
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జెండావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాల కమిటీ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు హాజరయ్యారు.
►మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ, ఇచ్చిన మ్యానిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కిందని కొనియాడారు. చంద్రబాబు మ్యానిఫెస్టోని అమలు చేయలేక దాన్ని కనపడకుండా చేశారు.. జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నా అడ్డుకుంటున్నారని, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అంటూ మోసం చేసిన మనిషి చంద్రబాబని ధ్వజమెత్తారు.
►ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం ఇదే రోజు జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.. ఆనాడు జనం జగన్ పై పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారని అన్నారు. పాదయాత్రలో వచ్చిన సమస్యలన్నీ విని మ్యానిఫెస్టోలో పెట్టారన్నారు. పరిపాలనని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లడం, రైతులకు అవసరమైన పథకాలను పొలం గట్టుదాకా తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్దేనని చెప్పారు. మాటలు చెప్పి కాలం గడిపే చంద్రబాబు లాంటి మనిషి జగన్ కాదని... ఆయన చేతల మనిషని కొనియాడారు.
►అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం జగన్ పేదల పక్షపాతి అని.. దేశం గర్వించేలా ఆయన పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మరని తెలిపారు.
►వైఎస్ జగన్ ముఖ్యమంత్రి గా నాలుగేళ్ళ పాలన పూర్తి చేసిన సందర్భంగా తునిలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసిన రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రులు ఎన్టీఆర్,వైఎస్ఆర్, వైఎస్ జగన్ మాత్రమేనని పేర్కొన్నారు. రూ. 108 పధకాన్ని మూలన పడేసిన వ్యక్తి చంద్రబాబు.. 2 కిలో బియ్యాన్ని రూ.5.30 చేసిన దుర్మార్గుడని మండిపడ్డారు.
►నెల్లూరు
మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి మాట్లాడతూ.. జగన్ నాలుగేళ్ల పాలన స్వర్ణ యుగం లాంటిది.. దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ప్రభుత్వంలో మహిళలను, అట్టడుగు వర్గాల వారిని భాగస్వామ్యం చెయ్యడం గొప్ప విషయమని, కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడటంతో పాటు సంక్షేమ పథకాలను అందించారన్నారు. చంద్రబాబు చేసిన కుట్రలు, వెన్నుపోటు వల్లే రామారావు చనిపోయారని మండిపడ్డారు. బతికి ఉన్నప్పుడు ఎన్టీఆర్ని, చనిపోయిన తర్వాత ఆయన ఆత్మను కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. 2014 లో ప్రజలు ఎందుకు ఛీకొట్టారో చంద్రబాబు మహానాడులో చెప్పాలన్నారు. మాట నిలబెట్టుకునే చరిత్ర చంద్రబాబు లేదు.. ఆయన ప్రకటించే మ్యానిఫెస్టోకి విలువ లేదని వ్యంగ్యాస్త్రాలను సంధించారు.
►తిరుపతి
తుడా సర్కిల్ వైఎస్ఆర్ విగ్రహం ఇందిరా మైదానం వద్ద సీఎం జగన్మోహన్రెడ్డి నాలుగేళ్ల సంక్షేమ పాలన పూర్తైన సందర్భంగా వైఎస్సార్సీపీ కేక్ కట్ చేసిన సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని, చంద్రబాబు ఉచిత హామీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
చదవండి: నవశకానికి నాలుగేళ్లు
Comments
Please login to add a commentAdd a comment