
సాక్షి, అమరావతి : డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్కు గురైన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. తనకు మద్దతు తెలపాలని ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్కు ఆయన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తుందంటూ లేఖలో పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు లేఖపై ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా చర్చించింది. ఆయనపై ప్రభుత్వం సస్పెన్సన్ విధించడం సరైనదే అని అసోసియేషన్ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, విచారణను ఎదుర్కొక తప్పదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఎలాంటి జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. కొన్ని ఛానళ్లలో తాము ఏబీకి మద్దతు తెలిపామని వస్తున్న వార్తలు అవాస్తవమని ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తోసిపుచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావుకు ఎలాంటి మద్దతు తెలపలేదని పేర్కొంది. అలాగే ఐపీఎస్ అధికారులపై ఎలాంటి ఆరోపణలు చేయకూడదని.. ఏబీ వెంకటేశ్వరరావుకు హెచ్చరిచ్చింది. (ఏబీకి ఎదురు దెబ్బ)
చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్పై హైకోర్టు గతంలో స్టే ఇచ్చింది. అయితే డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్కు గురైన ఏబీని సస్పెండ్ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్లో(క్యాట్) ఇదివరకే స్పష్టం చేయడం సహా.. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను క్యాట్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును ఇవ్వగా.. దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment