![Another Jilted Lover Incident In Visakhapatnam](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/crimescene2.jpg.webp?itok=HCFwwPcB)
విశాఖపట్నం, సాక్షి: అనకాపల్లిలో ఓ ప్రేమోన్మాది ప్రేమ పేరుతో బాలికను చిత్రవధ చేసి చంపి తానూ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరువక ముందే.. ఉమ్మడి జిల్లాలో మరొక ఘటన చోటు చేసుకుంది. విశాఖ న్యూపోర్ట్ పరిధిలో ఓ ప్రేమోన్మాది కత్తి దూశాడు.
వుడా కాలనీ సమీపంలో నివసించే శ్యామల అనే అమ్మాయిని సిద్ధూ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కాలేజ్ వద్ద ఆ యువతితో సిద్ధూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు మైనర్ కావడంతో గాజువాక పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడ్ని అరెస్ట్ చేశాడు.
అయితే జైలు నుంచి బయటకు వచ్చిన సిద్ధూ.. శ్యామలపై కక్ష గట్టాడు. మంగళవారం రాత్రి కత్తితో ఆమెను చంపాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె తల్లి సావిత్రి అడ్డురావడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. తల్లీకూతుళ్లు కేకలు వేయడంతో స్థానికులు రావడంతో సిద్ధూ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న న్యూపోర్ట్ పోలీసులు సిద్ధూ కోసం గాలిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి మండలం కొప్పుగుండపాలెంలో సురేష్ అనే యువకుడు స్థానికంగా చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రేమ పేరుతో వేధించాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకుని ఆమెను ఇంటిదాకా ఫాలో అయ్యి.. నరికి చంపాడు. ఆపై శవమై తేలడంతో సురేష్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment