ సీట్లు తగ్గిపో నున్నాయి. దీనిపై సాంకేతిక విద్య విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. కొత్తగా పెరిగే సీట్లలో ఎక్కువభాగం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి విభాగాల సీట్లే ఉండనున్నాయి. కొన్ని కాలేజీల్లో సైబర్ సెక్యూరిటీ సీట్లను పెంచనున్నారు. గత మూడేళ్లుగా డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకుని, వాటి స్థానంలో డిమాండ్ ఉన్న కోర్సుల సీట్లను పెంచుకునేందు కు అఖిల భారత సాంకేతిక విద్యశాఖ అనుమతించడంతో.. రాష్ట్రంలో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సుల్లో 9,240 సీట్లు పెరగనున్నాయి. ఈ నెల 28 నుంచి ఇంజనీరింగ్ మలి విడత కౌన్సెలింగ్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఆ సీట్లు సగానికన్నా తక్కువే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71,286 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులకు పెద్దగా డిమాండ్ లేని పరిస్థితి ఉంది. మొత్తం సీట్లలో వీటి సంఖ్య సగానికన్నా తక్కువే. ఇలా డిమాండ్ లేని కోర్సుల రద్దు, వాటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ కోర్సులకు అనుమతితో పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం సివిల్ విభాగంలో 5 వేలు, మెకానికల్లో 4,615, ఈసీఈ 12,219, ఈఈఈ 5,778 సీట్లు మాత్రమే రెండో విడత కౌన్సెలింగ్లో ఉండబోతున్నాయి. మొత్తం కలిపి ఈ సీట్ల సంఖ్య 27,612 మాత్రమే. పెరిగే 9,240 కంప్యూటర్ కోర్సుల సీట్లను కలిపితే.. రెండో విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో మొత్తం సీట్ల సంఖ్య 80,526 సీట్లకు చేరనుంది. అంటే సంప్రదాయ కోర్సులు మూడో వంతుకు తగ్గిపోనున్నాయి. 52 వేలకుపైగా కంప్యూటర్ సైన్స్, సంబంధిత కోర్సుల సీట్లే ఉండనున్నాయి. ఇప్పటికే సీఎస్సీ సీట్లు 18,686, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీట్లు 7,737 వరకు ఉన్నాయి. ఇవి గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇంకా 17 వేల సీట్లు ఖాళీ.. ఇంజనీరింగ్ ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. కేటాయించిన సీట్లలో 17 వేల మేర అధికార వర్గాలు తెలిపాయి. తొలి దశలో 71,286 సీట్లు అందుబాటులో ఉంటే, 60,208 సీట్లను కేటా యించారు. ఇందులో 43 వేల మంది మాత్రమే కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారని తెలిపాయి. మిగిలిన సీట్లలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సీట్లే ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాయి. ఈ సీట్లను రెండో విడత కౌన్సెలింగ్లో భర్తీ చేస్తారు. -
టెన్త్ అడ్వాన్స్డ్లో 79 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 79.82 శాతం విద్యార్థులు ఉత్తీర్ణుల య్యాయి. పాసయిన వారిలో బాలికలే ఎక్కువగా ఉన్నారు. ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ముందు వరుసలో (97.99 శాతం) ఉంటే, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (53.11 శాతం)లో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఆగస్టు 1 నుంచి 10 వరకూ జరిగిన టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేశారు. పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెగ్యులర్గా జరిగిన పరీక్షల్లో కూడా ఈసారి 90 శాతంపైనే ఫలితాలు వచ్చినట్టు దేవసేన తెలిపారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు లేకపోయినా, ఈసారి మంచి ఫలితాలు వచ్చాయని ఆమె తెలిపారు. నేటి నుంచి రీ కౌంటింగ్ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్ట్కు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. రీ కౌంటింగ్లో విద్యార్థి పేపర్ను ఉపాధ్యాయులే తిరిగి పరిశీలిస్తారు. రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేస్తే, విద్యార్థి రాసిన సమాధాన పత్రం ప్రతిని ఇంటికి పంపుతారు. దీంతో విద్యార్థి స్వయంగా పరిశీలించుకునే వీలుంటుంది. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం: దేవసేన టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం కల్పించాలని సంబంధిత అధికారులను కోరుతామని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు దేవసేన తెలిపారు. కాగా, రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులకు మొదటి విడత యూనిఫాంలు పంపామని, రెండో విడత కూడా పంపేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది 2.5 లక్షల మంది కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ఆ పిల్లలను క్రమంతప్పకుండా స్కూళ్లకు పంపే విషయంలో తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోవాలని ఆమె సూచించారు. కాగా, టీచర్ల నియామకం గురించి ప్రభుత్వానికి వినతి పంపామని ఆమె వివరించారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు.. ఆప్షన్లకు చివరి తేదీ ఎప్పుడంటే?
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్లో సాంకేతిక విద్య శాఖ అధికారులు స్వల్ప మార్పులు చేశారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీలో ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైవారికి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి తొలివిడత ఎంసెట్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ గడువు సోమవారం, ధ్రువపత్రాల పరిశీలన గడువు మంగళవారం ముగిసింది. అయితే, తాజాగా మంగళవారమే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో ఉత్తీర్ణులు ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్కు హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో స్లాట్ బుకింగ్, ధ్రువపత్రాల పరిశీలన, ఆప్షన్లకు కొత్త తేదీలను ప్రకటించారు. -
గురుకుల సీటు... వెరీ హాటు..!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. పూర్తిస్థాయిలో అడ్మిషన్లు చేపట్టినట్లు సొసైటీలు ప్రకటిస్తున్నా... ‘ఒక్క సీటు’ కావాలంటూ ప్రవేశాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కార్యాలయాలు కిక్కిరిసి పోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల సొసైటీ పాఠశాలల్లో ఐదోతరగతిలో నూతన అడ్మిషన్ల ప్రక్రియ, బ్యాక్లాగ్ ఖాళీ సీట్ల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు ఆయా సొసైటీలు బహిరంగంగా ప్రకటించాయి. అర్హత పరీక్షల ద్వారా విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి మెరిట్ ప్రకారం గురుకుల సొసైటీలు అడ్మిషన్లు చేపట్టాయి. కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్లు చేపట్టాయి. అడ్మిషన్లు పూర్తయ్యాయని, సీట్లు లేవని బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ సీట్లు కావాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఫిజికల్ రిపోర్టింగే మిగిలింది... రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ గురుకుల సొసైటీలు, విద్యాశాఖకు చెందిన జనరల్ గురుకుల సొసైటీల పరిధిలో 750 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో ప్రతి సంవత్సరం ఐదో తరగతిలో దాదాపు 50 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. నాల్గోతరగతి చదివే విద్యార్థులకు రాత పరీక్ష నిర్వహించి, మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. రిజర్వేషన్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆన్లైన్ పద్ధతిలో ప్రక్రియ పూర్తి చేస్తారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఇదే తరహాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీలు ఉమ్మడిగా అర్హత పరీక్ష నిర్వహించాయి. దాదాపు 1.6 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోగా.. ఒక్కో సీటుకు సగటున ముగ్గురు పోటీపడ్డారు. పరీక్ష అనంతరం మెరిట్ ఆధారంగా సొసైటీలు సీట్లు కేటాయించారు. మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ప్రత్యేకంగా అర్హత పరీక్ష నిర్వహించి ఆమేరకు అడ్మిషన్లు చేపట్టింది. 6, 7, 8, 9 తరగతుల్లోని బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి సైతం సొసైటీల వారీగా పరీక్షలు నిర్వహించారు. అర్హులైన విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అన్ని గురుకుల సొసైటీల్లో సీట్ల కేటాయింపులు పూర్తయ్యాయి. ఈ వారాంతంలోగా పాఠశాలల్లో ఆయా విద్యార్థులు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రవేశాల ప్రక్రియ దాదాపు ముగిసినట్లే. సీట్లు లేవు... దయచేసి రావొద్దు... ఐదు గురుకుల సొసైటీల పరిధిలో సీట్ల కేటాయింపులు పూర్తయినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం గురుకుల సొసైటీ కార్యదర్శి కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీంతో సీట్లు లేవంటూ సొసైటీలు ఇప్పటికే ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశాయి. గిరిజన గురుకుల సొసైటీ, జనరల్ గురుకుల సొసైటీలు కార్యాలయాల వద్ద సూచనలు చేస్తూ పోస్టర్లు అంటించాయి. అయినప్పటికీ సీట్ల కోసం దూరప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య తగ్గడం లేదు. సీట్ల కోసం వచ్చే వారిని కార్యాలయాల్లోకి అనుమతించకుండా, వారిని నిలువరించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. -
ఏపీ: పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులు
-
పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: పదో తరగతి పరీక్షా విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఎస్ఈ సిలబస్ నేపథ్యంలో 6 పేపర్ల విధానం అమలు చేయనున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. చదవండి: సాఫ్ట్వేర్ లవ్స్టోరీ.. బెంగళూరులో వివాహం.. రక్షణ కల్పించాలంటూ.. -
ఐదేళ్లలో 100% పరిజ్ఞానం!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థి చదివే, రాసే సామర్థ్యాన్ని ఇకపై వారానికోసారి అంచనా వేయ బోతున్నారు. అభ్యసన సామర్థ్యాలపై ప్రతి నెలా రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేపట్టబోతున్నారు. ముఖ్యంగా భాష, గణితంపై దృష్టి పెట్టనున్నారు. తద్వారా వచ్చే ఐదేళ్లలో 3, 5 తరగతుల విద్యార్థుల్లో 100% తెలివి తేటలు (పరిజ్ఞానం) పెంచాలని రాష్ట్ర విద్యాశాఖ లక్ష్యంగా పెట్టు కుంది. అలాగే 8వ తరగతి విద్యార్థుల్లో ప్రస్తుత సామర్థ్యాని 85 శాతానికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘తొలిమె ట్టు’ కార్యక్రమానికి ఆగస్టు 15 నుంచి శ్రీకారం చుట్టింది. దీనికోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. 1–5 తరగ తుల విద్యార్థుల కోసం తొలిమెట్టు అమలు చేయబోతు న్నారు. దీంతో పాటే 6–10 తరగతుల విద్యార్థుల అభ్యసన నష్టాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ‘న్యాస్’ రిపోర్టుతో మేల్కొలుపు అన్ని రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాలపై నేషనల్ అచీవ్మెంట్ సర్వే (న్యాస్) ప్రతి రెండేళ్ళకోసారి సర్వే నిర్వహిస్తుంది. సర్వేలో భాగంగా విద్యార్థులకు పలు ప్రశ్నలు వేయడం ద్వారా వారి స్థాయిని అంచనా వేస్తుంది. గత ఏడాది నవంబర్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి, ఫలితాలు వెల్లడించింది. కరోనా కారణంగా రెండేళ్ళలో విద్యా ప్రమాణాలు అనూహ్యంగా తగ్గాయని తాజా నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ కార్యాచరణకు దిగింది. పాఠశాలల ప్రారంభంలోనే విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సు నిర్వహించింది. దీనికి కొనసాగింపుగా 1–5 తరగతులకు తొలిమెట్టు, 6–10 తరగతుల్లో అభ్యసన నష్టాల భర్తీకి కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారం వారం అంచనా... విద్యార్థులకు వారంలో ఐదు రోజుల పాటు రెగ్యులర్ క్లాసులు జరుగుతాయి. అదనంగా ఓ గంట తొలిమెట్టు కింద ప్రత్యేక క్లాసు తీసుకుంటారు. విద్యార్థి వెనుకబడిన సబ్జెక్టు, పాఠాన్ని అర్థమయ్యేలా మళ్ళీ బోధిస్తారు. వారికి అర్థమైందా లేదా అనే దానిపై పాఠశాల స్థాయిలో చిన్న పరీక్ష నిర్వహిస్తారు. ఇది రాత పూర్వకంగా లేదా మౌఖికంగానైనా ఉండొచ్చు. ఒక పాఠం కనీసం 80 శాతం మందికి అర్థమవ్వాలని తొలిమెట్టు ప్రణాళికలో పేర్కొన్నారు. ఉన్నత తరగతుల విద్యార్థులకూ ఇదే విధానాన్ని అమలు చేస్తారు. -
గవర్నర్.. గాడిన పెడతారా?
నిర్మల్: ఒకటి, రెండు కాదు.. ఒకదాని వెనుకొకటి.. వరుసగా సమస్యలు బాసర ట్రిపుల్ఐటీని పీడిస్తున్నాయి. విద్యాక్షేత్రం ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. తమ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలంటూ జూన్ 14 నుంచి 21 వరకు ఎండనక, వాననక ఉద్యమించారు. చివరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్సిటీకి వచ్చి నెలరోజుల్లో సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు. రెండు నెలలు కావొస్తున్నా అవి పరిష్కారం కాకపోగా, అదనంగా ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ నెల 3న ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గవర్నర్ తమిళిసైని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. ‘ఒక్కసారి వర్సిటీకి వచ్చి చూడండి మేడమ్’అంటూ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆదివారం ట్రిపుల్ ఐటీకి వస్తున్నట్లు రాజ్భవన్ ప్రకటించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆర్జీయూకేటీకి అనుకున్నస్థాయిలో నిధులు రాకపోవడంతోపాటు న్యాక్ నుంచి ‘సీ’గ్రేడ్ రావడంతో విద్యార్థులు నిరాశపడ్డారు. వీటికి తోడు పురుగులన్నం, కప్పల కూరలు, టిఫిన్లలో బల్లులు, బొద్దింకలు రావడం విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించాయి. జూలై 15న ఫుడ్ పాయిజన్ జరిగి 600 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికీ చాలామంది కోలుకోలేదు. ట్రిపుల్ ఐటీ నుంచే వర్సిటీల సందర్శన రాజ్భవన్లో ఈ నెల 3న పలు యూనివర్సిటీల విద్యార్థులతో గవర్నర్ తమిళిసై సమావేశమ య్యారు. వర్సిటీలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రిపుల్ ఐటీలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలపై ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆహ్వానం మేరకు ట్రిపుల్ఐటీ నుంచే యూనివర్సిటీల సందర్శన ప్రారంభిస్తున్నారు. గవర్నర్ పర్యటన షెడ్యూల్ ►శనివారం రాత్రి 11.40కి హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి, నిజామాబాద్ చేరుకుంటారు. ►నిజామాబాద్ నుంచి ఆదివారం వేకువ జామున 3 గంటలకు బయలుదేరి 4 గంటలకు బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకుంటారు. ►ట్రిపుల్ ఐటీ గెస్ట్హౌస్లో ఉదయం 6 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ►ఉదయం 6.20 గంటలకు బాసర జ్ఞానసరస్వతీమాతను దర్శించుకుంటారు. ►ఉదయం 7 గంటలకు తిరిగి ట్రిపుల్ ఐటీ చేరుకుని, విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ►ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విద్యార్థులు, స్టాఫ్తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ►ఉదయం 10 గంటలకు ట్రిపుల్ ఐటీ నుంచి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి వెళ్తారు. రెక్టర్ హోదాలో.. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు గవర్న ర్ చాన్స్లర్ హోదాలో ఉంటారు. కానీ, ప్రత్యేక చట్టం కలిగిన రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ)కు మా త్రం ఈ హోదా వర్తించదు. గవర్నర్కు చీఫ్ రెక్టర్ (చాన్స్లర్ తరహాలో సంప్రదాయ పరిపాలనా ధికారి) హోదా మాత్రమే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలన్నింటికీ కలిపి ప్రత్యేకంగా చాన్స్లర్ ఉండేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ప్పటి నుంచి చాన్స్లర్ను నియమించలేదు. ఇటీవల వరుస ఘటనల నేపథ్యంలో గతనెలలో రాహుల్ బొజ్జాను మార్చి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటర మణకు బాధ్యతలు అప్పగించినా సమస్యలపర్వం కొనసాగుతూనే ఉంది. -
1.12 లక్షల మందికి డిగ్రీలో ప్రవేశాలు!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్–2022 తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తయింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 1,12,683 మంది విద్యార్థులకు ప్రాధాన్యతాక్రమంలో సీట్లు కేటాయించారు. ఈ మేరకు దోస్త్–2022 కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్తో కలసి శనివారం వివరాలను విడుదల చేశారు. దోస్త్–2022 ఫేజ్–1లో మొత్తం 1,44,300 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 1,18,898 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. 6,215 మంది విద్యార్థులు సరైనవిధంగా ఆప్షన్లు ఇవ్వకపోవడంతో వారికి సీట్లు రాలేదు. కామర్స్, ఆర్ట్స్ గ్రూపుల్లో అధికంగా... దోస్త్–2022 తొలివిడతలో సీట్లు పొందిన 1,12,683 మంది విద్యార్థుల్లో పురుషులు 45,743(40.59%), మహిళలు 66,940(59.41%) ఉన్నారు. అడ్మిషన్లు పొందినవారిలో అత్యధికంగా ఆర్ట్స్, కామర్స్ గ్రూపులవారే ఉన్నారు. సైన్స్ గ్రూప్ల అడ్మిషన్లు రెండోస్థానంలో ఉన్నాయి. మీడియాలవారీగా పరిశీలిస్తే ఇంగ్లిష్ మీడియంలో 1,02,418 మంది విద్యార్థులు, తెలుగు మీడియంలో 9,304, ఉర్దూ మీడియంలో 10, హిందీ మీడియంలో 951 మందికి సీట్లు కేటాయించారు. దోస్త్–2022లో మొత్తం 978 కాలేజీల్లో 510 కోర్సులున్నాయి. మొత్తం 4,20,318 సీట్లలో తొలివిడత 1,12,683 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు, ఇంజనీరింగ్, మెడికల్ సీట్లకు కౌన్సెలింగ్ పూర్తయ్యాక డిగ్రీ ప్రవేశాల వేగం పుంజుకుంటుందని నవీన్ మిట్టల్ తెలిపారు. ఇప్పటివరకు 51 కాలేజీల్లో ఎలాంటి ప్రవేశాలు జరగలేదు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే సీటు డిగ్రీ కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థులు లాగిన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియతో సీటు రిజర్వ్ చేసుకోవాలి. ప్రభుత్వకాలేజీల్లో సీటుపొంది ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత ఉన్న విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలతో ఉచితంగా, మిగతా విద్యార్థులు రూ.500 లేదా రూ.1,000 చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్తో సీటు రిజర్వ్ చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్లో విఫలమైతే సీటు రద్దవుతుంది. దోస్త్–2022 ఫేజ్–2 రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 7 నుంచి 22వ తేదీ వరకు కొనసాగుతుంది. -
బాబూ.. ఇంతకంటే మేలైన విధానాలు ఉంటే చెప్పండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యార్థులకు మేలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకోసమే పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టిందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. ప్రభుత్వ విధానంపై ఉపాధ్యాయ సంఘాల తీరు సహేతుకంగా లేదని మండిపడ్డారు. మంగళవారం విజయవాడలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. ప్రభుత్వాలను బెదిరిస్తామంటే పనులు కావని, ప్రభుత్వం ఉన్నది ప్రజలకు మేలు చేసేందుకేనని, అందుకు అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. ప్రతి పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ ఉండాలని తాను చెప్పానని, ఉపాధ్యాయులు కూడా 8 గంటలు పనిచేయాలని తెలిపారు. ఉద్యోగ రీత్యా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ఉద్యమాల పేరుతో ప్రజల్లో చులకన కారాదని ఉపాధ్యాయ సంఘాలకు హితవు పలికారు. నూతన విద్యా విధానం ప్రకారం మూడో తరగతి నుంచి ప్రత్యేకంగా తరగతి ఉపాధ్యాయుడిని నియమిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు అంతా ప్రభుత్వ విధానాలను అభినందిస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒకే ఉపాధ్యాయుడు ఉండాలన్నట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. ఇంతకన్నా మేలైన విధానాలు ఉంటే చంద్రబాబు చెప్పాలని, విద్యార్థులకు మేలు జరిగే విధానాలు ఏవైనా తాము ఏ భేషజాలు లేకుండా స్వీకరిస్తామని అన్నారు. జిల్లాల్లోని పాఠశాలలపై స్థానిక ఎమ్మెల్యేల నుంచి వినతులు తీసుకున్నామని, 5,800 స్కూళ్లను మ్యాపింగ్ చేస్తే సుమారు 400 స్కూళ్ల నుంచి వినతులు వచ్చాయని తెలిపారు. దీనిపై ఆయా జిల్లా జాయింట్ కలెక్టర్లతో కమిటీని వేశామని, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సానుభూతి కాదు.. సాయం కావాలి ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో స్వదేశానికి వచ్చేసిన మన వైద్య విద్యార్థులు ఇక్కడ చదువు కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. మంగళవారం ఈఏపీసెట్–2022 ఫలితాలు విడుదల చేసిన సందర్భంలో విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ సమాధానమిచ్చారు. విధిలేని పరిస్థితుల్లో చదువులు ఆపేసి భారత్కు తిరిగొచ్చిన మన విద్యార్థులపై ఇప్పుడు చూపాల్సింది సానుభూతి కాదని.. వారికి సాయం కావాలని పేర్కొన్నారు. -
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫార్మసీ తదితర కోర్సులకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2022 ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం విజయవాడలో విడుదల చేశారు. ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో మొత్తం 3,00,111 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,82,496 మంది పరీక్ష రాశారు. వీరిలో 2,56,983 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,94,752 మంది పరీక్ష రాయగా 1,73,572 మంది (89.12 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే అగ్రికల్చర్ విభాగంలో 87,744 మంది పరీక్ష రాయగా 83,411 (95.06 శాతం) మంది అర్హత సాధించారు. ఏపీ ఈఏపీసెట్లో ఇంజనీరింగ్ విభాగానికి బాలురు అధిక ప్రాధాన్యం ఇవ్వగా, అగ్రికల్చర్ విభాగానికి బాలికలు మొగ్గు చూపారు. అటు ఇంజనీరింగ్ విభాగంలో, ఇటు అగ్రికల్చర్ విభాగం రెండింటిలోనూ అబ్బాయిలే టాపర్లుగా నిలిచారు. ఇంజనీరింగ్ విభాగంలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన హరేన్ సాత్విక్ మొదటి ర్యాంక్ (158.6248 మార్కులు) సాధించి సత్తా చాటాడు. అగ్రికల్చర్ విభాగంలో గుంటూరు జిల్లాకు చెందిన వజ్రాల దినేష్ కార్తీక్ రెడ్డి మొదటి ర్యాంకు దక్కించుకున్నాడు. దుమ్ములేపేసిన అబ్బాయిలు.. ఏపీ ఈఏపీసెట్–2022 ఫలితాల్లో బాలురే టాపర్లుగా నిలిచారు. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం టాప్–10 ర్యాంకులు అబ్బాయిలకే దక్కాయి. వీరిలో నలుగురు తెలంగాణకు చెందిన విద్యార్థులు 5, 6, 7, 9 ర్యాంకులను సొంతం చేసుకున్నారు. అగ్రికల్చర్ విభాగంలో రెండు ర్యాంకులు మినహా మిగిలిన 8 ర్యాంకులు బాలురకే దక్కాయి. వీటిలో 7, 8, 9 ర్యాంకులు తెలంగాణ విద్యార్థులకు లభించాయి. ర్యాంకర్ల వివరాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పరీక్షల అనంతరం తుది ‘కీ’ని ప్రకటించామని గుర్తు చేశారు. అభ్యంతరాలను స్వీకరించాక కేవలం పది రోజుల్లోనే ఫలితాలను వెల్లడించామని తెలిపారు. గతేడాది కంటే ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షలు రాయడంతోపాటు అత్యధికులు అర్హత సాధించారని చెప్పారు. పరీక్షలో 160 మార్కులకు గాను 25 శాతం సాధించినవారిని అర్హులుగా పరిగణించామని వివరించారు. ఇంటర్మీడియెట్లో సాధించిన మార్కులకు ఈ ఏడాది వెయిటేజీ రద్దు చేశామన్నారు. కౌన్సెలింగ్కు ఏపీ ఈఏపీసెట్లో వచ్చిన ర్యాంకునే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈసారి పరీక్షకు హాజరైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అందరినీ అర్హులుగా పరిగణిస్తామన్నారు. ఫార్మసీ విభాగంలో 16,700 సీట్లు, ఇంజనీరింగ్లో 1,48,283 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఈసారి కోర్సుల డిమాండ్ను బట్టి ఆయా విభాగాల్లో సీట్లను పెంచే ఆలోచన ఉందన్నారు. ఐఐటీలు, ఎన్ఐటీల కౌన్సెలింగ్ తర్వాతే చేరికలు.. రాష్ట్రంలో ఎక్కువమంది విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీలను ఎంచుకుంటున్నందున వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిలో ప్రవేశాలు పూర్తయ్యాకే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ చేపడతామని మంత్రి బొత్స తెలిపారు. కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే 70 శాతం సీట్లకు జగనన్న విద్యా దీవెన అందిస్తామని చెప్పారు. యాజమాన్య కోటాపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కాగా పరీక్షలను సమర్థంగా నిర్వహించిన అనంతపురం జేఎన్టీయూ వైస్ చాన్సలర్, సెట్ కన్వీనర్ను మంత్రి బొత్స, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి అభినందించారు. టాపర్ల మనోగతాలు.. ఐఐటీ బాంబే నా లక్ష్యం.. మాది.. హిందూపురం. అమ్మ పద్మజ బయాలజీ టీచర్గా, నాన్న లోక్నాథ్ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. నేను బెంగళూరులో ఇంటర్ చదివాను. ఇటీవల జేఈఈ మెయిన్లోనూ మంచి ర్యాంకు వచ్చింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగలిగాను. ఆగస్టు 28న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ కోసం సిద్ధమవుతున్నాను. అందులో సీటు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతా. – బోయ హరేన్ సాత్విక్, ఫస్ట్ ర్యాంకర్, (ఏపీ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం) కంప్యూటర్ ఇంజనీర్ అవుతా.. మాది ఒంగోలు. అమ్మానాన్న లక్ష్మీకాంత, మాల్యాద్రిరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నేను గుడివాడలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివాను. ఇంటర్మీడియెట్ హైదరాబాద్లోని ఒక ప్రైవేటు కాలేజీలో అభ్యసించాను. అన్నయ్య లోకేష్రెడ్డి గతేడాది జేఈఈ అడ్వాన్స్డ్లో జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించాడు. అన్నయ్యలానే నేను కూడా ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతాను. మంచి కంప్యూటర్ ఇంజనీర్ కావడమే నా లక్ష్యం. – పోలు లక్ష్మీసాయి లోహిత్రెడ్డి, రెండో ర్యాంకర్ (ఏపీ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం) జేఈఈ అడ్వాన్స్డ్కు సిద్ధమవుతున్నా.. మాది శ్రీకాకుళం. అమ్మానాన్న మెండ రవిశంకర్, స్వరాజ్యలక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ టీచర్లే. అన్నయ్య జయదీప్ ఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. జేఈఈ మెయిన్లో 99.96 పర్సంటైల్ స్కోర్ చేశాను. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్డ్ కోసం సన్నద్ధమవుతున్నాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవాలన్నదే నా లక్ష్యం. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవుతా. – మెండా హిమవంశీ, మూడో ర్యాంకర్ (ఏపీ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం) ఎయిమ్స్ లేదా జిప్మర్లో ఎంబీబీఎస్ చేయడమే నా లక్ష్యం మాది.. గుంటూరు జిల్లా పెదకూరపాడు. నాన్న శ్రీనివాసరెడ్డి ఆర్డబ్ల్యూఎస్లో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. అమ్మ శివకుమారి గృహిణి. అన్నయ్య చంద్రశేఖరరెడ్డి విలేజ్ సర్వేయర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఎంసెట్ కోసం తరగతి గదిలో అధ్యాపకులు చెప్పినదాన్ని అవగతం చేసుకుని సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని.. ముఖ్యమైన పాఠ్యాంశాలను చదివాను. నీట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాను. ఎయిమ్స్ లేదా జిప్మర్లో ఎంబీబీఎస్ చేయడమే నా లక్ష్యం. – వజ్రాల దినేష్ కార్తీక్రెడ్డి, ఫస్ట్ ర్యాంకర్ (ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్ విభాగం) న్యూరాలజీ చేస్తా.. మాది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం. అమ్మ అంబిక.. డిగ్రీ కాలేజీ లెక్చరర్గా, నాన్న.. పరాత్పరరావు వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అన్నయ్య ఎయిమ్స్ రాయ్పూర్లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఎంసెట్లో విజయం సాధించడం వెనుక కుటుంబ సభ్యులు, ఫ్యాకల్టీ ప్రోత్సాహం ఎంతో ఉంది. డాక్టర్ కావాలనేది నా లక్ష్యం. అందులో న్యూరాలజీ స్పెషలైజేషన్ చేస్తా. – మట్టా దుర్గ సాయి కీర్తితేజ, రెండో ర్యాంకర్ (ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్ విభాగం) రోజుకు 12 గంటలు చదివా.. మాది.. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ. అక్క ఆసు సత్య ఎయిమ్స్ మంగళగిరిలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. నేను గుంటూరులో ఇంటర్ చదివాను. ఎంసెట్లో ర్యాంకు కోసం అధ్యాపకులు చెప్పిన విషయాలతోపాటు స్నేహితులతోనూ చర్చించాను. అక్క సత్య సలహాలు కూడా తీసుకున్నాను. రోజుకు 12 గంటలకు పైగా చదివాను. నీట్లో కూడా మంచి ర్యాంకు సాధిస్తాననే నమ్మకం ఉంది. ఎంబీబీఎస్ పూర్తి చేసి కార్డియాలజీ స్పెషలైజేషన్ చేయాలన్నదే నా లక్ష్యం. –ఆసు హిందు, మూడో ర్యాంకర్, (ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్ విభాగం) -
విధాన నిర్ణయాల్లో జోక్యం కూడదు
సాక్షి, అమరావతి: ప్రాథమిక స్థాయి నుంచే విద్యను పటిష్టం చేసేందుకు, తెలుగు విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను అమలు చేయాల్సిన ఉపాధ్యాయ సంఘాలు వాటి మార్పులపై మాట్లాడటం సరికాదని హితవు పలికారు. సోమవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ పాఠశాలల విలీనాన్ని చేపట్టామన్నారు. అయితే ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ రీత్యా ఇబ్బందులు ఉంటే వాటిపై పోరాడాలేగానీ, ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోవడం తగదన్నారు. ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారు. వారి పిల్లల భవిష్యత్తుకు పునాదులు పటిష్టంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదని, అలాగే పేద పిల్లల ఉన్నతిని కూడా వారు కోరుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని చెప్పారు. మెరుగైన విద్యకు బాటలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎల్కేజీ, యూకేజీతో పాటు ఒకటి, రెండు తరగతులను కలిపి ఒకే చోట ఏర్పాటు చేసి ఇద్దరు ఎస్జీటీ, ఇద్దరు అంగన్వాడీ టీచర్ల పర్యవేక్షణలో చదువు చెబుతున్నట్లు బొత్స తెలిపారు. 3 నుంచి 8వ తరగతి/ 3 నుంచి 10వ తరగతి/3 నుంచి ఇంటర్ వరకు ఒకే చోట ఏర్పాటు చేయడం ద్వారా ప్రాథమికంగానే సబ్జెక్టు టీచర్ల బోధన లభిస్తుందన్నారు. డిజిటల్ స్క్రీన్పై క్లాసులు, 8వ తరగతి నుంచి 5 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లో ఇంగ్లిషులో ఉచిత బోధనలు అందిస్తున్నామన్నారు. అక్షరక్రమంలో తొలి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ను విద్యా రంగంలో కూడా ప్రథమ స్థానంలో నిలిపేందుకే ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో విలీనానికి 5,800 పాఠశాలలను మ్యాపింగ్ చేస్తే 268 స్కూళ్ల నుంచి అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. వాటిని జాయింట్ కలెక్టర్లు పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలిపారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ ప్రకారమే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా, ప్రైవేటు పాఠశాలలకు నిర్ణీత రేట్ల ప్రకారం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇందు కోసం రాష్ట్రంలోని 660 ప్రింటింగ్ ప్రెస్లను ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నామన్నారు. అయితే ప్రైవేటు పాఠశాలలు నిర్లక్ష్యంగా ఇండెంట్ తక్కువగా పెట్టడం వల్లే పుస్తకాల కొరత ఏర్పడిందన్నారు. ఆ సమస్యను అధిగమించేందుకు 15 రోజుల్లో మళ్లీ ఇండెంట్ పెట్టాలని ఆయా యాజమాన్యాలకు సూచించినట్లు తెలిపారు. -
పది రోజుల్లో ఇంటర్ పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జూనియర్ కాలేజీలకు మరో పది రోజుల్లో ఇంటర్ పాఠ్య పుస్తకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, తెలుగు అకాడమీ డైరెక్టర్ దేవసేన తెలిపారు. ‘సాక్షి’ప్రతినిధితో సోమవారం ఆమె మాట్లాడుతూ.. పేపర్ కొరత కారణంగానే ముద్రణ ఆలస్యమైందన్నారు. ‘‘ఈ పుస్తకాలకు నాణ్యమైన పేపర్ను ఉపయోగిస్తాం. పేపర్ రేట్లు ఇటీవల విపరీతంగా పెరిగాయి. పాత కాంట్రాక్టు సంస్థల్లో ఒకటి మాత్రమే పేపర్ అందించడానికి ముందు కొచ్చింది. ప్రభుత్వం ఇటీవల వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంతో తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలకు డిమాండ్ పెరిగింది. దీంతో గతంలో వచ్చిన పేపర్ అవి ముద్రించడానికే ఉపయోగించాల్సి వచ్చింది. అవసరమైన పేపర్ను తెప్పించేందుకు అధికారులు సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రవాణాకు ఇబ్బంది ఏర్పడింది’’అని చెప్పారు. మార్కెట్లో ఖరీదుకు అందించే పుస్తకాలను ఇప్పటికే ముద్రించామని, ప్రభుత్వ కాలేజీలకు ఉచితంగా ఇవ్వాల్సిన పుస్తకాల్లో కొన్ని ముద్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పేపర్ అందిన మూడు రోజుల్లో ప్రింటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. తర్వాత వారం రోజుల్లో అన్ని కాలేజీలకు అందిస్తామన్నారు. పేపర్ కొరత సమస్య తెలంగాణకే కాదని, అన్ని రాష్ట్రాలకూ ఉందని వెల్లడించారు. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత అంతర్జాతీయంగానూ పేపర్ ఖరీదు పెరిగిందన్నారు. తాము టెండర్లు పిలిచినప్పటికి, ఇప్పటికి పేపర్ ఖరీదు రెట్టింపు అయిందని, అయినా నాణ్యత విషయంలో రాజీ పడకుండా విద్యార్థులకు మంచి పుస్తకాలు అందించాలనే సంకల్పంతో ఉన్నామని వివరించారు. -
టీడీపీ హయాంలో విదేశీ విద్య పేరుతో దోపిడీ
విజయనగరం అర్బన్: విదేశీ విద్య రుణాల పేరుతో టీడీపీ హయాంలో రూ. 300 కోట్ల మేర అవినీతి జరిగిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విదేశాల్లో ఉన్నాయో, లేవో తెలియని యూనివర్సిటీల పేరుతో దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. శనివారం విజయనగరం కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో టాప్–200 ర్యాంకుల్లో ఉన్న విదేశీ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చే రుణ అనుమతి ఉంటుందన్నారు. ఒక్క స్కూల్ కూడా మూతపడదు.. నూతన విద్యావిధానం మేరకు రాష్ట్రంలో అమలు చేస్తున్న 3, 4, 5వ తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడదని మంత్రి బొత్స వివరించారు. ఆ ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 1, 2వ తరగతులతో పాటు అంగన్వాడీ పిల్లలతో కలిపి ఫౌండేషన్ స్కూల్ పేరుతో అవి కొనసాగుతాయని పునరుద్ఘాటించారు. ఎల్లో మీడియాతో పాటు, సోషల్ మీడియాలో కొందరు బడులు మూతబడుతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలానికి రెండు జూనియర్ కళాశాలలు రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్ కోర్సులు ప్రారంభిస్తామని, మండలానికి రెండు జూనియర్ కళాశాలలను నిర్వహిస్తామని మంత్రి బొత్స తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అవసరమైన పుస్తకాలను ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. ఏ పాఠశాలలోనైనా అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ అయితే ఆ విద్యా సంస్థ గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మంత్రితో పాటు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అప్పలనరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు విద్యార్థులకు చౌకగా పాఠ్యపుస్తకాలు
సాక్షి, అమరావతి: ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్కుల పేరిట జరుగుతున్న దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం ముకుతాడు వేసింది. తల్లిదండ్రులపై ఏటా వేలాది రూపాయల భారం పడకుండా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థలకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్కులు తదితరాలను ప్రభుత్వమే ముద్రించి పంపిణీ చేసే విధానానికి ఈ విద్యా సంవత్సరం నుంచి శ్రీకారం చుట్టింది. అతి తక్కువ ధరకు నాణ్యతతో కూడిన పుస్తకాలను పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు ఈ పాఠశాలల విద్యార్థులకు కావలసిన పుస్తకాలను ఆయా యాజమాన్యాలు ప్రైవేటు పబ్లిషర్ల నుంచి తీసుకొని అందించే విధానాన్ని గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేసింది. దీనివల్ల పబ్లిషర్లు, పాఠశాలల యాజమాన్యాలు ఎక్కువ ధరలకు పుస్తకాలను అమ్మి, తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు దండుకొనేవి. కొన్ని పాఠశాలల విద్యార్థులు షాపుల్లో అధిక ధరలకు కొనేవారు. కొన్ని కార్పొరేట్ పాఠశాలలైతే ఒకటో తరగతి నుంచే పాఠ్య పుస్తకాలకోసం రూ.5 వేల వరకు వసూలు చేసేవి. పై తరగతులకు వెళ్తున్నకొద్దీ ఈ వ్యయం రూ.10వేలకు పైనే ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర పబ్లిషర్ల పుస్తకాలను కూడా ఈ స్కూళ్లు బలవంతంగా అంటగట్టేవి. ఈ పుస్తకాల నుంచి ఏదైనా బోధిస్తారా అంటే అదీ ఉండదు. ఆయా సంస్థలు రూపొందించే స్టడీ మెటీరియల్ను అనుసరించి బోధన, పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి మళ్లీ అదనంగా వసూలు చేస్తున్నారు. వీటన్నిటికీ ముకుతాడు వేస్తూ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్కులు ఉచితంగా అందిస్తోంది. ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థుల సంఖ్యను అనుసరించి ముందుగా ఇండెంటు తీసుకొని 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ముద్రించింది. ప్రైవేటు పాఠశాలల్లో 24, 44,942 మంది విద్యార్థులుండగా వాటి నుంచి 18,02,879 మంది విద్యార్థులకు సరిపడా ఇండెంటు వచ్చింది. వీరికి ఆయా తరగతులు, టైటిళ్లు, వివిధ మాధ్యమాలకు సంబంధించి 1.83 కోట్ల పాఠ్యపుస్తకాలను విద్యా శాఖ, ప్రభుత్వ పాఠ్య పుస్తక విభాగం సిద్ధం చేశాయి. పంపిణీకి ఏర్పాట్లు చేపట్టాయి. తరగతులు, స్టూడెంట్లవారీగా సెట్ల కింద అందిస్తున్నాయి. స్కూళ్ల యాజమాన్యాలు నిర్దేశిత గేట్వే ద్వారా డబ్బులు చెల్లిం చగానే పుస్తకాలను ఎంఈవోల ద్వారా అం దిస్తారు. పాఠ్య పుస్తకాల ధరలను నిర్ణయిస్తూ శనివారం పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీచేసింది. -
తెలంగాణ: పుస్తకాల ముద్రణ ఇంకా ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠ్య పుస్తకాల పంపిణీ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటివరకూ 63 శాతమే పంపిణీ జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. మిగతా 37 శాతం పాఠ్యపుస్తకాలను ముద్రించాల్సి ఉంది. ఈ ప్రక్రియకు ఇంకా సమయం పట్టేలా కన్పిస్తోంది. అయితే, మరో పది రోజుల్లో మొత్తం పుస్తకాలను విద్యార్థుల వద్దకు చేరుస్తామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటికే బోధన మొదలైంది. సర్కారీ బడుల్లో మాత్రం పుస్తకాల కొరత కారణంగా బోధన చేపట్టలేదు. దీన్ని కప్పి పుచ్చుకోవడానికి బ్రిడ్జ్ కోర్సు పేరుతో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. జూలైలోనూ పుస్తకాలు ఇవ్వకుండా, బోధన మొదలవ్వకపోతే విద్యార్థుల్లో ప్రమాణాలు ఎలా పెరుగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 24 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తారు. విద్యా శాఖ అంచనా ప్రకారం దాదాపు 1.67 కోట్ల పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంటుంది. బడులు మొదలై నెల రోజులకుపైగా గడిచినా ఇప్పటివరకూ 1.07 కోట్ల పుస్తకాలనే బడులకు పంపారు. ఇంకా 60 లక్షల పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. విద్యార్థులందరికీ సరిపడా పుస్తకాలు లేకపోవడంతో పంపిణీ కార్యక్రమంలో ఉపాధ్యాయులూ తికమక పడుతున్నారు. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే స్థానికంగా ఇబ్బందులొస్తున్నాయని అంటున్నారు. దీంతో స్కూళ్లకు చేరిన పుస్తకాలను కూడా పంపిణీ చేయడం లేదు. ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన చేపట్టాల్సి ఉండటంతో ద్విభాషలో పుస్తకాలు ముద్రించారు. పది రోజుల్లో ఇస్తాం: శ్రీనివాసచారి, డైరెక్టర్ ప్రభుత్వ పుస్తక ముద్రణ విభాగం పుస్తకాలకు అవసరమైన కాగితం ఆలస్యంగా రావడంతోనే సకాలంలో ముద్రించలేకపోయాం. ఇప్పటికే 63 శాతం జిల్లాలకు పంపాం. వాటిని వెంటనేపంపిణీ చేయమని చెప్పాం. మిగతావి కూడా మరో పది రోజుల్లో పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. -
నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీఈఏపీసెట్–2022 పరీక్షలు నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 8 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు, 11, 12 తేదీల్లో బైపీసీ స్ట్రీమ్ పరీక్షలు ఉంటాయి. రోజుకు రెండు సెషన్లుగా ఉ.9 గంటల నుంచి మ.12 వరకు, మ.3 నుంచి 6 వరకు ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా జరుగుతాయి. వీటిని సజావుగా పూర్తిచేయించేందుకు ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. మూడు లక్షల మంది దరఖాస్తు ఇక రాష్ట్రవ్యాప్తంగా 3,00,084 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు రిజిస్టర్ అయి దరఖాస్తులు సమర్పించారు. ఉ.7.30 నుంచి 9 గంటల వరకు, మ.1.30 నుంచి 3 గంటల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి వివరించారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ► నిర్ణీత సమయానికి ఒక్క నిముషం ఆలస్యమైనా ప్రవేశానికి అనుమతించరు. ► విద్యార్థులు మాస్కులు ధరించి రావాలి. బ్లాక్ లేదా బ్లూ బాల్పెన్ను, చిన్న బాటిల్తో పాటు శానిటైజర్ను మాత్రమే అనుమతిస్తారు. ► రఫ్వర్కు పత్రాలను పరీక్ష కేంద్రాల్లోనే సమకూరుస్తారు. ► ఎలక్ట్రానిక్ పరికరాలనూ అనుమతించరు. ► బయోమెట్రిక్ ద్వారా విద్యార్థుల వివరాలను పరిశీలిస్తారు. కాబట్టి ఎవరూ చేతివేళ్లకు మెహిందీ, లేదా సిరా లేకుండా చూసుకోవాలి. ► విద్యార్థులు హాల్టిక్కెట్తో పాటు అధికారిక ఫొటో గుర్తింపు కార్డు, ఒక పాస్పోర్టు సైజ్ ఫొటో తీసుకురావాలి. ► పరీక్ష కేంద్రంలో అప్లికేషన్ నింపి ఫొటోను అతికించి దాన్ని ఇన్విజిలేటర్లకు అప్పగించాలి. అలా అప్పగించని వారి ఫలితాలు విత్హెల్డ్లో పెడతారు. పరీక్షా విధానం ఇలా.. ఏపీ ఈఏపీ సెట్లో ప్రతి సెషన్ మూడుగంటల పాటు జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలుంటాయి. ఇంజినీరింగ్ స్ట్రీమ్లో 80 ప్రశ్నలు మేథమెటిక్స్లో, 40 ప్రశ్నలు ఫిజిక్స్, 40 ప్రశ్నలు కెమిస్ట్రీలో ఉంటాయి. అన్నింటికీ ఒకే వెయిటేజీ ఉంటుంది. అలాగే, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్లో 160 మార్కులలో 80 ప్రశ్నలు బయాలజీలో, (40 బోటనీ, 40 జువాలజీ), 40 ప్రశ్నలు ఫిజిక్స్, 40 ప్రశ్నలు కెమిస్ట్రీలో ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సమాధానామివ్వని ప్రశ్నలపై మూల్యాంకనం ఉండదు. 25 శాతం మార్కులొస్తేనే అర్హత ఈ ప్రవేశ పరీక్షలో అభ్యర్థులకు 25 శాతం మార్కులు వస్తే ర్యాంకులకు, కౌన్సెలింగ్కు అర్హులవుతారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ అభ్యర్థులకు క్వాలిఫైయింగ్ మార్కుల్లేవు. వారికి కేటాయించిన సీట్లను ఆ కేటగిరీ వారితోనే భర్తీచేస్తారు. పరీక్షలు ఆన్లైన్లో పలు సెషన్లలో జరగనున్నందున నార్మలైజేషన్ పద్ధతిలో మార్కులను ప్రకటించనున్నారు. అవాంతరాల్లేకుండా నిర్వహణకు ఏర్పాట్లు పరీక్ష సమయంలో సాంకేతిక సమస్యలకు ఆస్కారంలేకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ఎంత సమయం ఆలస్యమైందో ఆ మేరకు అదనపు సమయాన్ని ఇస్తారు. హాల్ టికెట్లను కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలి. సందేహాలుంటే ‘ఏపీఈఏపీసీఈటీ2022హెచ్ఈఎల్పీడీఈఎస్కె ఃజీమెయిల్.కామ్కు తెలియజేయవచ్చు. లేదా 08554–234311 లేదా 08554–232248 నెంబర్లలో సంప్రదించవలసి ఉంటుంది. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2022 పరీక్షలను ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి చెప్పారు. శనివారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జేఈఈ వంటి జాతీయ పరీక్షలకు అమలు చేస్తున్న మాదిరిగానే ఒక్క నిమిషం నిబంధనను ఈఏపీసెట్కు కూడా అమలు చేస్తున్నామన్నారు. అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయానికి గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. ప్రతి అభ్యర్థి హాల్టికెట్తో పాటు ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలను తీసుకు రావాలని సూచించారు. బాల్పాయింట్ పెన్నులు, రఫ్ వర్క్ చేసుకోవడానికి అవసరమైన కాగితాలను పరీక్ష కేంద్రాల్లోనే ఇస్తారన్నారు. పరీక్షల సమయాల్లో విద్యార్థులకు అనువుగా ఉండేలా బస్సులు నడపాలని ఇప్పటికే ఆర్టీసీ అధికారులను కోరామన్నారు. 3 లక్షలకు పైగా అభ్యర్థుల దరఖాస్తు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏపీ ఈఏపీసెట్కు 3,00,084 మంది దరఖాస్తు చేశారని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు తెలిపారు. ఏపీలో 120, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈసారి ఈఏపీసెట్లో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ ఉండదని, సెట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులకు ర్యాంకులు ప్రకటిస్తామని చెప్పారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయన్నారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహనరావు, కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్కుమార్, సెట్స్ ప్రత్యేకాధికారి సుధీర్రెడ్డి పాల్గొన్నారు. రోజుకు రెండు చొప్పున 10 సెషన్లలో ఇంజనీరింగ్ స్ట్రీమ్ ► ఈఏపీసెట్లో ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు రోజుకు రెండు చొప్పున 10 సెషన్లలో ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. ► 11, 12 తేదీల్లో 4 సెషన్లలో బైపీసీ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. ► అభ్యర్థులు తమ హాల్ టికెట్లోని పేరు, పుట్టిన తేదీ, జెండర్, కేటగిరీ, స్ట్రీమ్ వంటి వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తప్పు ఉంటే ఈఏపీసెట్ హెల్ప్లైన్ కేంద్రానికి తెలియజేసి సరిచేయించుకోవాలి. ► హాల్ టికెట్ లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు ► ఒకరోజు ముందే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలి. పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు వీలుగా మ్యాప్ల ద్వారా మార్గాన్ని చూపించే సదుపాయం కల్పించారు. ► విద్యార్థులను ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ► చెక్ఇన్ ప్రొసీజర్లో భాగంగా బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ కేప్చర్ చేస్తారు. ఎడమ వేలి ముద్ర ద్వారా వీటిని నమోదు చేయనున్నందున అభ్యర్థులు మెహిందీ వంటివి పెట్టుకోకూడదు. ► బాల్పెన్నుతో అప్లికేషన్ ఫారాన్ని నింపి దానికి ఫొటోను అతికించి ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేసి అందించాలి. అలా అప్లికేషన్ను సమర్పించని వారి ఫలితాలను ప్రకటించరు. ► పరీక్ష సమయంలో సాంకేతిక సమస్య ఏర్పడి వెంటనే పరిష్కారం కాకపోతే ఎంత సమయం ఆలస్యమైందో ఆమేరకు అదనపు సమయాన్ని ఇస్తారు. ► హాల్ టికెట్లను కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలి. ► ఇతర వివరాలకు ‘హెచ్టీటీపీఎస్://సీఈటీఎస్.ఏపీఎస్సీహెచ్ఈ.జీఓవీ.ఐఎన్/ఈఏపీ సీఈటీ’ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు ► సందేహాలుంటే ‘ఏపీఈఏపీసీఈటీ2022హెచ్ఈఎల్పీడీఈఎస్కెఃజీమెయిల్.కామ్కు తెలియజేయవచ్చు. లేదా 08554–234311 లేదా 08554–232248 నంబర్లలో సంప్రదించవచ్చు. -
చదువుల్లో ఏపీ పరుగులు
ప్రభుత్వ విద్యా రంగం అభివృద్ధికి రాష్ట్రంలో తీసుకుంటున్నన్ని చర్యలు, అమలు చేస్తున్న పథకాలు.. కార్యక్రమాలు మరే రాష్ట్రంలోనూ కనిపించవు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే కేంద్ర పెర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో రాష్ట్రం మంచి స్థానాన్ని దక్కించుకుంటే.. ఆ తర్వాతి సంవత్సరాల్లో మదింపు పూర్తయితే తప్పక అగ్రభాగాన నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ చేపట్టిన కార్యక్రమాలు తొలి ఏడాది నుంచే సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభా పాటవాలు గతంలో కన్నా ఎంతో వృద్ధి చెందాయి. ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల అభ్యసన ఫలితాలు (లెర్నింగ్ అవుట్కమ్) మెరుగు పడినట్లు కేంద్రం ‘పెర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్’ నివేదికలో వెల్లడించింది. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన నివేదికను కేంద్ర విద్యా శాఖ తాజాగా విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్న తీరు, వినూత్న బోధన, హాజరు తదితర అంశాలను పరిశీలించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్ల ‘పెర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్’ను తయారు చేస్తోంది. 2017–18 నుంచి ఏటా ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల పనితీరు 2019–20 విద్యా సంవత్సరంలో బాగా మెరుగు పడిందని తాజా నివేదికలో స్పష్టం చేసింది. 1000 పాయింట్ల సమగ్ర సూచీలో 10 స్థాయిలతో ఆయా రాష్ట్రాల స్థానాలను నివేదికలో కేంద్రం నిర్దేశించింది. జాతీయ స్థాయిలో 10 లెవల్స్లో ఆంధ్రప్రదేశ్కు 4వ స్థానం దక్కింది. అంతకు ముందు విద్యా సంవత్సరం (2018–19)లో రాష్ట్రం 6వ స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి జగన్ అధికారం చేపట్టిన తొలి విద్యా సంవత్సరంలోనే రాష్ట్రం లెవల్–6 నుంచి లెవల్–4కు ఎదిగి రెండు స్థానాలను మెరుగు పరుచుకోవడం విశేషం. అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ అమలు, విద్యార్థులకు బైజూస్ కంటెంట్, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు, బడుల్లో డిజిటల్ లెర్నింగ్కు కావాల్సిన మౌలిక వసతుల కల్పన.. తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఇక నుంచి మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని విద్యా వేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పాఠశాలల పని తీరు మెరుగు విద్యార్థుల ప్రతిభా పాటవాలు ఏటా పెరుగుతున్నాయా? లేదా? అభ్యసన ఫలితాలు మరింత మెరుగ్గా రావడానికి ఏ అంశాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది? తదితర విషయాలను తెలుసుకోవడానికి కేంద్ర విద్యా శాఖ నివేదికలు రూపొందిస్తోంది. చదువులలో నాణ్యత గుర్తించడానికి విభిన్న ఇండికేటర్స్ను నిర్ధారించింది. 2018–19 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2019–20లో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో నాణ్యత మెరుగు పడిందని నివేదిక పేర్కొంది. 1000 మార్కుల సూచీలో ఆంధ్రప్రదేశ్ 811 పాయింట్లు సాధించి లెవల్–4 (గ్రేడ్–1)లో నిలిచింది. 2018–19 విద్యా సంవత్సరంలో 725 పాయింట్లతో లెవల్–6 (గ్రేడ్–3)లో ఉండింది. అంతకు ముందు 2017–18లో కూడా 728 పాయింట్లతో లెవల్–6 (గ్రేడ్–3)లోనే ఉండింది. కేంద్ర పాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాల స్కోరు ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్కు దేశంలో 12వ స్థానం దక్కింది. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ 772 మార్కులతో 18వ స్థానంలో నిలిచింది. తొలి మూడు స్థానాలను పంజాబ్, తమిళనాడు, కేరళ దక్కించుకున్నాయి. ఐదు ప్రామాణికాలతో ఎంపిక కేంద్ర విద్యాశాఖ స్థూలంగా 5 అంశాలను పరిగణనలోకి తీసుకొని 1000 పాయింట్ల స్కోర్తో ఆయా రాష్ట్రాలకు స్థానాలను నిర్ధారిస్తోంది. 1. అభ్యాస ఫలితాలు, నాణ్యత : ప్రభుత్వ పాఠశాలల్లో 3, 5, 8వ తరగతి విద్యార్థుల భాష (తెలుగు/ఇంగ్లిష్/హిందీ), గణితంలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ అంశాన్ని నిర్ధారించారు. 1000 మార్కుల సూచీలో ఈ అంశానికి 180 మార్కులు కేటాయించారు. 2. పాఠశాల అందుబాటులో ఉన్న తీరు : ప్రైమరీ, సెకండరీ స్థాయిలో విద్యార్థుల కనిష్ట చేరికల నిష్పత్తి, ప్రాథమిక–సెకండరీ స్థాయిలో విద్యార్థులు కొనసాగుతున్న తీరు, ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీకి, అక్కడ నుంచి సెకండరీలోకి చేరుతున్న విద్యార్థుల శాతం, చదువుకు దూరంగా ఉంటున్న బడి ఈడు పిల్లల సంఖ్య.. అంశాల ఆధారంగా 1000 మార్కుల సూచీలో ఈ అంశానికి 80 మార్కులు కేటాయించారు. 3. మౌలిక సదుపాయాలు : పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అందుబాటులో ఉన్న మౌలిక వసతుల ఆధారంగా ఈ అంశానికి 1000 మార్కుల సూచీలో 150 మార్కులు కేటాయించారు. 4. సమానత (ఈక్విటీ) : ఓసీ, ఎస్సీ, ఎస్టీ, గ్రామీణ, పట్టణ, బాలికలు, బాలుర మధ్య అభ్యసన ఫలితాలను పరిశీలించి ఈ అంశానికి 1000 మార్కుల సూచీలో 230 మార్కులు కేటాయించారు. 5. పాఠశాల నిర్వహణ : విద్యా సంస్థల నిర్వహణ, బోధనాంశాల ప్రణాళిక రూపకల్పన తీరును పరిశీలించి ఈ అంశానికి 1000 మార్కుల సూచీలో 360 మార్కులు కేటాయించారు. రానున్న రోజుల్లో మరింత మంచి ఫలితాలు 2019లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అమ్మ ఒడి కింద అర్హులైన ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను మనబడి నాడు–నేడు పథకం కింద రూ.వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జగనన్న విద్యా కానుక కింద చదువులకు అవసరమైన వస్తువులు అందిస్తూ కార్పొరేట్ స్కూళ్ల పిల్లలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. జగనన్న గోరుముద్ద పేరుతో విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టారు. పునాది విద్యను బలోపేతం చేసేందుకు ఫౌండేషన్ స్కూళ్లనూ ఏర్పాటు చేశారు. సీబీఎస్ఈ సిలబస్ను అమలు చేస్తున్నారు. తాజాగా ప్రపంచంలోనే ప్రముఖ ఆన్లైన్ ఎడ్ టెక్ సంస్థ బైజూస్ భాగస్వామ్యంతో విద్యార్థులకు అత్యుత్తమ కంటెంట్ను సమకూరుస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు 8వ తరగతి నుంచి ట్యాబ్లు అందిస్తూ డిజిటల్ విద్య ద్వారా ప్రమాణాలు పెంచేలా కార్యాచరణ చేపడుతున్నారు. ఈ కార్యక్రమాల ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కనుక రాష్ట్రం ‘పెర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్’లో దేశంలో అగ్రస్థానంలో ఉంటుందన్నది అక్షర సత్యం. -
TS Inter Results 2022 : జూన్ 28వ తేదీన ఇంటర్ ఫలితాలు విడుదల..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను జూన్ 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ స్పష్టత నిచ్చింది.జూన్ 28వ తేదీన(మంగళవారం) ఉదయం 11 గంటలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్బోర్డు జూన్ 26వ తేదీ (ఆదివారం) ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొంది. ఫలితాలు విడుదల చేసిన 15 రోజుల్లోనే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహింస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ గతంలోనే ప్రకటించారు. మే 6వ తేదీన మొదలైన ఇంటర్మీడియెట్ పరీక్షలు మే 24న ముగిసిన విషయం తెల్సిందే. తెలంగాణ ఇంటర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. -
విద్యారంగంలో జగన్ జైత్రయాత్ర
విద్యా రంగంలో వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. చదువుల మీద ఒక ముఖ్యమంత్రిగా ఆయన పెడుతున్న శ్రద్ధ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా పెట్టలేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్షణక్షణానికీ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఊహించని స్థాయికి చేరుతున్న విజ్ఞానాన్ని రేపటి తరం పిల్లలు అందిపుచ్చుకోవాలన్న ఆయన సంకల్పం కొనసాగుతోంది. ఉన్నవారితో సమానంగా లేనివారి పిల్లలకూ అన్నీ అందాలన్న ఆయన దృఢ నిశ్చయం కళ్లముందు కనిపిస్తోంది. పేద కుటుంబాల తలరాతలే కాదు, ఒక ప్రజాస్వామ్య దేశంగా, ఉత్తమ విలువలతో కూడిన సమాజంగా వర్థిల్లాలంటే అది కేవలం చదువుల ద్వారానే సాధ్యమనే బలంగా విశ్వసించిన ఆయన, విద్యారంగంలో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. చదవండి: ఎల్లో హెచ్చులు ఢిల్లీ దాకా! నిరక్షరాస్యతకు చరమాంకం: 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 67.35 శాతం మాత్రమే. మహిళల అక్షరాస్యత 59.96 శాతం. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత, గత జనాభా లెక్కలు నాటికి ఆ 55 ఏళ్ల సంవత్సరాల్లో కూడా నూటికి నూరుశాతం అక్షరాస్యతను సాధించలేకపోయాం. ప్రగతికి ఇదో పెద్దలోటు. 2019లో వచ్చిన దృఢ సంకల్పంతో కూడిన రాజకీయ నాయకత్వం ఈ పరిస్థితులను మార్చడానికి కంకణం కట్టుకుంది. పుట్టిన ప్రతి పిల్లాడు కూడా బడికిపోవాలన్న సదుద్దేశంతో ‘అమ్మ ఒడి’ పథకం ప్రారంభమైంది. పిల్లల చదువుల కోసం ఏ పేదింటి తల్లీ భయపడవద్దని, కేవలం బడికి పంపితే చాలు రూ.15 వేల ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తుచ తప్పక అమలు చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం.. మేనిఫెస్టోలో కేవలం బడికి వెళ్లే పిల్లలకు మాత్రమేనంటూ ఈ పథకాన్ని పేర్కొన్నా తర్వాత దాన్ని ఇంటర్మీడియట్ చదువుతున్న వారికీ వర్తింపుచేశారు. 2019-2020 విద్యా సంవత్సరంలో 42,33,098 మంది తల్లులకు రూ.6,349.53 కోట్ల రూపాయలను చిత్తూరులో 2020, జనవరి 9న ముఖ్యమంత్రి బటన్ నొక్కి జమచేశారు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి 44,48,865 మంది తల్లులకు రూ.6,673 కోట్లను నెల్లూరులో 2021,జనవరి 11న సీఎం బటన్ నొక్కి జమ చేశారు. మొదటి ఏడాదిలో పథకం అప్పుడే ప్రారంభం అయిన దృష్ట్యా వారి పిల్లలను బడికి పంపేలా తల్లులను ఉత్సాహపరిచేలా ఎలాంటి హాజరు శాతాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం లబ్ధిదారులు అందరికీ కూడా అమ్మ ఒడిని జమ చేసింది. రెండో ఏడాది కూడా కోవిడ్ కారణంగా పాఠశాలలు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులకు అందరికీ కూడా పిల్లల హాజరుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం వర్తింపచేసింది. ఈ ఏడాది మాత్రం 75 శాతం హాజరును పరిగణలోకి తీసుకుంది. పథకం ఉద్దేశం నీరు గారకుండా, లక్ష్యాన్ని సాధించేందుకు నిర్ణయించిన హాజరు శాతాన్ని పరిగణలోకి తీసుకుని పథకాన్ని వర్తింపుచేస్తామని నేరుగా ముఖ్యమంత్రే చిత్తూరు ‘అమ్మ ఒడి’ సభలో స్పష్టం చేశారు. మొత్తంగా మూడేళ్ల కాలంలో కేవలం అమ్మ ఒడి పథకానికే రూ.19,617.53కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కొత్తగా అమ్మ ఒడి పరిధిలోకి 5,48,329 మంది 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా అమ్మఒడి పరిధిలోకి 5,48,329 మంది తల్లులు వచ్చారు. పథకం స్థిరంగా, సమగ్రంగా కొనసాగుతుందనేందుకు ఇదొక ఉదాహరణ. వీరంతా కూడా ఒకటో తరగతిలో చేరిన పిల్లల తల్లులు. 75శాతం హాజరు నిబంధనను వీరు సంతృప్తికరంగా పూర్తి చేయడం మంచి పరిణామం. మొత్తంగా 43,96,402 మంది తల్లులకు సుమారు రూ.6,595 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి బటన్నొక్కి జమచేయనున్నారు. తద్వారా 82,31,502 మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. వివక్షలేదు... అవినీతి లేదు.. అంతా పారదర్శకం: పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తోంది. ఏ పథకం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు దరఖాస్తులు తీసుకుంటారు? ఆ దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి? దాఖలు ఎక్కడ చేయాలి? ఇలాంటి ప్రశ్నలు గత ప్రభుత్వాల్లో కోకొల్లలు. వీటికి తావులేకుండా మొత్తం ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటోంది. కుటుంబాల వారీగా ఉన్న వాలంటీర్లు అర్హులైన వారిని గుర్తించి వారిచేత దరఖాస్తు చేయిస్తున్నారు. అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచుతున్నారు. సామాజిక తనిఖీ సమయంలో అర్హత ఉండి పేరులేకపోతే మళ్లీ అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా గ్రామస్థాయిలోనే కచ్చితమైన తనిఖీలతో ముందుకు సాగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి దశలోనూ జవాబుదారీతనం కనిపిస్తోంది. అందుకనే ఇన్ని లక్షలమందికి లబ్ధి చేకూర్చే ఈ పథకం ఇంత సజావుగా అమలవుతోంది. అమ్మ ఒడి అద్భుత ఫలితాలు: పిల్లలను బడికి పంపేందుకు తీసుకున్న చర్యల కారణంగా 2018–19 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 37.21 లక్షలుగా ఉన్న అడ్మిషన్ల సంఖ్య దాదాపు రూ.7 లక్షలు పెరిగింది. 2021–22 నాటికి 44.30 లక్షలకు చేరుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య 2 లక్షలు పెరిగి, 72.7 లక్షలకు చేరుకుంది. మరో వైపు కోవిడ్ లాంటి విపత్తు సమయంలో పిల్లల చదువులకు అందిస్తున్న డబ్బు వారికి ఎంతగానే మేలు చేసింది. విపత్తు సమయంలో ఈ పథకాలు ఒక రక్షణ కవచంలా ఈ పథకాలు నిలిచాయనడంలో ఎలాంటి సందేహంలేదు. మనబడి-నాడు నేడు: విద్యారంగంలో వైఎస్ జగన్ జైత్రయాత్రలో మరో ఘన విజయం మనబడి నాడు-నేడు. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను ఈ ప్రభుత్వం సమూలంగా మార్చేస్తోంది. బ్లాక్బోర్డ్, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, టాయిలెట్లు, డ్రింకింగ్ వాటర్, కాంపౌండ్వాల్ ఇలా పదిరకాల సౌకర్యాలను కల్పించేందుకు భారీ మొత్తంలో ఖర్చుచేస్తున్నారు. తొలిదశలో 15,715 స్కూళ్లలో సుమారు రూ.3,669 కోట్లు ఖర్చుచేశారు. మరో 22,344 స్కూళ్లలో రూ.8 వేల కోట్ల ఖర్చుతో రెండో దశ పనులు జరుగుతున్నాయి. తల్లిదండ్రులతో ఏర్పడిన విద్యా కమిటీల భాగస్వామ్యంతో, వారి పర్యవేక్షణలో ఈ పనులన్నీ జరుగుతున్నాయి. స్కూళ్లలో పరిశుభ్రత – సమర్థ నిర్వహణ: వేల కోట్ల పెట్టి పాఠశాలల్లో సౌకర్యాలను, సదుపాయాలను కల్పించుకోవడమే కాదు.. వాటిని కాపాడుకోవడం, సమర్థవంతంగా నిర్వహించుకోవడం కూడా అందరి బాధ్యత. ఇదే వాతావరణం తర్వాత వచ్చే పిల్లలకు కూడా నిరంతరం అందేలా ఈ చర్యలు చేపట్టింది. తల్లిదండ్రుల భాగస్వామ్యంతో రెండు కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టాయిలెట్ మెయింటినెన్స్ ఫండ్కు వేయి రూపాయల చొప్పున జమచేస్తున్నారు. అమ్మ ఒడి నుంచి అందించిన డబ్బు ద్వారా రూ.430 కోట్ల టాయిలెట్ మెయింటినెన్స్ నిధి సమకూరింది. తల్లిదండ్రుల కమిటీలు ద్వారా దీన్ని ఖర్చు చేస్తున్నారు. ప్రతి 300 విద్యార్థులకు ఒక ఆయా ఉండేలా చూస్తున్నారు. వీరికి నెలకు రూ.6 వేల రూపాయలు అందిస్తున్నారు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడం దీని ముఖ్య ఉద్దేశం. తద్వారా ఆడపిల్లలు బడిమానేయాల్సిన పరిస్థితులకు లేకుండా చూస్తున్నారు. దీంతోపాటు స్కూళ్లను సమర్థవంతంగా నిర్వహించడానికి, ఎప్పుడు ఏ మరమ్మత్తుగా వచ్చినా వెంటనే బాగుచేసేందుకు వీలుగా స్కూలు మెయింటినెన్స్ నిధిని కూడా తల్లిదండ్రుల భాగస్వామ్యంతో నిధిని పెడుతున్నారు. అమ్మ ఒడి నుంచి వేయిరూపాయలను దీనికి జమచేస్తున్నారు. దీనిపై పర్యవేక్షణ బాధ్యత తల్లిదండ్రుల కమిటీలదే. విద్యాకానుక, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్ఈ, బైజూస్: పిల్లలకు విద్యాకానుక ద్వారా ప్రతిఏటా వైఎస్.జగన్ సర్కార్ మరికొన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. 3 జతల యూనిఫారంతోపాటు షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్, ఇంగ్లిషు నిఘంటువు అందిస్తోంది. విద్యాకానుక కోసం 2020-21లో రూ.648.11 కోట్లు ఖర్చుచేస్తే, 2021-22లో రూ.789.21 కోట్లు ఖర్చుచేసింది. మొత్తంగా రెండేళ్లలో రూ.1,437.32 కోట్లు ఖర్చుచేసింది. ఈఏడాది కూడా భారీ ఖర్చుకు సిద్ధమైంది. మొత్తంగా మూడేళ్లలో రూ.2,324 కోట్లు ఖర్చుచేసింది. పిల్లలను బడికి రప్పించడం, వారు చక్కగా చదువుకునేలా మంచి సౌకర్యాలను, వాతావరణాన్ని కల్పించడం ఒక వైపు చేస్తుంటే... మరోవైపు నాణ్యమైన విద్యను అందించడంపైన కూడా ఈ వైయస్.జగన్ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం గట్టిచర్యలు తీసుకుంది. ప్రపంచస్థాయిలో ఎదురయ్యే పోటీని ఎదుర్కొనేందుకు వీలుగా మన పిల్లలను తయారుచేసేందుకు ఇంగ్లిషు మీడియంలోనే బోధన ప్రారంభించారు. పిల్లలు అర్థంచేసుకునేందుకు వీలుగా పాఠ్యపుస్తకాలను ద్విభాషల్లో ముద్రించారు. స్కూళ్లన్నింటినీ కూడా సీబీఎస్ఈకు అనుసంధానం చేస్తున్నారు. ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న పిల్లలు 2025 నాటికి సీబీఎస్ఈలో పరీక్షలు రాస్తారు. వీరిని మరింత సుశిక్షితులుగా తయారుచేయడానికి వీలుగా బైజూస్తో ఒప్పందం కదుర్చుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకూ బైజూస్ కంటెంట్ ఉచితంగా అందుబాటులోకి వస్తోంది. సెప్టెంబరులో 4.7లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు కూడా అందుబాటులోకి వస్తాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతి తరగతి గదిలోకూడా టీవీలు వస్తాయి. దీంతో బోధన మరింత సులభంగా ఉంటుంది. పిల్లలకూ సంగ్రహణ శక్తి పెరుగుతుంది. ఇక్కడితో జగన్ జైత్రయాత్ర ఆగిపోలేదు. జగనన్న విద్యాదీవెన (ప్రతి త్రైమాసికానికీ పూర్తి ఫీజు రియింబర్స మెంట్చెల్లింపు కింద రూ.7678.12 కోట్లు), జగనన్న వసతి దీవెన (వసతి, భోజన ఖర్చుల కింద పిల్లలకు రూ. 3,329.05 కోట్లు), జగనన్న గోరుముద్ద (మెరుగైన, నాణ్యమైన, రుచికరమైన మధ్యాహ్న భోజనం కింద రూ.3,087 కోట్లు), పాఠశాలల్లో నాడు–నేడు (ఇప్పటికే రూ.3,669 కోట్లు ఖర్చు చేయగా మరో రూ.8వేల కోట్లు ఖర్చుచేస్తున్నారు), వైయస్సార్ సంపూర్ణ పోషణ(రూ.4,895కోట్లు) ఈ కార్యక్రమంలో అన్నింటికింద రూ.52,600.65 కోట్లు ఖర్చుచేశారు. -పూడి శ్రీహరి, ఏపీ సీఎం సీపీఆర్వో -
ఇంటర్లో 61% ఉత్తీర్ణత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియట్– 2022 సెకండియర్ పరీక్ష ఫలితాల్లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. విజయవాడలో బుధవారం ఈ పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. పరీక్షలు పూర్తయిన 28 రోజుల్లోనే ఇంటర్మీడియట్ బోర్డు ఈ ఫలి తాలను ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు రాసిన మొత్తం 9,41,358 మందిలో రెగ్యులర్ స్ట్రీమ్ విద్యార్థులు 8,69,059 మంది, వొకేష నల్ విద్యార్థులు 72,299 మంది ఉన్నారు. రెగ్యులర్ స్ట్రీమ్లో ఫస్టియర్లో 4,45,604 మందికిగాను 2,41,591 (54 శాతం) మంది, సెకండియర్లో 4,23,455 మందికిగాను 2,58,449 (61 శాతం) మంది ఉత్తీర్ణుల య్యారు. ఈసారి ఫలితాల్లో బాలురకన్నా బాలికలు ఎక్కువమంది పాసయ్యారు. ఫస్టియర్లో బాలురు 49 శాతం, బాలికలు 60 శాతం మంది, సెకండియర్లో బాలురు 54 శా తం, బాలికలు 68 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ వొకేషనల్ పరీక్షల్లో ఫస్టియర్లో 45 శాతం, సెకండియర్లో 55 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కృష్ణాజిల్లా టాప్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణతలో కృష్ణాజిల్లా అగ్రస్థానంలో నిలిచింది. సెకండియర్లో 72 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా మొదటిస్థానంలో ఉండగా 50 శాతం ఉత్తీర్ణత తో వైఎస్సార్ జిల్లా చివరిస్థానంలో ఉంది. సెకండియర్లో కృష్ణాలో బాలురు 66 శాతం, బాలికలు 72 శాతం మంది, వైఎస్సార్ జిల్లాలో బాలురు 34 శాతం, బాలికలు 47 శాతం మంది పాసయ్యారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి ఫీజు చెల్లింపు గడువు జూలై 8 ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు తొలిసెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ కింద ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఫెయిలైన వారితోపాటు ప్రస్తుతం పాసైన విద్యార్థులు మార్కుల ఇంప్రూవ్మెంటుకోసం కూడా ఈ పరీక్షలకు దరఖాస్తు చేయవచ్చని చెప్పారు. ప్రాక్టి కల్స్ ఆగస్టు 17 నుంచి 22 వరకు జరుగు తాయన్నారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజును ఈనెల 25 నుంచి జూలై 8వ తేదీ లోగా చెల్లించాలని చెప్పారు. ప్రస్తుత ఫలితాలకు సంబంధించి మార్కుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఈనెల 25 నుంచి జూలై 5వ తేదీవరకు దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. ఫెయిలైన ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నామన్నారు. ఇవి ప్రమాణాలతో కూడిన ఫలితాలు గతంలోకన్నా ఈసారి ఇంటర్మీడియట్లో ప్రమాణాలతో కూడిన ఫలితాలు వచ్చినట్లు మంత్రి బొత్స చెప్పారు. విద్యార్థులు చూపిన ప్రతిభ మేరకు ఫలితాల శాతాలు ఉంటాయన్నారు. మాస్కాపీయింగ్ చేయిస్తే ఉత్తీర్ణత శాతాలు పెరుగుతాయని, కానీ అవి ప్రమాణాలతో కూడిన ఫలితాలు కావని చెప్పారు. ఈ సందర్భంగా 2017 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల ఉత్తీర్ణత శాతాలను మంత్రి వివరించారు. విద్యార్థులు ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను నేర్చుకునేలా విద్యాసంస్థల్లో తగిన వాతావరణాన్ని తమ ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరికలు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. గతంలో ప్రభుత్వంలో 38 శాతం, ప్రైవేటులో 65 శాతం మంది విద్యార్థులుంటే.. ఇప్పుడు ప్రభుత్వంలో 60 శాతం, ప్రైవేటులో 40 శాతం మంది విద్యార్థులున్నారని చెప్పారు. చంద్రబాబులా డబ్బాలు కొట్టుకోవడం కాకుండా విద్యాసంస్థల్లో అభివృద్ధి పనులు చేస్తున్నందునే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారని వివరించారు. ముందుగా టెట్ నిర్వహించి అనంతరం అవసరం మేరకు డీఎస్సీని కూడా పెడతామని ఆయన చెప్పారు. -
పరస్పర బదిలీలకు ఓకే..
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీల్లో కదలిక వచ్చింది. హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని సమ్మతిపత్రం అందజేసిన దరఖాస్తుదారుల పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పరస్పర బదిలీలపై వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని అన్ని ప్రభుత్వశాఖలను సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2,558 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రయోజనం కలగనుందని అధికారులు వెల్లడించారు. విద్య, హోంశాఖల నుంచి అధికసంఖ్యలో పరస్పర బదిలీల కోసం దరఖాస్తులొచ్చాయి. విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి సోమవారం ఉపాధ్యాయుల పరస్పర బదిలీలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి ఆదేశాల మేరకు పరస్పర బదిలీలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాకాటి కరుణ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోనల్, జోనల్, జిల్లా క్యాడర్లకు పలువురు ఉపాధ్యాయుల పరస్పర బదిలీల జాబితాలను ఈ ఉత్తర్వుల్లో వెల్లడించారు. బదిలీపై వెళ్లేవారికి కొత్త లోకల్ క్యాడర్లోని ప్రస్తుత రెగ్యులర్ చివరి ఉద్యోగి తర్వాతి ర్యాంక్ను కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ బదిలీలకు టీఏ, డీఏ వర్తించదని తెలిపారు. ఇదిలా ఉండగా, పరస్పర బదిలీల్లో భాగంగా ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్కు వెళ్తే మొత్తం సీనియారిటీని కోల్పోవాల్సి ఉంటుందని గతంలో జారీ చేసిన జీవోలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీనిని సవాలు చేస్తూ అప్పట్లో కొందరు హైకోర్టులో కేసు వేయడంతో బదిలీల ప్రక్రియ ఆగిపోయింది. ఈ అంశంపై తుదితీర్పునకు లోబడి తుదినిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణపత్రం జారీ చేయడంతో పరస్పర బదిలీలకు అనుమతిస్తూ ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరస్పర బదిలీలపై హైకోర్టు తుదితీర్పునకు కట్టుబడి ఉంటామని దరఖాస్తుదారుల నుంచి సమ్మతిపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. -
బైజూస్ అంటే ఏమిటో నీ మనవడిని అడుగు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 35 లక్షల మంది విద్యార్థులకు అభ్యాసనాంశాల(కంటెంట్)ను ఉచితంగా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం బైజూస్తో ఒప్పందం చేసుకుంటే.. అది బైజూసో.. జగన్మోహన్రెడ్డి జూసో అంటూ చంద్రబాబు వెటకారంగా మాట్లాడటం హేయం.. దారుణం అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బైజూస్ అంటే హెరిటేజ్లో అమ్మే జ్యూస్ అనుకుంటున్నావా అంటూ ధ్వజమెత్తారు. బైజూస్ అంటే తెలియకపోతే.. నీ మనవడిని అడిగితే చెబుతాడని ఎద్దేవా చేశారు. రెండు రోజులుగా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించి ఒక్క అంశంపైనైనా మట్లాడారా? అని ప్రశ్నించారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో రిజిష్టర్ చేసుకున్న 150 మిలియన్ల విద్యార్థులకు కంటెంట్ అందిస్తున్న సంస్థ బైజూస్ అని చెప్పారు. ‘మీ కొడుకు, మనవడు మాత్రమే ఇంగ్లిష్లో చదవాలి.. వారు మాత్రమే విదేశాలకు వెళ్లాలి.. ఆ తర్వాత తిరిగి వచ్చి మీ మాదిరిగా దోచుకు తినాలి. ఇదేగా మీ ఉద్దేశం’ అని నిప్పులు చెరిగారు. మంత్రి బొత్స ఇంకేమన్నారంటే.. మతి స్థిమితం లేని మాటలు.. ► నిరుపేదల పిల్లలు, గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులు వద్దనేదే మీ లక్ష్యం. బైజూస్ ద్వారా ఆ విద్యార్థులు బాగా చదువుకునేలా ప్రోత్సహిస్తుంటే దానినీ ఎగతాళి చేస్తావా? బైజూస్తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం తప్పు అని ఒక్క మేధావితోనైనా చెప్పించగలవా చంద్రబాబూ? ► బైజూస్ యాప్ తీసుకోవాలంటే ఒక్కరికి కనీసం రూ.20 వేలు ఖర్చవుతుంది. అలాంటిది ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుని 35 లక్షల మంది పేద పిల్లలకు ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నాం. దీనిని చంద్రబాబు ఎగతాళి చేయడం చూస్తే ఆయన మతి స్థిమితం కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. ► రాజకీయాల్లో నీ కంటే పనికిమాలినోడు ఎవరైనా ఉన్నారా? నువ్వేమైనా రాజకీయాల్లో పుడుంగా? ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి దక్కించుకున్న అధికారాన్ని కాపాడుకోవడానికి ఎన్ని దిక్కుమాలిన పనులు చేశావో ఎవరికి తెలియదు? మళ్లీ అధికారంలోకి రావడానికి వాజ్పేయి, అద్వానీ, మోదీ కాళ్లు పట్టుకోలేదా? రాజకీయాల్లో నీకంటే యూజ్లెస్ ఫెలో ఎవరైనా ఉంటారా? రాజకీయంగా పనైపోవడంతో అసహనంతో పిచ్చిపట్టి నీచపు మాటలు మాట్లాడుతున్నావు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ► నారాయణ విద్యా సంస్థలకు మేలు చేసేందుకు ప్రభుత్వ విద్యా వి«ధానాన్ని చంద్రబాబు నీరుగార్చడం వాస్తవం కాదా? అందుకే చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 35 శాతం ఉంటే, ప్రైవేటు సంస్థల్లో చదివేది 65 శాతం. ► సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు ద్వారా విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 శాతానికి పెరిగింది. ► దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి జిల్లాకూ యూనివర్సిటీ లేదా కాలేజీ వచ్చేలా చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ విజయనగరం జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీని జేఎన్టీయూ విశ్వవిద్యాలయంగా మార్చారు. మెడికల్ కాలేజీని నిర్మిస్తున్నారు. చంద్రబాబూ.. విజయనగరంలో మీరు నిర్మించిన మెడకల్ కాలేజీ ఎక్కడుందో చూపగలవా? ► మహానేత వైఎస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి చెందింది. తోటపల్లి ప్రాజెక్టును 85 శాతం వైఎస్ పూర్తి చేస్తే.. మిగిలిన 15 శాతం కూడా పూర్తి చేయలేక చంద్రబాబు చేతులెత్తేయడం నిజం కాదా? బాబు చెప్పే అబద్ధాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మేము అప్పుడూ, ఇప్పుడూ ఒకేలా ప్రజలకు అండగా ఉన్నాం. చంద్రబాబూ.. సామాజిక న్యాయంపై చర్చకు సిద్ధమా? -
కరోనా నష్టం.. ‘బ్రిడ్జి కోర్సు’ పాఠం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నాళ్లపాటు బ్రిడ్జి కోర్సు నిర్వహించాలని రాష్ట్ర విద్య, శిక్షణ, పరిశోధన మండలి (ఎస్సీఈఆర్టీ) జిల్లా విద్యాశాఖ అధికారులను మంగళవారం ఆదేశించింది. ఇందుకు సంబంధించి పాఠ్య ప్రణాళికను కూడా రూపొందించినట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా మూలంగా విద్యార్థులు అభ్యసన నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. దీన్ని దూరం చేసి తిరిగి గాడిలో పెట్టడమే దీని ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. మొదటి తరగతిలో చేరే విద్యార్థులకు 12 వారాలపాటు విద్యాప్రవేశ్ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఉన్న విద్యార్థులకు 4 వారాలపాటు బ్రిడ్జి కోర్సు చేపట్టాలని, ఇందుకు పాఠశాల హెచ్ఎంలు బాధ్యత తీసుకోవాలని ఎస్సీఈఆర్టీ సూచించింది. చదవడం, రాయడం, ప్రమాణాలు పెంచేలా పాఠ్య ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. బ్రిడ్జి కోర్సు మాడ్యూళ్లు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది. భయం పోగొట్టేలా... విద్యాప్రవేశ్ పేరుతో మొదటి తరగతి విద్యార్థులకు అందించే ప్రత్యేక మాడ్యూల్స్లో ఎక్కువ భాగం విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్లుగా విద్యార్థులు కరోనా కారణంగా స్కూళ్లకు దూరమయ్యారు. పాఠశాల వాతావరణం అంటే కొంత భయం నెలకొంది. ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా అవి గ్రామీణ ప్రాంతాలకు చేరలేదన్న వాదన ఉంది. ముఖ్యంగా మొదటి తరగతిలో చేరుతున్న విద్యార్థులకు పాఠశాలకు హాజరుకావడం ఇదే తొలిసారి అవుతుందని అధికారులు చెబుతున్నారు. వారిని స్కూల్ వాతావరణానికి అలవాటు చేసి భయం పోగొట్టేలా ఆటపాటలతో చదువు వైపు మళ్లించాలని ఎస్సీఈఆర్టీ భావించింది. ఆహ్లాదకరంగా, ఆనందంగా, స్కూళ్లకు వెళ్లాలనే ఆలోచన విద్యార్థులకు కలిగేలా విద్యాప్రవేశ్ శిక్షణ ఉండాలని సూచించారు. మూడు నెలలపాటు ఈ తరహాలో విద్యార్థులను చదువుకు సిద్ధం చేశాక బోధన ప్రక్రియ మొదలు పెట్టాలని నిర్ణయించారు. మళ్లీ గుర్తుకు తెచ్చేలా... ప్రస్తుతం 2–10 తరగతుల విద్యార్థుల్లో ఆంగ్లం, తెలుగు చదవడం, రాయడం వంటి నైపుణ్యాలు తగ్గాయని ఎస్సీఈఆర్టీ గుర్తించింది. చాలా మంది విద్యార్థులు కనీస స్థాయికన్నా తక్కువగా ఉన్నారని, సాధారణ స్థాయి ప్రమాణాలు దాటిన వారు 15 శాతం మించి లేరని నేషనల్ అచీవ్మెంట్ సర్వే కూడా తేల్చిచెప్పింది. విద్యార్థులు పాఠాలను అర్థం చేసుకొనే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని 2–10 తరగతుల విద్యార్థులను నాలుగు విభాగాలుగా అధికారులు విభజించారు. లెవెల్–1లో 2 నుంచి 5వ తరగతి విద్యార్థులను, లెవెల్–2లో 6, 7 తరగతులు, లెవెల్–3లో 8, 9 తరగతులు, లెవెల్–4లో 10వ తరగతి విద్యార్థులను చేర్చారు. బ్రిడ్జి కోర్సు మాడ్యూళ్లను కూడా నాలుగు విభాగాలుగా తయారు చేశారు. ముందు తరగతులకు లింక్ ఉండే పాఠ్యాంశాలను తీసుకొని సరైన పునశ్చరణ ఉండేలా ఇవి ఉంటాయని అధికారులు తెలిపారు. పుస్తకాలు రానందునేనా? స్కూళ్లు తెరిచినా ఇంతవరకూ పుస్తకాల ముద్రణ పూర్తవ్వలేదు. 2.10 కోట్ల పుస్తకాలు కావాల్సి ఉంటే ఇప్పటివరకూ కేవలం 20 లక్షలే ముద్రించారు. మిగతావి రావడానికి ఇంకా రెండు నెలలు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు బ్రిడ్జి కోర్సును తెరపైకి తెచ్చారనే వాదన విద్యావర్గాల నుంచి వినిపిస్తోంది. -
తొలి రోజు అంతంతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభమైనా పెద్దగా సందడి కనిపించలేదు. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో కలిపి విద్యార్థుల హాజరు 20 శాతానికి మించలేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. తొలిరోజున బోధన ఏదీ జరగదన్న ఉద్దేశం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, సెలవుల కోసం ఊర్లకు వెళ్లినవారు ఇంకా తిరిగి రాకపోవడం వంటివి దీనికి కారణ మని అంటున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఎక్కువ శాతం విద్యార్థులు యూనిఫాంతో కనిపించగా.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంకా యూనిఫాం ఇవ్వకపోవడంతో సాధారణ దుస్తుల్లోనే విద్యార్థులు హాజరయ్యారు. పలుచోట్ల ప్రభుత్వ స్కూళ్లలో స్వాగత తోరణాలు కట్టి విద్యార్థులను ఆహ్వానించారు. మిఠాయిలు పంచారు. నేతలు, టీచర్ల హడావుడి.. బడుల ప్రారంభోత్సవాన్ని పండుగలా జరపాలని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. కొన్ని ప్రాంతాల్లో స్థానిక నేతలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు స్వాగతం పలికారు. ఈ ఏడాది నుంచే సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ఉంటుందని, అందువల్ల ప్రైవేటు బడులకన్నా ఇక్కడ చదివించడమే మంచిదని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. మంత్రి సబిత హైదరాబాద్లోని మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లారు. తరగతి గదిలో విద్యార్థులతో కలసి బెంచీపై కూర్చుని కాసేపు ముచ్చటించారు. స్కూలు ప్రాంగణానికి వచ్చిన తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కామన్పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన గురించి ఉపాధ్యాయులు వివరించారు. గార్లలో ఓ ప్రభుత్వ బడిలో చేరిన ప్రైవేటు స్కూలు విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా స్వాగతించారు. నల్లగొండ జిల్లా మాన్యంచెల్క ప్రాథమిక పాఠశాలలో 24 మంది విద్యార్థులకుగాను తొలిరోజున నలుగురు మాత్రమే హాజరయ్యారు. ఈ పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉండగా.. ఒక్కో గదిలో ఇద్దరేసి విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెప్పారు. ఇక కార్పొరేట్ తీసికట్టు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నాం. పైసా ఖర్చులేకుండా ఇంగ్లిష్ మీడియంలో విద్య నేర్చుకోవచ్చు. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తాం. ఇప్పటికే 75 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రవేశాలు పొందారు. భవిష్యత్లో అన్ని మౌలిక సదుపాయాలు అందించే సర్కారీ బడులను ఆదరించాలి. – మంత్రి సబితా ఇంద్రారెడ్డి -
తెలంగాణలో మోగిన బడిగంట.. ఉత్సాహంగా విద్యార్థుల బడిబాట
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి.కొత్త ఆశలు, క్రొంగొత్త ఆలోచనలతో నూతన విద్యా సంవత్సరంలోకి విద్యార్థులు అడుగుపెట్టారు. అందంగా ముస్తాబైన పాఠశాలలు పిల్లలకు స్వాగతం పలికాయి. తొలిరోజు ఉత్సాహంగా విద్యార్థులు బడిబాట పట్టారు. సెలవులకు స్వస్తి పలికిన విద్యార్థులు పేరెంట్స్కు టాటా చెబుతూ స్కూల్లో అడుగుపెట్టారు. కాగా సుమారు 60 లక్షల మంది విద్యార్థులు బడి బాట పట్టనున్నారు. కోవిడ్ కేసుల పెరుగుదల, పుస్తకాల పంపిణీ పూర్తవకపోవడం, వేసవి తీవ్రత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగిస్తారన్న ప్రచారం జరిగినా.. ఆ ఊహాగానాలకు విద్యాశాఖ తెరదించింది. 13వ తేదీ నుంచే యథావిధిగా పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని స్పష్టం చేసిన విషయం తెలిసిందే కోవిడ్ తర్వాత సకాలంలో..: రాష్ట్రవ్యాప్తంగా 26,065 ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 26లక్షల మంది విద్యార్థులు చదువు తున్నారు. రెసిడెన్షియల్, కస్తూరిబా బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్లో మరో 2.5 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇక 10,800 ప్రైవేటు స్కూళ్లలో 32 లక్షల మంది విద్యార్థులు న్నారు. మొత్తంగా 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల బాట పట్టనున్నారు. కరోనా ప్రభావం కారణంగా రెండేళ్ల తర్వాత ఈ విద్యా సంవత్సరం లోనే సకాలంలో స్కూళ్లు ప్రారంభమవుతుండటం గమనార్హం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమం కింద పాఠశాలల్లో సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపట్టింది. ఆంగ్ల మీడియంతో ప్రవేశాలు పెరిగే అవకాశం ఈ విద్యా సంవత్సరం నుంచే సర్కారీ బడుల్లో 1–8 తరగతులకు ఆంగ్ల బోధన మొదలవనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు 80 వేల మంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సిద్ధం చేసింది. వారు ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయనున్నారు. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్య పుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్ రెండు మాధ్యమాల్లోనూ ఉండేలా సిద్ధం చేశారు. పుస్తకం బరువు పెరగకుండా.. సమ్మేటివ్ అసెస్మెంట్–1 వరకూ ఒక భాగం, ఎస్ఏ–2 వరకు మరో భాగంగా విభజించారు. ఇంగ్లిష్ మీడియం నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో ఈసారి ప్రవేశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. పలు సమస్యలతో ఇబ్బందులు! పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న తరుణంలో ఇప్పటికీ పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. కొత్తగా ఇంగ్లిష్ మీడియం కోసం రెండు భాషల్లో ముద్రించిన పుస్తకాలు స్కూళ్లకు సరిపడా చేరలేదు. 2.10 కోట్ల పుస్తకాలు అవసరంకాగా.. ఇప్పటికీ 20 లక్షల పుస్తకాలే ముద్రించినట్టు సమాచారం. కాంట్రాక్టర్లు ఎక్కువ ధర కోట్ చేయడంతో టెండర్ల ప్రక్రియ తిరిగి మొదలుపెట్టడం, కాగితం కొరత ఆలస్యానికి కారణమని అధికారులు చెప్తున్నారు. ఈ నెలాఖరు నాటికి పుస్తకాలు అందుతాయని అంటున్నా.. మరో నెల వరకూ వచ్చే అవకాశం కన్పించడం లేదు. ►ఇక గత ఏడాది సర్కారీ స్కూళ్లలో యూనిఫారాలు ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా ఈ సమస్య కన్పిస్తోంది. 1.5 కోట్ల మీటర్ల వస్త్రం అవసరంకాగా.. ఇప్పటివరకు 60 లక్షల మీటర్లే కొనుగోలు చేశారు. మిగతాది కొని, కుట్టించి, పంపిణీ చేయాలంటే సమయం పట్టొచ్చని అధికారులు అంటున్నారు. ►ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత సమస్యగానే ఉంది. బోధనేతర సిబ్బందీ సరిగా లేరు. 2019–20 విద్యా సంవత్సరంలో 21 వేల మంది విద్యా వలంటీర్ల సేవలు తీసుకున్నారు. కోవిడ్తో గత ఏడాది వీరి సేవలు నిలిపివేశారు. మళ్లీ వారిని తీసుకుంటే కొంతవరకు సమస్య తీరుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. ►కొద్దిరోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. ఈ ఏడాది కూడా విద్యా రంగం పరిస్థితి ఏమిటన్న ఆందోళనలూ వెంటాడుతున్నాయి. -
టెన్త్కు కోవిడ్ ఎఫెక్ట్
సాక్షి, అమరావతి: వరుస వేవ్లతో ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి విద్యారంగాన్నీ వదల్లేదు. కోవిడ్ ప్రభావంతో వరుసగా రెండేళ్ల పాటు టెన్త్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొనగా తాజాగా వెలువడ్డ 2022 పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం బాగా తగ్గిపోయింది. సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో 67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా బాలురపై బాలికలు పైచేయి సాధించారు. పరీక్షలకు 6,20,788 మంది నమోదు చేసుకోగా 6,15,908 (99.21 శాతం) మంది హాజరయ్యారు. వీరిలో 4,14,281 మంది ఉత్తీర్ణులయ్యారు. 3,16,820 మంది బాలురకు గాను 2,02,821 (64.02 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 2,99,088 మంది హాజరు కాగా 2,11,460 (70.70 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురకన్నా బాలికలు 6.68% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్ ఎస్.సురేష్కుమార్, ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ డి.దేవానందరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ప్రకాశం ఫస్ట్.. చివరిలో ‘అనంత’ ► 797 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ► 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. వీటిల్లో 31 ప్రైవేట్ స్కూళ్లు కాగా 18 ఎయిడెడ్ స్కూళ్లున్నాయి. ► ఉత్తీర్ణతలో ప్రకాశం జిల్లా 78.30 శాతంతో అగ్రస్థానంలో ఉండగా అనంతపురం జిల్లా 49.70 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. ► ఏపీ రెసిడెన్సియల్ స్కూళ్లు 91.10 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్లు 50.10 శాతంతో అత్యల్ప ఉత్తీర్ణత నమోదు చేశాయి. లాంగ్వేజెస్లో అధిక ఉత్తీర్ణత ఈసారి లాంగ్వేజెస్లలో ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. మేథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఫస్ట్ లాంగ్వేజ్లో 5,64,294 (91.73 శాతం) మంది, సెకండ్ లాంగ్వేజ్లో 5,95,801 (97.03 శాతం) మంది, థర్డ్ లాంగ్వేజ్లో 6,01,644 (97.95 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. మేథమెటిక్స్లో 4,93,839 (80.26 శాతం) మంది, జనరల్ సైన్సులో 5,05,719 (82.18 శాతం) మంది, సోషల్ స్టడీస్లో 5,00,975 (81.43 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఆంగ్ల మాధ్యమం విద్యార్ధుల ఆధిక్యం టెన్త్ పరీక్షల్లో తెలుగు మాధ్యమం కన్నా ఇంగ్లీషు మీడియం విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. తెలుగు మాధ్యమంలో 43.97 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఆంగ్ల మాధ్యమంలో 77.55 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం. అత్యధికులకు ఫస్ట్ డివిజన్ టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో అత్యధికులు ఫస్ట్ డివిజన్లో నిలిచారు. 3,17,789 మంది ఫస్ట్ డివిజన్ సాధించగా 69,597 మంది సెకండ్ డివిజన్లో, 26,895 మంది థర్డ్ డివిజన్లో నిలిచారు. రెండేళ్లుగా చదువులపై ప్రభావం కరోనా వ్యాప్తితో పాఠశాలలు తెరుచుకోని పరిస్థితుల్లో 2020, 2021లో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. మహమ్మారి వల్ల పిల్లల చదువులు బాగా దెబ్బతిన్నాయి. 2016లో 94.52 శాతం, 2017లో 91.92 శాతం, 2018లో 94.61 శాతం, 2019లో 94.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండేళ్లుగా కరోనాతో పిల్లల చదువులు ముందుకు సాగకపోవడంతో ఆ ప్రభావం ఈసారి టెన్త్ పరీక్షలపై పడి 67.26 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 2,01,627 మంది ఫెయిలయ్యారు. -
ఇంగ్లిష్ మీడియం చదువు.. అందరి చూపు సర్కారీ స్కూళ్ల వైపు!
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నందున విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు దృష్టి సారించారు. ‘ఉన్న ఊళ్లోనే ఇంగ్లిష్ చదువు దొరుకుతుంటే, ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తూ పట్టణాల్లో ఉండటమేమిటీ?’అనే ఆలోచన చాలామందిలో కన్పిస్తోంది. దీంతో సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లిష్ మీడియం గురించి పెద్దసంఖ్యలో ప్రభుత్వబడులను సంప్రదిస్తున్నారని విద్యాశాఖ చెబుతోంది. ‘ఇంగ్లిష్ అత్యవసర భాషగా ఇప్పటికే అన్నివర్గాలూ గుర్తించాయి. బోధనలో వెనక్కి తగ్గే అవకాశమే లేదు’అని వరంగల్కు చెందిన శాంతికుమార్ అనే ఉపాధ్యాయుడు అంటున్నారు. శిక్షణలో చిత్తశుద్ధి ఎంత? రాష్ట్రంలో 26,072 ప్రభుత్వ స్కూళ్లున్నాయి. ఇందులో 1–10 తరగతులు చదివేవారు 20 లక్షలమంది ఉంటారు. ప్రజల్లో స్పందన చూస్తుంటే ఈసారి కనీసం 2 లక్షలమంది కొత్తగా సర్కారు స్కూళ్లల్లో చేరే వీలుందని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ప్రస్తుతం 1.06 లక్షల మంది టీచర్లు ఉండగా, ఇంకా 21,500 ఖాళీలున్నాయి. ప్రేమ్జీ వర్సిటీ శిక్షణ కన్నా ముందు 60,604 మంది మాత్రమే ఇంగ్లిష్ మీడియం చెప్పగలిగే టీచర్లున్నారని గుర్తించారు. ప్రస్తుతం 80 వేల మందికి ప్రేమ్జీ వర్సిటీ ద్వారా ఆంగ్ల బోధనపై నెల రోజులపాటు శిక్షణ ఇప్పించారు. అయితే తెలుగు నేపథ్యం నుంచి వచ్చిన టీచర్లకు నెలరోజుల శిక్షణ సరిపోదనే భావన వ్యక్తమవుతోంది. ‘శిక్షణకాలంలో ఇంగ్లిష్ భాష ద్వారా భావాన్ని వ్యక్తం చేసే తరహాలో వీడియోలు ప్రదర్శించారు, దీంతోపాటే సంభాషణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే బాగుండేది’అని ఆదిలాబాద్కు చెందిన కుమార్ వర్థన్ వ్యాఖ్యానించారు. ఆంగ్లం అంత కష్టమేమీ కాదు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంగ్లిష్పై విద్యార్థులు పట్టు సాధించడం ఈ తరంలో పెద్ద సమస్యేమీ కాదు. స్మార్ట్ ఫోన్ వాడని, ప్రతి దానికీ గూగుల్ సెర్చ్ చేయని పిల్లలున్నారా? ఫస్ట్ క్లాస్ నుంచే ఈ అలవాటు ఉంది. నిజానికి మనకు తెలియకుండానే 40 శాతం ఇంగ్లిష్ వాడకం అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్ భాష నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అనుమానాలు లేకుండా ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపడితే, క్రమంగా సమస్యలు సర్దుకుంటాయి. –స్వామి శితికంఠానంద, డైరెక్టర్, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ బోధించే స్కిల్స్ ఉన్నాయి ఉపాధ్యాయుల్లో బోధించే నైపుణ్యం ఉంది. తెలుగు మీడియం నుంచి వచ్చినా, మారిన ప్రపంచంలో ఎంతోకొంత ఇంగ్లిష్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకపోతే బోధించేటప్పుడు భయం బ్రేకులు వేస్తోంది. మొదటిదశ శిక్షణలో ఇది కొంత దూరమైంది. మరో దఫా 5 వారాలు శిక్షణ ఉంటుంది. కాబట్టి, టీచర్లందరూ క్రమంగా ఆంగ్లంలో బోధించగలరు. –చెరుకు ప్రద్యుమ్న కుమార్, ప్రభుత్వ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ కేంద్రం కో ఆర్డినేటర్ -
నాడు – నేడు రెండో దశ పనులు ప్రారంభించండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బడి నాడు–నేడు రెండో దశ పనులను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. నిర్ణీత కాలపరిమితిలో ఈ పనులన్నీ పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయాలన్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్తో కలిసి విజయవాడలోని సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం నుంచి గురువారం జిల్లా కలెక్టర్లు, జేసీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి బొత్స మాట్లాడుతూ నాడు నేడు రెండో దశలో భాగంగా 12 వేల పైచిలుకు పాఠశాలల్లో పనులు చేపట్టనున్నామని, ఇప్పటికే రివాల్వింగ్ ఫండ్ విడుదలైనందున వెంటనే పనులను ప్రారంభించాలని ఆదేశించారు. పనుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దని, పనులు వేగవంతంగా జరగడంలో అధికారులు, ఆయా పాఠశాలల పేరెంట్స్ కమిటీలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలల్లో గతానికి ఇప్పటికీ స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. -
విద్యాశాఖ ప్రకటన.. ఏపీ టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?
సాక్షి, అమరావతి: ఈ నెల 4న ఏపీ టెన్త్ ఫలితాలను విడుదల కానున్నాయి. జూన్ 4న ఉదయం 11 గంటలకి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి విజయవాడలో ఫలితాలు ప్రకటించనున్నారు. మార్కుల రూపంలో ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. రికార్డు స్థాయిలో 25 రోజుల్లోనే విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుంది. ఏప్రిల్ 27న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. చదవండి: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. చర్చించిన అంశాలివే..