
సాక్షి,కర్నూలు : అగ్రిగోల్డ్ కొనుగోలు చేసిన భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఆ సర్వే నంబర్లకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకూడదు. అయితే జిల్లాలో పలుచోట్ల ఇందుకు విరుద్ధంగా జరిగింది. అగ్రిగోల్డ్ సంస్థ కొనుగోలు చేసిన భూములు వేరొకరి పేరున రిజిస్ట్రేషన్అయ్యాయి. కొందరికి పాసు పుస్తకాలు కూడా వచ్చాయి. సంస్థ 450 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా..క్షేత్రస్థాయిలో 100 ఎకరాలు కూడా లేదని సీఐడీ అధికారుల విచారణలో బయటపడినట్లు సమాచారం.
ఇవీ అక్రమాలు..
కృష్ణగిరిలో సర్వే నంబర్ 65లో ఉన్న 3.25 ఎకరాల భూమిని బోయ లక్ష్మన్న, సర్వే 63లో 5.07 ఎకరాలను కట్టెల రంగారెడ్డి.. అగ్రిగోల్డ్ సంస్థకు విక్రయించారు. అయితే సదరు సర్వే నంబర్లలోని 8.32 ఎకరాల భూమికి కొత్త రాధమోహన్కు 2019 జూలైలో అప్పటి తహసీల్దార్ పట్టాదారు పాసుపుస్తకాన్ని మంజూరు చేశారు.
► అగ్రిగోల్డ్కు చెందిన 83/బీ, 84/సీ, 93, 82/3, 81/1, సర్వే నంబర్లలోని 30ఎకరాల భూమిని కోడుమూరు సబ్రిజిస్టార్ అధికారులు అబ్దుల్ రహిమాన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకం సైతం మంజూరు చేశారు.
►రామకృష్ణాపురంలో టీడీపీ నాయకుడు దామోదర్నాయుడు 113, 146/1 సర్వే నంబర్లలో 13 .19 ఎకరాల భూమిని అగ్రిగోల్డ్ సంస్థకు అమ్మాడు. సర్వే నంబర్ 146/1 రెవెన్యూ రికార్డులలో లేదు. అయినప్పటికీ 5.95 ఎకరాలు ఉన్నట్లు చూపి సంస్థను మోసం చేశాడు. టీడీపీ నేతల సహకారంతో రికార్డులు తారుమారు చేయించాడు.
► కృష్ణగిరి గ్రామంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం కొనుగోలు చేసిన భూములకు సంబంధించి 4/ఏ, 5, 41, 42, 43, 45, 48, 49, 54, 57/బీ, 59/సీ, 64, 113, 146/1, 141 తదితర సర్వే నంబర్లు రెవెన్యూ రికార్డుల్లో లేవు. రెవెన్యూ అధికారులు నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడంతో 102.69 ఎకరాల భూమిని అగ్రిగోల్డ్ సంస్థ కొనుగోలు చేసింది.
► కోడూరు నరసింహారావు, కోడూరు నరసయ్య, కోడూరు శశికళలకు కృష్ణగిరి గ్రామంలో 27.24 ఎకరాల భూమి ఉంది. ఈ భూములకు వేరొకరి పేరు మీద రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాలు ఇచ్చారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆ భూములను కొనుగోలు చేసింది. దీంతో పట్టాదారులైన రైతులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment