
సాక్షి, అమరావతి: వచ్చే నెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. వారం రోజులు సభ నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ, ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే అంశాలపై అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాయి.
ఈ సమావేశాలను ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే నెల 13న జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా సమావేశాలను ఆ మరుసటి రోజు నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.