
గుంటూరు : జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. సౌరవ్ రాయ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ కేంద్ర బృందం సభ్యులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా వివిధ శాఖల అధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని వివిధ శాఖ వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్ నీలం సాహ్ని కేంద్ర బృందానికి వివరించారు. 2లక్షల 12వేల హెక్టార్లలో ధాన్యం పంటలు, 24 వేల 515 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని సీఎస్ నీలం సాహ్ని కేంద్ర బృందానికి తెలిపారు. (సోమశిల చివరి ఆయకట్టు రైతుల కల సాకారం)
భారీ వర్షాలకు రాష్ట్రంలో 5 వేల 583 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, వీటి ద్వారా రూ.6,368 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు నివేదిక అందజేశారు. తాత్కాలిక పునరుద్ధరణ చర్యలకు రూ.840 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ చర్యలకు రూ.4,439 కోట్లు అందించాలని సీఎస్ నీలం సాహ్ని కోరారు. పంటల కొనుగోలుకు కేంద్రం సడలింపులు ఇవ్వాలని కోరారు. తడిసిన, రంగుమారిన ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఏక్యూ ( ఫెయిర్ ఏవరేజ్ క్వాలిటీ ) నిబంధనలు సవరించేలా సిఫార్స్ చేయాలని విఙ్ఞప్తి చేశారు. దెబ్బతిన్న వేరుశెనగ పంటకు కూడా నిబంధనలు సడలించాలని కోరారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఉపశమనం కల్పించామని సీఎస్ కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. ప్రభుత్వం తక్షణ చర్యలతో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించామని తెలిపారు. (ఏపీ ప్రభుత్వ నిర్ణయం.. తొలి టీకా వారియర్స్కే..! )