
సాక్షి, విజయవాడ: దుర్గగుడి పాలకమండలి బుధవారం రోజున ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. పలు అంశాలపై పాలకమండలి చర్చించారు. సుమారు 66 అజెండాలపై చర్చించి, చాలా వరకు అంశాలను పాలక మండలి ఆమోదించింది. రానున్న దసరా ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లను చేస్తున్నట్లు పాలకమండలి వెల్లడించింది. ప్రతి భక్తుడికి 250 గ్రాముల దద్దోజనం, 250 గ్రాముల సాంబార్ రైస్ను ప్రసాదంగా ఇవ్వాలని దుర్గగుడి పాలకమండలి నిర్ణయించింది.
ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కుంకుమ, అమ్మవారి ప్రతిమ ఉన్న డాలర్ను ఇవ్వనున్నట్లు పాలకమండలి పేర్కొంది. దసరా ఏర్పాట్లను చేయడానికి పాలకమండలి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. కలెక్టర్, కో ఆర్డినేషన్ కమిటీల సమన్వయంతో ఉత్సవాలకు బడ్జెట్ను కేటాయిస్తామని పేర్కొంది. గత దసరాకి ముఖ్యమంత్రి కేటాయించిన రూ. 70 కోట్ల నిధులకు సంబంధించి పనులను పూర్తి చేస్తున్నట్లు దుర్గగుడి దేవస్థానం చైర్మన్ పైలా స్వామినాయుడు, ఈవో భ్రమరాంబ వెల్లడించారు.