
విశాఖపట్నం: విశాఖ తీరంలో మరొకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రింగు వలలో వేట సాగిస్తున్నారంటూ ఒక గ్రామానికి చెందిన మత్స్యకారుల బోట్లను మరో గ్రామస్తులు నిప్పు పెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విశాఖ నగరానికి ఆనుకుని ఉన్న మత్స్యకారపల్లిలో కొందరు రింగ్ వలలతో చేపల వేట కొనసాగిస్తున్నారు. దీనికి సమీపంలో ఉన్న జాలరిపేట గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు.
ఈ విషయంపై రెండు వర్గాల మధ్య ఆరు నెలల క్రితం ఘర్షణ చెలరేగడంతో మంత్రి అప్పలరాజు, కురసాల కన్నబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. ఈ దశలో నిన్న రాత్రి చేపల వేట ముగించి తీరంలో లంగర్ వేసిన ఆరు బోట్లకు నిప్పు పెట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య మరొకసారి వివాదం ఏర్పడింది. తమ వలలకు దారుణంగా నిప్పు పెట్టి నష్టపరిచారని మత్స్యకార మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై పోలీసులు వెంటనే స్పందించి రెండు గ్రామస్తుల మధ్య వివాదం చెలరేగ కుండా అడ్డుకున్నారు. అధికారుల ఆదేశాల మేరకు చేపల వేట సాగుతుందని అంతవరకు ప్రజలు సమయంనంతో ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment