
సాక్షి, అమరావతి: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టింది. రోజూ 1,075 దర్శనం టికెట్లు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. తాజాగా ఈ నెల 9 నుంచి శ్రీశైలం భక్తులకు కూడా ప్యాకేజీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు దేవదాయ శాఖతో ఒప్పందం చేసుకుంది. వాటిలో స్పర్శ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం టికెట్లు ఉన్నాయి. రూ.500 స్పర్శ దర్శనం టికెట్లు 275, రూ.300 అతి శీఘ్ర దర్శనం టికెట్లు 300, రూ.150 శీఘ్ర దర్శనం టికెట్లు 500 అందుబాటులోకి తీసుకువచ్చింది.
భక్తులు ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా శ్రీశైలం వెళ్లేందుకు ప్రయాణ టికెట్లతోపాటు ఈ దర్శనం టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చును. వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి నిర్వహించే 95 ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ టికెట్లను బుక్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. శ్రీశైలం వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకే దేవదాయ శాఖతో కలసి ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టామని ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment